మంచు తెరల సొగసులు, సంధ్యా రాగపు సరిగమలు, కర్పూర సుగంధాలు, గులాబీల గుబాళింపులు, దుమికే జలపాతాలు, పచ్చని ప్రకృతి సౌందర్యాలు, కొండలు, కోనలు, లోయలు, గుహలు, మనసుకు అద్భుత ఆహ్లాదాన్ని పరిచయం చేసే సుందర రమణీయ ప్రదేశం
వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ దీన్నే నందగిరి లోయ అని కూడా పిలుస్తారు.
అరుదైన పూలతో నిండిన లోయ ఉత్తరాఖండ్లో వుంది. ఊపిరాడనంత ఎత్తయిన కొండల్లో ఈ అందమైన పువ్వుల లోయ వుంది. ఈ లోయ అందాన్ని చూడడానికి నేను, మా శ్రీవారు, మా స్నేహితురాలు రేఖ వారి శ్రీవారితో కలిసి సెప్టెంబరులో వెళ్ళాం. ఇది హిమాలయలోని బద్రీనాథ్కి వెళ్ళే దారిలో వుంది. మేం మొదట హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళి అక్కడి నుంచి ఒక కారు మాట్లాడుకొని వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్కు బయలు దేరాం. ఢిల్లీ నుండి అక్కడకు 509 కిలో మీటర్ల దూరం. అక్కడకు చేరడానికి 14 గంటల ప్రయాణం చేయాల్సిందే. మేం రాత్రి ఋషికేష్లో హోటల్ తీసుకున్నాం. మర్నాడు పొద్దున్నే లేచి జోషిమట్ మీదుగా గోవింద్ఘాట్కు వెళ్ళాలి. మార్గమధ్యలో అనుకోకుండా దారిని మూసేశారు. ఎందుకని ప్రశ్నిస్తే.. కొండ చరియలు పై నుంచి రోడ్డుమీద పడిపోతున్నాయి. అది సరిచేయడానికి ఒక రోజు పడుతుందని చెప్పారు.
ఆ కొండ చరియల్ని యుద్ధ ప్రాతిపదిక కోసం సైనికులు ఆ రోడ్డును సరిచేశారు. మేం చిన్న పల్లెటూరిలో ఒక గది అద్దెకి తీసుకొని అందులో వున్నాం. రెండో రోజు ఎనిమిది గంటలకు ప్రయాణికులు వెళ్ళడానికి రోడ్డును బాగు చేశారు. అక్కడి నుంచి ఎనిమిది గంటల ప్రయాణం చేస్తే గోవింద్ ఘాట్కు సాయంత్రం నాలుగు గంటలకు చేరుకున్నాం. అక్కడి నుంచి కాలి నడకన లేదా గుర్రాల మీద 16 కిలో మీటర్లు నడిచి వెళ్ళాం. అక్కడ గుర్రాలను అద్దెకు ఇస్తారు. అది తెలుసుకొని మేం కూడా గుర్రాలను అద్దెకు తీసుకున్నాం. 16 కిలో మీటర్లకు 2000 రూపాయలు తీసుకున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు బయలుదేరితే మధ్యలో ఆగి పుల్నా గ్రామానికి చేరుకున్నాం. అక్కడ ఉత్తరాంచల్ స్టేట్ గెస్ట్ హౌస్లో రూమ్ తీసుకున్నాం.
