శిశువైద్య నిపుణుల 55వ జాతీయ సమావేశాలు ఈ సంవత్సరం మహారాష్ట్రలోని నాగపూర్లో జరిగినందున మేం నాగపూర్ కు కుటుంబ సమేతంగా వెళ్లాం. మన దేశంలో మహారాష్ట్ర మూడవ అతి పెద్ద రాష్ట్రం. అరేబియా సముద్రానికి ఆనుకొని 720 కి. మీ తీరాన్ని కలిగిన రాష్ట్రం మహారాష్ట్ర. మహారాష్ట్రలోని ముంబయి, పూణే తర్వాత మూడవ పెద్ద నగరం నాగపూర్. సుమారుగా 25 లక్షల జనాభా కలిగిన నగరమిది. వాణిజ్య కేంద్రంగా విలసిల్లుతున్న ప్రాంతం. మహారాష్ట్రకు శీతాకాలపు రాజధానిగా కూడా నాగపూర్ వ్యవహరిస్తోంది. మేం రేషిమ్ బాగ్ లోని సురేష్ భట్ ఆడిటోరియమ్ గ్రౌండ్స్ లోకి అడుగు పెట్టగానే దాదాపు 10-12 అడుగుల ఎత్తున్న 'ఆరెంజ్' బొమ్మ దర్శనమిచ్చింది. సరదాగా అందరూ అక్కడ ఫొటోలు తీసుకున్నారు. నాగపూర్ లో నారింజ పండ్లు చాలా ఎక్కువగా పండుతాయి. ఆ కారణంగా దీనికి 'ఆరెంజ్ సిటీ' అనే పేరు వచ్చింది. మా కాన్ఫరెన్స్లో అక్కడక్కడా గడ్డిపరిచి గంపల గంపల కమలా కాయల్ని పోశారు. ఎవరికి కావాల్సిన వాళ్లు ఎన్ని కావలిస్తే అన్ని తీసుకొని తినవచ్చు. ఇదీ మాకు నాగపూర్ డాక్టర్లు ఇచ్చిన ఆతిధ్యం. సమావేశ ప్రాంగణమంతా కమలాకాయల కనువిందైన వర్ణంతో పాటు వాటి కమ్మనైన వాసన చక్కగా ముక్కుపుటాలకు తగిలింది. అంతేకాదు ఇక్కడ ఈ కమలాకాయలతో తయారు చేసిన ఆరెంజ్ స్వీట్ అనే తీపి హల్వా బాక్సులను అందరికీ అందించడంతో వాటినిస్వాదించడంలో అందరూ మునిగిపోయారు. నాగపూర్ కు పూర్వం 'ఫణీంద్రపుర' అనే పేరు ఉండేదట. ఫణి అంటే తెలుసుకదా 'పడగ', పురం అంటే ఊరు. ఈ ఊరును 1703 సంవత్సరంలో దేవగఢ్ను పాలించే గోండుల రాజు అయినటువంటి 'భక్త బులంద్ షా' కనుగొన్నాడు. తర్వాత మరాఠా రాజ్యంలోని భోంస్లే వంశస్థుల చేతికి వెళ్ళింది. 'నాగ్' అనే నది ఈ ఊరు మధ్య గుండా ప్రవహిస్తూ ఉంటుంది. అందువలన డా|| బి.ఆర్. అంబేద్కర్ ఇక్కడి ప్రజలను 'నాగ్ ప్రజలు' అని అంటుండేవారు. ఇందుకో, మరెందుకో గానీ ఫణీంద్రపుర అనే పేరు నుండి నాగపూర్ గా మారిపోయిందీ నగరం. ఏ పేరైనా నాగుపాములను పడగలను, నాగమణులను గుర్తుకు తెస్తున్నది. నాగపూర్ నుండి వెలువడిన తొలి వార్తా పత్రిక ''ఫణీంద్ర మణి''. ఫణీంద్రమణి అంటే నాగరాజు పడగ పై ఉండే మణి అని అర్థం. ఈ పత్రిక చీకటిని పోగొట్టి కాంతిని వెదజల్లుతుంది. అజ్ఞాన అంధకారాన్ని పోగొట్టి వెలుగుల వైపు ప్రసరింపజేసేది 'వార్తా ప్రతిక' అని ఇక్కడి పత్రికకు ఆ పేరు పెట్టారు.
