భారతదేశంలోనే అత్యంత వర్ణరంజితమైన రాష్ట్రం రాజస్థాన్. అందులో జైపూర్ అంటే పింక్ సిటీగా పేరు పొందిందే కదా! ఊర్లోని భవనాలన్నీ గులాబీ రంగులో ఉంటే అక్కడి ప్రజల బట్టలు కళ్ళు చెదిరే రంగుల సమ్మేళనంతో అత్యంత మోహనంగా ఉంటాయి. ఇక్కడి కోటలు రాజ భవనాలు, సరస్సులు, సంస్కృతి ఏదైనా ప్రాముఖ్యం కలిగినటువంటిదే. జైపూర్ నగరాన్ని మహారాజా జైసింగ్ 17వ శతాబ్దంలో నిర్శించాడు. అందుకే ఆయన పేరు మీదగానే ఈ నగరానికి జైపూర్ అని నామకరణ చేశారు. జైపూర్ నగరం అందానికి మాత్రమే పేరుగాంచింది అనుకుంటే పొరపాటే. ఇది కళలకూ, సంప్రదాయానికీ పెట్టింది పేరు. జైపూర్ బంగారు ఆభరణాలకు, ఎనామిల్ పెయింటింగ్లకు, జాతిరాళ్ళకు పెట్టి పుట్టింది. ఇక్కడి లక్క గాజులు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందినవి. అలాగే ప్రకృతి దృశ్యాలూ అత్యద్భుతంగా ఉంటాయి.
జైపూర్ అనగానే రాజప్రాసాదాలు, కోటలు, అందంగా అలంకరిం చిన ఏనుగుల విన్యాసాలు, ఒంటెల సవారీలు, కళ్ళు చెదిరే రంగురంగుల దుస్తులు ఎన్నో గుర్తుకు వచ్చాయి. అన్నింటికన్నా పింక్సిటీ అంటే నగరమంతా ఎలా పింక్ రంగులో ఉంటుందోనన్న ఉత్సాహం ఆవరించింది మమ్మల్ని. ఇంకా ప్రఖ్యాత హవామహాల్ను దర్శించాలన్న ఆరాటం, రాజపుత్ర వీరుల సాహసగాథలు, ఆనాటి రాజుల శిల్పకళాభిరుచిని ఆస్వాదించబోతున్నామన్న ఆత్రుత మమ్మల్ని ఒక్కచోట నిలవనీయలేదు. తీరా వెళ్ళే రోజు రానే వచ్చింది. మేం జనవరిలో వెళ్ళడం వలన బయట విపరీతమైన చలిగా ఉన్నది. మరుసటి ఉదయం బ్రేక్ఫాస్ట్ ముగించుకొని మావారు వర్క్షాపు ఉన్నదని 'బిర్లా ఆడిటోరియమ్' వెళ్ళారు. పిల్లలిద్దరికీ పరీక్షలున్నందున మాతో రాలేదు. నేను రూమ్ కెళ్ళిపోయాను. 'బిర్లా సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్' స్టాచ్యూ సర్కిల్లో ఉన్నది. ఇందులో విద్యకు, వినోదానికి సంబంధించి అత్యాధుని కమైన కంప్యూటరైజడ్ ఆడియో విజువల్ డిస్ప్లే ఉన్నది. దీంట్లో సైన్స్ మ్యూజియమ్, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్, ప్లానెటోరియమ్, ఆడిటోరియమ్ ఉన్నాయి. ఇది దేశంలోని పెద్ద ఆడిటోరియమ్లలో ఒకటి. దీనిలో 1350 మంది జనం పడతారు. ఫార్మాన్యూటికల్స్ మేనేజర్ ఒకరు కారు తీసుకొచ్చి ఓల్డ్సిటీ చూద్దురుగానీ రండి అని పిలిస్తే వెళ్ళాను. జైపూర్ అంతా మామూలుగా ఉంది. మరి పింక్సిటీ ఎక్కడ అని రాత్రి అనుకున్నాం. ఇపుడు ఓల్డ్సిటీ చూశాక గానీ అర్థం కాలేదు. ఒక రాజ ప్రాకారం దాటాక గానీ పురాతన నగరం వచ్చింది. అక్కడి ప్రధాన కూడళ్ళలో తిరుగుతుంటే ఆనాటి రాజుల మధ్య తిరుగుతున్నట్లనిపించింది. ఇక్కడ మొత్తం ప్రతి ఇంటిపై పింక్ కలర్ పరదా కప్పినట్లున్నది. ఇక్కడ ప్రతి భవనం ఎర్ర రాళ్ళతో కట్టబడి ఉన్నది.
