అరణ్యం! నా దృష్టిలో ఒక గొప్ప తాత్విక పదం. కిక్కిరిసి పోవటం, చిక్కగ ఉండటం, సాంద్రవంతంగా ఉండటం, దట్టంగా ఉండటం, వైవిధ్యవంతంగా ఉండటం, నిశ్శబ్దంగా ఉండటం, మార్మికంగా ఉండటం, భిన్న జీవజాతులకు సహజావాసంగా ఉండటం, సృష్టి, స్థితి, లయలతో శ్రావ్యంగా ఉండటం, ఇంకా నేను చూడలేనన్ని రకాలుగా, వర్ణించలేని విధాలుగా ఉండటం ఒక్క అడవికే సాధ్యం. అందుకే అడవంటే నాకో ఆరాధన! పుట్టినప్పటి నుండి నగరాల్లోనే బతికిన వాడిని. కనీసం గ్రామీణ జీవితం కూడా పెద్దగా అనుభవంగా లేని వాడిని. కానీ చెట్టంటే ఇష్టం. ఎక్కడ పెద్ద చెట్టు కనబడ్డా ఒక హీరోని చూసినట్టు చూసేవాడిని. అటువంటిది వేలాది మహావృక్షాలు, లక్షలాది చెట్లు, కోట్లాది మొక్కలతో వాగులు, జలపాతాలు, నదులు వంటి ప్రాకృతిక జలాశయాలు. ఆది మానవుడి గుహలతో, అనంతానంత జీవ వైవిధ్యంతో మనిషి ఇప్పటికీ నాశనం చేయకుండా లేదా చేయలేక వదిలేసిన అరణ్యం ఈ సృష్టిలో నాకు అత్యంత సమ్మోహనం. అడవిని నేనేమీ అధ్యయనం చేయను. అడవి గురించి శాస్త్రీయంగా తెలియదు. నేనిష్టపడే వాటి గురించి పరిజ్ఞానం ఉండాలని అనుకోను. ఆ మాటకొస్తే నాకు ఇంట్లో మొక్కలెలా పెంచాలో కూడా సరిగ్గా తెలియదు. బహుశా చిన్నప్పుడే జిడ్డు కష్ణమూర్తి ప్రభావంలో పడటం కావొచ్చు. మరీ లోతైన జ్ఞానం అనుభూతిని కప్పేస్తుందనే అభిప్రాయంతో ఉండేవాడిని. మనుషుల పట్ల కూడా అలాగే ఉంటాను. ''అడవిని చూడాలంటే ఇదే సరైన సమయం. ఏదో కార్లేసుకొని రహదార్ల మీద చెట్లని చూస్తూ తిరగటం కాదు. కాలి నడకన మూలమూలకూ వెళ్ళి, ఎక్కడ పడుకుంటామో తెలియనంత అజ్ఞాత ప్రాంతాలకు వెళ్ళే సాహసం చేద్దాం. వస్తారా?'' అని అడిగారు శ్యాం సుందర్ గారు. మంచుకొండలతో సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ట్రెక్కింగ్ చేసిన అనుభవం ఉన్నవారు ఆయన. అడవితో సావాసమన్నా, అడవిలో సాహసమన్నా ఇష్టపడే వారు. అందుకే ఆయన తన గిరిజన మిత్రులతో కలిసి మారేడిమిల్లిలో మంచి కాటేజీ కూడా నిర్మించారు. వెంటనే సై అన్నాను. ఇది ఆయన నిర్వహిస్తున్న మొదటి ట్రెక్కింగ్. ఈ ట్రిప్ లోనే ''బైసికిల్ బర్డ్స్'' జయతి, లోహితాక్షన్ దంపతులు కూడా జాయిన్ అవుతున్నట్టు చెప్పారు.
