వెన్నెలను వర్ణించగలమా.. పోని సూర్యోదయాన్ని... ఎంత వర్ణించినా తక్కువే... ఇంకా ఏదో మిస్ అయినట్టే ఉంటుంది కదూ..? అచ్చం వెనిస్ నగర సౌందర్యం కూడా ఇలాగే అనిపిస్తుంది. ఎన్ని సార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. అందుకే ఈ నగరాన్ని చూడటానికి రెండు సార్లు వెళ్ళాం. నీటిలో తేలియాడే భవన నిర్మాణాలు, నగరమంతా పరుచుకున్న ఊయల్లాంటి వంతెనలు. సందర్శకులను చేరవేసే పడవలు. ఆ పడవల్లోనే సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు. వీటిని తలదన్నే అక్కడి జీవన సౌందర్యం. అన్నింటినీ ఒక్కసారి హృదినిండా నింపుకుంటే చాలు, సప్త స్వరాలతో మది కోటిరాగాలు పలికినట్టు అనిపిస్తుంది. అంతటి అద్భుతమైనది మా ఇటలీ ప్రయాణం.
హైదరాబాద్ నుండి ఇటలీకి సుదూర ప్రయాణమనే చెప్పాలి. విమాన ప్రయాణం 13 నుంచి 16 గంటల సమయం పడుతుంది. ఇటలీకి బెంగళూరు, ఢిల్లీ, ముంబయి, కోల్కతా, హైదరాబాద్, చెన్నై తదితర ప్రాంతాల నుంచి విమాన సౌకర్యం ఉంది. కాస్త ఇబ్బందీ అయిన ఇటలీ సందర్శన ప్రతి ఒక్కరికీ జీవితంలో మర్చిపోలేని అనుభూతిగా గుర్తుండిపోతుందని మాత్రం చెప్పవచ్చు.
ఎందరికో కలల రాజ్యం
ప్రపంచంలో అత్యంత సుందరమైన నగరాలలో ఒకటగా పేరొందిన ఈ వెనిస్ ఒకప్పుడు సిల్కు, ధాన్యం, సుసుగంధ ద్రవ్యాలు వర్తకానికి కేంద్రంగా ఉండేదట. అలాగే 13వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం చివరి వరకు ఇది కళలకు కేంద్రంగా వర్ధిల్లిందని ఆ దేశ చరిత్ర చెబుతోంది. ఇటలీలోని వెన్నిటో ప్రాంతానికి రాజధానైన ఈ నగరం ఎందరికో కలల రాజ్యం. ఇది మొదట్లో ఉప్పు తయారీ కేంద్రంగా, తర్వాతి రోజుల్లో పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి పొందింది. పద్నాలుగో శతాబ్దంలో అక్కడ రెండు లక్షల మంది నివాసం ఉండేవారట కానీ రోజు రోజుకు జనాభా తగ్గుకుంటూ వస్తుంది. ఇలాగే తగ్గుకుంటూ పోతే 2100 నాటికి దీని ఉనికే ప్రశ్నార్థకం అవుతుందంటున్నారు పర్యావరణ వేత్తలు. దీనికి కారణం తరచుగా వచ్చే వరదలు.
వంతెనల నగరం...
వెనిస్లో ఎక్కడికి వెళ్ళాలన్నా మన దగ్గరిలా బస్సులు, టాక్సీల్లో ప్రయాణాలు ఉండవు. అక్కడి రవాణా పడవలపై ఆధారపడి ఉంది. ఇక్కడి పబ్లిక్ రవాణాకు నీటి ఆధారిత బస్సులు, ప్రైవేటు వాటర్ టాక్సీలు నిత్యం అందుబాటులో ఉంటాయి. మేం దిగిన మరుసటి రోజు వెనిస్ నగరం అంతా చూస్తు తిరిగాము. మొదటిసారి వెనిస్కు వెళ్లినప్పుడితో పొల్చుకుంటే చాలా మారిపోయిందని. అయితే వెనిస్ గురించి చెప్పుకుంటునప్పుడు ఇక్కడి వంతెనల గురించి తప్పకుండా గుర్తుకు తెచ్చుకోవాలి. ఈ ఒక్క వెనిస్ నగరంలోనే దాదాపు 417 వంతెనలు ఉన్నాయట అందుకేనేమో ఈ నగరానికి వంతెల నగరం అని పేరు కూడా వచ్చింది. అతి పురాతన వంతెన పేరు ''రియాల్టో'' . ఇది గ్రాండ్ కెనాల్పై ఉన్న నాలుగు వంతెనలలో ఒకటి. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ వంతెన నేటికీ చెక్కుచెదరకుండా వినియోగంలో ఉందంటే కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది. ఆ వంతెనల మీద వేల మంది టూరిస్టులు ఫొటోలు దిగుతూ కనిపించారు. మేము కూడా కొన్ని ఫోటోలు దిగాం. అక్కడ చాలా షాపులు కనిపిస్తే వాటి చుట్టూ తిరిగాము.
