తెలంగాణ కళాసంపదకు మాత్రమే కాదు అత్యద్భుతమైన శిలా సంపద కూడా నెలవు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పురావస్తు శాఖ అధికారులు, ఔత్సాహిక పరిశోధకులు ఎన్నో పరిశోధనలు చేసి ఎన్నో జలపాతాలు, సున్నపు గుహలు, రాతి చిత్రాల స్థావరాలు కనుగొంటున్నారు. దాంతో అత్యంత చారిత్రక , భౌగోళిక ప్రాంతాలు జన బాహుళ్యంలోకి వస్తున్నాయి. వీటిలో 2015లో నల్గొండ జిల్లాలో బయటపడిన రంగుల గుహలు ముఖ్యమైనవి. కృష్ణానదీ లోయలో నల్గొండ జిల్లా చందంపేట మండలంలో ఈ రంగు గుహలను కనుగొన్నారు. ఈ గుహలు దేశంలోనే కొత్తవి.
ప్రపంచంలో ఇలాంటి గుహలు
ఐస్ లాండ్లోని ఒక అగ్నిపర్వతంలో కరిగి చిమ్మిన లావా వేడికి ఏర్పడి భూమికి 400 అడుగుల లోతున వున్న ద్రిహ్నుకగిగుర్ అనే గుహ ప్రకృతే స్వయంగా వేసిన హరివిల్లు రంగులతో కనిపిస్తున్నది.మరొకటి చైనాలోని గల్లిన్ ప్రావిస్స్లో వున్న రీడ్ ఫ్లూట్ అనే గుహ భూమికి 790 అడుగుల లోతున వున్న గుహ కూడా రెయిన్ బో గుహ.దీన్ని 1200 సంవత్సరం నుండి సందర్శిస్తున్నట్టు క్రీ.శ.792 సంవత్సరంలో టాంగ్ రాజవంశీయులు గుహలో రాయించిన శాసనం వల్ల తెలుస్తున్నది. ఈ గుహలో నీలి, ఎరుపు, నారింజ, ఆకుపచ్చ రంగులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. రష్యాలోని యూరల్ పర్వతశ్రేణుల్లో, ఐర్లాండులో,ఉత్తర అమెరికాలో,మియన్మార్ లో, మనదేశంలో బెంగాల్లో ఇలాంటి గుహలు ఉన్నాయి.
అందమైన ఆకృతులతో....
ఇక మన రాష్ట్రంలోని నల్గొండ జిల్లా చందంపేట మండలంలోని కాచరాజుపల్లికి దగ్గర వున్న గుట్టల వరుసలో మునులగుహగా పిలువబడుతున్న 'గాజుబేడం' గుహ ఆక్వామెరీన్ (నీలి ఆకుపచ్చ) రంగుతో మెరిసిపోతున్నది.ఈ గుహలోని సొరంగాలు దాదాపు 12 కి.మీ.లు పొడవున్నాయని, వీటిద్వారా వెళితే దేవరచర్ల, ఏలేశ్వరం, శ్రీశైలం దాకా చేరవచ్చని స్థానికులు చెబుతున్నారు. గుహలో ప్రవేశించే మార్గం విశాలంగా ఉంటుంది. కండ్లు చెదిరే రంగులగోడలు, అంతస్తుల గుహలు మనల్ని అబ్బురపరుస్తాయి. ఈ మునుల గుహ లేదా భావోజిగుహలో ఏర్పడిన గుహంతర్భాగాలు సొరంగాలుగా, అంతస్తులుగా చక్కగా చెక్కినట్టుగా రాతిగోడలు,అందమైన ఆకృతులు ఒకచోట ఎరుపు రంగు, మరొకచోట కొంచెం నారింజ వర్ణం, గుహలో 90 శాతం ఆక్వామెరీన్(నీలి ఆకుపచ్చ)రంగుతో చాలా అందంగా కనిపిస్తాయి.
ఎన్నో చారిత్రక విశేషాలు
ఈ రాతిగోడలు ఇలా రంగులతో మెరిసిపోతున్నాయంటే.. అగ్రిపర్వతంలో లావా ప్రవాహంతో ఇట్లాంటి గుహలు ఏర్పడివుంటాయి. లావావేడికి కరిగిన వివిధ ఖనిజాలు కలిసిపోవడంతో ప్రాకృతికంగా గుహలగోడలకు ఈ రంగులు అద్దివుంటాయి.ఈ గుహలోని రాళ్ళు ఖనిజసంపన్నమైనవి. ప్రభుత్వం వీటిని పరీక్షించి వీటిలోని ఖనిజాలను అన్వేషించాలి. అంతేకాదు దేశంలోనే అరుదైన ఈ గుహలకు మంచిదారులు వేసి విహార యాత్రాస్థలంగా రూపొందించాలి. ప్రభుత్వం వీటిపై దృష్టిపెడితే ప్రతిష్టాత్మకంగా మారడమే కాక రేపటి పర్యాటక సంపదకు కూడా మూలకారణం అయ్యే లక్షణాలు ఈ గుహలకు పుష్కలంగా ఉన్నాయి. గుహలోని మార్గాలను అన్వేషిస్తే అనేకమైన కొత్తసంగతులు, ఆశ్చర్యపరిచే చారిత్రక విశేషాలు బయటపడే అవకాశాలున్నాయి.
తీసుకోవలసిన జాగ్రత్తలు
అనారోగ్యంతో బాధ పడుతున్నవారు, ఐదారేళ్ళకన్నా చిన్న పిల్లలు, వృద్ధులు వెళ్ళకపోవడం మంచిది. వెళ్ళేటప్పుడు మంచినీటిని వెంట తీసుకెళ్ళడం మరవొద్దు. సన్నటి కాటన్ దుస్తులు ధరించి వెళితే, ఉబ్బరింతను భరించడం కుదురుతుంది. కచ్చితంగా గైడ్ సహాయం తీసుకోవాలి.టార్చ్లైట్ వెంట తీసుకెళితే సౌకర్యంగా ఉంటుంది.తాడు, టోపి ఇతర సాహస యాత్రలకు అవసరం అయ్యే సామాగ్రి ఉంటే మరీ మంచిది.
Authorization