కుటుంబం నుండి, సంపాదన నుండి కొంతకాలం దూరమై యాత్రలు చేసేవాళ్ళున్నారు. యాత్రల కోసమే ఒంటరి జీవితాన్ని ఎన్నుకున్న యాత్రికులు కూడా ఉన్నారు. ఎలాంటి బంధనాల్లో ఇరుక్కోక హాయిగా దేశాలు తిరిగే మహిళా యాత్రికులు కూడా కొంతమంది కనిపిస్తారు. వీరందరికంటే భిన్నంగా, జంటగా అనగా భార్యాభర్తలు కలిసి దేశాలు చుట్టేయడం చాలా అరుదుగా కనిపిస్తుంది. అలాంటి అరుదైన వాళ్ళే నర్మదారెడ్డి, ఇంద్రారెడ్డి దంపతులు. వారి యాత్రా విశేషాలన్నింటిని అత్యంత ఆసక్తికరంగా తెలియజేయడం నర్మదారెడ్డికే చెల్లింది. నిజానికి వారు ప్రపంచమంతా చుట్టి వచ్చారనే చెప్పాలి. అన్ని ఖండాలలోని ఎంపిక చేసుకున్న దేశాలను సందర్శించడం, అక్కడి వింతలు, విశేషాలను తమ ప్రయాణానుభవాలతో కలిసి చెప్పడం వారి ప్రత్యేకం.
తర్వాత వైవిధ్యం కోసమని ప్రపంచ ప్రఖ్యాత అన్వేషకులు-యాత్రికులు చేసిన సాహసయాత్రల స్ఫూర్తితో, తీరిక పరిస్థితులలో వారు పయనించిన మార్గాన్ని తమ సందర్శనకు ఎన్నుకున్నారు.అందులో భాగంగా మార్కొపోలో ప్రయాణించిన సిల్క్ రూట్ గుండా మంగోలియా, చైనా తదితర దేశాలన్నీ వారు ఇప్పటికే తిరిగి వచ్చారు. అందుకని ఈ సారి ఇండియాను కనుగొంటానని బయలుదేరి ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాల మధ్య ఉన్న దీవుల్ని లాటిన్ అమెరిక మార్గాన్ని కనుగొన్న కొలంబస్ ప్రయాణించిన మార్గం గుండా ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు.
క్రిస్టోఫర్ కొలంబస్ (1451-1506) స్పెయిన్ దేశాల నుండి దాదాపు ఏడు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న కరేబియన్ సముద్రంలోని దీవులకు ప్రయాణం చేశాడు. ఉత్తర అట్లాంటిక్ సముద్రం మధ్య జరిగిన అతని నాలుగు ప్రయాణాల వలన ప్రపంచ వాణిజ్యం-యుద్ధ, దౌత్య రంగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాలకి మధ్యలో ఉన్న అనేక వందల దీవుల సముదాయంలో కరేబియన్ దీవులు, బహామా దీవులు ఉన్నాయి. వాటిల్లో కొలంబస్ ప్రయాణించిన కొన్ని దీవులను చూడటానికి రెడ్డి దంపతులు బయలు దేరారు. ఈ యాత్రా చరిత్రను మూడు భాగాలుగా విభజించుకొని ''కొలంబస్ సాహస యాత్ర'' అనే మొదటి అధ్యాయంతో ఈ పుస్తకాన్ని ప్రారంభించారు. టర్కీలో బైజాంటిన్ సామ్రాజ్యం కూలిపోయి, టర్కులు... అధికారంలోకి వస్తారు. వారి పేరుతో వర్తకాలను సిల్క్రూట్లోకి అడుగు పెట్టనివ్వకపోవడంతో ఇండియా, చైనాలను చేరుకునే ఏకైక మార్గం మూసుకుపోతుంది. దాంతో ఆ దేశాలను చేరుకోవడానికి కొత్త మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఐరోపా దేశాలకు ఏర్పడుతుంది. భూమి గుండ్రంగా ఉందని నమ్మిన కొలంబస్ దక్షిణంగా ప్రయాణించి ఆఫ్రికాను చుట్టి ఇండియా చేరుకోవాలని తలపోస్తాడు. తన ప్రయాణపు ఆర్థిక సహాయం కోసం ఎందరో రాజుల చుట్టూ తిరిగి విసిగిపోయిన కొలంబస్కు, స్పెయిన్ రాణి ఇసబెల్లా మద్దతు దొరుకుతుంది. సముద్ర మార్గాన కొలంబస్ అమెరికాను కనుగొన్నాడని మనం చదివి ఉన్నాం. కాని ఆ అంతులేని మహా సముద్రంలో, దారి తెలియని మార్గంలో కొలంబస్ ఎలా పయనించాడు. ఎక్కడెక్కడ తిరిగాడు? ఎక్కడ విడిది చేశాడు? ఎంతమందిని తనతో పాటు తీసుకెళ్ళాడు? అసలు అతని లక్ష్యాలేమిటి? వాటిని ఎలా చేరుకున్నాడు అనే విషయాలతో పాటు అతడు చేసిన నాలుగు యాత్రల గురించి మొదటి అధ్యాయంలో వివరించారు.
''కొలంబస్ అడుగుజాడల్లో'' అనే రెండవ అధ్యాయంలో కానరీ ఐలాండ్స్, క్యూబా, పొర్టోరికో, సెయింట్ థామస్, యాంటిగ్వా, సెయింట్ లూసియా, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, సెయింట్ మార్టిన్, కొలంబియా, ఎల్సాల్విడార్, పనామా, నికరగువా మొదలైన దీవులు, దేశాలన్నీ తిరిగి అక్కడివారి చరిత్ర-సంస్కృతిని, వింతలు-విశేషాలను తమ ప్రయాణ అనుభవాల నుండి వివరించారు. ఇక మూడవ భాగంలో ఈ యాత్రకు సంబంధించిన పర్యటన చిత్రాలు, పత్రికలతో ప్రచురితమైన యాత్రా కథనాల కటింగ్స్ను, వారు తిరిగిన దేశాల జాబితాను అనుబంధంగా ఇచ్చారు. ప్రతి సందర్శనకు సంబంధించిన ఫొటోలను వాటి వెంటనే ఇవ్వడం బాగుంది. ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందిన ఈ యాత్రా కథనాలను చదువుతుంటే మనం కూడా రెడ్డి దంపతుల వెంట తిరుగుతున్న అనుభూతికి లోనవుతాం.
కొలంబస్ అడుగుజాడల్లో... రచన : నర్మదారెడ్డి.
వెల : 120 రూ. పే :168, ప్రతులకు : ప్రధాన పుస్తక కేంద్రాలు.
- కె.పి. అశోక్ కుమార్
9700000948
Authorization