చరిత్ర పుస్తకం పట్టుకుంటే నేను టైమ్ మెషీన్ ఎక్కినట్టే. వందల, వేల ఏండ్ల క్రితం నాటి నాగరికత విశేషాలు, నాటి మనుషులు, వారి ఆచారాలు, వారి ఆహారం, వారి రాజకీయం... ఒకటేమిటి ప్రతీది కండ్ల ముందు చిత్రాల్లా సాగిపోతుంటాయి. అసలు ఈ భూమండలం మీదకు మనం ఎలా వచ్చాం, అడుగులు వేసుకుంటూ ఎలా నాగరిక ప్రపంచంలోకి ప్రవేశించాం.. మానవ పరిణామ క్రమం ఎలా ఉండేది ఇలా ఎన్నో ప్రశ్నలు నిత్యం నా మెదడును తొలిచేస్తూ ఉంటాయి. అందుకే ఈ సారి గుజరాత్కు ప్రయాణం కట్టాను. చరిత్రలో కి వెళ్లటానికి ఇదో ప్రయత్నం. అదెలాగా అంటారా? అయితే నాతో పాటు నాలుగు అడుగులు మీరు వేయాల్సిందే.
శిలాజ వనం...
అది గుజరాత్ రాష్ట్రం ఖేడా జిల్లాలోని రైయోలీ. మూరుమూల చిన్న పల్లెపట్టు. బాలసినోర్కు పక్కనే ఉంటుంది. విశాలమైన మైదాన ప్రాంతం. అహ్మదాబాద్ నుంచి గంటన్నర ప్రయాణం. 1980 ల్లో ఓ యాదృచ్ఛిక సంఘటన జరిగింది. ఖనిజ సంపద పుష్కలంగా ఉండే ఈ ప్రాంతంలో జియోలాజిస్ట్లు సాధారణ తవ్వకాలు చేస్తుంటే ఓ అద్భుతం ఆ మట్టి పొరల్లో బయటపడింది. గుడ్లు, ఎముకల శిలాజాలు కనిపించాయి. వాటి గురించి పరిశోధన చేస్తే ఈ చిన్ని గ్రామం లక్షల సంవత్సరాల క్రితం రాకాసి బల్లులకు అడ్డా అనే విషయం తెలిసి నోరెళ్లబెట్టారు పరిశోధకులు. ప్రపంచంలోనే డైనోసార్లు సంచరించిన ప్రధాన ప్రాంతాల్లో బాలసినోర్ మూడోవది. ఎక్కడెక్కడి నుంచో రాకాసి బల్లులు గుడ్లు పెట్టడానికి ఇక్కడకు తరలి వచ్చేవట. నదుల ప్రవాహం, అవి మోసుకు వచ్చే తేలికపాటి మట్టి రేణువులతో బాలాసినోర్ చుట్టుపక్కల నేల గుడ్లు పొదగటానికి, రక్షణకు అనుకూలంగా ఉండేదట. అందుకే కాబోలు ఒకటో రెండో కాదు టైరానోసారస్, మెగాలోసారస్, టిటానోసారస్ వంటి ఏడు రకాల డైనోసార్లు ఈ మట్టి పైనే తిరుగాడాయి. దాదాపు వెయ్యి వరకు డైనోసార్ల గుడ్ల శిలాజాలు లభించాయని విని బుజ్జి బుజ్జి డైనోసార్లు ఎంత ముచ్చటగా ఇక్కడ తిరిగాడాయో కదా అనుకున్నా. అందుకే బాలసినోర్ను శిలాజ వనంగా కూడా పిలుస్తారు. దాదాపు వంద మిలియన్ సంవత్సరాల వరకు ఈ ప్రాంతం అరుదైన డైనోసార్లకు ఆవాసంగా విరాజిల్లింది.
అరేబియా సముద్రం, నర్మద నదీ పరివాహక ప్రాంతంలో వందల సంఖ్యలో రాకాసి బల్లుల గుడ్లు, ఎముకలు, వెన్నెపూస, కడుపులో భాగాలు, తల ఇలా... ఎన్నో అవశేషాలు బయటపడ్డాయి. ఓ రాయి మీద పొడవాటి వెన్నుముక అచ్చు, గుడ్డు శిలాజాన్ని రాతి నుంచి తీసివేయగా మిగిలిన గుడ్డు ఆకారపు గుంటలు సంభ్రమాశ్చర్యాలకు గురి చేశాయి. రెండు డైనోసార్లు పక్క పక్కనే పడి సమాధి అయిన ఆనవాళ్ళు ఉన్నాయి. 65 మిలియన్ ఏండ్ల క్రితం అరేబియా సముద్రం నుంచి వచ్చిన భీకర వరదలు, అగ్నిపర్వత పేలుళ్ళతో ఈ జాతి పూర్తిగా అంతరించిందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ ఫాజిల్స్ను జాగ్రత్తగా సేకరించి మ్యూజియంలో భద్రపరిచే ఏర్పాట్లు చేస్తున్నారు. డైనోసార్ల ప్రాంతం అని చూడగానే అర్థ్ధం కావ టానికి, అనుభూతి చెందటానికేమో ఓ పెద్ద డైనోసార్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ. నోరు తెరిచి గాండ్రిస్తున్నట్లు ఉన్న డైనోసార్ పక్కన ఫోటోలు దిగటానికి పర్యాటకులు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు.
