- దేశభక్తులు నడయాడిన నేలపై...
''మేఘాలలో తేలిపోమ్మన్నది...'' అనే ఓ సినీగేయం స్ఫురణకు రాగా.. ఇండిగో విమానం 31 వేల అడుగుల ఎత్తులో మేఘాలలో ఎగురుతూ గంటకు 500 కి.మీ వేగంతో దూసుకెళ్తుంది. ఇండిగో కెప్టెన్ మంద్ర స్వరంతో వివిధ భాషలలో హైద్రాబాద్ ఇంకా రెండు గంటల సమయం పడుతుందని సూచనలు చేస్తున్నాడు. కిటికిలో నుండి చూస్తే ఎక్కడ చూసిన మేఘాలు తప్ప కింద భూభాగం ఛాయలు కనబడటం లేదు. ఓ పావుగంట ముందు దృశ్యం నా మదిలో లీలగా.. అలలు అలలుగా.. స్వర్గలోకపు ద్వీపాలు కనుమరుగు కాగా.. అండమాన్ అందమైన యాత్ర స్ఫురణకు వచ్చే వేళ నిద్ర పట్టేసింది. కలలోనే నా హృదయం చిత్రించిన మధురమైన ఆరు రోజుల యాత్ర గురించి రాయడం మొదలైనది.
''అందమంత యుండె అండమాన్ నందే
ఇంద్రలోక మందు ఇన్ని యుండునా
హావ్లాక్ ఐలాండ్ నందు ఆనందమెంతయో
నీల్ ఐలాండ్ నందు నేత్రాలు చాలవు
అపార జలరాశిలోన అద్భుతాలెన్నో
సముద్ర అలల కెరటాల కన్న
అండమానుల జీవన విధానంబు లెస్స
కరడు గట్టిన హృదయాలను సైతం కరిగించు
సెల్యులర్ జైలు గోడల మౌనవేదన...''
ఆ రోజు (2019, మార్చి1) ఉదయం 6:45 గంటలకు ఇండిగో విమానం హైద్రాబాద్ నుండి చెన్నరు మీదుగా అండమాన్ వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నది. నాకూ, మా ఆవిడకు మొదటిసారి విమాన ప్రయాణం వల్ల కాబోలు థ్రిల్గా అనిపించింది. కిటికి పక్కన కూర్చోడానికి పోటీ పడ్డాం. మా పెద్దబ్బాయి, కోడలు హనిమూన్కు ఇటీవలే ఇండోనేషియా 'బాలి'కి వెళ్ళిన అనుభవం వల్ల చాలా నింపాదిగా మాకు సూచనలు చేస్తున్నారు. రాజీవ్ గాంధీ విమానాశ్రయం నుండి చెన్నరు మీదుగా అండమాన్కు ఇండిగో పరుగులు పెడ్తుంది. కిటికిలోంచి కిందికి చూస్తే చిన్న చిన్న ఐలాండ్లు ముద్దు ముద్దుగా పచ్చిక బయళ్ళతో కనబడసాగాయి.
