కొత్తగా పెండ్లయిన జంటలు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. దానికోసం వారిద్దకి ఏకాంతం కావాలి. ఏకాంతమే వారిలో ప్రేమానురాగాలు పెరిగేందుకు సహకరిస్తుంది. అందుకే పెండ్లయిన కొత్త జంటలు హనీమూన్ పేరుతో తమకు నచ్చిన ప్రదేశానికి ప్రేమ పక్షుల్లా ఎగిరిపోతారు. ఆకాశ వీధుల్లో తనివితీర విహరించి వస్తుంటారు. అలా వెళ్ళే ప్రదేశాలు ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉండాలి. శీతల పవనాలు మేనిని తాకి గిలిగింతలు పెట్టాలి... మంచుదుప్పటి కప్పుకున్న గిరులు మదిని పులకరింపజేయాలి... నేలంతా పరుచుకున్న పచ్చదనం, ఆకాశాన్నంటే తరువులు హృదయాన్ని పరవశింపజేయాలి... అయితే వేసవిలో ఇవన్నీ సాధ్యమేనా అనే అనుమానం! కచ్చితంగా సాధ్యమే.. జీవితాంతం గుర్తుండిపోయే మధురానుభవాలను మూటకట్టుకోవడానికి మన సువిశాల దేశంలో ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. వాటిపై ఓ విహంగ వీక్షణం...
ఊటీ
కొత్తగా పెండ్లయిన జంటలు విహరించాలనుకుంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఊటీ. మధ్య తరగతి కుటుంబం నుంచి కాస్త ఉన్నత స్థాయి కుటుంబాల వరకూ ఈ ప్రాంతాన్నే తమ హనీమూన్ స్పాట్గా ఎంచుకుంటారు. నీలగిరి పర్వత శ్రేణుల్లో పచ్చని చీర కట్టిన పర్వాతల ఒడిలో దాగిన ఊటీ కొత్త జంటలు సరదాగా గడిపేందుకు ఎంతో అనువైనది. బొటానికల్ గార్డెన్, రోజ్ గార్డెన్, ఊటీ లేక్ ఇలా ఎన్నో ఆకర్షణలు పర్యాటకులను అక్కడకు రారమ్మంటూ ఆహ్వానిస్తుంటాయి. ఇది మనకు దగ్గరగా కూడా ఉంటుంది.
మనాలి
హనీమూన్కి వెళ్ళాలనుకునే వారి కోసం హిమాచల్ ప్రదేశ్లోని ఈ చిన్న పట్టణం కూడా ఓ అందమైన ప్రదేశం. ఒక వైపున నదీ లోయలు, మరోవైపు ఆకాశాన్ని తాకే పర్వత శిఖరాలు, ఆ పర్వతాల్లో రంగురంగుల పుష్పాల కంటే కొత్త జంటలు కోరుకునేది ఇంకేముంటుంది. అందుకే సముద్రమట్టానికి 2050 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పట్టణానికి హనీమూన్ జంటలు క్యూ కడుతుంటాయి. అదే విధంగా ఇక్కడి భౌగోళిక పరిస్థితులు సాహస క్రీడలకు పెట్టింది పేరు. అందువల్ల ఇటీవల కాలంలో యువకులు కూడా ఇక్కడకు ఎక్కువగా వెలుతుంటారు.
కేరళ
ఎటు చూసినా పచ్చదనం. సముద్ర తీర ప్రాంతమైన ఈ రాష్ట్రం పర్యాటకంలో ఎప్పుడూ ముందుంటుంది. ఏకాంతంగా గడపాలనుకునే జంటలకు కేరళ సరైన ప్రాంతం. గాడ్స్ పేరడైజ్గా పేరొందిన కేరళాలో ప్రకృతి అందాలకు కొదవే లేదు. అందమైన కాలువలు, నదులు... ఇలా ఎన్నో అందాలకు నెలవైన ఈ ప్రాంతంలో కేరళా సాంప్రదాయ పద్ధతిలో మీ కోసమే ప్రత్యేకంగా సిద్ధం చేసిన హనీమూన్ బోటులో లాహిరి లాహిరి లాహిరిలో అంటూ షికారు చేస్తుంటే... ఆహా అనుభూతే వేరు కదూ...
గోవా
సముద్ర తీర ప్రాంతమైన గోవా కేవలం మనకే కాదూ విదేశీయులకు కూడా అత్యంత ఇష్టమైన పర్యాటక ప్రాంతం. చాలా మంది బ్యాచిలర్ పార్టీ కోసం ఇక్కడికే వెళుతుంటారు. కొన్ని కళాశాలలు కూడా తమ విద్యార్థులకు ఇక్కడకు ట్రిప్ కోసం తీసుకువెళుతుంటాయి. ఇక్కడి హోటల్స్, రిసార్టులు కూడా ప్రతి వర్గం కోసం అందుబాటు ధరల్లో అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నాయి.
ఉదరు పూర్
రాజస్థాన్లో సిటీ ఆఫ్ సన్ సెట్ గా పేరుగాంచిన ఉదరు పూర్ అటు విద్యార్థులతో పాటు ఇటు హనిమూన్ జంటలను కూడా బాగా ఆకర్షిస్తుంది. ఇందుకు ప్రధాన కారణం ఇక్కడ ఉన్నటువంటి సరస్సులే. ఏకాంతంగా గడపాలనుకొనే వారికి అనువైన వాతావరణంతో పాటు అడ్వెంచర్ టూర్ను ఇష్టపడే యువతకు కూడా ఈ ఉదరు పూర్లోని సరస్సులు మంచి అనుభూతిని కల్పిస్తాయి.