హవామహల్, జంతర్మంతర్, సిటీప్యాలెస్, జల్మహాల్లోని నాలుగు అంతస్థులు ప్రస్తుతం సిటీలో ఉన్నాయి. కేవలం ఒక అంతస్థు మాత్రమే నీటిపై భాగాన ఉన్నది. సరస్సు మధ్యలో ఉన్న ఈ మహల్ నగర్ఘర్ కోట నుంచి అద్భుతంగా కనిపిస్తుంది. జల్ మహల్ దగ్గర నుంచి ఆర్టీడీసీ కి వచ్చాను. ఇందులో బట్టలు, నగలు, కార్పెట్లు, షోపీస్లు, గృహలంకరణ వస్తువులు ఎన్నో దొరుకుతున్నాయి. మార్బుల్ చూర్ణంతో తయారయిన అమ్మాయి ముఖ బింబాలు చాలా అద్భుతంగా అనిపిస్తాయి. మార్బుల్స్లో చాలా రంగులు దొరు కుతాయి. అవి రాళ్ళుగా కొట్టేక్రమంలో చిన్న చిన్న చూర మిగిలిపోతుంది. ఆ చూరను మెత్తగా చూర్ణంగా చేసి ముఖానికి పసుపురంగు, బట్టలు, గాజులు అన్ని పెయింటింగ్ వేసినట్లుగా ఆయా భాగాల్లో ఈ చూర్ణాన్ని అతికిస్తారు. ఇలాంటి పెయింటింగ్ లు ఇక్కడ ఎన్నో దొరుకుతాయి. ఇక్కడ కొన్ని వస్తువులు కొనుక్కొని మీల్స్ టైంకు అశోకా క్లబ్కు వెళ్ళాను. మహారాజ కుటుంబీకులు ప్రస్తుతం కూడా నివసించే ప్యాలెస్లలో ఒకటి మైసూరు. రెండవది జైపూరు అట.
సాయంత్రం బయటకు వెళ్లాం. మా డ్రైవర్ పేరు లాలూ. అతను ఊరంతా తిప్పుతూ అన్ని విశేషాలూ చక్కగా చెబుతున్నాడు. రాజస్థానీలు ఎక్కువగా వెజిటేరియన్ లట. దారిలో ఆల్బర్ట్హాల్, బిర్లామందిర్, గణేష్ టెంపుల్, విధాన సభ అన్నీ చూసుకుంటూ వెళుతున్నాం. దారిలో లైట్లతో వెలిగిపోతున్న ఓ భవనాన్ని చూపించి 'ఇదేంటి?' అని అడిగాను. దాని కతను 'యే హీ విధాన సభా హై! రాజస్థానీ కీ సబ్ బద్మాష్ లోగ్ యహా భైఠతే హౌ!' అన్నాడు. ఇది విన్నాక సామాన్యులకు కూడా రాజకీ యాలంటే ఎంత అసహ్యమో అనిపించింది. ఊరంతా ఎటు తిరిగినా కోటలే కనిపిస్తున్నాయి. షాపుల్లో ఇక్కడ ఎక్కువ టై అండ్ డై ప్రింట్, బాందినీ ప్రింట్, ఇంకా మినాకారీ వర్కు చాలా ప్రసిద్ధి ఇక్కడున్న జవహర్ బజార్లో అన్ని రకాల వస్తువులూ దొరుకుతాయి. ఇది మన హైదరాబాద్ లోని సుల్తాన్బజార్లా ఉంది.
