చిన్నతనంలో ఇసుకతో గూళ్ళు కట్టుకొని ఆడుకునేవాళ్లం. అది సరదా ఆట మాత్రమే కాదు.. అంతర్జాతీయ స్థాయి కళ కూడా. ఊహలకు ఆకాశమే హద్దుగా కనువిందు చేసే సైకత శిల్పాలను మలచే కళాకారుల ప్రతిభా ప్రదర్శనకు ప్రపంచవ్యాప్తంగా అనేక సాగర తీరాలు వేదికలు అవుతున్నాయి. మన దేశంలో అలాంటి సైకత వేడుక ఒడిశా ఇంటర్నేషనల్ శాండ్ ఆర్ట్ ఫెస్టివల్! ప్రతి సంవత్సరం నవంబర్, డిసెంబర్ నెలల మధ్య అంతర్జాతీయ సైకత కళా ఉత్సవానికి ఒడిశా రాష్ట్రం ఆతిథ్యం ఇస్తుంది. ఎంతో ప్రఖ్యాతి చెందిన ఈ ఉత్సవాల్లో మన దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా అనేక దేశాలకు చెందిన సైకత కళాకారులు పాల్గొంటారు. మెక్సికో, సింగపూర్, స్పెయిన్, ఫ్రాన్స్, నార్వే, జర్మనీ, అమెరికా, నెదర్లాండ్స్కు చెందిన విఖ్యాత కళాకారులు వీరిలో ఉంటారు. సాగరతీరంలో వారు సృష్టించే అపురూప మైన కళాకృతులను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలి వస్తారు. ఈ ఏడాది 30 మంది వరకూ భారతీయ, 10 మంది వరకూ విదేశీ కళాకారులు ఈ ఉత్సవాల్లో జరిగే పోటీల్లో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించబోతున్నారు.
ప్రజల్లో అవగాహన కలిగించి, ఆలోచన రేకెత్తించే పర్యావరణ పరిరక్షణ లాంటి థీమ్స్ను పోటీ దారులు శిల్పాలను రూపొందిస్తారు. అత్యుత్తమ కళా సృజన చేసినవారికి రూ. లక్ష నగదు బహుమతిని నిర్వాహకులు అందజేస్తారు. ఈ ఉత్సవాల సమయంలోనే కోణార్క్ డ్యాన్స్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది. భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ తదితర భారతీయ సంప్రదాయిక నత్య ప్రదర్శనలు, ఇతర అనేక సాంస్కతిక కార్యక్రమాలు దీనిలో ఉంటాయి. మొదట్లో కోణార్క్ నత్యోత్సవంలో భాగంగా శాండ్ ఆర్ట్ ఫెస్టివల్ ఉండేది. దీన్ని 2015 నుంచి ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు.
ఒడిశాలోని కోణార్క్కు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రభాగ బీచ్లో డిసెంబర్ నెలలో జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాల నుంచి ఒడిశాలోని భువనేశ్వర్, పూరి నగరాలకు నేరుగా రైలు సౌకర్యం ఉంది. పూరీకి సుమారు 36 కి.మీ., భువనేశ్వర్కు 62 కి.మీ. దూరంలో ఉన్న కోణార్క్కు రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. సమీప విమానాశ్రయం భువనేశ్వర్లో ఉంది. సందర్శించాలనే ఆసక్తి ఉన్న వారికోసం ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీలు అందిస్తోంది. ఆ సంస్థ వెబ్సైట్ నుంచి సమాచారం తెలుసుకోవచ్చు.
ఇంకా అక్కడ చూడదగిన ప్రదేశాలు.. కోణార్క్ సూర్య దేవాలయం, పూరీ జగన్నాథ స్వామి ఆలయం, సాగరతీరం, భువనేశ్వర్లోని లింగరాజ్ ఆలయం, నందన్ కానన్ జంతుప్రదర్శన శాల, కోణార్క్కు 65 కి.మీ. దూరంలో ఉన్న చిలుకా సరస్సు.
Authorization