రెండు రోజులు సెలవులు వస్తే చాలు మధ్యతరగతి మనుషులు కొద్ది పాటి మార్పుకోసం విహార
యాత్రలు చేయాలనుకుంటారు. అయితే 'వెళ్లాలి' అనుకోగానే.. ఎక్కడికి? ఎలా? వెళ్లాలి అనే అన్వేషణ మొదలవుతుంది. విదేశాలకు వెళ్లాలి అంటే ఖర్చు భారం ఎక్కువ. మన దేశంలోనే ఇంటిల్లిపాది కలిసి విహరిస్తే.. ఆ ఆనందమే వేరు. అలా ఆనందంగా వెళ్లిరావడానికి మన దేశంలో అనేక ప్రదేశాలున్నాయి. వాటిలో కొన్ని... జనవరి 25 జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా...
దేశానికి విదేశీ మారక ద్రవ్యాన్ని అందిస్తున్న మూడో పెద్ద రంగం టూరిజం కిందటి ఏడాది మన దేశాన్ని సందర్శించిన విదేశీ పర్యాటకుల సంఖ్య సుమారు కోటీ ఇరవై వేలు ఈ ఏడాది జనవరి నుంచి జులై మధ్య భారత్ను సందర్శించిన విదేశీయులు 59.07 లక్షలు (ట్రావెల్ అండ్ టూరిజం కాంపిటేటివ్నెస్ రిపోర్ట్- 2017 ప్రకారం) టూరిజం రంగంలో 136 దేశాల్లో భారత్ ఓవరాల్ ర్యాంక్ 40.
న్యూఢిల్లీ : దేశ రాజధాని న్యూడిల్లీకి చారిత్రక కీర్తి ఉంది. మొఘల్ చక్రవర్తుల పరిపాలనలో ఎన్నో అపురూప కట్టడాలు పురుడుపోసుకున్నాయి. గత ఏడాది సుమారు 60 లక్షల మంది న్యూఢిల్లీని సందర్శించారని గణాంకాలు దేశ పర్యాటకం ఆదాయం రూ. 100 కోట్లకు చేరుకుందని గణాంకాలు చెబుతున్నాయి.
ముఖ్యంగా చూడాల్సినవి: పార్లమెంట్ భవనం, కుతుబ్మినార్, ఎర్రకోట, హుమయూన్ సమాధి, అక్షరధామ్ ఆలయం, ఇండియా గేట్.
ముంబయి : ఆర్థిక రాజధానిగా ముంబయి నగరం దేశంలోనే ప్రసిద్ధి. అంతేకాదు భారతీయ సినీ రాజధాని కూడా. ఎప్పుడూ బిజీబిజీగా హడావుడిగా ఉండే ముంబయి... పర్యాటకులకు ఫేవరెట్ డెస్టినేషన్. ఢిల్లీకి సమానంగా విదేశీ పర్యాటకుల తాకిడి ఈ నగరానికి ఉంది.
ముఖ్యంగా చూడాల్సినవి: గేట్ వే ఆఫ్ ఇండియా, ఎలిఫెంటా గుహలు, కొలాబా కాజ్ వే మార్కెట్, జుహు బీచ్, విక్టోరియా టెర్మినస్.
చెన్నై : ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తున్న నగరాల్లో చెన్నై ఒకటి. గత ఏడాది తమిళనాడును 48 లక్షల మంది పర్యాటకులు సందర్శిచారు. వీరిలో ఎక్కువ శాతం పర్యాటకులను ఆకట్టుకున్న నగరం చెన్నై. అంతేకాదు మహిళలకు అత్యంత భద్రమైన నగరంగా చెన్నై ప్రసిద్ధి చెందింది.
ముఖ్యంగా చూడాల్సినవి: మెరీనా బీచ్, బిర్లా ప్లానిటోరియం, సెయింట్ జార్జి ఫోర్ట్, చెన్నై రైల్ మ్యూజియం
ఆగ్రా : తాజ్మహల్ అంటే ప్రేమకు చిహ్నంగా ప్రసిద్ధి. ప్రపంచంలోనే ఏడు వింతల్లో ఒకటి. ఎన్నో ఏళ్ల నుంచి దేశీయ పర్యాటకులనే కాదు, విదేశీయునూ ఆకర్షిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే తాజ్మహల్ మాత్రమే కాదు ఆగ్రాలో చూడదగ్గ ప్రదేశాలు మరి కొన్ని ఉన్నాయి. గతేడాది 16 లక్షల మంది సందర్శించారు.
ముఖ్యంగా చూడాల్సినవి: ఫతేపుర్ సిక్రి, అక్బర్ సమాధి, రామ్ బాగ్, బులాంద్ దర్వాజా, మంగళేశ్వర్ ఆలయం.
జైపూర్ : రాజస్థాన్ అంటే కళ్ల ముందు ఎడారి మాత్రమే కాదు అద్భుతమైన చారిత్రక వారసత్వపు జాడలు మెదులుతాయి. ఈ రాష్ట్రంలో జైపూర్ నగరం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా 'అంబర్ ఫోర్ట్' ను గత ఏడాది దాదాపు 20 లక్షల మంది సందర్శించారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ముఖ్యంగా చూడాల్సినవి: సిటీ ప్యాలెస్, జంతర్మంతర్, హవామహల్, జల్మహల్, లక్ష్మీ నారాయణ్ ఆలయం (బిర్లా టెంపుల్).
వేడుక ఇలా మొదలైంది!
పర్యాటకరంగం ప్రాముఖ్యతపై ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు... సామాజిక , రాజకీయ ఆర్థిక, సాంస్కతిక, రాజకీయ విలువలను పర్యాటక రంగం ద్వారా ప్రభావితం చేయటం లక్ష్యంగా ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ప్రపంచ పర్యాటక సంస్థ ఏర్పడింది. ఈ సంస్థ రూపొందించిన చట్టాలు, మార్గదర్శకాలు 1970 సెప్టెంబర్ 27న అమల్లోకి వచ్చాయి. ప్రపంచ పర్యాటక రంగానికి సంబంధించి దీన్నొక పెద్ద ముందడుగుగా భావిస్తారు. ఆ తరువాత 1980 నుంచి ప్రతి సంవత్సరం అదే రోజున (సెప్టెంబర్ 27) ప్రపంచ పర్యాటక దినోత్సవంగా జరుపుకొంటున్నారు. ఐక్యరాజ్యసమితి విభాగమైన డబ్ల్యూటీవో (ప్రపంచ పర్యాటక సంస్థ) దీన్ని ప్రారంభించింది. ఏటా ప్రపంచ పర్యాటక దినోత్సవానికి ఒక థీమ్ను ఎన్నుకొని ప్రజల్లో పర్యాటక రంగంపై అవగాహన కల్పిస్తారు. ప్రతి సంవత్సరం ఈ థీమ్ మారుతుంది. అలాగే జాతీయ పర్యాటక దినోత్సవాన్ని ప్రతి ఏడాది భారత ప్రభుత్వం జనవరి 25 జరుపుకోవడం జరుగుతుంది. ఈ వేడుకల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకసంస్థలు, ప్రభుత్వ సంస్థలు పాల్గొంటాయి. పర్యాటకరంగాన్ని ప్రోత్సహించేందుకు ఫొటో కాంపిటీషన్స్ నిర్వహిస్తారు. పర్యాటక రంగం అభివృద్ధికి పాటుపడిన వ్యక్తులు, సంస్థలకు పురస్కారాలు అందజేస్తారు.
Authorization