ప్రకృతి ప్రేమికులను ఆకర్షించే పర్యాటక ప్రదేశాలలో 'దాద్రానాగర్ హవేలీ' ఒకటి. ఇదొక కేంద్ర పాలిత పాంత్రం. చుట్టూ పచ్చని వాతావరణం మరోపక్క కొండకోనల సోయగాలు, ఇంకొవైపు గంతులేసే లేడిపిల్లల వయ్యారాలు. కొండల మధ్యనుంచి జాలువారుతున్న ఎత్తైన జలపాతాలు వీటిని అనుకొని ఉన్న అనేక అరుదైన వృక్ష, జంతుజాలాలు ఈ ప్రాంతానికే సొంతం. ఇలా ప్రకృతి విలసితమైన అందాలెన్నే! వీటికి తోడు అచ్చమైన గిరిజనుల జీవన విధానం. వారి జీవన చిత్రానికి రూపమిచ్చే ప్రత్యేక మ్యూజియం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నది. ఆలాగే సాహసోపేతమైన ఆటలను ఇష్టపడే యువతకోసం పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన వాటర్ స్పోర్ట్స్ ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి. ఈ మాన్సూన్ సీజన్ను ఎంజారు చేయాలనుకునే పర్యాటకులకు చక్కటి విడిది.
నిత్యం విదేశీ పర్యాటకులతో, సహజ సంపదలతో తులతూగే దాద్రా నగర్ హావేలీ గురించి చాలామందికి తెలియదు. గుజరాత్, మహారాష్ట్ర సరిహద్దులుగా ఉన్న ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో పర్యాటక కేంద్రాలు అనేకం. రాజధాని నగరమైన సిల్వస్సాతో పాటు అనేక ప్రాంతాలు పర్యాటకులను రారమ్మని పిలుస్తునే ఉంటాయి... దాద్రా నగర్ హవేలీ చుట్టుపక్కల ఉండే కొన్ని ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలు...
సిల్వస్సా...
సిల్వస్సా దాద్రానాగర్ హవేలీ రాజధాని నగరం. ఇది అక్కడి పర్యాటక ప్రాంతాలలో ముఖ్యమైనది. దీనిని పొర్చుగీసు పాలనలో 'విలాడి పాకో డి అర్కోస్' అని పిలిచేవారు. యాంత్రిక జనజీవనానికి దూరంగా ఉన్నాగానీ, అలనాటి పోర్చుగీసు మూలాలలతో సాంస్కృతిక వారసత్వం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నది. స్వాతంత్య్రానికి పూర్వం, స్వాతంత్య్రం వచ్చాక దాదాపు దశాబ్ద కాలంపైగా ఈ ప్రాంతం పోర్చుగీసు వారి ఆధినంలోనే ఉండటంతో పోర్చుగీసు వారి మూలాలు ఇప్పటికీ కనిపిస్తూ పర్యాటకులనూ విస్తూ పోయేలా చేస్తున్నది ఈ నగరం. అంతేకాదు సిల్వస్సా ప్రాంతం ప్రత్యేక పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది. రాజధాని నగరంలోని అనేక పచ్చికమైధానాలు, పార్కులు, వాటర్ పౌంటేన్స్ నిత్యం పర్యాటకులతో సందడిగా ఉన్నాయి. పొరుగున ఉన్న మహారాష్ట్ర, గుజరాత్, కర్నాటక రాష్ట్రాల నుంచి రవాణ సౌకర్యం కూడా అందుబాటులో ఉండటంతో అనేక మంది పర్యాటకుల వస్తూ, పోతూ ఉంటారు.
మధుబన్ డ్యాం...
