ఓ ప్రదేశంలో నివసిస్తూ మన చుట్టూ వున్న పరిసరాలను అక్కడి పద్ధతులను తెలుసుకునే క్రమంలో యాత్రలు కొనసాగుతుంటాయి. కీ||శే|| ఏనుగుల వీరాస్వామితో మొదలైన యాత్రా రచన ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ ''పర్యాటక దర్శిని -2018'' యాత్రా రచనలో ఒక విశిష్ట గ్రంథం. ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటూ ఇతర భారతీయ రాష్ట్రాలలోని దర్శనీయ ప్రదేశాల, క్షేత్రాల విశిష్టతను తెలియజేస్తూ అద్భుతమైన ఛాయాచిత్రాలతో ఆద్యంతమూ ఆకట్టుకుంటుంది. ఈ గ్రంథ నిర్మాణంలో సంపాదకుడు సబ్బెళ్ళ శివన్నారాయణ రెడ్డి అభిరుచీ, శ్రమా, ఆసక్తీ ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. భారతదేశపు యాత్రలలో భాగంగా ఇక్కడి వివిధ ప్రాంతాల రుచులు, వాటి వివరాలు, భోజన వివరాలూ ఆయా ప్రాంతాల ప్రత్యేకతలను పాఠకుల కళ్ళముందు నిలుపుతాయి. ఉత్తర, దక్షిణ భారతదేశంలోని వివిధ పార్యటక ప్రదేశాలూ, ఆధ్యాత్మిక స్థలాలూ, పర్యటనకు కావలసిన సమాచారమూ ఇవ్వడం, ఇతర ప్రాంతాలవారు ఎలా చేరుకోవాలనేది సుస్పష్టంగా తెలియచేస్తుందీ గ్రంథం. సప్తవర్ణ చిత్రాలూ, సందర్భోచితమైన ఛాయాచిత్రాలూ గ్రంథానికి మరింత వన్నె తెచ్చాయి. యాత్రలు చేయాలనుకునే వారికి ఉపకరించే పుస్తకమిది.