ప్రకృతి తల్లి పురివిప్పి నాట్యమాడినట్లు కనిపించే నేపాల్ పర్వత పంక్తులు, జలజల పారే జలపాతాల హొయలు, పక్షుల కిలకిలరావాలు, కొండలపై నుండి గంగమ్మ జాలు వారుతుంటే కనువిందు చేసిన సెలయేర్ల సుందర దృశ్యాలు, అడుగడుగునా కనిపించే అద్భుత కళాఖండాలు, ప్రకృతి సృజించిన జలధారలు, దట్టమైన అడవి సోయగాల అనుభూతులు సందర్శించి ఆస్వాదించాల్సినవి నేపాల్ అందాలు...
నేపాల్ దట్టమైన పర్వత పంక్తులకు.. అడవులకు పుట్టిల్లు. ఆకాశ మంతా దూది కుప్పలు పోశారా అని పించే ఎవరెస్ట్ పర్వత శ్రేణుల లో, ప్రయాణమంతా అగాధాల్లాంటి లోయలతో చూడముచ్చ టగా ఉంటుంది. నేపాల్కు దసరా సెలవులలో 83 మంది వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన ''వెల్ విషర్స్ టీచర్స్ ఫ్యామిలీ'' సభ్యులు 10 అక్టోబర్ నుండి 18 అక్టోబర్ వరకు వారం రోజుల పాటు సందర్శించి స్నేహ బంధం మరింత బలపడేలా చేసింది ఈ ప్రయాణం. ఎన్నో మరచిపోలేని మధురానుభూతులను మదిలో దాచుకున్నాం.
నేపాల్ మన దేశానికి ఉత్తరాన, చైనా, బంగ్లాదేశ్, టిబెట్ లు సరిహద్దులుగా ఉన్నాయి. లక్ష 47 వేల, 181 చదరపు కి.మీటర్ల విస్తీర్ణంలో ఉన్నది. రెండు కోట్ల 97 లక్షల 47 వేల జనాభా ఉంది. నేపాలీ అధికార భాషగా, నేపాలీ రూపీ కరెన్సీగా ఉంది. నేపాల్ వెళ్లడానికి పాస్పోస్టు గానీ, వీసాగానీ, ముందుస్తు అనుమతి గానీ అవసరం లేదు. ఇక్కడి ప్రజల్లో 80 శాతం హిందువులు మిగతా 20 శాతం బౌద్ధులు, ముస్లింలు, క్రిస్టియన్లుగా ఉన్నారు. భారతీయులు ఇక్కడ వ్యాపారాలు చేసుకోవచ్చు. స్థిరాస్థుల కొనుక్కోవచ్చు. అందుకే ఇక్కడి హోటళ్లు భారతీయులే ఎక్కువగా నడుపుతుంటారు. ఇదంతా భారత్, నేపాల్ దేశాల మధ్య కుదుర్చుకొన్న ఒప్పందం. ఇక్కడ దట్టమైన అడవుల్లో రుద్రాక్ష చెట్లు ఎక్కువగా పెరుగుతాయి. ప్రపంచంలో కెల్లా నేపాల్ రుద్రాక్ష చెట్లకు బాగా ప్రసిద్ధి. 'ఏకత్వంలో భిన్నత్వం' అనే నానుడిని నేపాల్ ప్రజలు నమ్ముతారు, ఆచరిస్తారు. పది ఏండ్ల కిందట దారిద్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాల సంఖ్య ఎక్కువ. ప్రస్తుతం ఈ సంఖ్య రోజురోజుకు తగ్గుతున్నది. బంగ్లాదేశ్, చైనా, భూటాన్ల నుండి ఎక్కువగా ప్రజలు వలస వస్తారు. ఇక్కడ ప్రజానీకం 80 శాతం పర్యాటకం పైన, 20 శాతం వ్యవసాయం పైన ఆధారపడి జీవిస్తారు. నేపాల్ దేశం అంతా 14 ప్రాంతీయ విభాగాలు (భాగమతి, డేరి, దవుల్గరి, జానకపురి, ఖండస్తి, కోడి, లుంచిని, ఖర్గని, రుహంకా, రబ్ధి, మేచి, నారాయాద్రి, సబర్మతి, సేరి)గా విభజించారు. ప్రకృతి వనరులున్నా సరియైన నాయకత్వ లేమి వల్ల సామాజికంగా, ఆర్థికంగా నేపాల్ అభివృద్ధి చెందలేదు. ప్రస్తుతం నేపాల్ కమ్యూనిస్టు పార్టీ (యన్సీపీ) నేపాల్ ను పరి పాలిస్తుంది. దక్షిణ ఆసియాలో ఇది అతి పెద్ద కమ్యూనిస్టు పార్టీ.