మేం దిగిన 'తులి ఇంటర్నేషనల్' హౌటల్ కు దగ్గర్లోనే 'జీరో మైల్ స్టోన్' అనే ప్రదేశం ఉన్నది. అదొక నాలుగు రోడ్ల కూడలి. ఏంటీ పేరు అని విచారిస్తే అక్కదొక పునాది రాయి లాంటిది. దానికి పక్కగా నాలుగు అశ్వాల బొమ్మలు, ఒక స్థూపం ఉన్నాయి. ఈ స్థూపం సముద్ర మట్టం నుంచి 1020 అడుగుల ఎత్తుగా కట్టబడింది. దీనిని 1907 లో కట్టారు. గ్రేట్ ట్రిగోనోమెట్రికల్ సర్వే (జీటీఎస్) వారు దీనినొక ల్యాండ్ మార్క్గా భారత దేశానికి భౌగోళికమైన మధ్యస్థ భాగం అని నిర్థారించారు. ఈ స్థూపం ఎనిమిది దిక్కులను కలిగి ఉంటుంది. ఎనిమిది దిక్కులవైపు ఎనిమిది నగరాలు ఎంతెంత దూరంలో ఉన్నాయో ఈ స్థూపంపై చెక్కిబడి ఉన్నాయి. అందులో మన హైదరాబాద్ నగరం కూడా ఉన్నది. హైదరాబాద్ నగరం 318 మైళ్ళ దూరంలో ఆగేయ దిశలో వైపు ఉన్నదని లిఖించి ఉన్నది. నాగపూర్ కు ఇదొక మాన్యుమెంట్.
మహారాష్ట్రలో ఆరు టైగర్ రిజర్వ్ పార్కులు ఉన్నాయి. అందుకేనేమో మా కాన్ఫరెన్స్లో ఎక్కడ చూసినా పులి బొమ్మలు, పులి పెయింటింగులు ఉన్నాయి. ప్రముఖులకు ఇచ్చే మెమెంటోల్లో సైతం పులి బొమ్మ ఉన్నది. ఒక కమలాకాయ, మధ్యలో జీరోమైల్ స్టోన్ స్థూపం. చివర పులి బొమ్మతో మెమెంటోలు తయారు చేయించారు. నాగపూర్లో ఎక్కువగా మరాఠి భాషనే మాట్లాడుతున్నారు. హిందీ, ఇంగ్లీషు భాషలు తక్కువ. ఇక్కడ హిందూయిజమ్ తర్వాత బుద్ధిజం ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. ఉదయమంతా గ్రౌండ్స్ లోని బిజినెస్ స్టాల్స్ చూస్తూ సరదా ఆట పాటల్లో పాల్గొని సాయంత్రం మొదలయ్యే ప్రారంభ సమావేశానికి వెళ్ళేందుకు ఆడిటోరియమ్ కు వెళ్ళాం. అక్కడ పెద్ద అక్షరాలతో ''కవివర్య సురేష్ భట్' అనే బోర్డు కనిపించింది. సురేష్ భట్ మహారాష్ట్రకు చెందిన గజల్ కవి.
సురేష్ భట్ గజల్ సామ్రాట్టుగా పేరు పొందిన ప్రతిభావంతుడైన కవి. ఒక కవి పేరు మీదుగా ఇంత పెద్ద ఆడిటోరియం కట్టడం చాలా గర్వంగా అనిపించింది. ఈయన అమరావతిలో 1932 లో జన్మించాడు. అతని తల్లి చిన్నతనం నుంచీ ఎన్నో పద్యాలను బట్టీ పట్టించి మరీ చదివించేది. ఆ కారణంగానే అతనికి సాహిత్యంపై ఇష్టం ఏర్పడింది. ఆ తర్వాత భట్ కు రెండున్నర సంవత్సరాల వయసులోనే పోలియో వ్యాధి సోకి అవిటి వాడైనాడు. ఈ కారణంగా అతను మామూలు బాలల్లా ఆడుకోలేక డిప్రెషన్ కు గురయ్యాడు. ఆ కుంగుబాటు నుంచి బయటపడటానికి అతనికి సాహిత్యం ఒక మార్గమైంది. ఇలా సాహిత్య మార్గం వైపు మళ్ళిన భట్ పర్షియన్ కవిత్యం లోని గజల్ ప్రక్రియను మరాఠీ భాషలోనికి తీసుకొచ్చాడు. ''రూప గంధ, రంగ మాఝా వెగాలా, ఎల్గార్, జంఝావత్, సప్తరంగ'' మొదలైనవి సురేష్ భట్ ప్రఖ్యాత రచనలు. ''రూప గంధ, రంగ మాఝా వెగాలా' అనే రెండు గ్రంథాలకు మహారాష్ట్ర ప్రభుత్వ సాహితీ అవార్డులు లభించాయి. 'రంగ మాఝా వెగాలా' అనే గ్రంథాన్ని మహారాష్ట్ర లోని మూడు విశ్వవిద్యాలయాలు ఎం.ఏ మరాఠీ విద్యార్థులకు పాఠ్య గ్రంథంగా నిర్ణయించారు.