ఇది రాజధాని ప్రాంతమైన సిల్వస్సాకు 20 కిలోమీటర్ల దూరంలో, దామిని గంగా దిగువన సుమారు 40 కిలోమీటర్ల దూరంలో మధుబన్ డ్యాం ఉంది. ఈ ప్రాంతంలో నీటి వనరులు ఎక్కువగా ఉండటంతో వాటర్ స్పోర్ట్స్ కు కేంద్రంగా ఉంటూ తన ప్రత్యేతకను చాటుకుంటుంది. అందుకే ఈ ప్రాంతానికి వచ్చే పర్యాటకులు చాలా మంది స్పీడ్ బోట్స్, ఆక్వా బైకులు, పడవలు, బంపర్ పడవలలో సవారీలు చేస్తూ అనందిస్తుంటారు. వీటితో పాటు చుట్టుపక్కల ఉండే అటవీ ప్రాంతం సందర్శకులకు కనువిందే అని చెప్పవచ్చు. ఆనకట్ట ప్రాంతానికి సమీపంలో పర్యాటకులు సేదతీరేందుకు విలాసవంతమైన గుడారాలు, శిబిరాలు, హోటళ్ళు ఇలా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అంతేకాదు ఆనకట్ట దగ్గరలో పిక్నిక్ స్పాట్స్ కూడా చాలా ఉన్నాయి.
సత్మాలియా జింకల పార్కు...
సిల్వస్సా రోడ్లోని సిల్వాస ఖాన్వేల్ శివారు ప్రాంతంలో సత్మాలియా జింకల పార్కు ఉంది. బ్లాక్ బక్, కృష్ణ జింకలు, మచ్చల జింకలు, సాంబార్, నిల్లై, నాలుగు కొమ్ముల జింకలు ఇలా అరుదైన అనేక జాతుల జింకల ఆవాసానికి అనువుగా ఉంది. మూడు వందల హెక్టార్లు విస్తరించి ఉన్న అతి పెద్ద పార్కుగా చెప్పుకోవచ్చు. ఇక్కడి అందమైన దృశ్యాలు మనోహరభరితంగా ఉంటాయి. ప్రకృతి ఒడిలో సేదతీరేందుకు చక్కటి ప్రదేశం. పచ్చని ప్రకృతి సమ్మేళనంగా ఉండే ఈ ఉద్యానవనాన్ని సందర్శించడానికి జూన్, జులై, ఆగస్టు నెలలు అనుకూలమైనవి. సిల్వస్సాకొచ్చిన పర్యాటకులకు పెద్దగా ఖర్చులు ఉండవు.
దుధాని...
సిల్వస్సాకు 40 కిలోమీటర్ల దూరంలో దుద్నికి దగ్గరలో గంగానది వద్ద ఉంది దుధాని. ఆటలకు, అనువైన వాటర్ ఫ్రంట్ ఉండటంతో వాటి ఆధారంగా వాటర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లను సందర్శకుల కోసం ఏర్పాటు చేశారు. ఇవి పర్యాటకులకు చక్కటి వినోదాన్ని అందిస్తాయి. వీటితోపాటు పశ్చిమ కనుమలకు చుట్టూ అందమైన ఫూట్ హిల్స్ ఉండటం వల్ల ఎక్కడో పచ్చికమైదానాల్లో కొట్టుకుపోయామా అన్న అనుభూతి కలుగుతుంది. వాటర్ స్పోర్ట్స్, రోయింగ్ పడవలు, నీటి స్కూటర్లు, పడవలు, స్పీడ్ బోట్లు, సిరాక్ రెసిడెన్సియల్ బోట్లు వంటివి పర్యాటకశాఖ నిర్వహణలో అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ బస చేయాలనుకుంటే అనువైన వసతి గృహాలున్నాయి. అలాగే ఔత్సాహిక క్రీడాకారులు కోసం దట్టమైన అటవీ ప్రాంతంలో ట్రెక్కింగ్ ఏర్పాటు కూడా ఉంది. కాలిబాటన వెళ్లే పర్యాటకులకు ఇక్కడి ఒంపుసొంపుల రహధారులు ఉత్సాహానిస్తాయి.
గిరిజన సాంస్కృతిక మ్యూజియం...