17 మే 2018 కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్, (మార్క్సిస్టు-లెనినిస్టు). కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్టు) లు కలిసి పోయి భాడ్లా ప్రసాద్ ఓలి.. ప్రధాన మంత్రిగా పరిపాలన చేస్తున్నారు. పక్కా పాలనా ప్రణాళికలు చేస్తూ ముందుకెళుతున్నారు.. చక్కెర, పొగాకు, ఆహార పంటలు బాగా పండిస్తారు. ప్రస్తుతం బట్టల పరిశ్రమ, తివాచీల పరిశ్రమల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ పర్వత శ్రేణి, భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా టెలి కమ్యూనికేషన్ వ్యవస్థ అంతగా అభివృద్ధి కాలేదు. చాలా తక్కువ అంటే 3జీ ఇంటర్నెట్ స్పీడ్ మాత్రమే సాధ్యం. ఇప్పటి వరకు ప్రపంచంలోని ఏ దేశం కూడా నేపాల్ పై దండెత్తలేదు.
ట్రెక్కింగ్, పారాగ్లైటు... రాఫ్టింగ్ లాంటి సాహస క్రీడలకు నేపాల్ పెట్టింది పేరు. ప్రపంచ పర్యాటకులు ఈ సాహస క్రీడల కోసం ఎక్కువగా నేపాల్ కొస్తుంటారు. ఇక్కడి గోర్ఖా వారు సాహసానికి, ధైర్యానికి పెట్టింది పేరు. అందుకే వీళ్లు ఇండియన్ ఆర్మీలో ఎక్కువగా చేరుతుంటారు. ఇక్కడి ప్రజలు ఎలాంటి స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోలేదు. అంతేకాదు ఎవరికి బానిసలుగా లేరు. జాతీయ జెండా కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మొదటి రోజు ఉదయం ఆరు గంటలకు వరంగల్ ముందు బస్సు ద్వారా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బయలు దేరి పది గంటలకు చేరుకున్నాం. మధ్యాహ్నం 12:30 కు విమాన మార్గాన వెళ్తే మధ్యాహ్నం 2:30 వరకు లక్నో విమానాశ్రయం చేరుకొన్నాం. ఆకాశంలోకి ఎగిరి పోతే ఎంత బాగుంటుందో మొదటిసారి నా అనుభవంలోకి తెచ్చుకున్నాను. తర్వాత గోరఖ్పూర్ చేరుకున్నాం. అక్కడ హోటల్లో బస చేశాం. మర్నాడు ఉదయం ఆరు గంటలకే హోటల్లో స్నానాలు ముగించుకొని, బ్రేక్ఫాస్ట్ చేసి గోరఖ్పూర్ మందిరం చూశాం. తర్వాత దాదాపు 125 కిలోమీటర్లు ప్రయాణించి లుంబినీ చేరుకున్నాం. అక్కడ గౌతమ బుద్ధుడు జన్మించిన స్థలం మాయాదేవి మందిరం, మహాబోధి మందిరా లను తిలకించాం. లుంబినీ రూసద్దేహ.. జిల్లాలో ఉంది. ఇచ్చట రాణి మాయాదేవి గౌతమబుద్ధునికి జన్మ నిచ్చిందట. ఇక్కడి ఉద్యానవనాలు, తిరుగుతూ బోటు షికారులో జాలీగా గడిపాం. క్రీ.పూ రెండో శతాబ్దంలో అశోకుడు నేపాల్లోని దక్షిణ ప్రాంతా లను పాలించినట్టు అక్కడి కట్టడాలు చెబుతాయి. అలా ఒకప్పుడు నేపాల్ భారత్లో అంతర్భాగంగా ఉండేది అనుకోవచ్చు. లుంబినీకి వివిధ దేశాల నుండి బౌద్ధులు వస్తారు. ఇది బౌద్ధుల ప్రఖ్యాత ప్రార్థన స్థలం.
