తొంభయవ దశకంలో సోవియట్ రష్యాలోని సోషలిస్టు ప్రభుత్వ పతనంతో సోవియట్లో భాగమైన మిగతా రిపబ్లిక్స్ కూడా స్వతంత్రం ప్రకటించుకున్నాయి. వాటిలో తాష్కెంట్ రాజధానిగా గల మధ్య ఆసియా దేశమైన ఉజ్బెకిస్థాన్ కూడా ఒకటి. 1991లో స్వతంత్రం ప్రకటించుకోక ముందు సోవియెట్లో భాగంగా వున్నప్పటి పరిస్థితికి, నేటి పరిస్థితికి మధ్య పోలికల్ని, అంతరాల్ని ఆసక్తికరంగా వివరిస్తూ అరణ్య కృష్ణ యాత్రా కథనం సాగింది.
ఉజ్బెకిస్థాన్ ముస్లిం మెజారిటీ దేశం. మంగోలాయిడ్, యూరోపియన్ మిశ్రమ జాతి. రష్యాకు, ఇండియాకు మధ్య మంచి స్నేహ సంబంధాలు వుండడం వల్ల అక్కడి ప్రజలలో భారతీయుల పట్ల గౌరవాభి మానాలు కనిపించడం మామూలే. విడిపోయిన ఉజ్బెకిస్థాన్లో కూడా అవే ఆదరాభి మానాలు కనిపించడం అరణ్యకృష్ణకు ఆశ్చర్యం కలిగించాయి. ఆహారప్రియులైన ఉజ్బెక్లు మనిషిని తప్ప భూమ్మీద తిరిగే అన్ని రకాల జంతువుల మాంసం తింటారని అక్కడి గైడ్ గొప్పగా చెప్పుకుంటాడు.పశుసంపదకు, డ్రైఫ్రూట్స్కు పేరు గాంచిన ఉజ్బెకిస్తాన్లో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ బాగుంది. సెక్యూరిటీ సర్వీస్ తక్కువ భద్రత ఎక్కువ. అక్కడ టూ వీలర్స్ నిషేధం. అందరికీ కార్లు వుంటాయి. ఏ కారునయినా సరే ఆపి బస్సు ఛార్జీతో అందులో ప్రయాణించవచ్చు. అక్కడ పెట్రోలు లీటరు ముఫ్పై రూపాయలే. అతి సంపద ప్రదర్శన అక్కడ కనిపించదు. కాని కనీస ప్రమాణాలకు లోటు లేదు. ఎంతో పరిశుభ్రంగా, ప్రశాంతంగా వుందీ నగరం? ప్రజలెంత ఆహ్లాదంగా ప్రశాంతంగా, సౌందర్య వంతంగా వున్నారు? అని మన పర్యాటకుడు ఆశ్చర్యపోతాడు.
ఉజ్బెకిస్థాన్ చూసిన పర్యాటకుడికి మార్క్సిస్టు సోషలిజం ఎంత గొప్పదో అర్ధమైందట. కాని అక్కడి ప్రజలు స్వతంత్రం పొందాక కమ్యూనిజంకు దూరం కావడం, దాన్ని అసహ్యించుకోవడం అరణ్య కృష్ణకు నచ్చలేదు. మేడేను రద్దు చేసి ఫాంటయిన్ డేను జరుపుకోవడం కూడా పర్యాటకుడికి నచ్చలేదు. అసలు వాళ్ళేం కోల్పోతున్నారో వాళ్ళు గుర్తించడం లేదని పర్యాటకుడు వాపోవడం 'కందకు లేని దురద' సామెతను గుర్తుకు తెస్తుంది. నిజానికి కమ్యూనిస్టు పాలనలో ఒకసారి, స్వతంత్రం పొందిన తర్వాత మరోసారి ఆ దేశాన్ని చూసినప్పుడే - ఆ దేశం గురించి, అక్కడి ప్రజల పోకడల గురించి ఒక నిర్ధారణకు రాగలుగుతాం. అంతే తప్ప ఫిక్స్డ్ అభిప్రాయాలతో, తెచ్చి పెట్టుకున్న కళ్ళద్దాల నుండి చూస్తే వాళ్ళు పతనమవుతున్నట్టే కనిపిస్తుంది. మన కంటే వేయి రెట్లు మంచి వాతావరణంలో హాయిగా సుఖంగా సంతోషంతో బతుకుతున్న ఉజ్బెక్ వాసులను చూసి మనం ఈర్ష్య పడాలి తప్ప జాలి పడకూడదు.
Authorization