ఆ గోడల్లోని మట్టి పరిమళాలు గతకాలపు వైభవాలను ఇప్పటికీ వెదజల్లుతూనే ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో ఉన్న అన్ని మ్యూజియంల కన్నా భిన్నమైంది పురానాహవేలీ. ఇది నిజాం కాలపు మ్యూజియం. మొత్తం వెండి వస్తువులతోనే నిండి ఉంటుంది. దీన్ని కుతుబ్ షాహీల కాలంలో నిర్మించారు. నిజాం కాలంలో అధికారిక భవనంగా ఉండేది. మూడవ నిజామైన సికిందర్ జా తన నాలుగవ కొడుకైనా నసీర్రుదౌలాకు అధికారిక భవనంగా దీన్ని మార్చారు. అప్పటి నుంచి ఈ భవనాన్ని రాయల్ పాలెస్ అని పిలుస్తున్నారు. ఇది రెండు అంతస్థుల్లో అద్భుతమైన ఆర్కిటెక్చర్ను కలిగి ఉంటుంది. ఐదు, ఆరు, ఏడవ నిజాంలు ఈ పాలెస్ను ఎక్కువగా ఉపయోగించారట. తర్వాత కాలంలో కొత్తగా కట్టించిన ప్యాలెస్లోకి మారడం వల్ల దీనికి పురానాహవేలీ అనే పేరు వచ్చింది.
అపురూపమైన వస్తువులు...
పురానాహవేలీ భవనంలోనే ఉంది నిజామ్స్ మ్యూజియం. ఈ మ్యూజియంలో ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ ఆలీఖాన్కు వచ్చిన రకరకాల బహుమతులు, ప్రశంసా పత్రాలు, సావనీర్లు, మెమోంటోలు, ఆయన ఉపయోగించిన వస్తువులు కనిపిస్తాయి. ఇది 2000 సంవత్సరంలో ఏర్పడింది. మ్యూజియంలో కనిపించే వస్తువులన్నీ బంగారం, వెండితో తయారు చేసినవి. చక్కటి నగిషీ పనితనంతో చేసిన ఈ అద్భుతమైన వస్తువులు ఎంతో కళాత్మకంగా ఉండి పర్యాటకులను ఆకట్టుకుంటాయి. మ్యూజియంలో నిజాం ప్రెసిడెన్సీ మ్యాప్ కనిపిస్తుంది. ఇది స్వాతంత్రానికి ముందున్న నిజాం సంస్థానం. ఈ మ్యాప్లో కేవలం 16 జిల్లాలు మాత్రమే కనిపిస్తాయి. మ్యూజియం అంటే సేకరించిన వస్తువులతోనో, కొనుగోలు చేసిన వస్తువులతోనో ఏర్పాటు చేస్తారు. కానీ ఈ మ్యూజియం గొప్పతనం ఏంటంటే ప్రజల భాగస్వామ్యం ఉండటం. అందుకే ఇందులో చిన్న చెంచాలు, గ్లాసు, గిన్నె వంటి వస్తువుల నుంచి అపురూపమైన, విలువైన వస్తువులు ఎన్నో కనిపిస్తాయి.
మినియేచర్ రెప్లికాలు...
ఈ వస్తువుల్లో హైదరాబాద్ సంస్కృతి, వారసత్వం కండ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. అలాగే ఆ కాలపు చరిత్ర స్పష్టంగా అర్థం అవుతుంది. బర్మా టేకుతో తయారైన వార్డ్రోబ్. నిజాం కాలంలో ఉన్న ఎన్నో మాన్యు మెట్రీలు, రెప్లికాలు ఈ మ్యూజియంలో ఎన్నో కనిపిస్తాయి. అవి కూడా వెండితో తయారు చేసినవి. మినియేచర్ రూపంలో ఈ వస్తువులు పర్యాట కులను అబ్బురపరుస్తాయి. వంద కిలోల వెండితో ఉస్మానియా యూనివర్శిటీ రెప్లికను తయారు చేశారు. నిజాంకు ఓ అలవాటు ఉండేదట. ప్రారంభోత్సవం చేసిన సమయంలో ఉపయోగించిన వస్తువులను భద్రంగా దాచిపెట్టేవారట. ఉస్మానియా యూనివర్శిటీ, నిజాం సాగర్, మక్కా మసీదు ఇలా అనేక కట్టడాలకు ఉపయోగించిన తాపీలను, తట్టలను జాగ్రత్తగా దాచిపెట్టేవారట. ఆ వస్తువులన్నీ ఈ మ్యూజియంలో కనిపిస్తాయి.
వెండి, బంగారు నగిషీలు...
పింగాణి మీద వెండి నగిషీలను చెక్కారు. కర్పూరపు చెక్కతో తయారు చేసిన పెట్టెలు, వెండి, బంగారు పుస్తకాలు, ఏనుగు దంతంతో చేసిన మైసూరు మహారాజ పాలెస్. కత్తులు, చేతికర్రలు, సమాచారం పంపేందుకు ఉపయోగించే ఎన్నో వెరైటీల గుండ్రటి గొట్టాలు, గడియారాలు, టీ కప్పులు, బంగారం మీద వజ్రాల తాపడం చేసిన కాఫీ పాత్రలు, సిగరెట్ పెట్టెలు, వెండి ఆర్ట్పీసులు, రాజ ముద్రలు, అరబిక్ వర్క్స్ కనిపిస్తాయి.
అతి పెద్ద వార్డ్రోబ్...
ఇక్కడ మొత్తం 746 కళాకృతులు ఉన్నాయి. వీటిలో జాకబ్ డైమాండ్ ఫొటో కూడా కనిపిస్తుంది. ప్రపంచంలోనే అతి పెద్ద ముత్యం ఈ మ్యూజియంలో కనిపిస్తుంది. ఇది సహజ సిద్ధంగా ఆడపిల్ల ఆకారంలో ఏర్పడింది. నిజాం వార్డ్రోబ్లో నిజాం వేసు కున్న బట్టలు, పెట్టుకున్న తలపాగాలు, చేతికర్రలు, అత్తరులు, చెప్పులు ఇలా నిజాం వాడే వస్తువులన్నీ ఇక్కడే ఉండేవి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వార్డ్ రోబ్. దీన్ని రెండు వరుసల్లో 140 కబోర్డులతో బర్మాటేకుతో తయారు చేశారు. వార్డ్రోబ్ 240 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు ఉంటుంది. గత చరిత్ర వైభవాలను తెలుసుకోవాలంటే తప్పకుండా నిజాం మ్యూజియంను సందర్శించాల్సిందే!
-రూప
7661910634
Authorization