నాగపూర్ లోని బౌద్ధ స్థూపం 'దీక్షా భూమి' ని చూడటానికి వెళ్లాం. ఈ కట్టడం అర్ధ గోళాకారంగా అన్ని బౌద్ధ స్థూపాలవలె ఉన్నది. ఇక్కడ డా|| బి.ఆర్. అంబేద్కర్ హిందూ మతం నుంచి బౌద్ధ మతంలోకి మారాడు. 1956 వ సంవత్సరం అక్టోబర్ 14 వ తేదీ నాడు నాగపూర్ లో ప్రసిద్ధ బౌద్ధ గురువుల సమక్షంలో అంబేద్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఆ సమయంలో అంబేద్కర్ అనుచరులు ఐదు లక్షల మంది హాజరైనారు. ఈ సమావేశం తర్వాత అంబేద్కర్ నేపాల్ లోని ఖాట్మండులో జరిగే నాల్గవ ప్రపంచ బుద్ధిస్టుల సమావేశానికి హాజరైనాడు. ఈ సందర్భంగా అంబేద్కర్ ''ద బుద్ధ అండ్ హీస్ డ్రామా'' అన్న పుస్తకాన్ని రచించారు. బౌద్ధ మతాన్ని స్వీకరించిన రెండు నెలల్లోనే డిసెంబరు 6 వ తేదిన 1956 లోనే అంబేద్కర్ కన్నుముశారు.
ఈ కట్టడం లోపల బుద్ధుని ప్రతిమ ఉంటుంది. చుట్టూరా అంబేద్కర్ సాధించిన, పాల్గొన్న, సమావేశాలు విజయాలు మొదలైన వాటిని చిత్రాలుగా అమర్చారు. అవన్నీ చూసి అతని భార్య మాయీ సాహెబ్ (సవితా అంబేద్కర్) అతన్ని అనారోగ్య సమయంలో ఎంతో బాగా చూసుకున్నదని అర్థమయింది. బయట గుమ్మటంలా ఉన్న బోధి వృక్షం ఉన్నది. ఓ పక్కగా అంబేద్కర్ విగ్రహం ఉన్నది. దీక్షా భూమిని చూశాక మేం పుటాలా సరస్సును, బాలాజీ మందిరాన్ని, స్వామి నారాయణ్ మందిరాన్ని చూశాం. స్వామి నారాయణ్ మందిరాన్ని చూడటానికి రెండు కండ్లు చాలవు అనిపిస్తోంది. రాయిని అంత చక్కని లతలుగా, పూలుగా చెక్కడం ఎంత కష్టమైన పని. అసలు రాయి అని అనిపించడం లేదు. ఎంత సేపు చూసినా చూడాలని పిస్తూనే ఉన్నది.
ఆ మరుసటి రోజు మేం 'సివి రామన్ సైన్స్ సెంటర్' చూడటానికి వెళ్లాం. చుట్టూ చాలా పెద్ద గార్డెన్ ఉంది. అందులో ఎలోవీరా, యాలకులు, లవంగాలు వంటి మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. లోపల త్రీడి షో, తారామండల్, సైన్స్ ప్రయోగశాల ఉన్నది. మేం వెళ్ళినప్పుడు స్కూల్ పిల్లలతో నిండి ఉంది. మేం కూడా సరదాగా వారితో పాటు తిలకించాం. మొదట్లోనే ఒక పెద్ద బావి ఉన్నట్లుగా కనిపించింది. కానీ అది బావికాదు రెండు అద్దాల అమరిక. అందులో ఆప్టికల్ ఇల్యూషన్కు సంబంధించిన అనేక ప్రయో గాలు ఉన్నాయి. తెల్లటి చార్టర్ కలిగిన నల్లని చతురస్రాల మధ్య నల్లని వలయాలు వచ్చిపోతున్నట్లుగా కనిపిస్తాయి. అద్దంలో చూసుకుంటే మన ముఖం కనిపించదు అందులో మన వీపు భాగం కనిపిస్తుంది. చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ! అక్కడ ఒక దర్పణ పద్మ వ్యూహం ఉన్నది. అందులో అన్నీ అద్దాలే. లోపలికి వెళ్తే ఎక్కడ అద్దముందో, ఎక్కడ దారి ఉందో అర్థం కాక అద్దాలకు కొట్టుకున్నాం. అందులో మాతో పాటు స్కూలు పిల్లలు కూడా చాలా సరదాగా కనిపించారు. సీటి స్కాన్ ఎలా పని చేస్తుంది, టెలి మెడిసిన్ విధానం ఎలా పని చేస్తుంది, వైద్య పరికరాలకు సంబంధించిన అనేక అంశాలు ప్రయోగాల ద్వారా తెలియ చేస్తున్నాయి. ఇంకా బయోటెక్నాలజీ, కంప్యూటర్స్ తుఫాన్ హెచ్చరికల కేంద్రం ఎలా పని చేస్తుందో కూడా తెలుపుతున్నాయి. సైన్స్ సెంటర్ లోని అనేక ప్రయోగాలు పరిశోధనలు చూసి ఆనందించాం. అలా నాగపూర్ లోని మా సమావేశాలతో పాటుగా ఊరునూ, మందిరాలను, సైన్స్ సెంటర్నూ సందర్శించి ఆనందించాం. ఈ రీతిన నాగపూర్ పర్యటన మరువలేని అనుభవంగా మిగిలింది.
- డా|| కందేపి రాణీ ప్రసాద్
9866160378
Authorization