హరప్పా సంస్కృతి...
బాలసినోర్ తర్వాత లోథల్ దిశగా ప్రయాణం అయ్యాను. ప్రస్తుతం అహ్మదాబాద్ జిల్లాలోని ఢోల్కా తాలూకాలో ఉంది. ఇది కూడా మట్టి పొరల్లో బయటపడిన చారిత్రక ప్రాంతమే. ప్రపంచంలోని ప్రాచీన నాగరికత అవశేషాల్లో ఇది ఒకటి. ఇక్కడి శిథిలాలను చూస్తుంటే నాకు అచ్చం చరిత్ర పుటలను తిరగేసినట్లే అనిపించింది. మానవ నాగరికత మొగ్గతొడిగిన తొలి ప్రాంతాల్లో లోథల్ ఒకటి. క్రీస్తు పూర్వం 2400 సంవత్సరం నాటి హరప్పా సంస్కతి బయటపడిన ప్రాంతాలు గుజరాత్ రాష్ట్రంలో చాలా ఉన్నాయి. ధోలవీర, గోలా ధోరో, లోటేశ్వర్, రంగపూర్, సర్కోటాడా నాటి ఇతర ముఖ్య పట్టణాలు. సింధూ నాగరికతనే హరప్పా-మొహంజోదారో నాగరికత అని కూడా అంటారు. భారత పశ్చిమ భాగంలోని సింధ్ ప్రాంతంలో ఈ నాగరికతకు మెసపొటోమియా, ప్రాచీన ఈజిప్ట్ నాగరికతలు సమకాలీన నాగరికతలు. సింధు నాగరికత వికసించిన ప్రాంతం లోథల్. లోథల్ అంటే గుజరాతీ భాషలో మతుల దిబ్బ అని అర్ధం. దీన్ని ప్రపంచంలోనే తొలి ఓడల రేవుగా చరిత్రకారులు పరిగణిస్తారు. హరప్పా ప్రజల నిర్మాణ కౌశల అదుÄ్భతానికి, ఇంజనీరింగ్ నైపుణ్యానికి లోథల్ నిలువెత్తు సంతకం. 1954లో ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జరిపిన తవ్వకాల్లో ఈ నగరం బయటపడింది.
అహ్మదాబాద్ నుంచి 85 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ నగరం అప్పట్లో వ్యాపారానికి కేంద్ర బిందువుగా ప్రసిద్ధి చెందింది. ఎండిన ఇటుకలతో పక్కాగా నిర్మించిన గోడల నిర్మాణం అదుÄ్భతమే. వేల ఏండ్ల క్రితమే భూగర్భ డ్రైనేజీని హరప్పా ప్రజలు నిర్మించుకుని ఉపయోగించిన విధానం... చూసి ఆశ్చర్యపోవటం మన వంతు అవుతుంది. లోథల్ పట్టణం ప్రధానంగా రెండు భాగాలుగా విడిపోయి ఉంది. ధనవంతులు, పాలకులు ఉండే ఇండ్లు ఒక వైపు ఉన్నాయి. వీటిలో కొన్ని రెండంతస్తుల భవనాలు కూడా ఉన్నాయి. ఇక మరో భాగంలో సాధారణ ప్రజలు నివసించిన చిన్న పాటి ఇండ్ల నిర్మాణం కనిపిస్తుంది. నది నుంచి వరదలు ముంచెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు హరప్పా ప్రజలు చేపట్టారు.
గట్టి గోడలను నిర్మించటమే కాకుండా ఇండ్లు, షాపులను భూమి నుంచి మూడడు గుల ఎత్తున నిర్మించారు. అందుకే ఇప్పటికీ అంత భద్రంగా మనకు కనిపిస్తున్నాయి.
ఇటుకలతో నిర్మించిన ఓడ రేవు...