వీటన్నిటిని ప్రత్యక్షంగా చూడటం ఒక మధురమైన అనుభూతి. తర్వాత 170 కిలోమీటర్లు ప్రయాణించి పోక్రా సిటీ చేరుకున్నాం. రాత్రంతా ప్రయాణం, ట్రాఫిక్ జామ్లతో చాలా ఇబ్బంది అయింది. తర్వాత రోజు హోటల్లో భోజనం చేసి, కాస్త విశ్రాంతి తీసుకున్న తర్వాత పోక్రా సరస్సు చూడటానికి బయలు దేరాం. ఈ సరస్సు పోక్రా నగరంలోని, సారంగ్ కోట్, కస్కికోట్ ప్రాంతంలో ఉంది. ఇది నేపాల్లో రెండవ అతి పెద్ద సరస్సు. 443 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో 28 అడుగుల లోతులో ఉంది. మంచుకురిసే పర్వత శ్రేణుల పరావర్తనం, అలాగే ధౌలగిరి పర్వతపంక్తుల పరావర్తానం ఈ సరస్సుకు చెందుతాయి. ఈ దృశ్యం చాలా అందంగా ఉంటుంది. రాత్రి నేపాల్ షాల్స్, ఉలెన్ వేర్ లాంటివి షాపింగ్ చేసి అక్కడే ఒక హోటల్లో భోజనం చేశాం. తర్వాత రోజు హోటల్లోనే పనులన్నీ ముగించుకొని అల్పాహారం తర్వాత లోకల్ వాహనం ద్వారా పోక్రా నగరంలోని బింద్యాబాసిని, గుప్తేశ్వర మహాదేవ గుహలు, మహేంద్ర గుహలను సందర్శించాం. పోక్రా నగరం నేపాల్లో రెండవ అతి పెద్ద నగరం. అంతా కొండమీదే ఉన్నట్టుగా ఉంది. ప్రయాణం చేస్తున్నప్పుడు దారి పొడవునా ఇరువైపులా అగాధాల్ని తలపించే లోయలు, ప్రకృతి రమణీయత తనివితీరా చూసి తరించాల్సిందే. అక్కడి వాతావరణం, ప్రజల జీవన విధానం, సంస్కృతి, గుహల్లో జలపాతాలు మమ్మల్ని మరచిపోయేలా చేశాయి. దేవి ఫాల్స్ భూగర్భంలో దాదాపు ఐదు వందల అడుగుల వరకు వేసిన టన్నెల్.. దీన్నే పటేలాచాంగో అని కూడా అంటారు. ఈ టన్నెల్ ద్వారా గుప్తేశ్వర మహదేశ్ గుహలలోకి నీరు ఎప్పటికీ ప్రవహిస్తూ ఉంటుంది. ఈ గుహలు సంక్లిష్టమైన డిజైన్లతో చూడచక్కగా ఉన్నాయి. మరుసటిరోజు బస్సులో నేపాల్ రాజధాని ఖాట్మండ్ కు ప్రయాణమాయ్యాం. ఖాట్మండ్ వాలీలో ఖాట్మండ్ నగరం ఉంది. ఖాట్మండ్ నగరమంతా గుట్టలతో, కొండలతో పచ్చిక బయళ్లతో కనువిందు చేస్తుంది. హిమాలయాలను చాలా దగ్గరి నుండి చూడొచ్చు. స్వయం భూనాధ్, బౌద్ధనాధ్ స్థూపాలు, పశుపతినాథ్్ మందిరం చూశాం. అంతేకాదు బాబర్ మహల్, చౌని నేషనల్ మ్యూజియం, పటాన్ మ్యూజియం, పార్క్ ఆర్ట్ గ్యాలరీ, భక్తాపూర దర్బార్లు కూడా చూడాల్సిన ప్రదేశాలు. కానీ సమయం లేక వీటిని చూడలేకపోయాం. జల్ వారాధి దర్శించాం.
