మన మనసుల్ని కట్టిపడేసే ప్రకృతి రమణీయతతో పాటు వందలాది జాతుల పక్షులకు, మొసళ్లకు, చారిత్రక సంపదకు పాకాల సరస్సు నిలయం. రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద సరస్సుల్లో పాకాల సరస్సు ఒకటి. దాదాపు 839 చ.కి.మీ. వైశాల్యంలో విస్తరించి ఉంటుంది ఈ పాకాల సరస్సు. అప్పట్లో వ్యవసాయం కోసం కాకతీయులు నిర్మించిన ఈ పాకాల సరస్సు అందాల గురించి...
ఈ ప్రాంతంలో వివిధ రకాల వన్యప్రాణులు , వృక్ష జాతులతో ఉండడం వల్ల 1952లో నాటి హైదరాబాద్ ప్రభుత్వం పాకాల సరస్సు ఉన్న ప్రాంతాన్ని రక్షిత అభయారణ్యంగా గుర్తించింది. ఇక్కడ 200 లకు పైగా వృక్ష జాతులున్నాయి. వాటిలో టేకు, తిరుమని, మద్ది, వెదురు, అందుగ ముఖ్యమైనవి. అలాగే ఈ సరస్సులో అనేక జాతుల చేపలు, అరుదైన పక్షి జాతులు, సరీసృపాలు, నీటి మొక్కలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. పాకాల ప్రాంతంలో ఒకప్పుడు పెద్ద పులులు ఉండేవని నిజాం రాజులు వేటకు వచ్చేవారట. ప్రస్తుతం పాకాల సరస్సును పర్యాటకపరంగా అభివృద్ధి చేసేందుకు పర్యాటక, అటవీ శాఖలు కృషి చేస్తున్నాయి.
పాకాల శాసనం: కాకతీయ గణపతి దేవుడి కాలంలో వేయించిన ఈ శాసనం సంస్కృత భాషలో రాయబడి ఉంది. కాకతీయ గణపతి దేవుడి సేనాని జగదాల ముమ్మడి నాయకుడు పాకాల చెరువును తవ్వించాడని ఇందులో రాసి ఉంది..
ప్రపంచంలోనే: జీవవైవిధ్యం, అద్భుతమైన ప్రాకృతిక సౌందర్యంతో పాటు పాకాలకి ఇంకో అరుదైన ప్రత్యేకత కూడా ఉంది. ప్రపంచంలో ఉన్న కాలుష్య రహిత మంచినీటి సరస్సుల్లో ఎనిమిదో స్థానంలో, భారతదేశంలో రెండవ స్థానంలో ఉంది. ఈ ప్రత్యేకతను కాపాడేందుకు, పర్యావరణాన్ని రక్షించేందుకు అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పర్యాటకులు పాకాల సరస్సు చుట్టూ విహరించడానికి బ్యాటరీ వాహనాన్ని కూడా ఏర్పాటు చేశారు. అంతే కాకుండా ఇక్కడ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించారు.
పక్షులకు నిలయం: ప్రకృతి అందాలకు మాత్రమే కాకుండా అనేక పక్షులకు, జంతు జాతులకు నిలయంగా పాకాల సరస్సు విలసిల్లుతోంది. ఇప్పటి వరకు 85 రకాలకు పైగా పక్షి జాతులతో పాటు అరుదైన గద్ద, గుడ్లగూబలతో పాటు పలు రకాల పాములను ఇక్కడ గుర్తించారు. అటవీ శాఖపక్షుల సంరక్షణ కోసం అనేక ఏర్పాట్లను చేసింది. పక్షులు , ఇతర వన్యప్రాణుల గురించి అధ్యయనం కోసం పర్యావరణ అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పరిశోధకులు, ఔత్సాహికుల కోసం అరుదైన, విలువైన పుస్తకాలను సైతం అధ్యయన కేంద్రంలో అందుబాటులో ఉంచారు .
ప్రత్యేక కార్యక్రమాలు: చారిత్రక సంపదగా, రైతన్నల పెన్నిధిగా నిలిచిన ఈ నిండుకుండ పర్యాటక కేంద్రంగానూ ప్రసిద్ధి చెందింది. ప్రకృతి ఆరాధకులు, పర్యాటక ప్రియులు పాకాల సోయగాలు చూసేందుకు రోజూ వందల సంఖ్యలో పాకాల వస్తున్నారు. పక్షులను చూడటానికి వాచ్ టవర్స్ ఉన్నాయి.
బోటు షికారు: సరస్సులో బోటు విహారం కూడా చేయవచ్చు. బోటులో సరదాగా సరస్సు అంతా చుట్టి రావచ్చు. సరస్సులో బోటు విహారం ఓ మధురానుభూతిగా మిగులుతుంది. బోటుపైకి ఎక్కి సరస్సు మధ్యలో ఉన్న దీవి వరకు వెళ్లొచ్చు. ట్రెక్కింగ్ అంటే ఆసక్తి ఉన్నవారు పాకాల నుండి అడవి మార్గం గుండా 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిలకల గుట్ట వరకు చేయవచ్చు. ఈ మార్గంలో సరస్సు అందాలను ఆస్వాదించడానికి వ్యూ పాయింట్లను ఏర్పాటు చేశారు. పాకాల సరస్సుకు ఒకవైపు అందమైన ఉద్యానవనం ఉంది. ఇందులో అనేక రకాల పూల మొక్కలు, అరుదైన ఔషధ మొక్కలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ చెరువులో మొసళ్లు ఉంటాయి. అందుకే సరస్సులోకి దిగడంపై నిషేధం విధించారు.
సౌకర్యాలు:పర్యాటకులు బస చేయడానికి వీలుగా తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ హరిత హోటల్ నిర్వహిస్తోంది. సాధారణ, ఏసీ గదులతో పాటు రాత్రి సమయంలో బయట టెంట్ వేసుకొని ఉండడానికి టెంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అక్టోబర్ నుండి ఏప్రిల్ మధ్య కాలం సందర్శనకు అనువైనది.
ఇలా వెళ్లాలి....?
హైదరాబాద్ నుండి 200 కిలోమీటర్ల దూరంలో... వరంగల్ నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నర్సంపేట నుంచి సుమారు 18 కిలోమీటర్లు. హైదరాబాద్ నుంచి వరంగల్, నర్సంపేటకు బస్సు సర్వీసులు ఉన్నాయి. ఈ రెండు చోట్ల నుంచి పాకాలకు బస్సులో, ప్రైవేట్ వాహనాల్లో వెళ్లవచ్చు. నర్సంపేట నుంచి పాకాలకు ప్రతి 30 నిమిషాలకు ఆర్టీసీ బస్సు అందుబాటులో ఉంది. జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం నుంచి కూడా నర్సంపేటకు ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. నర్సంపేట నుండి పాకాల సరస్సు వరకు ప్రయివేటు ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయి.
Authorization