ద్వీపాల సమూహం
అండమాన్ 572 చిన్న చిన్న ద్వీపాల సమూహం. మొత్తం విస్తీర్ణం 8250 చ||కి.మీ. జనాభా సుమారు 3.80 లక్షలు. దీని రాజధాని పోర్ట్ బ్లేయర్. జీవన సంచారం లేని ద్వీపాలు 37 ఉన్నాయి. వాటిలో ఒకటి ప్రమాదకరమైన సెంటినరి దీవి. వీరసావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం చిన్నదిగా వుండటం వలన పైలట్ చాలా జాగ్రత్తగా విమానాన్ని ల్యాండ్ చేసాడు. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఫ్లైయిట్, హౌటల్, పెర్సీ(షిప్) ఆన్లైన్లో మూడు నెలలు ముందుగానే రిజర్వు చేసుకుంటే ఖర్చులు కలిసివస్తాయి. అలాగే ఐలాండ్లో అద్దెకు తీసుకున్న స్కూటర్లపై అన్ని బీచులు తిరిగి రావచ్చు. అండమానులో ఎక్కడా రవాణా సౌకర్యం, భాషతో కాని ఎలాంటి ఇబ్బంది లేదు. టీఎస్జీ హౌటల్ విమానాశ్రయం పక్కనే ఉంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన వాహనదారుడు అండమానులో చూడవలసిన అన్ని ప్రదేశాలు తక్కువ ఛార్జీతో చూపించాడు. వాటిలో ముఖ్యమైనవి చిత్తం బ్రిడ్డి, పురాతన కోత యంత్రం, జర్మన్ల బంకర్, అక్వేరియం, అంత్రోపాలజీ మ్యూజియం, కార్బోకోవ్ బీచ్, సుభాష్ చంద్రబోస్ త్రివర్ణ పతాకం ఎగురవేసిన స్థలం, సెల్యూలార్ జైలు, ఆడియో ప్రదర్శన.
చెక్కుచెదరని నిర్మాణాలు
జర్మన్ల దాడిలో చిత్తం బ్రిడ్జి నాశనం కాగా అండమానులు పునర్నిర్మించుకొన్న చిత్తం బ్రిడ్డిని చూడవచ్చు. బ్రిటిష్ వాళ్ళు నెలకొల్పిన అప్పటి కర్రకోత యంత్రాలను, అండమాను కర్రతో చేసిన నిర్మాణాలు ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా వాడుకలో ఉన్నాయి. అక్కడే ఉన్న జర్మన్ల బంకర్ను కూడా చూసాం. అక్వేరియంలో సముద్రంలోని అద్భుత దృశ్యాలతో పాటు సముద్రంలో దొరికే పగడాలు, ఆల్చిప్పలు, ముత్యాలు చూడవచ్చు. అంత్రోపాలజీ మ్యూజియంలో అండమానుల జీవన విధానం, స్థితిగతులు బ్రిటిష్వారు రాక ముందు, వచ్చిన తర్వాత అభివృద్ధిలో భాగస్వామ్యం, ఆహారపు అలవాట్లు, వారి నివాసం గమనించాం. సెంటినరీ ద్వీపం గురించి కూడ ఇక్కడ తెలుసుకోవచ్చు. వారు విల్లంబులతో 1 కి.మీ వరకు గురి చూసి కొట్టగలరని అక్కడున్నతను చెప్పాడు. తర్వాత స్థానిక బీచ్ కోర్బోకోవ్ వెళ్ళాం. అక్కడ చిన్న చిన్న వాటర్ స్పోర్ట్స్ జరుగుతున్నాయి.
సెల్యూలర్ జైలు
అక్కడ నుండి అతి ముఖ్యమైన సెల్యూలర్ జైలుకు వెళ్ళాం. అండమాన్ యాత్రలో సెల్యూలర్ జైలు తప్పక చూడాల్సిన ప్రదేశం. అలాగే మ్యూజికల్ డాక్యుమెంటరీ. సెల్యూలార్ జైల్ లోపలి భాగాలను చూస్తూ అప్పటి బ్రిటిష్ పాలకుల కఠిన శిక్షలను గైడ్ సహాయంతో తెలుసుకున్నాం. ఇక ఆడియో ప్రదర్శన సాయంత్రం 7:30 నుండి 8:30 వరకు హిందీలో సీనియర్ చిత్ర కథానాయకుడు ఓంపురి వాయిస్తో గంటసేపు సాక్షి భూతంగా నిల్చొనివున్న మర్రి చెట్టు స్వగతంగా మంద్ర స్వరంతో వేదనా భరితంగా సెల్యూలర్ గోడల సంగీత దృశ్య కావ్యం మనల్ని 1974కు ముందు స్వాతంత్య్రోద్యమ కాలానికి తీసుకెళ్ళి మన హృదయాన్ని ఆర్ద్రం చేస్తుంది.