అక్కడి నుండి దారి పొడవునా గులకరాళ్ళు, అక్కడక్కడా సన్నటి దారులలో ప్రయాణం. మూడు గంటల్లో 16 కి.మీ ప్రయాణం. మా లగేజీని గాడిద మీద తీసుకొని హౌటల్ దగ్గరకు వచ్చారు. దాని కోసం డబ్బులు చెల్లించాలి. గుర్రాలు మనుషుల్ని మోయడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు. మేం ఈ గుర్రాల్ని బేరం చేసి బయల్దేరితే సాయంత్రం ఆరైంది. ఆరింటికి బయలుదేరితే రాత్రి ఎనిమిది గంటలకు చేరుకున్నాం. చిమ్మ చీకటి నేను నా స్నేహితురాలు రేఖ చక్కగా పాటలు పాడుతూ నిండు పున్నమి రాత్రిలో తీరు తెన్నులు తెలియని దారిలో బిక్కు బిక్కు మనుకుంటూ మా హోటల్ రూమ్కు చేరుకున్నాం. పిచ్చి చలి వణుకు. హోటల్ కు వెళ్లిన వెంటనే వేడి వేడి సూప్ ఇచ్చారు. తాగిన తర్వాత ఆలు పరోటా తిని విశ్రాంతి తీసుకున్నాం. ఆ గెస్ట్ హౌస్లో రాత్రి పంది కొక్కులు తిరుగుతున్నాయి. ఇవేంటి ఇన్ని వున్నాయి అని అడిగితే.. ఆరు నెలలు అవి భూమి లోపల బొరియలు చేసుకొని ఉంటాయి. మిగత ఆరు నెలలు బయట తిరుగుతాయి. పంది కొక్కులను అరికట్టడం చాలా కష్టం అని చెప్పాడు ఓనరు.
మర్నాడు ఉదయం ఏడు గంటలకు లేచి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ చూడటానికి నడుచు కుంటూ వెళ్ళాం. అక్కడ ఊపిరాడనంత చల్లటి వాతావరణం ఉంటుంది. పొద్దున కొద్దిదూరం మాతో పాటు వచ్చిన మా స్నేహితురాలు వారి భర్త ఇద్దరికి శ్వాస తీసుకోవడం చాలా భారంగా వుందని చెప్పారు. వారికి కర్పూరం వాసన పీల్చుకుంటూ గెస్ట్రూమ్లో వెచ్చటి కాఫీ తాగి గదిలో విశ్రాంతి తీసుకున్నారు. నేను మావారు నెమ్మదిగా నడుస్తూ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ చూడటానికి వెళ్ళాం. ఒక చిన్న కాలువ మీద చిన్న వంతెన వుంది. ఆ వంతెన మీద నడిచి వెళ్లాలి. అలా పూల లోయలో నడుస్తుంటే ఎటు చూసినా ఆకాశాన్ని తాకే పచ్చని కొండలు.. ఆ కొండల మధ్యలో రారమ్మని పిలిచే పూలు, మమ్మల్ని చూసి పక్కున నవ్వే ఆ అందాల పూబంతులు, అలా కిందికి జారుతూ పచ్చిక సిల్క్ దారాల్లా కిందికి జారి నదిలో కలుస్తూ సన్నటి ఈల వేసే గాలి, ఆ రంగు రంగుల ఎర్రని, పసుపు, తెలుపు గులాబీ రంగుల పూలను తాకుతూ వుంటే ఆ పూబంతులు మమ్మల్ని రమ్మని పిలుస్తూ వుంటే ఆ కొండల మధ్యలో మమ్మల్ని మేం మరిచిపోయాం. ఆ ప్రకృతి అందాల ఊయలలో ఊగుతూ.. పిల్లగాలుల్ని ఆస్వాదించాం.
