'శిలలపై శిల్పాలు చెక్కినారు.. మనవాళ్లు సృష్టికే అందాలు తెచ్చినారు' అంటూ శిల్పుల నైపుణ్యం గురించి చెప్పిన పాట వినే ఉంటారు. కానీ ఆ శిల్పులే ఆశ్చర్యపోయేలా ఎంతో నైపుణ్యంతో చెక్కినట్లు రకరకాల ఆకృతుల్లో ఉన్న కొన్ని పురాతన శిల్పాలు బయటపడ్డాయి. వాటిని మలచిన శిల్పి ఎవరా అని ఆరా తీస్తే ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. అవేంటో తెలుసుకుందామా..
అది అమెరికాలోని ఉటాV్ా రాష్ట్రంలో ఓ లోయ. కొన్ని వందల ఏండ్ల కిందట ఓ కౌబోరు, తప్పిపోయిన పశువులను వెతుక్కుంటూ అటు వైపు వెళ్లాడు. ఆ లోయలో కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. రెండుమైళ్ల పొడవున కనుచూపు మేర రకరకాల ఆకృతుల్లో శిల్పాలు కనిపించాయి. పుట్ట గొడుగుల ఆకారంలో కొన్ని, విచిత్రమైన జంతువుల రూపంలో ఉండేవి కొన్ని, ఇద్దరు మనుషులు ఎదురుగా నిల్చున్నట్లు, ఓ తల్లి బిడ్డను ఎత్తుకున్నట్లు ఇలా రకరకాల రూపాలతో ఆ శిల్పాలు కనిపించాయి. అలా ఈ శిల్పాలు వెలుగులోకి వచ్చాయి. వీటిని చెక్కింది శిల్పులు కాదు.. ప్రకృతి అని పరిశోధనలో తేలిసింది. అంటే ఇవి సహజ సిద్ధంగా ఏర్పడ్డాయి. 14 కోట్ల సంవత్సరాలకు ముందు రాక్షస బల్లుల కాలంలోని ఇసుకరాళ్లతో ఇవి తయారయ్యాయట. మామూలు రాళ్లతో పోలిస్తే ఇసుకరాళ్లు మెత్తగా ఉంటాయి. కాబట్టి కాలక్రమంలో ఈ మెత్తటి రాళ్లు నీటి ప్రవాహానికి, బలమైన గాలులకు లోనై కోతకు గురవుతూ వచ్చాయి. అలా కొంత భాగం తరిగిపోతూ రావడంతో ఆ రాళ్లలో ఇలాంటి విచిత్రమైన ఆకృతులు ఏర్పడ్డాయి. 1949లో ఆర్థర్ షఫ్లిన్ అనే ప్రకృతి ప్రేమికుడు తొలిసారి ఈ లోయలోని అద్భుతమైన శిల్పాలను కెమెరాలో బంధించాడు. ఆ ఫొటోల ద్వారానే వీటికి విస్తృత ప్రాచుర్యం దక్కింది. ఈ లోయలో 'గెలాక్సీ క్వెస్ట్' అనే హాలీవుడ్ చిత్రాన్ని చిత్రీకరించారు. గ్రహాంతరవాసులు నివసించే గ్రహంగా ఆ లోయను చూపించారు. 1964లో ఈ శిల్పాల లోయను అక్కడి ప్రభుత్వం పర్యటక స్థలంగా మార్చింది. ఈ శిల్పాల అందాలను చూడటానికి సందర్శకులు విరివిగా వస్తుంటారు.
Authorization