మారేడిమిల్లి - రంపచోడవరం మెయిన్ రోడ్డు మీదనే రెండెకరాల విస్తీర్ణంలో కొండ మొదట్లో చెట్ల మధ్య శ్యాం గారు నిర్మించిన ఆ వెదురు కుటీరం కళాత్మకంగా, కవితాత్మకంగా ఉంది. నిజానికి ఇది ఆయన ప్రణాళికకు అనుగుణంగా పూర్తి కాలేదు. కర్రల మీద నుండి పైకెక్కితే ఒక హాలు, రెండు బెడ్రూములతో ప్రస్తుతానికి ఒక పదిమంది ఉండే విధంగా తయారు చేశారు. కొండకు ఏటవాలుగా కట్టినందువల్ల రూముల్లో జారుతున్న ఫీలింగ్ కలిగింది. అంతా వెదురు సామాగ్రి. కింద ప్రత్యేకంగా కట్టిన వాష్ రూమ్ లో తప్ప ఎక్కడా మరో ఇనుము, ప్లాస్టిక్ వినియోగం లేదు. అత్యంత సహజ సిద్ధ వాతావరణంలో ఆ వెదురు కుటీరం కొండకు కాపలా కాస్తున్న సైనికుడిలా దర్జాగా ఉంది. శ్యాం గారి అభిరుచికి ఫిదా అవ్వకుండా ఉండలేం. ఆ ఆవరణలోని పచ్చని చెట్ల మధ్య ఒక ఎండిపోయిన చెట్టు కూడా ఉంది. మిగతా పచ్చని చెట్లన్నీ కలిసి ఆ చెట్టుకి రక్షణనిస్తూన్నట్టుగా.
భోజనం అనంతరం ఒక ఆటోలో రంపచోడవరం బయలు దేరాం. మధ్యదారిలో గోదావరి బేసిన్లోని భూపతిపాలెం మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ డ్యాం చూశాం. చాలా అందంగా ఉంది. దీన్నే సీతపల్లివాగు అంటారు. నిండైన నీటి మధ్యలో ఎండిన చెట్లు ఓ వైవిధ్య సుందర దశ్యం. రంపచోడవరం నుండి కొండ మీదకు మా ట్రెక్కింగ్ మొదలైంది. మా గైడ్గా వచ్చిన బాపిరాజు అనే 17 ఏండ్ల కొండకాపులకి చెందిన అడవి బిడ్డ మేం ఎంత దూరం పైకి ఎక్కినా కూడా ''ఇంకెంతండీ! ఒక కిలోమీటరే, అర కిలోమీటరే'' అంటూండే వాడు. ఒకసారైతే ''ఇంకో అర కిలోమీటరే'' అన్న తరువాత కూడా కొద్దిసేపాగి అడిగితే ''ఇంకెంతండీ ఇంకో కిలోమీటరే'' అనేవాడు. బహుశా ఈ ఆదివాసులకు దూరం అనేది అసలు సమస్య కాదేమో అనిపించింది. దూరాలు, భారాలు మనలాగా మోటారు బళ్ళకి అలవాటు పడ్డ వాళ్ళకే కానీ తమ జీవనంలో రాయీ రప్పా, డొండా వంక, చెట్టూ చేమల్ని భాగం చేసుకున్న గిరిపుత్రులకు కాదేమో! కొన్నిసార్లు కొండ ఎక్కటం కష్టంగా అనిపించింది. ''మీరు ఫిట్గా ఉంటేనే ఈ ట్రెక్కింగ్ పెట్టుకోండి'' అని శ్యాం గారు ఎందుకన్నారో అర్ధమైంది. మాతో లైట్ వెయిట్ మొబైల్ టెంట్స్, నూనె, పప్పు, ఉప్పు, బియ్యంతో కూడిన వంట పదార్థాలు, టెట్రా పాలపాకెట్లు ఉన్నాయి. అంత బరువును బాపిరాజు సులువుగా మోసేస్తున్నాడు.
దారిలో ప్రకృతి అనూహ్యమైన మలుపులు తిరుగుతున్నది. కాలుష్యానికి దూరంగా నీరు, గాలి, చెట్టూ, రాయి... అన్నీ ఒక్కో చోట ఒక్కో రకంగా ఓ గొప్ప సౌందర్యంతో తళుక్కుమన్నాయి. అడవిలోని నిశ్శబ్దంలో కూడా ఒక అద్భుతమైన శ్రావ్యత ఉంది. అలసటగా అనిపిస్తున్నప్పటికీ ఓ తాదాత్మ్యంతో ముందుకెళుతున్నాం. ఒక్కోసారి మనిషంత ఎత్తు రాళ్ళని ఒకరికొకరం చేతులు పట్టుకొని పైకెక్కాం. సగం దూరం వరకు కొండ పైనుండి పారుతున్న జలధార సవ్వడి వింటూ దాని పక్కనే ట్రెక్కింగ్ సాగించాం. కొండల పైనుండి ఓ అజ్ఞాత ప్రాంతం నుండి ఉబికి వస్తూ జరజరా పాకుతూ కిందకి జారిపోతున్న ఈ జలధార పక్కనుండే మేం కొండ పైకి ఎక్కాం. నీరు కిందకు జారుతుంటే మేం కొండ పైకి ప్రవహించాం. అంత చలిలోనూ మాకు చెమట్లు పట్టాయి. మధ్యలో కొంత మైదానంగా ఉన్న చోట వరి, పసుపు పంటలు కనిపించాయి. అదో మనోహర దృశ్యం. మధ్యలో చింత చెట్ల మీదకి రాళ్ళేస్తూ చుట్టూ కొండలు, పచ్చటి పొలాలు, సన్నటి కాలిబాటలు, పొలం గట్ల మీద నడుస్తూ, మళ్ళీ కొండెక్కుతూ అలా ఏకధాటిగా సుమారు మూడు గంటల తరువాత ''పెదకొండ'' అనే కొండరెడ్ల గ్రామానికి చేరుకున్నాం.