పకడ్బందీ నిర్మాణం
సెల్యూలర్ జైలు అనగా ఒక్కొక్క సెల్లో విడివిడిగా ఖైదీలను బంధించడం. ఆసియాలోనే అతిపెద్దదైన ఈ జైలు 1896 నుండి 1906 వరకు కట్టారు. ఇందులో రాజకీయ ఖైదీలను మాత్రమే ఉంచేవారు. మూడంతస్థుల పకడ్బందీ నిర్మాణం ఇది. మొత్తం ఏడు వింగులుగా 696 గదులు ఉన్నాయి. విశ్రాంతి తీసుకోవడానికి గానీ, తప్పించుకోవడానికి గానీ అణువంతైన ఆస్కారం లేని రీతిన నిర్మించారు. ఈ జైలును ఖైదీలతోనే నిర్మించి ఆ ఖైదీలనే అందులో బంధించారు. దీని నిర్మాణానికి అయిన ఖర్చు 5,17,352 రూపాయలు. జైలు గది బలమైన ఇనుపరాడ్లతో లాక్ చేయబడి, సెంట్రీ మాత్రమే తీసే విధంగా నిర్మించారు. ఖైదీ పొరపాటున రూం నుండి తప్పించుకున్నా ఆ ఖైదీ బంగాళఖాతం ద్వారానే బయటకు వెళ్ళగలడు. ఎటు చూసిన 1000 కి.మీ వరకు సముద్రం విస్తరించి ఉంటుంది. అందువల్ల ఖైదీ అందులో పడి మరణించడమో లేదా పట్టుబడటమో జరుగుతుంది. రికార్డుల ప్రకారం ఈ జైలు నుండి 1868లో 238 మంది సముద్రమార్గం నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయగా వారిలో 87 మంది ఉరితీయబడ్డారు.
నేషనల్ మెమోరియల్ భవనంగా...
మూగ వేదన, చిత్రహింసలు, మానవీయ హక్కులను హరించిన సెల్యూలర్ జైలు స్వాతంత్య్రోద్యమాన్ని స్ఫురించే ఓ నిలువెత్తు కట్టడంగా గుర్తించడమైంది.1943, డిసెంబర్ 3న సుభాష్చంద్రబోస్ మొదటి సారిగా అండమాన్లో త్రివర్ణ పతాకం ఎగురవేసి సెల్యూలర్ జైలులోని ఖైదీలందరిని విడుదల చేశారు. ఆ స్థలంలో మేము ఫొటోలు దిగి కొంత ఉద్విగతకులోనయ్యాం. 1979లో మొరార్జీదేశారు జైలును 'నేషనల్ మెమోరియల్ భవనం'గా ప్రకటించారు. అప్పటి నుండి ఒకప్పటి భయంకరమైన జైలు యాత్రాస్థలమై స్వాతంత్రోద్య మంలో పాల్గొన్న నాయకుల గాథలు కళ్ళకు కట్టినట్లు సంగీత రూపకమై మనసులను పిండేస్తుంది. సాక్షిభూతమైన మర్రిచెట్టు మాత్రం సెల్యూలర్ మూగవేదనను వినిపిస్తూనే ఉంది.
