ఎడారి అంటే ఇసుకదిబ్బలు గుర్తుకు వస్తాయి.
ఎడారి అంటే మెల్ల మెల్లగా సాగిపోయే ఒంటెల బారు గుర్తుకు వస్తుంది.
ఎడారి అంటే చుక్కనీరు దొరకని ప్రాంతం అని గుర్తుకు వస్తుంది.
ఎడారి అంటే ఖర్జూరాలు పండే ఒయాసిస్సులు గుర్తుకు వస్తాయి.
కాని వీటన్నింటినీ పక్కకు తోసి మన ముందు సాక్షాత్కరిస్తుంది ఉప్పు ఎడారి.
అసలు నాకు ఈ వైట్ డిజర్ట్ మీద నాలుగైదు ఏళ్ళ నుంచే కన్ను ఉందనుకోండి. 2012 గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కవరేజ్ కోసం వెళ్లినప్పుడే ఈ ప్రాంతాన్ని చూడాలనుకున్నాను కాని కుదరలేదు. ఉప్పు ఎడారి అంటే నిజంగా ఉప్పు ఉంటుందా? అసలు అంత ఉప్పు ఎలా తయారవుతుంది? ఉప్పు పై ఎలా నడుస్తాం? ఇలా బోలడన్నీ ప్రశ్నలు నా బుర్రలో ఉండేవి. సరిహద్దు పహారా అందులోనూ వైట్ డిజెర్ట్లో మరి నిద్ర ఎలా పడుతుంది.? గుజరాత్ రాష్ట్రంలోని పశ్చిమ సరిహద్దు ప్రాంతంలో పర్యటించి తిరిగి భుజ్కు వచ్చేసిన మరుసటి రోజు ఉప్పు ఎడారిలోకి ప్రయాణం. సర్ క్రీక్స్ కోసం దక్షిణ దిక్కుకు వెళితే... ఇవాళ మనం ఉత్తరం వైపుకు ప్రయాణం చేస్తాం. గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లా పరిధిలోకి వస్తుంది రణ్ ఆఫ్ కచ్ ప్రాంతం.అటు క్రీక్స్, ఇటు ఈ వైట్ డిజెర్ట్ కావటానికి నేల స్వరూప స్వభాల్లో తేడాలున్నా... అంతటిని కలిపి గ్రేట్ రణ్ ఆఫ్ కచ్ అనే వ్యవహరిస్తారు. ఉదయం ఆరుగంటలకే నా ప్రయాణం మొదలు. అసలు అహ్మదాబాద్ నుంచి భుజ్కు వెళ్లే దారిలోనే సరిగ్గా చెప్పాలంటే భుజ్ నుంచి అహ్మదాబాద్ వైపు వంద కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తే మనకు రోడ్డుకు ఇరువైపులా పెద్ద ఎత్తున ఉప్పు తయారీ పరిశ్రమలు కనిపిస్తాయి. ఉప్పు కయ్యలు, భారీ ఉప్పు గుట్టలు, లారీల కొద్దీ లోడ్ అవుతున్న దశ్యాలు ఆసక్తి కలిగిస్తాయి. ప్రపంచంలో అత్యధికంగా ఉప్పు తయారు చేస్తున్న దేశాల్లో మనది మూడవ స్థానం. ఇక దేశీయ ఉప్పు అవసరాల విషయానికి వస్తే దేశంలో తయారయ్యే మొత్తం ఉప్పులో 75శాతం రణ్ ఆఫ్ కచ్ లోనే ఉత్పత్తి అవుతుంది.కాండ్లా పోర్ట్ దగ్గరగా ఉండటం వల్ల ఇతర ప్రాంతాలకు ఉప్పు ఎగుమతి చేయటం తేలిగ్గా ఉంటుంది. లక్ష మందికి పైగా ఈ ఉప్పు తయారీ పరిశ్రమ పై ఆధారపడి బతుకుతున్నారు.
ఎడారి పండుగ...