చుట్టురా ఆకుపచ్చని కొండల మధ్య ఓ ఇరవై ఎనిమిదిళ్ళతో గువ్వలా ఒదిగున్న గిరిజన గ్రామం పెదకొండ. ప్రతి ఇంటికీ వెదురు కర్రలతో ఒక దడి ఉంది. ఆ దడి అలా ఒక ఇంటి నుండి మరో ఇంటికీ కొనసాగి అదో గేటెడ్ కమ్యూనిటీలా ఉంది. ఒక్కో వైపు ఒక్కో ఓపెనింగ్ ఉంది. ఆ గ్రామంలోకి అడుగు పెడుతుండగానే మొదట్లోనే ఒక మేకల దొడ్డి. గ్రామంలోకి ప్రవేశించాక మా మీద గ్రామస్థులు ఏదో ఒక చూపు అలా విసిరి వెళ్ళిపోవటం, తమ పనులు తాము చేసుకుపోవటమో తప్ప మమ్మల్ని ఎగాదిగా చూడటం కానీ, ఏవో ప్రశ్నలు వేయటం కానీ చేయలేదు. నాగరీక సమాజం నుండి భౌతికంగా అంతెత్తు కొండల మధ్య జీవిస్తున్న వారి ప్రవర్తనకు ముచ్చటేసింది. దాదాపు ప్రతి ఇంటికి తాటాకుల సదుపాయాన్ని వాడుకున్నారు. భూమిలో నిలువుగా పాతిన కర్రలే వాళ్ళకి గిన్నెల స్టాండు. సహజ సిద్ధమైన పెద్ద పెద్ద బండలతో, రుబ్బురోళ్ళు, చట్నీలు నూరుకునే రాయి... అక్కడ సెల్ ఫోన్ సిగల్ రాదు. కానీ డిటీహెచ్ యాంటెన్నాలు మాత్రం ఇళ్ళ పైన కనిపించాయి. కొండ కిందకు కచ్చా రోడ్డు కూడా వుంది. దాని మీదుగా మోటార్ సైకిళ్ళు కూడా ఈ గ్రామంలోకి వస్తున్నాయి. ఈ గిరిపుత్రులు నాగరీక సమాజానికి దూరంగా వున్నారే కానీ నాగరికతకు కాదు. ఈ చిన్న గ్రామంలో కూడా రక్షిత మంచినీటి స్టోరేజి ట్యాంకుంది. అటవీ ఉత్పత్తుల మీద, వ్యవసాయం మీద ఆధారపడతారు వీళ్ళు పశుపోషణ కూడా చేస్తారు. ఆవులున్నాయి. కానీ పాలు తీయరు. ఎందుకు తీయరంటే పాలు దూడ కోసం వదిలేస్తారు. మరి ఆవులెందుకు పెంచటమంటే వ్యవసాయానికి ఉపయోగించే ఎద్దులకు జత కోసం. అలాగని వాళ్ళేం ఆవుల పట్ల భక్తి భావంతో ఉంటారని అనుకోవద్దు. బీఫ్ వారి ప్రధాన మాంసాహారం. వేటకి వెళుతుంటారు. చిన్న చిన్న జంతువులని కొట్టుకొస్తుంటారు. జీలుగు కల్లు బాగా తాగుతారు.