హైటెక్, టెక్నాలజీ అని మనం తెగ సంబర పడిపోతుంటాం కాని, వేల సంవత్సరాల క్రితమే సింధు ప్రజలు ఓడ రేవు నిర్మించుకున్నారు. ఇటుకలతో నిర్మించిన ఓడ రేవు శిథిలాలు ఇప్పటికీ ఉన్నాయి. నౌకలు ఆగటానికి సముద్ర ఆటుపోట్ల ప్రభావం పడకుండా వ్యూహాత్మక డాక్ యార్డ్నూ వీరు నిర్మించారు.
అంతే కాదు ఓడల ద్వారా వస్తువులు పెద్ద ఎత్తున ఎగుమతి, దిగుమతి అవుతుంటాయి కదా వాటిని భద్రపరచటానికి అప్పట్లోనే సింధూ ప్రజల వేర్ హౌస్లు కట్టుకున్నారు. అది కూడా భూమి నుంచి మూడున్నర మీటర్ల ఎత్తున కట్టారు. వారి దూర దష్టికి ఈ నిర్మాణాలు నిదర్శనం. సబర్మతి నది ద్వారా సింధూ నాగరికతకు చెందిన ఇతర పట్టణాలకు కూడా వ్యాపారం జరిగేది. మరో వైపు అంతర్జాతీయ వ్యాపారం చేసేవారు సింధూ ప్రజలు. ఇక్కడి నుంచి మెసపొ టోమియా, ఈజిప్ట్, పర్షియా వంటి దేశాలకు వ్యాపార లావాదేవీలు జరిగేవి. ఇరాక్ దేశస్తులు వాడిన ముద్రలు, ఇతర వస్తువులు తవ్వకాల్లో బయటపడ్డాయి. లోథల్కు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఓడ రేవు, అంతర్జాతీయ వ్యాపారం జరిగేదంటే సహజంగా పారిశ్రామిక వాతావరణం కూడా ఉండొచ్చని అంచనా వేయవచ్చు.
పూసలకు కేంద్రం లోథల్...
లోథల్లో పూసల పరిశ్రమలు ఉండేవన్న విషయంలో ఇక్కడి తవ్వకాల్లో దొరికిన ఆధారాలతో చరిత్రకారులు తేల్చారు. ముఖ్యంగా ఆభరణాల్లో పూసలకు అప్పట్లో ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. పూసల పరిశ్రమకు లోథల్ కేంద్రంగా ఉండేది. ఇక్కడి మట్టిపొరల్లో సింధూ ప్రజల మత దేహాలు కూడా బయటపడ్డాయి. రెండు మత దేహాలు ఒకే సమాధిలో కలిసి కనిపించటంతో సతీసహగమనం జరిగేదని కొంత మంది చరిత్ర కారుల అంచనా. ఈ ప్రాంతంలో బయటపడిన హరప్పా ప్రజలు ఉపయోగించిన అలంకరణ, వంట సామాగ్రి, టెర్రాకోట వస్తువులు, అన్నింటిని భద్రపరచటానికి 1976 లో మ్యూజియం ఏర్పాటు చేశారు. కాలం ఏదైనా ఆడవారిని, అలంక రణను విడదీసి చూడలేమేమో అనిపించింది. మ్యూజియమ్లోని కొన్ని వస్తువులను చూసిన తర్వాత. సింధూ మహిళలు అందాలకు మెరుగులు దిద్దటానికి ఉపయోగించిన అద్దాలు, కాటుక డిబ్బి, పెదాలకు లిప్స్టిక్ పూతలాంటి రంగులు వేసుకునే వారు. వారు ఉపయోగించిన పూసల దండలు, ఆభరణాల డిజైన్లు ఇప్పటికీ ట్రెండ్ స్వెటర్లు. ధాన్యం దాయటానికి ఉపయోగించిన మట్టి కుండలు, రకరకాల పాత్ర, పని ముట్లు, శిలలు, వ్యాపారంలో ఉపయోగించే సీళ్లు వంటివి కూడా ఈ మ్యూజియంలో భద్రపరిచి ఉన్నాయి. అయితే ఈ మ్యూజి యంలో ఫోటోగ్రఫీ, వీడి యోగ్రఫీని నిషేధం కావటం వల్ల కెమెరాలు క్లిక్ మని పించే అవకాశం దొరకలేదు. ప్రపంచంలోని అత్యంత సజనాత్మక నగరాల్లో లోథల్ ఒకటి అని ముక్తాయిం చటం సమంజసంగానే ఉంటుందనుకుంటాం.
- రెహనా
9492527352
Authorization