గిరిజన సంస్కృతి, సంప్రదాయం, నాగరికత, జీవనశైలిని కాపాడుకోవడంలో 'గిరిజన సాంస్కృతిక మ్యూజియం' కీలకపాత్ర పోషిస్తుంది. ఇది పట్టణానికి మధ్యభాగంలో ఉంది. ఈ మ్యూజియం ప్రవేశద్వారం చాలా విలక్షణమైన దండలతో, అలంకరణతో అద్భుతంగా ఉంటుంది. మ్యూజియం లోపలికి ప్రవేశించే ముందు తప్పనిసరిగా చెప్పులు, బూట్లు వదిలి వెళ్ళాలి. గిరిజన జీవన విధానం ఉట్టిపడేలా ఆకర్షణీయమైన నమూనా ప్రదర్శన కనువిందు చేస్తుంది. ఈ ప్రదర్శనశాలలో అక్కడి గిరిజన మహిళలు ధరించే వైవిధ్యమైన అభరణాలు, వారి రోజువారీ కార్యకలాపాల్లో ఉపయోగించే వస్తువులు, గృహవోపకరణాలు, వంటగదిలో ఉపయోగించే వస్తువులు, పనిముట్లు, చేపల్ని వేటాడే ఫిషింగ్ రాడ్లు, వ్యవసాయానికి ఉపయోగించే పనిముట్లు, సంగీత వాయిద్య పరికరాలు అకట్టుకుంటాయి. మ్యూజియం గోడలకు వందల ఏండ్లనాటి తుపాకులు, ఖడ్గాలు, కవచాలు, బాకులు, బాణాలు, వివాహాది వేడుకల్లో ఉపయోగించే వస్త్రాలు ఇలా ఎన్నో వస్తువులు సందర్శకుల్ని కట్టిపడేస్తాయి. అంతేకాదు గిరిజన సంప్రదాయ నృత్యాలను ప్రత్యేకించి వీక్షించవచ్చు. అనేక తెగలకు నిలయంగా ఉన్న ఈ దాద్రా నాగర్ హవేలీలో గిరిజనుల చరిత్ర, వారి సంస్కృతి సాంప్రదాయాలు అర్థం చేసుకోవడానికి గిరిజన సాంస్కృతిక మ్యూజియానికి మించింది లేదు. దేశంలో ఉన్న ప్రముఖ గిరిజన మ్యూజియాల్లో ఇది ఒకటి.
వసోన లయన్ సఫారి..
దాద్రా నగర్ హవేలీ భూభాగంలో 53 శాతం అడవులు ఆక్రమించాయి వ్యన్యప్రాణులకు ఈ ప్రాంతంలో నెలవైనది. అందుకే ఇక్కడి లయన్ పార్కులో అరుదైన సింహాలను చూడవచ్చు. గీర్ అభయారణ్యం నుండి రవాణ చేయబడ్డ సింహాలను దగ్గరి నుంచి చూసేందుకు పర్యాటక శాఖ ఎంక్లోజర్స్తో కూడిన వాహనాలని ఏర్పాటు చేసింది. సహజ సిద్ధమైన వాతావరణంలో దగ్గరి నుంచి సింహాలను చూడాలనుకునే వాళ్ళకి ఇది అనువైన ప్రాంతం. ప్రతి రోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పర్యాటకులకు అనుమతి ఉంటుంది.
ఎలా చేరుకోవాలి?
ఇన్ని ఆరక్షణీయమైన పర్యాటక ప్రాంతాలున్న దాద్రా నగర్ హవేలీకి ఎలా చేరుకోవాలనే కదా మీ డౌట్. సిల్వస్సాలకు దగ్గరల్లోనే వ్యాపీ రైల్వే స్టేషన్ ఉంది. ఇది సిల్వస్సాకు 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ముంబయి. అహ్మదాబాద్, బెంగుళూరు, జోధ్పూర్, పూణే అలాగే మన రాజధాని నగరమైన హైదరాబాద్ వంటి దేశంలోని ప్రధాన నగరాలతో వ్యాపీ రైల్వే స్టేషన్కు అనుసంధానం చేయబడి ఉంది. స్టేషన్ నుండి సిల్వస్సా వెళ్ళేందుకు టాక్సీలు, ఆటోలు, బస్సులు అన్ని సమయాల్లోనూ అందుబాటులో ఉంటాయి. విమానమార్గం ద్వారా వెళ్ళాలనుకుంటే డయ్యూ విమానాశ్రయం లేదా ముంబయి విమానాశ్రయం దగ్గరి ప్రాంతాలు.
- స్వేచ్ఛ
Authorization