చుట్టూ కొండలు... దట్టమైన అడవులు... నింగి నుంచి జాలువారే జలపాతం... ఆమని అద్భుత దృశ్యాలు... మనసును ఇట్టే కట్టి పడేసే ప్రకృతి సోయగాలు చూడాలంటే నల్లగొండ జిల్లా చందంపేట మండలం దేవరకొండకు వెళ్లాల్సిందే! ఈ గ్రామానికి సమీపంలోని మునిస్వామి గుట్టలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. మునిస్వామి గుట్టలు చక్కటి ప్రకృతికి ఆలవాలంగా నిలుస్తున్నాయి. దేవరకొండ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుగ్రామం దేవరచర్ల. అక్కడి నుంచి సుమారు 5 కిలోమీటర్లు నడిస్తే మునిస్వామి గుట్టలు వస్తాయి. గుట్టపై నుంచి జాలువారే జలపాతం. వందల ఏండ్ల నాటి పురాతన శివాలయం. అక్కడికి వెళ్లే పర్యాటకులను, భక్తులను కనువిందు చేస్తాయి. గుట్టల నడుమ ఉండే శివాలయం దాని పక్కనే సొరంగ మార్గం ఉంటుంది. ఈ నిర్మాణాలు ఎప్పటివో ఎవరికీ తెలియదు. ఈ ప్రాంతం చుట్టు పక్కల ఉండే గిరిజనులు మాత్రం... తాత ముత్తాతల కాలం నాటి నుంచి ఈ ప్రాంతంలో శివాలయం, జలపాతం ఉన్నాయని చెబుతారు. ప్రతి సంవత్సరం శివరాత్రి, ఏకాదశి పర్వదినాల్లో రెండుసార్లు మాత్రమే ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. ఆలయంలోని స్తంభాలపై చెక్కిన పద్మాలను (పుష్పాలు) బట్టి ఈ నిర్మాణాలు పద్మనాయక కాలం నాటివని తెలుస్తోంది.
గుట్ట కింది భాగంలో శివాలయాన్ని నిర్మించారు. ముందు స్తంభాలను మాత్రమే నిలబెట్టి వెనుక భాగంలో గుట్టనే ఆలయంగా మలిచారు. ఓ చోట చతురస్రాకారంలో ఉన్న ఇటుకలతో ఒక నిర్మాణం ఉంది. ఆ ఇటుకలు కేవలం 200 నుంచి 300 గ్రాముల బరువు ఉంటాయి. శివలింగం చుట్టూ చిన్న సైజులో మరో 18 చిన్నలింగాకారాలు ఉన్నాయి. ఆలయం పక్కనే ఓ గుహ లాంటి నిర్మాణం ఉంది. ఇక్కడి నుంచి శ్రీశైలం వరకు రహస్య సొరంగ మార్గం ఉందని స్థానికులు చెబుతుంటారు. ఈ ఆలయాన్ని అభివృద్ధి పరిచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని గిరిజనులు కోరుతున్నారు. దేవరకొండకు వెళ్తే అరకులోయకు వెళ్లినంత ఫీలింగ్ కలుగుతుంది. దేవరకొండ అందాలను చూసి పర్యాటకులు ముగ్ధులైపోతారు. ఇది తెలంగాణ అరకులోయ అంటూ అభివర్ణిస్తారు. పురావస్తు, పర్యాటకశాఖకు సంబంధించిన అధికారులు ఈ ప్రాంతాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులను, అందాలను తిలకించారు. గిరిజన సంస్కృతిని, ఆచార సంప్రదాయాలను, ఈ ప్రాంత వైభవాన్ని, విశేషాలను బాహ్య ప్రపంచానికి తెలుపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి వందశాతం ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
Authorization