అలా నందగిరి లోయలో తిరుగుతుంటే మా మిత్రులు కూడా వచ్చి కలిశారు. ఎనిమిది కిలోమీటర్లు వెళ్ళి రావడానికి, ఎనిమిది కిలోమీటర్లు నడిచినా ఏమీ బడలిక అనిపించలేదు. మధ్యాహ్నం మా హోటల్కు వచ్చి సూప్ తాగి పరోటా, అన్నం తిన్నాం. ఇక ఆ రాత్రికి విశ్రాంతి తీసుకొని ఉదయం గుర్రం మీద సిక్కు లకు అతి పవిత్రమైన ''హేమ్కుండ్'' గురుద్వార్ కు వెళ్లాం. అక్కడకు వెళ్లాలంటే 12 కి.మీటర్లు ప్రయాణం చేయాల్సిందే. మేం పొద్దున ఏడు గంటలకు గుర్రాలమీద ఎక్కి ప్రయాణం మొదలు పెట్టాం. సన్నటి గీత గీసినట్టు ఉండే దారి పైకి వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు. ఎక్కడ పడిపోతామో అని బిక్కుబిక్కుమంటూ ఉంటారు. పది వేల అడుగుల పైన లోయలు. మధ్యలో చలికి కాళ్ళు, చేతులు కొంకర్లు పోతున్నాయి. చిన్నచిన్న టీ కొట్ల దగ్గర ఆగి చలి కాచుకొని వేడి వేడి టీ తాగి కర్పూరం వాసన పీలుస్తూ ముందుకు వెళ్ళాం. పైకి చెరగానే బ్రహ్మ కమలాలు కనువిందు చేశాయి. ఈ బ్రహ్మ కమలాలు 30 సం||లకు ఒక పువ్వు పూస్తుందని చెబుతుంటారు. బ్రహ్మ కమలాలు పచ్చటి కొండల మధ్య లేతపసుపు, తెలుపు రంగులతో కొండల మధ్యలో ఒక పుష్ప గుచ్ఛం ఉంచినట్టుగా వుంది. అబ్బా ఆ అందాల్ని, ఆ దృశ్య కావ్యాన్ని ఎంత వర్ణించినా తక్కువే.
అన్నీ దాటుతూ హేమకుండ్ చేరుకున్నాం. హేమ్కుండ్ దేవతలు ఈ కుండంలో స్నానం చేసి వెళ్తారని ప్రతీతి. నిజంగా ఆ చిన్న చెరువు పచ్చటి, నల్లటి కొండల మధ్య మిల మిల మెరుస్తూ ఉంది. ఆ కొండలు అందులో ప్రతిబింబిస్తూ స్వచ్ఛమైన నీరు, చల్లటి గాలి ఆరు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. ఇక్కడకు రావటానికి ఆరు గంటల సమయం పట్టింది. ''హేమ'' అంటే ''మంచు'' ''కుండ్'' అంటే ''సరసు''. ఈ సరసు స్వచ్ఛమైన నీటితో ''సప్తర్షి కొండలు'' అంటే ఏడు కొండల మధ్య వజ్రంలాగ, స్పటికంలాగ మెరుస్తూ ఉన్న ఆ సరసును చూసి ''దేవలోకం'' అంటే ఇదేనేమో అని అబ్బురంగ చూస్తూ నిలబడి పొయాం. హిమ గంగ చిన్న చిన్న పాయలుగా వీడి పారుతుందట. ఈ చెరువులో నీరు చల్లటి చలికి గడ్డ కట్టుకొని పొయింది. అంతటి చలిలో కూడా సిక్కులు వారికి పుట్టిన బిడ్డలను ఆ చెరువులో ముంచి తీస్తున్నారు. అబ్బా ఇంత చలికి పిల్లలు చనిపోరా అని అడిగితే ఇక్కడ చనిపోతే మోక్షం లభిస్తుందని వారి నమ్మకం అని చెప్పారు. వారి భక్తికి జోహార్లు. అక్కడ వేడి వేడిగా పాయసం ఇచ్చారు. అది తాగి మళ్ళీ మా తిరుగు ప్రయాణం అయ్యాం. ఇది చాలా కష్టమైన ట్రెక్. ఈ లాండ్ స్లైడింగ్లో (జారుడు స్థలాలో) కింద పడే అవకాశాలు వున్నాయి. ఎన్ని బాధలున్నా తప్పకుండా చూడవలసిన ప్రదేశం అనిపించింది. సాయంత్రం మేం ఒక షార్ట్ ఫిల్మ్ చూశాం. నిజంగానే ఇది ఇంద్రలోక సౌందర్యం. పర్యా టకులు జీవితంలో ఒక్కసారైన తప్పకుండా చూసి తీరాల్సిన ప్రదేశం.
- నర్మదా రెడ్డి
9849018510
Authorization