మధ్యాహ్నం హవా మహల్ను చూడటానికి వెళ్ళాం. ఇది రోడ్డుపైనే ఉన్నది. దీని ముందంతా షాపులున్నాయి. ఈ హవా మహల్ను మహారాజు సవాయి ప్రతాప్ సింగ్ నిర్మించాడు. జైపూర్కు పేరు తెచ్చింది, ప్రతిభావంతమైనది, విలక్షణమైనది అయిన హవామహల్ క్రీ.శ 1799లో నిర్మించారు. ఇది నగర మధ్య భాగంలో ఎర్రరంగు రాళ్ళతో పిరమిడ్ ఆకారంలో కట్టబడి ఉంది. ఈ భవనం అయిదు అంతస్థులుగా ఉండి 593 కిటికీలతో అందమైన ఆర్చీలున్న బాల్కనీలతో చూడముచ్చటగా అలరారు తున్నది. రాణీి వాసపు స్త్రీలు పర్వదినాల్లో ఆయా ప్రధాన రహదారుల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపుల్ని ఈ కిటికీల గుండా తిలకించేవారు. ఈ కిటికీల వల్ల మంచిగాలి, వెలుతురు కూడా భవనం లోపలకు వస్తుంది. దీన్ని చూశాక అంబర్ కోటకు వెళ్ళాం. ఇది జైపూర్కు 11కి.మీ దూరంలో కొండ మీద కట్టబడింది. రాజామాన్సింగ్ 16వ శతాబ్దంలో ఈ కోటను కట్టటం ప్రారంభించగా 18వ శతాబ్ధంలో సవాయి జైసింగ్ దీనిని పూర్తి చేశాడు. ఈ కోట బయటి నుంచి మామూలుగా కనిపించినా లోపల చాలా అందంగా అలంకరించారు. గోడల మీద ఎక్కువగా వేటాడే సీన్లు ఉన్నాయి. కోటంతా ఎర్రరంగు రాళ్ళతోనూ, లోపల తెల్లని మార్బల్తోనూ కట్టారు. రాజపుత్రులు, మొఘలుల శిల్పకళతో కట్టించారు. ఈ కోట దగ్గర నుంచి సింగ్ పోల్, జలేబ్ చౌక్ దాకా యాత్రికులు ఏనుగుల
మీద సవారీ చేస్తూ ఆనందపడతారు. ఈ కోటను ఎక్కలేక బాగా కాళ్ళు నొప్పులొచ్చాయి. వాటిని చూస్తుంటే అసలు ఇంతంత కోటల్లో వాళ్ళు రోజూ ఎలా నడిచేవాళ్ళో అనిపించింది. పెద్దపెద్ద కొండల్ని కోటలుగా మార్చేశారు పూర్వపు రాజులు.
సాయంత్రం 'సిల్వర్ ఇన్'లో కల్చరల్ ఈవెనింగ్ జరిగింది. అందులో అద్భుతమైన రాజస్థానీ సంప్రదాయ డాన్సులు చూశాం. ఆ కళాకారులు మాతో ఫొటోలు తీయించుకున్నారు. చైనీస్, మొఘలాయీ, జైన్ వంటి అన్ని రకాల ఫుడ్స్ను అందరం రుచి చేశారు. మేం ఈరోజు అజ్మీరు, పుష్కర్ వెళ్ళాలనుకున్నాం. ఇంకొక ఫ్యామిలీతో కలిసి మొదటగా పుష్కర్ బయల్దేరాం. ఇది ప్రపంచంలోనే ఏకైక బ్రహ్మదేవాలయం. ఇక్కడొక సరస్సు ఉన్నది. ఇక్కడ నీళ్ళు చల్లుకొని గుడిలోనికెళ్ళాం. గుడి చుట్టూ కొండముచ్చులు విపరీతంగా ఉన్నాయి. యాత్రికుల వద్ద నుండి మరమరాలు తీసుకొని తింటున్నాయి. గుడి లోపలికి ఫోన్లు, కెమెరాలు తీసుకెళ్ళనియ్యకపోవడంతో ఇక్కడ ఫొటోలేవీ తీసుకోలేదు. జైపూర్ నుండి పుష్కర్ వచ్చే దారిలో నిండు రంగుల