దోమకొండ... నిజామాబాద్ జిల్లాలో ఓ మారుమూల గ్రామం. హైదరాబాద్కు సుమారు 96 కి.మీ. దూరంలో ఉన్న దోమకొండ ఖిల్లా వందల ఏండ్ల చరిత్ర కలిగి వుంది. తెలంగాణలో పెద్ద సంస్థానాలలో పేరున్న 'దోమకొండ కోట' పాకనాటి రెడ్డి శాఖకు చెందిన కామినేని వంశస్తులది.16వ శతాబ్దంలో కుతుబ్షాహీల పాలనలో ఈ సంస్థానం బాధ్యతలను చేపట్టారు కామారెడ్డి వంశస్తులు. అప్పటినుండి నిజాంల పాలన ముగిసే వరకూ దోమకొండ నిజాం రాజ్యంలో సంస్థానంగా కొనసాగింది.
రాజరాజేశ్వరరావు హయాంలో దోమకొండ కోటను నిర్మించారు. ఈ కోట దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంలో వుంటుంది. స్థానికులు ఈ ప్రాంతాన్ని 'దోమకొండ గడి, దోమకొండ ఖిల్లా అని పిలుస్తారు. శత్రువుల దాడులను సమర్థవంతంగా ఎదుర్కొనేలా రాతి ప్రహరీగోడను నిర్మించుకోవడం ఈ ఘడి ప్రత్యేకత. 40 అడుగుల ఎత్తులో వున్న ఈ ప్రహరీగోడ దోమకొండ కోట రాజసానికి దర్పణం. కోట చుట్టూ పెద్ద నీటి కందకం వుంది. కోట చుట్టూ ఎత్తయిన ప్రహరీగోడతో పాటు ఎత్తయిన బురుజులు కనిపిస్తాయి.
రెండంతస్తుల మహల్
ప్రహరీ గోడ దాటి కోట లోపలివైపుకు వెళితే రెండు పెద్ద కమాన్లు కనిపిస్తాయి. గడి ముఖ ద్వారాలను వారు కట్టుదిట్టంగా నిర్మించారు. బలిష్ఠమైన ఈ ద్వారాలను తెరవాలంటే ఏనుగుల సహాయం కావాల్సిందే. శతాబ్ధాలు గడిచినా ఈ దర్వాజాల నిర్మాణం నేటికీ చెక్కు చెదరలేదు. 30 అడుగుల ఎత్తు ఉన్న ఈ మహాద్వారమే రెండంతస్తుల మహల్లా వుంటుంది. ఈ గడిలో శిల్పుల నిర్మాణ కౌశలానికి సంబంధించి అనేక విభాగాలు కనిపిస్తాయి. వీటిలో వెంకట భవనం, అద్దాల మేడ, రాజుగారి దర్బారు, అశ్వగజ శాలలు, రాతి కుడ్యాలు, బురుజులు, కందకాలు ధాన్యాగారాలు, దేవాలయాల వంటి అనేక నిర్మాణాలు మనకు కనిపిస్తాయి.
చూపరులను ఆకట్టుకుంటాయి
విశాలమైన ఈ కోట ప్రాంగణంలో ఎత్తయిన చెట్లు, అందమైన తోటల మధ్య రాజసం ఉట్టిపడేలా ప్రధాన రాజ భవనం కనిపిస్తుంది. ఈ భవనంలోనే సంస్థానాధీశులు ఉండే వారట. ఈ భవనం పై భాగాన వున్న శిలాఫలకం మీద గ్రానైట్ తో చెక్కబడ్డ 'వెంకటభవనం' అని తెలుగులోనూ, ఉర్దూలోనూ చెక్కబడి వుంటుంది. ఈ భవనంలో 30కి పైగా విశాలమైన గదులున్నాయి. ఇప్పటికీ ఈ సంస్థానాధీశుల వారసులు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ భవనంలోనే విడిది చేస్తారు. ఈ భవనం మొత్తం మీద కనబడే ఎన్నెన్నో అందమైన డిజైన్లు చూపరులను అబ్బుర పరుస్తాయి. ప్రధాన భవనం పైన పిరమిడ్ లాంటి నిర్మాణాలు కనిపిస్తాయి.
అద్దాల మేడ
ఈ గడి ప్రాంగణంలో నిర్మించిన అద్దాల మేడ కండ్లు మిరుమిట్లు గొలిపేలా వుంటుంది. ఇందులోనే సాంస్క ృతిక కార్యక్రమాలు జరిగేవి. ఈ ప్రాంగ ణంలోనే ఫౌంటెయిన్స్ కూడా నిర్మించబడి వున్నాయి. మొదటి అంతస్తులో గుండ్రని స్తంభాలు, చెక్క దూలాలతో చేయబడ్డ అనేక నిర్మాణాలు మనకు కనిపిస్తాయి. నెమలి డిజైన్లతో చేసిన కిటికీలు, ఏనుగులు, నెమలి, బొమ్మలతో తయారుచేయబడ్డ తలుపులు కళాత్మకంగా కనిపిస్తాయి. దోమకొండ గడిలో రెండు దేవాలయాలు కూడా నిర్మించబడ్డాయి.
Authorization