సిమ్లా
హనీమూన్ గురించి చెప్పుకునేప్పుడు సిమ్లా గురించి చెప్పకుండా ఉండలేము. ఎండాకాలంలో సైతం రొమాంటిక్ వాతావరణంతో స్వాగతం పలికే సిమ్లాలో ప్రకృతి అందాలు మిమ్మల్ని కట్టిపడేస్తాయి. ఓక్ చెట్ల సౌందర్యం, మంచుతో కప్పబడిన ప్రాంతాలు, విస్తారమైన లోయలను చూస్తుంటే అద్భుతమైన అనుభూతి మీ సొంతమవుతుంది. వేసవిలో ఇక్కడ ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్. హిమాలయ పర్వత సానువుల్లో భాగమైన ఈ నగరంలో ఒక్కొక్కసారి నాలుగు డిగ్రీల సెల్సియస్కు పడిపోతుంది. ఆ చల్లని వాతావరణాన్ని తనివి తీరా ఆస్వాదించవచ్చు. అయితే ఇక్కడి టారు ట్రైన్ ప్రయాణం మాత్రం అస్సలు మిస్ కావద్దు.
నైనిటాల్
ప్రకృతికి పుట్టినిల్లైన ఉత్తరాఖండ్లో నైనిటాల్ అప్పుడే పెండ్లయిన జంటలకు మధురమైన అనుభూతి కలిగిస్తుంది. చుట్టూ కొండలు, మధ్యలో సరస్సు అందులో సరదాగా బోటు షికారు చేస్తే ఎంత రొమాంటిగ్ ఉంటుందో ఓ సారి ఊహించుకోండి.
లక్షద్వీప్
పిల్లగాలితో అల్లరి చేయాలనుందా? చల్లని సముద్ర గర్భంలో దాగిన అందాలు చూడాలని ఉందా? అయితే లక్షద్వీప్ వెళ్లాల్సిందే. ఈ పగడపు దీవుల్లోని ప్రకృతి సౌందర్యం ఎంతో గొప్పగా ఉంటుంది. అరేబియా సముద్రంలో చెల్లాచెదురుగా ఉన్న ఈ ద్వీపాలకు దేశవిదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. మండు వేసవిలోనూ గరిష్ఠ ఉష్ణోగ్రత 35 డిగ్రీలు దాటదు. సాయంకాలం సాగర తీరంలో శీతల పవనాలు వీస్తుంటాయి. లక్షదీప్ 36 దీవుల సమూహం. ఇందులో 10 ద్వీపాల్లో మాత్రమే జనాలున్నారు. వీటిలో బంగారం, కడమట్, అగట్టి ద్వీపాలు చాలా బాగుంటాయి. ఒక ద్వీపం నుంచి మరో ద్వీపానికి వెళ్లడానికి ఫెర్రీలు ఉంటాయి. కయాకింగ్, వాటర్ స్కీయింగ్, విండ్ సర్ఫింగ్, స్కూబా డైవింగ్ వంటి సాహసక్రీడలకు వేదికలు ఈ ద్వీపాలు.
శ్రీనగర్లోని దాల్ సరస్సు
మనదేశంలో ఎవర్గ్రీన్ హనీమూన్ స్పాట్ శ్రీనగర్.. కొత్త దంపతులకు ఇది ప్రేమ్నగర్. మదిని పరవశింపజేసే దాల్ సరస్సు.. ఆ పక్కనే ఊసులు పంచుకోవడానికి షాలీమర్ తోట.. దాని చెంతనే హౌస్బోట్లతో నగీన్ సరస్సు.. ఈ ఉత్సాహం నుంచి తేరుకోకముందే తులిప్ తోట.. ప్రపంచంలోని ప్రకృతి అందాలన్నీ ఇక్కడే ఉన్నాయా..! అన్నటు ఉంటుంది ఈ ప్రదేశం. మనసులోని భావాలను పంచుకునేందుకు ఆలుమగలకు ఇంతకన్నా అనువైన చోటు ఎక్కడ దొరుకుతుంది చెప్పండి. అందుకే హనీమూన్ అనగానే టూరిస్ట్ ఆపరేటర్లు, ట్రావెల్ సంస్థలు కూడా ముందుగా కశ్మీర్ పేరే చెబుతారు. అందునా శ్రీనగర్ సౌందర్యం ప్రత్యేకమైనది. వేసవి ముహూర్తాల్లో ఒక్కటైన వారు.. మరింత దగ్గరవ్వడానికి ఇంతకన్నా మంచి ప్రదేశం మరొకటి ఉండదు.
డార్జిలింగ్
హనీమూన్కు పశ్చిమ బంగలో అనువైన చోటు డార్జిలింగ్. ఇక్కడికి యాభై కిలోమీటర్ల దూరంలో మరో అందమైన ప్రాంతం ఉంది. దాని పేరు కాలింపాంగ్. ఎత్తయిన కొండలు.. వాటిపై బౌద్ధారామాలు.. ప్రశాంతతకు చిరునామాగా ఉంటుందీ ఊరు. ఆమని రాకతో పర్వతాలన్నీ పచ్చటి దుప్పటి కప్పుకొని పసందుగా కనిపిస్తాయి. అరవిరిసిన ఆర్చిడ్ పూలు వసంతగాలికి వలపులు నేర్పిస్తాయి. తీస్తా నది తీరంలో విహారం, కొండల్లో లోయల్లో ప్రయాణం.. కాలింపాంగ్కు వెళ్లిన నూతన వధూవరులకు మధురమైన అనుభూతినిస్తాయి. పనిలో పనిగా పక్కనే ఉన్న డార్జిలింగ్నూ సందర్శించి రావొచ్చు.
Authorization