అసలు ఈ ప్రాంతం ఉన్న కచ్ జిల్లానే ప్రత్యేకమైంది. గుజరాత్ రాష్ట్రంలో పూర్తిగా పశ్చిమ భాగంలో విస్తరించి ఉంటుంది. ఇది దేశంలోనే అతి పెద్ద జిల్లా. విస్తీర్ణపరంగా చూస్తే కేరళ, గోవా, సిక్కిం వంటి దాదాపు తొమ్మిది రాష్ట్రాల కంటే ఈ జిల్లానే పెద్దది. ఇక కేంద్ర పాలిత ప్రాంతాలను కూడా కలుపుకుంటే ఈ సంఖ్య 15కు చేరుతుంది. దీన్ని బట్టి కచ్ ఎంత పెద్ద జిల్లానో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా నవంబర్ మాసం (ఈ ఏడాది నవంబర్ 1 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 20 వరకూ) రాగానే గుజరాత్లోని కచ్ ప్రాంతంలో సందడి మొదలవుతుంది. అంతర్జాతీయ పర్యాటకులు మన దేశంలో సందర్శించే ప్రధానమైన వేడుకల్లో ఒకటైన 'రణ్ ఆఫ్ కచ్' ఫెస్టివల్ (కచ్ ఎడారి పండుగ- రణ్ ఉత్సవం) అప్పుడే మొదలవుతుంది. ప్రపంచంలో అతి పెద్ద ఉప్పు ఎడారిలో సుమారు మూడున్నర నెలలు కొనసాగే రణ్ ఉత్సవానికి ఆతిథ్యం ఇచ్చే ఈ ప్రాంతం సందర్శకులకు అపూర్వ అనుభూతుల సమాహారంగా స్వాగతం పలుకుతూ ఉంటుంది. ఈ ప్రాంతం ఏడాదిలో 8 నెలల పాటు ఉప్పు నీటిలో మునిగి ఉంటుంది. శీతకాలం వచ్చేసరికి నీరు ఇంకిపోతుంది. తెల్లగా పరుచుకున్న ఉప్పు బయటికి తేలుతుంది. శరద్రుతువు వెన్నెలలో తెల్లగా మెరిసే ఈ ఉప్పు ఎడారిని సందర్శించడం, భౌగోళికంగా ఎంతో వైవిధ్యం కలిగిన ఆ ప్రాంతంలో బస చేయడం జీవితకాలం గుర్తుండిపోయే మధురానుభూతి. అందుకే రణ్ ఉత్సవ్ ఎంతో విభిన్నమైనదీ, ప్రత్యేకమైనదీ కూడా.
పర్యాటకుల సందడి ఎక్కువ...
కచ్ ప్రాంతంలో ఈ సీజన్లో పర్యాటకుల కోసం ప్రత్యేక వసతి సౌకర్యాలను ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థలు అందిస్తున్నాయి. బడ్జెట్కు అనుగుణంగా ఎంపిక చేసుకోవచ్చు. గుజరాత్ టూరిజం శాఖ, ప్రయివేట్ ఆపరేటర్లు ఆఫర్ చేసే ప్యాకేజీల్లో వసతి, ఆహారం, గైడ్ తదితర సదుపాయాలు కలిసి ఉంటాయి. సంప్రదాయికంగా అలంకరించిన భుంగాలు (మట్టి గుడిసెలు) కూడా వసతికి అనుకూలంగా ఉంటాయి. సువిశాలమైన ఉప్పు నీటి ఎడారిలో బస చేస్తూ, వెన్నెల రాత్రులను ఆస్వాదించడం ఒక అద్భుతమైన అనుభూతి. దీనితోపాటు గుజరాత్ హస్తకళలు-ఎంబ్రాయిడరీ వస్త్రాలు, ఆభరణాలు, పెయింటింగ్ల ప్రదర్శనలూ, జానపద సంగీత, నత్య కార్యక్రమాలతో ఈ మూడున్నర నెలలూ కచ్ ఎడారిలో సంబరాలు మిన్నంటుతాయి. అంతేకాదు, పారామోటరింగ్, మూడు చక్రాల స్కూటర్ల మీద రైడ్స్, రాక్ క్లైంబింగ్ లాంటి సాహస క్రీడలు, చదరంగం, క్యారమ్స్ లాంటి ఇండోర్ గేమ్స్, ఒంటెల మీదా, ఒంటెల బండ్ల మీదా సవారీ... ఇంకా ఎన్నెన్నో యాక్టివిటీస్ సందర్శకులకోసం, ప్రత్యేకించి పిల్లల కోసం ఉంటాయి.
ఇండియా బ్రిడ్జ్...