మేళవింపులతో లెహంగాలు ధరించే స్త్రీలు, సంప్రదాయ షేర్వాణీ, తలపాగాలతో పురుషులు కనిపించారు. ఇక్కడ నుంచి అజ్మీర్ వెళ్ళాం. అజ్మీరు వెళ్ళే దారి చాలా బాగుంది. ఈ ఊరి చుట్టూ కొండులున్నాయి. కొండల మధ్యలో కిందికి అజ్మీరు ఉంటుంది. బయట నుంచి ఈ ఊరు కనిపించదు. అన్నింటి కన్నా పెద్ద దర్గా ఇది. చాలా అద్భుతంగా ఉన్నది. అక్కడ ప్రసాదం తయారు చేసే పాత్రలు చాలా పెద్దవి. ఈ ఊరిలో 90 మంది ముస్లింలు ఉంటారు. మనం కూడా టోపీ, కొంగు నెత్తిమీద కప్పుకునీ నమాజ్కు వెళ్ళాలి. ఇక్కడ కూడా ఫోన్లు, కెమెరాలు లోపలికి తీసుకువెళ్లొద్దు. అజ్మీరు నుంచి జైపూరు వచ్చేటపుడు దారిలో 'మకరానా' అనే ఊరు కనిపించింది. మనం ఇక్కడ ఇళ్ళలో పరుచుకునే మకరానా మార్బుల్స్ ఈ ఊర్లోనే దొరకుతాయట. సాయంత్రానికి జైపూర్ చేరాం.
జైపూర్లోని 'హెవెన్స్ గార్డెన్'లో బ్యాంకెట్ జరిగింది. ఇది చివరి రోజు కాబట్టి చాలా అద్భుతంగా జరిగింది. కాన్ఫరెన్స్ జరిగిన ఈ మూడు రోజులూ మాకు డ్రెస్కోడ్ పెట్టారు. ఒకరోజు క్యాజువల్ వేర్, ఒకరోజు ఫార్మల్ వేర్, ఒకరోజు ఎత్నిక్ వేర్ ధరించాలి. ఈరోజు మాకందరకూ డాన్స్ ఫ్లోర్ ఇచ్చారు. ఆడవాళ్ళందరూ దాండియా ఆడుకున్నాం. మగవాళ్ళందరికీ రాజస్థానీ తలపాగాలు పెట్టారు. వాళ్ళు డాన్సులు చేశారు. ఉత్తరాది వాళ్ళు అద్భుతంగా డాన్సులు చేశారు. ఇదంతా వీడియోలు తీసుకున్నాం. ఒక గుర్రపు బగ్గీ తెచ్చి పెట్టారు. అందులోకి జంటలు ఎక్కి ఫొటోలు తీసుకున్నారు. గుర్రాలు చాలా అందంగా అలంకరిం చబడి ఉంటాయి. అలాగే ఏనుగులు కూడా బాగా అలంకరింపబడి ఉంటాయి. వాటిని వరుసగా నిలబెట్టారు. అందరూ ఏనుగులతో, గుర్రాలతో ఫొటోలు తీసుకుంటున్నారు. మేం కూడా చాలా ఫొటోలు తీసుకున్నాం. ఓ పక్క రాజస్థానీ జానపదనృత్యాలైన ఘూమర్, గారాసియా, అగ్ని నృత్యాలు వేదికపై అందంగా సాగిపోతున్నాయి. ఇంకో వేదికపై సినిమా పాటలకు అద్భుతమైన నృత్యాలు చేస్తున్నారు. నోరూరించే రకరకాల ఫుడ్స్ వేడి వేడిగా తింటూ చెవుల కింపైన సంగీతం వింటూ కనువిందైన నృత్యాలు తిలకిస్తూ చాలా చాలా ఆనందిస్తున్నారు అంతా. ఇదంతా ఓపెన్ గ్రౌండ్ కాబట్టి అందరూ చలికి వణుకుతూ సూపుల మీద సూపులు వేడిగా తెగ తాగేస్తున్నారు. చేతిలో సూప్ కప్పుతో ఫైర్ప్లేస్ కిందికి జేరుతూ అన్నింటినీ ఎంజారు చేస్తున్నాం. జైపూర్ దర్శనంతో ఆహ్లాదమైన అనుభూతుల్ని ఆనందంగా ఎంజారు చేసి ఇంటికి తిరిగొచ్చాం.
Authorization