అందమైన గాజు బొమ్మలు
మరుసటి రోజు 'మురానో' చూడటానికి బయలుదేరాం. ఈ మురానో గాజు పరిశ్రమకు ప్రసిద్ధి. ఇటలీ చర్చీలలో ఉండే రకరకాల గ్లాసు అద్దాలు, బొమ్మలు, దీపాలు ఇక్కడ తయారైనవేనట. గాజుతో జంతువులు, పుష్పాలు, కప్పులు, దీపాలను ఎలా తయారుచేస్తారో ప్రదర్శనలు ఇచ్చి మరీ చూపిస్తుంటారు ఇక్కడ.
రోమ్లో...
మర్నాడు రోమ్ను చూడటానికి వెళ్లాం. ఎన్నో సార్లు రోమ్ గురించి, అక్కడి చక్రవర్తుల గురించి కథలుగా వినడమే కానీ అది ఎలా ఉంటుందో చూడలేదు కాబట్టి అక్కడికి వెళుతున్నామంటే ఒకరకమైన ఆసక్తి కలిగింది. పైగా ఎన్నో సినిమాల్లో క్రమశిక్షణాయుతమైన రోమన్ సైన్యం గురించి, అక్కడి చక్రవర్తుల క్రూరత్వం గురించి చూసి ఉన్నాం కాబట్టి మరికాస్త ఆసక్తి పెరిగింది. రోమ్లో ప్రత్యేకంగా చెప్పుకో దగ్గది అక్కడి 'కలోసియం'. ఇది క్రీస్తు శకం 70వ శతాబ్దంలో కట్టిన పెద్ద స్టేడియం. అది ఎంతో పెద్ద కట్టడం అయినప్పటికీ దాన్ని ఇటుకలతోనే నిర్మించారు అంటే నమ్మశక్యం కాలేదు. కొన్ని చోట్ల నాలుగు/ఐదు అంతస్తులు కూడా వుంటుంది. ఇప్పుడది శిధిలమైన గోడల్లాగ కనిపిస్తున్నప్పటికీ దాన్ని నిర్మించిన పద్దతి మాత్రం అద్భుతంగా ఉంది. అక్కడే గ్లాడియేటర్ పోట్లాటలు, జంతువులతో మనుష్యుల చెలగాటలూ జరిగేవి. ఇక్కడ పొట్లాటలు ఎలా జరిగేేవో స్పార్టకస్, గ్లాడియేటర్ అనే సినిమాల్లో కండ్లకు కట్టినట్లు చిత్రీకరించారు. ఆ కుస్తిపోటీలు జరుగుతూ ఉంటే రాజులూ, రాణులూ చూసి ఆనందిస్తూ వుండే వారట. ఒకరకంగా ఇది పిల్లికి చెలగాటం, ఎలుకకి ప్రాణసంకటం అన్న మాట. ఒకవేళ ఆ పోటీలో వాళ్లు విజయం సాధిస్తే వారికి స్వేచ్ఛను ప్రసాదించి విడిచిపెట్టేవాళ్లట. మేము అక్కడ కాసేపు ఉండి ఫొటోలు దిగి అక్కడి నుండి వెనుదిరిగాం.
క్యాథలిక్ల పుణ్యక్షేత్రం....