హావ్లాక్ ఐలాండ్
మరుసటి రోజు హావ్లాక్ ఐలాండ్ చేరడానికి ఫెర్రీ షిప్ ఎక్కాం. ఫెర్రీ పూర్తిగా ఎయిర్ కండీషన్డ్. చుట్టూ సముద్రం చూడముచ్చటగా ఉంది. అక్కడక్కడ బ్రిటిష్ వాళ్ళు కట్టించిన నిర్మాణాలు కనిపిస్తాయి. దీవులన్నీ దట్టమైన అడవులతో ప్రకృతి రమణీయంగా గోచరిస్తాయి. అండమాన్ నుండి ఓ గంటలో హావ్లాక్ చేరుకున్నాం. అండమాన్లో లభించే కర్ర 'పాడాక్' మన టేకు కర్ర కంటే పటిష్టంగా, అందంగా ఉండి వంద ఏండ్లకు పైనే మన్నికగా ఉంటుంది. హావ్లాక్లో రెండు రోజులు ఉన్నాం. రాధానగర్ బీచ్, హెలిపెంట్ బీచ్, కాలాపత్తర్ బీచ్లు ఎంతో చూడముచ్చటగా ఉన్నాయి. రాధానగర్ బీచ్ (ఆసియాలోనే టాప్ బీచ్)లో సూర్యాస్తమయం చాలా అద్భుతంగా ఉంటుంది. ఐలాండ్ తిరగడానికి స్కూటర్లు అద్దెకు దొరుకుతాయి. అద్దె రోజుకు 500 రూపాయలు. ఒక లీటరు పెట్రోలు పోసి ఇస్తారు. ఐలాండ్ మొత్తం హాయిగా తిరిగి రావొచ్చు. సముద్రం పక్కన నైట్ డిన్నర్ ఎగ్జయింట్గా ఉంది.
సముద్ర అందాలు
తర్వాతి రోజు చిన్న బోట్లో ఒక్కొక్కరికి 950 రూపాయలు తీసుకొని ఎలిఫెంట్ బీచ్కు తీసుకెళ్ళారు. బీచ్లో స్నూక్లింగ్, సీవాక్, బైక్ రైడింగ్ వంటి వాటర్ స్పోర్ట్స్ ఉంటాయి. అన్ని స్పోర్ట్స్ కలిసి 3,500 రూపాయలు. సీవాక్ అద్భుతంగా ఉంటుంది. ఆక్సిజన్ మాస్క్ వేసి గ్రూపుల వారిగా 25 ఫీట్ల లోతున సముద్ర అందాలను చూపిస్తూ ఫొటోలు, వీడియోలు తీస్తారు. సముద్రంలో తిరిగే అందమైన చేపలు, వృక్షజాతులు, ఆల్చిప్పలు, అత్యద్భుతంగా కనువిందు చేస్తాయి. ఇది ఎవరూ మిస్ కాకూడదు.
ఫెర్రీలో షికారు
సాయంత్రానికి కాలాపత్తర్ బీచ్కువెళ్ళాం. మరుసటి రోజు ఫెర్రీలో ఒక గంట ప్రయాణం చేసి నీల్ ఐలాండ్కు చేరుకొన్నాం. ఇక్కడ కోకోనట్ బీచ్, సీతాపుర్ బీచ్, నాచురల్ బ్రిడ్జ్, లక్ష్మీపూర్ బీచ్లు స్కూటర్లపై తిరిగి చూశాం. నాచురల్ బ్రిడ్జ్ సహజంగా రాళ్ళతో ఏర్పడిన వంతెన. ఆ రాళ్ళు చూడటానికి ముచ్చటగా ఉంటాయి. అండమాన్ ప్రభుత్వం అక్కడి బీచ్లను కాలుష్యమవ్వకుండా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది. నీల్ ఐలాండ్లో రాత్రి బస చేసి తర్వాత అండమాన్కు వచ్చి ఉండూరు బీచ్, మైరైన్ మ్యూజియం చూశాం. దారిలో 2004లో వచ్చిన సునామీ దృశ్యాలు మనసును కలిచి వేశాయి. మొత్తానికి ఈ యాత్రను ఓ అద్భుత యాత్రగా అభివర్ణించవచ్చు. తక్కువ ఖర్చుతో(40వేలు ఒక్కొక్కరికి) వెళ్ళి రావచ్చు. అండమాన్ ఓ ప్రకృతి రమణీయ స్థలమే కాదు దేశభక్తులు నడయాడిన నేల.
Authorization