గిజా పిరమిడ్.. లీనింగ్ టవర్ ఆఫ్ పీసా.. ఐఫిల్ టవర్... రోమన్ కలోసియమ్... తాజ్ మహల్.. క్రైస్ట్ ది రిడీమర్... స్టాట్యూ ఆఫ్ లిబర్టీ... ఇవి ప్రపంచంలోని ఏడు వింతలు. ఇది అందరికీ తెలిసిన విషయమే. వీటిని చూడాలంటే అవి ఉన్న అన్ని దేశాలకు వెళ్ళవల్సిందే. ఇది కూడా అందరికీ తెలిసిన విషయమే. అయితే కొత్త విషయం ఏమిటంటే ఆ ఏడు వింతలను చూడాలంటే అన్ని దేశాలను చుట్టి రావల్సిన అవసరం లేదు. ఢిల్లీలోనే చూడొచ్చు. అదే వేస్ట్ టు వండర్ పార్క్. మరి ఏడు వింతల్ని ఒకే చోట సాక్షాత్కరించిన ఆ పార్క్ సంగతులేంటే తెలుసుకుందాం...
గుజరాత్కు చెందిన ఓ ఆర్కిటెక్ట్ ఆలోచనల నుండి పుట్టుకొచ్చినదే ఈ వేస్ట్ టు వండర్ పార్క్. ఇందులో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ప్రపంచ వింతలన్నీ ఎన్నో టన్నుల వ్యర్థాలతో నిర్మించారు. అందుకే దీనికి వేస్ట్ టు వండర్ పార్క్ అనే పేరు వచ్చింది. ఒక నిర్మాణానికి, మరో నిర్మాణానికి మధ్య దూరం కేవలం 200 మీటర్లే. అంటే అర గంటలో అన్ని ప్రపంచ వింతలూ చూసేయవచ్చన్నమాట.
ఇక్కడున్న గిజా పిరమిడ్ నిర్మాణానికి 12 టన్నుల వ్యర్థాలను వాడారు. ఐఫిల్ టవర్ నిర్మాణానికి 15 టన్నుల వ్యర్థాలు ఉపయోగించాయి. పీసా టవర్ కోసం 9 టన్నులు, రోమన్ కలోసియమ్కు 12 టన్నులు, తాజ్ మహల్ నిర్మాణానికి 12 టన్నులు, క్రైస్ట్ ది రిడీమర్ నిర్మాణానికి 5 టన్నులు, స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కోసం 8 టన్నుల వ్యర్థాలను ఉపయోగించారు. మొత్తం రూ.4.5 కోట్లతో నిర్మించిన ఈ పార్క్ 5 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ మొత్తం నిర్మాణానికి 6 నెలలు పట్టింది. దీన్ని ఫిబ్రవరిలో ప్రారంభించారు. ఒకే చోట ప్రపంచ వింతలన్నీ దర్శనమివ్వడంతో పర్యాటకుల ఆనందాన్ని అవధుల్లేకుండా పోయింది.
ఈ సారి ఢిల్లీ వెళ్ళినప్పుడు మీరు కూడా ఈ పార్క్ను కచ్చితంగా చూసిరండి. వేలకు వేలు డబ్బు ఖర్చు పెట్టే పని లేకుండా ఒకే చోట అన్ని దేశాలను చుట్టేసిని అనుభూతి కలుగుతుంది.
Authorization