మర్నాడు ఎత్తయిన పర్వత ప్రాంతం కోట్కు పయనమయ్యాం. లోతైన లోయలు, రోడ్డుకిరువైపులా అటూ ఇటూ ప్రకృతి అందాల నడుమ ప్రయాణం చాలా ఆనందంగా సాగింది. నగర్కోట్ ట్రెక్కింగ్కు చాలా ప్రసిద్ధి . ప్రకృతి అందాలు చూసి తరించాం. మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని వీక్షించి సన్సెట్ పాయింట్ను తిలకించాం. ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఉన్నందు వల్ల చలికి తట్టుకోలేక పోయాం. తిరిగి ఖాట్మండ్కు వెళ్లాం. ఖాట్మండ్ నుండి ప్రయాణమై రోప్వే ద్వారా మనోకామ్నా మందిరం చేరుకున్నాం. రోప్ వే అంటే కేబుల్ కార్ల ద్వారా చిత్రాన్ నుండి మనోకామ్నా గోర్కా వరకు దట్టమైన అడవుల మధ్య, కింద సెలయేరు పారుతుండగా భూమి నుండి 9095 ఫీట్ల ఎత్తులో, 2,772 మీటర్లు ప్రకృతి అందాలను చూస్తూ ప్రయాణం చేశాం. ఇది ఒక మరిచిపోలేని అనుభూతి.
అక్కడి నుండి జనాక్పూర్కు ప్రయాణమాయ్యాం. మార్గమధ్యంలో ప్రకృతితో మమేకమవుతూ ప్రకృతి రమనీయతలో సేదతీరాం. ఇక జనాక్పూర్లో సీతాదేవి జన్మించిన స్థలం, రాముడు శివధనస్సు విరచిన ప్రదేశం, సీత స్వయం వరం జరిగిన స్థలం చూశాం. జనాక్పూర్లో మహిళలు తెలంగాణ ప్రతీక అయిన బతుకమ్మ సంబంరాల్లో చాలా సంతోషంగా పాల్గొన్నారు. ఈ సంబరాల్లో నేపాల్ మహిళలతో పాటు నేపాల్ సందర్శనకు వచ్చిన అమెరికా వనితలు పాల్గొనడం విశేషం. ఇక అక్కడి నుండి రైల్వే స్టేషన్కు చేరుకున్నాం. దాదాపు 36 గంటలు రైలు ప్రయాణం చేసి క్షేమంగా వరంగల్కు చేరుకున్నాం. ఆ రోజు మా మ్యారేజి అనివర్సరీ. అని తెలుసుకున్న మిత్రులు రైల్లో చాలా గ్రాండ్గా 'మ్యారేజి డే ఆన్ భాగమతి ఎక్స్ప్రెస్ వీల్స్' సెలబ్రేట్ చేశారు. ఇది మా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని అనుభూతి. సుమారు ఎనిమిది రోజులు మిత్రులతో కలిసి ప్రయాణాలు చేసి, ప్రకృతిని వీక్షించడం, సాహసక్రీడల్లో పాల్గొనడం చాలా బాగుంది.
-కె. సరళ కుమారి , 9494788668
Authorization