మర్నాడు వాటికన్కి వెళ్ళాం. వాటికన్ అనేది ప్రపంచంలోనే అతి చిన్న దేశం. ఒక రకంగా ఇది దేశంలోని దేశం అనుకోవచ్చు. ఇటలీ దేశంలోని ఒక స్వతంత్ర దేశం. రోమ్ అనే నగరంలో వున్న ఒక చిన్న దేశం. 1929లో ఇటలీ నుండి విడిపోయి స్వతంత్ర దేశమయింది. క్రిస్టియన్ మతంలో పెద్ద శాఖ అయిన కాథలిక్లకు కేంద్రంగా ఉంది. కేవలం 109 ఎకరాల్లో, వెయ్యి లోపు మాత్రమే ఇక్కడ జనాభా ఉంటుందట. కానీ ప్రతి రోజూ ప్రపంచం నలుమూలల నుంచి యాత్రీకులు లక్షల్లో ఇక్కడికి వచ్చిపోతూ ఉండటంతో ఆ ప్రాంతమంతా సందడిగా ఉంది. కాథలిక్లు పుణ్య క్షేత్రంగా భావించే ఈ ప్రాంతం నుండే ప్రపంచ దేశాలకు పోప్ సందేశం ఇస్తూ ఉంటాడు. ప్రతి బుధవారం, ప్రొద్దున్న పదిగంటలకు పోప్ బెనెడిక్ట్ బయటికి వచ్చి అందరి మధ్య నుంచి వెడుతూ దర్శనమిస్తాడట. అయితే మేము వెళ్లిన రోజు బుధవారం కాదు కాబట్టి మాకు ఆయన దర్శనం కాలేదు.
చిత్రాలు, శిల్పాలు
ఇక్కడ చూడాల్సిన వాటిలో ముఖ్యమైనది సైంట్ పీటర్స్ బసీలికా చర్చి. దాని పక్కనే వాటికన్ మ్యూజియం, సిస్టిన్ చాపల్ వున్నాయి. ఇవన్నీ తీరిగ్గా చూడాలంటే పూర్తిగా ఒక రోజు పడుతుందనిపించింది. మాకు అంత టైం లేదు కాబట్టి గబగబా అంతా తిరిగి చూశాం. ఆ చర్చి ముందు ఉన్న శిల్పం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎంతో అద్భుతంగా ఉంది. పైనుండి కింది వరకు ఒక దుప్పటిని విసిరేస్తే అది ముడతలు ముడతలుగా కిందకు పడుతుంటే ఎలా ఉంటుందో అలా గ్రైనైట్తో మలిచిన తీరు అద్భుతమనే చెప్పాలి. ప్రపంచంలోనే అతిపెద్ద చర్చిగా పేరున్న ఈ బసీలికాలో ఏకకాలంలో సుమారు 60వేల మంది ప్రార్థన చేసుకోవచ్చట. చర్చి లోపల ఎన్నో రకాల ప్రఖ్యాత చిత్రాలూ, శిల్పాలూ వున్నాయి. మైకలాంజేలో, పెరూజినో, బాట్టిచెల్లీ మొదలైన వారి కళాఖండాలు చూడవచ్చు. అవన్నీ కూడా బైబిల్ పురాణ గాధల చిత్రాలు, శిల్పాలు. ఒక దానిని మించి ఇంకొకటి ఉన్నాయి. ఆ చర్చి లోపల ఒక పెద్ద డోమ్ ఉంది. ఆ డోమ్ ఎంత పెద్దది అంటే ఒక ఎనభై ఫీట్ల పొడవు, నలభై అడుగుల వెడల్పు ఉండవచ్చు. ఆ డోమ్పై ఎలా చిత్రించాడు అనేది ఆశ్చర్యంగా అనిపించింది. కేవలం తలపైకెత్తి చూడటానికే మాకు మెడ నొప్పి వేస్తుంటే వాళ్లు వాటిని వేయడానికి ఎంత శ్రమపడి ఉంటారో కదా అనిపించింది.
రోమ్ నగరంలోని ట్రేవీ ఫౌంటెన్లో నిర్మించిన శిల్పం చాలా బాగుంటుంది. దీన్ని 1762లో కట్టారట. వచ్చిన వాళ్ళు వెనక్కి తిరిగి కూర్చుని, ఆ ఫౌంటెన్ నీటిలో నాణాల్ని పడేస్తుంటారు (అక్కడ వాటిని లీరే అంటారు) . ఇలా చేస్తే, అనుకున్నది జరుగుతుందని ఒక నమ్మకం. అలా కోరికలతో అక్కడికి వచ్చిన వాళ్లంతా నాణేలను విసిరేయడం వల్ల ఆ ఫౌంటెన్ అంతా వేలాది నాణాలతో నిండిపోయింది. ఈ వింత ఆచారాన్ని చూశాక అక్కడి నుండి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పీసా టవర్ను చూడటానికి వెళ్లాం.