కచ్ జిల్లా ప్రధాన నగరమే భుజ్. 2001లో తీవ్ర భూకంపంతో విలవిల్లాడిన నేపథ్యం భుజ్ ప్రాంతానికి ఉంది. 16 ఏళ్ళ సుదీర్ఘ కాలంలో నాటి గాయాలు మానిపోయే కనిపించాయి. భుజ్ నుంచి రణ్ వైపు దాదాపు 70, 80 కిలోమీటర్ల దూరం ప్రయాణం తర్వాత ఇండియా బ్రిడ్జ్ తారసపడింది. ఈ బ్రిడ్జ్ దాటి ఆవల అంతా సరిహద్దు దళం ఆధీనంలో ఉంటుంది. అంటే జనావాసాలకు, సరిహద్దు ప్రాంతానికి ఇది లింక్ అన్నమాట. ఇండియా బ్రిడ్జ్ దాటిన తర్వాత ఊళ్లు అనేవే ఉండవు. సిపాయిల అనుమతి లేకుండా వెళ్ళటమూ సాధ్యం కాదు. ఎవరు వెళుతున్నారు, ఎక్కడికి వెళుతున్నారు, వాహనం, వెళుతున్న వారి సంఖ్య తదితర అన్ని వివరాలు ఈ పాయింట్ దగ్గర నమోదు చేసుకుంటారు. 1971 ఇండియా-పాక్ యుద్ధ సమయంలో ఈ వారధిని పేల్చేసేందుకు పాక్ సైన్యం తీవ్రంగా ప్రయత్నం చేసిందని అక్కడి సరిహద్దు దళ అధికారులు చెప్పారు. బ్రిడ్జ్ కింద అక్కడక్కడ నీరు, అక్కడక్కడ ఉప్పు పరచుకున్న నేల, కొంత ప్రాంతంలో సముద్రపు అల వచ్చి వెళ్లిన తర్వాత తడి ఇసుక ఉంటుందే అలా కనిపించింది. కనువిందైన దశ్యం. బ్రిడ్జ్ దగ్గర సైనికుల కవాతు, అధికారుల ఇంటర్వ్యూ అయిన తర్వాత ముందుకు సాగాను.
వార్ మెమోరియల్...
బహుశా పదిహేను-ఇరవై నిమిషాలు ప్రయాణం చేసిన తర్వాత అనుకుంట ధర్మశాల అనే ప్రాంతానికి చేరుకున్నాను. ఇక్కడ వార్ మెమోరియల్ ఉంది. 1971లో పాక్తో యుద్ధం చేస్తూ మరణించిన వీర జవాన్ల జ్ఞాపకార్ధం కట్టారు. దేశం కోసం ప్రాణాలు త్యాగం చేయటం ఎంత గొప్ప విషయం. వారి కుటుంబాలు ఎంత తల్లడిల్లి ఉంటాయి. అసలు సరిహద్దు పహారా అంటేనే ప్రాణాల పై ఆశలు వదులుకోవటమే. ఈ సందర్భంగా నాకు ఒక ట్రైనీ కమాండర్ చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయి. ఒకసారి బీఎస్ఎఫ్ అకాడమిలో శిక్షణ పొందుతున్న ట్రైనీ కమాండర్ను అడిగాను. ''బార్డర్ డ్యూటీలో ప్రాణాపాయం ఉంటుంది కదా, మరి అన్నీ ఆలోచించుకునే వచ్చారా'' అని. ''దేశం కోసం ప్రాణాలు సైతం పణంగా పెట్టాలని నిర్ణయించుకున్న తర్వాతే అకాడమీలో అడుగు పెట్టాను మేడమ్'' అన్న అతని సమాధానం విని గర్వంగా అనిపించింది. వీరు కదా భరతమాత ముద్దు బిడ్డలు అని పొంగిపోయాను. ధర్మశాల నుంచి కాస్త ముందుకు వెళితే భీగా కోట్ అనే ప్రాంతం వస్తుంది. ఇక్కడకు వెళితే మనం దాదాపు భారత్-పాక్ అంతర్జాతీయ సరిహద్దుకు చేరుకున్నట్లే. అంతా పొడి నేల, చుక్క నీరు దొరకదు. ఈ ప్రాంతంలో ఉండే సైన్యానికి తాగే నీరు కోసం 85 కిలోమీటర్ల దూరం నుంచి ప్రత్యేక పైప్ లేన్ వేశారు. ఒక నిర్దిష్ట పాయింట్ నుంచి ట్యాంకర్ల ద్వారా సరిహద్దు క్యాంప్ వరకు నీరు చేర వేస్తుంటారు. ఇక్కడ గట్టిగా సరిహద్దు పహారా జరుగుతుంటుంది. ఈ ప్రాంతం అంతా పొడిగానే ఉంది. సరిహద్దు పహారా షూటింగ్ తర్వాత ఉప్పు ఎడారి వైపు మళ్లాం.
ఎడారి ఓ అద్భుత దృశ్యం...