పెదకొండ గూడేనికి వీడుకోలు పలికి, ఆదివాసీలకు ధన్యవాదాలు తెలిపి రంపచోడవరం బైల్దేరాం. దారిలో కనబడ్డ చిన్న జలపాతాలు, పెద్ద పెద్ద రాళ్ళు, తోటలు, గోశాల చూస్తూ, చేతికందిన కాయలు తెంపుకుంటూ రంప చేరాం. అక్కడ రాజస్థానీ మిఠాయి దుకాణంలో సమోసాలు తిని, గుంటూరు నాయుడు బడ్డీ హోటల్లో టీ తాగి మారేడిమిల్లి చేరుకున్నాం. అక్కడ అమర్నాధ రెడ్డి తయారు చేసిన ''బొంగులో చికెను'', ఇతర పదార్థాలు తిని ''టైగ్రిస్'' జలపాతం దగ్గరకు బయలు దేరాం. మధ్య మధ్యలో అనేక చోట్ల ఆగి వ్యూ పాయింట్స్ చూసుకుంటూ వచ్చాం. చింతూరు, మోతుగూడెం మీదుగా పుల్లూరు చేరుకున్నాం. పుల్లూరు పక్కన ఎత్తయిన కొండ దారిలో కొంచెం కిందకి దిగితే జలపాతం ఉంది. ముందుగానే ఎక్కడ దిగాలో స్పాట్ సెలెక్ట్ చేశాం. జలపాతానికి కొంత పైన వాగు పక్కన చూసుకున్నాం. రెండు కొండల మధ్య లోయలో నిండుగా పారుతున్న వాగు మరో నీటి చెలమ నడుమ గులకరాళ్ళ సంపద పక్కన కాస్తంత మట్టి నేల చూసుకున్నాం. పూర్తిగా కిందకు దిగాల్సిన అవసరం లేకుండానే ఎంచుకున్నాం. ఎండిన కొమ్మలు, దుంగలు బోలెడున్నాయి. క్యాంప్ ఫైర్ వేసుకోగానే ఆ ప్రాంతం మీద మాకేదో పురాతన పరిచయం వున్నట్లు అనిపించింది.
తెల్లవారగానే జలపాత స్పర్శ మరో మహత్తర అనుభవం. అక్కడివరకు ఒక వాగుగా మంద్రంగా ప్రవహించిన నీరు ఒక్క సారిగా లోతైన పల్లం రాగానే ఒక జలపాతంగా మారటం ఓ విస్మయకర సౌందర్య ప్రవాహం. పరీక్షించి చూడాలే కానీ ప్రకృతి నీరు ఓ బాహుబలి. దూకే అవకాశం దొరకాలే కానీ జలం తన బలం ఎంతటిదో చూపగలదు. జలపాత పరిష్వంగం నుండి బైటపడి రోడ్డు మీదకి వచ్చాం. వేటకి వెళుతున్న గిరిజనుల దగ్గర బాణం విల్లంబులు తీసుకొని వేణు కాసేపు వేటగాడిలా ఫోజిచ్చి తన వేట మోజు తీర్చుకున్నాడు. ఈ లోపు శ్యాంగారు మోతుగూడెం వెళ్ళి ఎలాగో ఓ ఆటో తీసుకొచ్చి మమ్మల్ని బైలుదేర తీశారు. మళ్ళీ మోతుకూరు వచ్చి బస్సెక్కి భద్రాచలం చేరాం.
ముందే చెప్పినట్లు శ్యాంగారు గొప్ప ప్రకృతి ప్రేమికుడే కాదు, నలుగురికీ ఆ ప్రేమని పంచాలన్న ఆరాటమున్నవాడు. ఆయన ఇలాంటి కార్యక్రమాల్ని నిర్వహించగల సమర్ధుడని భావిస్తున్నాను. జయతి, లోహితాక్షన్ ఇద్దరూ విలువైన వ్యక్తులు. అల్పమైన భౌతిక విషయాల్ని వదిలేసిన వాళ్ళు. వాళ్ళిద్దరూ విస్తృ తంగా అడవి ప్రాంతం గుండా సైకిళ్ళ మీద ప్రయాణించిన వాళ్ళు. అందుకే వాళ్ళిద్దరికీ ''బైసికిల్ బర్డ్స్'' అనే బిరుదును ప్రదానం చేశాను. ఒక స్థిరమైన నివాసం లేక పోవటంలోని సంతోషమేమిటో వాళ్ళని చూస్తే అర్ధమవుతుంది. మూడో రోజు రాత్రి తిరిగి భద్రాచలం రోడ్ (కొత్తగూడెం)లో రైలెక్కి మరుసటి రోజు తెల్లవారుజాము హైదరాబాదు చేరుకొని, మళ్ళీ ఏమెరగనట్లు తొమ్మిది ముప్పావుకల్లా ఆఫీసు అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేయటం ద్వారా తప్పిపోయిన గొర్రెపిల్ల తిరిగి మందలో చేరినట్లు పాత జీవితాన్ని పునరుద్ధరించుకున్నాను.
- అరణ్య కృష్ణ
Authorization