లీనింగ్ టవర్ ఆఫ్ పీసా...
భారత్ పేరు చెప్పగానే తాజ్ మహల్ గుర్తొచ్చినట్టే... ఇటలీ అనగానే 'లీనింగ్ టవర్ ఆఫ్ పీసా' పేరు స్ఫురిస్తుంది. అంటే ఒకవైపునకు వంగిన టవర్ ఆకారంలో ఉండే అతి పెద్ద నిర్మాణం. చాలా సినిమాల్లో మనకు ఈ టవర్ కనిపిస్తుంది. అయితే ఈ టవర్ ఇలా ఒకవైపుకి వంగి ఉండటం వెనుక ఓ కారణం ఉంది. ఈ శిఖరం కట్టేటప్పుడు నిలువుగానే కడదామనుకున్నారట. కానీ నేల మరీ మెత్తగా వుండటం వల్ల పునాది సరిగ్గా లేక ఒక పక్కకి వంగటం మొదలుపెట్టింది. అలా వంగటం మొదలు పెట్టిన టవర్ పూర్తి ఆయ్యే సరికి కొంచెం ఎక్కువగానే వంగిందట. ఇప్పటికీ అది అలాగే ఓ పక్కకు ఒరిగి ఉన్నట్టు కనిపిస్తుంది. నిజానికి పక్కకు ఒరగడం వల్లే ఈ టవర్ ప్రపంచ గుర్తింపు వచ్చిందనుకోవచ్చు. అయితే 1990 జనవరి నుంచీ 2001 వరకూ దీని దరిదాపుల్లోకి కూడా ఎవరినీ వెళ్లనివ్వలేదట. దీన్ని చూద్దామని రోజూ వచ్చే వేల మంది టూరిస్టులు దూరం నుంచే ఈ టవర్ని చూస్తూ, ఫొటోలు తీసుకునేవారట. కానీ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఈ నిర్మాణాన్ని సరిచేయగలమన్న నమ్మకం పెరుగడంతో 186 అడుగుల ఎత్తైన ఈ నిర్మాణాన్ని తిరిగి యథాస్థితిలో నిలబెట్టేందుకు ప్రయత్నించడమే కాకుండా టవర్లో 45 సెంటీమీటర్లు వంపును తగ్గించారట. దీనికోసం ఏకంగా 18 వందల కోట్ల రూపాయలు ఖర్చైందంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ టవర్ ప్రత్యేకత ఏంటో. మేము మాత్రం ఆ టవర్ను ఎంచక్కా దగ్గరినుండే చూసి తనివితీరా ఆనందించి దాని దగ్గర ఫోటోలు కూడా దిగాం.
అల్బెరబెల్లో...
ఈ అల్బెరబెల్లో 'బారీ' అనే ప్రదేశానికి దగ్గరలో ఉంది. బారీకి ట్రైన్లో వెళ్లి, బారీ నుండి ఒక కారు తీసుకొని అల్బెరబెల్లో వెళ్లాం. ఇక్కడ పలకల్లాంటి పెంకులను ఇంటి కప్పుకు వాడుతున్నారు. వీటిని ఎన్ని శతాబ్దాలు గడిచిన మార్చకుండానే వాడుతున్నారు. ఇలాంటి ఇండ్లు కొన్ని వందలు కనిపించాయి. యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపుపొందిన ఈ ప్రాంతానికి నిత్యం యాత్రికులు వస్తుంటారని చూస్తే అర్థమైంది. ఆప్రదేశంలో కూడా ఫొటోలు దిగి తిరుగు ప్రయాణం అయ్యాం.
ఎన్నో ప్రత్యేకలు ఉన్న ఇటలీ దేశాన్ని పర్యటించి అనేక అనుభూతుల్ని పదిలంగా దాచుకుని తిరిగి మన దేశానికి వచ్చాము.
- నర్మదా రెడ్డి
Authorization