ఉప్పు ఎడారి ఓ అద్భుత దశ్యం. దూరంగా నింగి, నేల కలిసిన ఆ చివరి రేఖలా విశాలంగా పరుచుకున్న శ్వేత వర్ణాన్ని చూసే సరికి ఊహలకు రెక్కలు తొడిగినట్లే అనిపించింది. ఈ నేల పై ఇంత అద్భుత అందాలు ఉన్నాయా అని అబ్బురపడి పోయాను. ఉన్న పళంగా ఆ ధవళ ప్రపంచంలోకి లేడీమల్లే పరుగెత్తుకు పోవాలని పించింది. వెన్నెల చల్లినట్లు, మల్లెలు పేర్చినట్లు ఉన్న ఆ నేల పై నా పాదముద్రలు పేర్చుకుంటూ వెళ్లి సంబరపడిపోయాను. అందులోను అది సూర్యుడు నెమ్మదిగా మరో ప్రపంచంలోకి జారుకుంటున్న వేళ ఏమో... మాటల్లో వర్ణించలేని దశ్యాలను మనసు నిండా పొదుముకోగలిగాను. ఎప్పటికీ చెరగని జ్ఞాపకం అది. ఆ తర్వాతి రోజు కూడా ఉప్పు తయారీ పరిశ్రమలను షూట్ చేయటం కోసం బయలు దేరితే... మధ్యలో అల్లంత దూరంగా ఉప్పు పరుచుకుని కనిపించింది. ఇక ఆగుతామా... వెంటనే బళ్లు ఆపి ఎడారి వైపు అడుగులు వేశాం. ఉప్పు ఉన్న ప్రాంతానికి వెళ్ళటానికి చిక్కటి జారుడు బురదలో నుంచి నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. ఆ బురద ఎంత వేడిగా ఉందని. బురదమయమైన నేల కదా. అందుకే పైకి ఉప్పు తేటతేరి కనిపించినా నేల ఒక్కోచోట జారుగా ఉంది. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా కాలు జర్రున జారిపోతుంది. మళ్లీ ఈ అవకాశం రాదు కదా అని జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ నేను వెళుతుంటే ''మేడమ్...
ఆగే మత్ జావో... జల్జలే హౌంగే'' అని హెచ్చరిం చారు మాతో ఉన్న కమాండర్. ముందుకు పోయే కొద్దీ ఊబి వంటి ప్రాంతాలుంటా యట. అబ్బో... దీని వెనుక ఇంత ప్రమాదం పొంచి ఉందా అని ఆశ్చర్యపోయాను. ఈ నేలలో రసాయనాల గాఢత ఎక్కువగా ఉంటుంది. ఈ బురదలో కాని, ఇక్కడి ఉప్పులో కాని ఎక్కువసేపు ఉంటే చర్మంలో పగుళ్లు వస్తాయని చెప్పారు కమాండర్. అరేబియా సముద్రపు నీరు, ఈ బురద నేలల్లో ఇలా ఉప్పు రూపంలో మట్టిపై ఒక పొరలా ఏర్పడుతుంది. కొన్ని చోట్ల ఈ ఉప్పు పొర పలుచగాను, కొన్ని చోట్ల చాలా మందంగానూ ఉంటుంది. అలాగే శీతాకాలంలో ఉప్పు ఎక్కువగా పేరుకుంటుంది.
ఐనా మహల్...
ఇక భుజ్ పట్టణంలో కూడా చూడటానికి చాలా చారిత్రక ప్రాంతాలే ఉన్నాయి. గుజరాత్ రాష్ట్ర సరిహద్దులు దాటి రాజస్తాన్లోకి ప్రవేశించటానికి కంటే ముందు ఐనా మహల్ను చూడటానికి ఒక గంట సర్దుబాటు చేసుకున్నాను. ఐనా మహల్ అంటే అద్దాల మేడ లేదా అద్దాల అంతపురం అనవచ్చు. కచ్ రాజ్య పాలకుడు రావు లఖ్పత్జీ 1761 లో దీన్ని నిర్మించారు. ఇండో-యూరోపియన్ శైలిలో ఉంది. పేరును బట్టే మనకు ఈ భవంతి కాన్సెప్ట్ అర్ధం అయిపోతుంది. ఈ భవంతిలోకి అడుగు పెట్టగానే ఎటు చూసినా నేనే కనిపించాను. భలే అనిపించింది. అంతటా అద్దాలు, అద్దాల చుట్టూ కళాత్మక అలంకరణలు. ఇక అన్నింటి కంటే ఏనుగు దంతాన్ని సన్నగా తొలిచి ఆ తునకలను అద్దుతూ తయారు చేసిన ద్వారం ఐవరీ గేట్ మాత్రం చూసి తీరాల్సిందే. నాటి భుజ్ కళాకారుల పని తనానికి నిలువటద్దం ఇది. భుజ్ భుకంపంలో ఈ భవంతి బాగా దెబ్బ తిన్నది కాని... రాచవంశ వారసులు బాగానే పునరుద్ధరణ చేశారు. ఇప్పటికీ నాటి జ్ఞాపకాలను భవిష్యత్ తరాలకు అందించే పనిని ఈ ఐనా మహల్ సమర్ధవంతంగా చేసుకుంటూ పోతోంది. ఐనా మహల్ చూసిన తర్వాత సాయంత్రం ఆరు గంటల వేళ రాజస్థాన్ వైపు మా వాహనం పరుగులు పెట్టింది.
- రెహాన , 9010234023
Authorization