మన రాష్ట్రంలో నల్గొండ జిల్లాలోని కొలనుపాక ప్రాచీన కాలంలో జైన కేంద్రంగా విలసిల్లింది. దాదాపు 2000 ఏండ్ల చరిత్ర కలిగిన కొలనుపాక ప్రస్తుతం కొత్త రూపం సంతరించుకుని పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. తెలంగాణలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా నిలిచింది. మరి దాని విశేషాలేంటో చూద్దాం...
దాదాపు 9వ శతాబ్ధంలో రాష్ట్రకూటుల పాలనలో కొలనుపాకకు ఎంతో ప్రాముఖ్యం ఉండేది. ప్రముఖ జైన క్షేత్రంగా ఉన్న ఈ ప్రాంతాన్ని రాష్ట్రకూటులు ఆ రోజుల్లో సైన్యాగారంగా మార్చారు. తరువాత దీన్ని పాలించిన చాళుక్యుల కాలంలో ఇక్కడ అనేక ఆలయాలు నిర్మించబడ్డాయి. అనంతర కాలంలో చోళులు, పల్లవులు జైనులపై దాడులు ప్రారంభించడంతో ఈ ప్రాంతంతో పాటు ఇక్కడి ఆలయం సైతం దాదాపుగా ధ్వంసమైంది. తర్వాత ఈ ప్రాంతం కాలగర్భంలో కలిసిపోయింది. కొలనుపాక గ్రామం, ఇతర సమీప గ్రామాల్లో లభించిన అనేక చారిత్రక ఆనవాళ్లతో పురావస్తుశాఖ ఓ మ్యూజియాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్ తరాలకోసం పదిలపరిచింది.
అరుదైన విగ్రహం
మ్యూజియంలో 1.5 మీటర్ల ఎత్తుగల అరుదైన మహావీరుడి విగ్రహం ఉంది. 11వ శతాబ్దంలో కళ్యాణి చాళుక్యుల రెండవ రాజధానిగా కొలనుపాక ఉండేది. ఆకాలంలో ఈ గ్రామం జైనులకు గొప్ప మతకేంద్రంగా ఉండేది. అంతే కాకుండా దక్షిణ భారతదేశంలోని ఇతర ప్రముఖ జైన్ కేంద్రాలలో ఒకటిగా విలసిల్లింది. దాదాపు వందేండ్ల కిందట మట్టి దిబ్బలలో కనుగొన్న కొలనుపాక జైన దేవాలయం ప్రస్తుతం ఆధునిక రూపుని సంతరించుకుంది.
అద్భుతమైన మ్యూజియం
పురాతన , వారసత్వాన్ని తెలుసుకోవాలని తపన పడే వారికి ఉపయోగపడే భారతదేశంలోని అద్భుతమైన మ్యూజియంలలో ఇది ఒకటి. వెయ్యేండ్లకు పైగా చరిత్ర కలిగిన స్మారక శిలలు, వీరగల్లులుగా పిలవబడే విగ్రహాలు మ్యూజియంలో భద్రపరచబడ్డాయి. ఈ మ్యూజియంలో హిందూమతం, జైనమతం రెండింటికి సంబంధించిన విగ్రహాలతో పాటు ఇతర వస్తువులు ఉన్నాయి.
శిల్పాలతో గ్యాలరీ
కొలనుపాకలోని సోమేశ్వర ఆలయ సముదాయంలో ఉన్న జైన దేవాలయానికి సమీపంలో ఉన్న మ్యూజియంలో 6 నుండి 16 వ శతాబ్దం మధ్యకాలం నాటి మహావీర, మత్స్య వల్లభ, చాముండి, నంది లాంటి ముఖ్యమైన శిల్పాలు ఉన్నాయి. పురావస్తు శాఖ ఇక్కడ శిల్పాలతో ఒక గ్యాలరీని ఏర్పాటు చేసింది, ఇందులో కొలనుపాకలోని వివిధ చారిత్రక కట్టడాల నుండి, ఇతర సమీప గ్రామాల నుండి సేకరించబడిన కళాఖండాలను ప్రదర్శిస్తున్నారు.
చరిత్ర పరిశోధకులకు
చాళుక్య, కాకతీయ శైలులకు సంబంధించిన శిల్పాలు ఇక్కడ మనకు ఎక్కువ కనపడతాయి. ఈ మ్యూజియంలో 100 కిపైగా ఉన్న కాకతీయ, చాళుక్యు శిల్ప రీతుల గూర్చి చరిత్ర పరిశోధన చేసే పరిశోధకులకు అత్యంత ఉపయోగకరంగా ఉంటాయి.
ముఖ్యమైన విగ్రహాలు
1076-1127 A.ణ మధ్య కాలంలో కొలనుపాకని పరిపాలించిన త్రిభువనమల్ల రాజు వేయించిన విజయ స్తంభం. స్తంభం నాలుగు వైపులా శాసనం ఉండడం విశేషం.
Authorization