హిమాలయాల నుంచి వీచే స్వచ్ఛమైన గాలి, నీలి ఆకాశం, పసుపు రంగులో అలరించే అడవులు, తోటలు, మూన్లైట్ శాలువ చుట్టినట్టు పర్వతాలు, పర్వతాల మధ్యలో ఉండే సన్నని రహదార్లు, కోయిల కుహు కుహూ రాగాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కకు మించిన అందాలు. కనులకు విందుచేసే సోయగాలు. పచ్చని ప్రకృతి ఒడిలో సేదదీరేందుకు చక్కని ప్రదేశం ఎక్కడ దొరుకుతుంది. అంటే కచ్చితంగా పాలంపూర్లోనే అని చెప్పవచ్చు. మరి అంతటి అందాల గురించి మనమూ తెలుసుకుందామా...
ప్రకృతి ప్రేమికులను ఆకర్షించే పర్యాటక ప్రదేశాలలో హిమాచల్ ప్రదేశ్ ఒకటి. అక్కడి సహజసిద్ధమైన అందాలు నిత్యం సుదూర ప్రాంతాలవారిని సైతం రా రమ్మంటూ ఆహ్వానిస్తాయి. మనసును దోచే ప్రాంతాలు హిమాచల్లో ఎన్నో ఉన్నాయి. వాటిలో పాలంపూర్కు ఓ ప్రత్యేకత ఉంది. ఎవరినైనా ఇట్టే కట్టిపడేసేలా చేస్తుంది ఈ ప్రాంతం.
అందమైన ప్రదేశాలు
హిమాచల్లోని కాంగ్రా వ్యాలీ. ఇక్కడి అహౌల్దార్ సర్వ్యూట్లోని ఓ అందమైన ప్రదేశమే పాలంపూర్. స్థానిక భాషలో నీటి వసతి సమృద్దిగా వున్న ప్రదేశాన్ని 'పాలం' అని అంటారు. పూర్వం ఈ ప్రాంతం 'జలంధర' రాజ్యంలో వుండేది . కొండలమీంచి అడుగడుగునా ప్రవహిస్తున్న సెలయేళ్లని చూసిన తరువాత స్థానికులు పాలం అని పిలుస్తున్నారు. పాలంపూర్కి దగ్గరౌతున్నకొద్దీ పెద్ద పెద్ద పైన్ వృక్షాలు, కొండవాలులలో పెరుగుతున్న 'తేయాకు తోటలు' కనువిందు చేస్తాయి. మంచుతో కప్పబడిన పర్వతాలు అహౌల్దార్ పర్వతాల్లో భాగం. బేజ్ నాథ్ మందిరం, పారాగ్లైడింగ్, మొత్తం ప్రపంచంలోనే ప్రసిద్ధమైన బీడ్ బిల్లింగ్ ఇక్కడి ప్రత్యేకతలు.
టారుట్రైన్
కాంగ్రా వ్యాలీలో నడపబడుచున్న టారుట్రైన్ ద్వారా పాలంపూర్లోని చాలా ప్రదేశాలను వీక్షింవచ్చు. వేసవి సెలవులను ఎంజారు చేయడానికి ఇది ఎంతో అనుకూలమైన ప్రదేశం.ఈ ప్రదేశాన్ని మనసారా ఆశ్వాదించాలంటే కనీసం వారం రోజులైనా పడుతుంది. ఢిల్లీ నుండి పాలంపూర్కు సుమారు 530 కిలోమీటర్లు ఉంటుంది. పాలంపూర్ ఓ చిన్న పట్టణం. మిలిటరీ కంటోన్మెంటు వున్న ప్రదేశం. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే ఉత్తర భారత దేశపు 'డార్జిలింగ్' అని చెప్పుకోవచ్చు.
తేయాకు పంటలు
పాలంపూర్లో పండే తేయాకు మనదేశంలోనే అతి మేలైన రకంగా గుర్తించారు. 1849లో మొదటి సారిగా'ఆల్మోరా' నుంచి తేయాకును తెచ్చి ఈ ప్రాంతంలో వేసేరు. అప్పటి నుంచి ఇక్కడి తేయాకు ప్రముఖ పంటగా పేరు తెచ్చుకుంది. తేయాకు తోటల్లో విహరిస్తూ ఆ అందాలను మన కెమేరాల్లో బంధిస్తుంటే ఆ ఆనుభూతే వేరు.
పచ్చిక మైదానాల్లో అహ్లాదకరంగా...
ఓ వైపు ఆకాశాన్ని అంటుకుంటున్నట్టు మంచుతో కప్పబడిన పర్వతాలు. గలగల ప్రవహిస్తున్న జలపాతాలు. మరో వైపు పచ్చిక మైదానాలతో ఆ ప్రాంతం ఎంతో అహ్లాదకరంగా వుంటుంది. ఎనభైల తరువాత ఈ ప్రాంతం ప్రాముఖ్యతను సంతరించుకుంది. దీన్ని ప్రముఖ పర్యాటక స్థలంగా రూపొందించే క్రమంలో ' కేబుల్ కారు' , 'ఎంమ్యూజ్ మెంటు పార్కులు' నిర్మించారు. పర్యాటకులు ప్రశాంతకంగా సేదతీరుటకు ఆహ్లాదమైన సౌకర్యాలు, భోజన సదుపాయాలు సైతం ఏర్పాటు చేశారు.
ప్రపంచ ప్రసిద్ధి పారాగ్లైడింగ్
పాలంపూర్లోని 'పారాగ్లైడింగ్' ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రాంతం అని చెప్పడానికి 2015లో ఇక్కడ నిర్వహించిన 'ప్రపంచ పారా గ్లైడింగ్' పోటీలే సాక్షం. పాలంపూర్ పర్యాటక స్థలంగానే కాక ప్రముఖ విద్యాకేంద్రం కూడా. ఉత్తర భారతదేశ లో ప్రధమస్థానంలో నిలిచిన ఆయుర్వేద కళాశాల, అనుబంధంగా ఆయుర్వేద ఆసుపత్రి కూడా ఇక్కడ వున్నాయి. అలాగే అగ్రికల్చర్ యూనివర్సిటీ కూడా ఉంది.
జలపాతాలు...
పాలంపూర్ నగర శివార్లలో 'నౌగల్' సెలయేరు ఎత్తయిన పర్వతాలమీదుగా జారుతూ పర్యాటకులకు కనువిందు చేస్తుంది. అక్కడి నుండి ఓ వంద మీటర్ల దూరంలో వున్న 'బుంద్లా' జలపాతం, దానికి ఆనుకొని 'కెప్టెన్ సౌరబ్ సింగ్ కాలియా' పేరు మీద నిర్మించిన ' సౌరబ్ వన్ విహార్' ని సందర్శించ వచ్చు .
అరుదైన ఫల వృక్షాలు
పాలంపూర్లో అడుగడుగునా కనిపించే 'ఖుమాని' ఫలవృక్షాలు కనువిందు చేస్తాయి. ఈ జాతి వృక్షాలు జమ్ము - కశ్మీరులోని శ్రీనగర్ లోయలోను, పాలంపూర్లోనూ పెరిగే అరుదైన ఫలజాతి. బాగా పండిన పళ్లు పసుపు రంగులో కాస్త పెద్ద రేగుపండు సైజులో వుంటాయి
హెరిటేజ్ విలేజ్
హిమాచల్ హెరిటేజ్ విలేజ్ పచ్చని ప్రకృతి నడుమ ఉన్న ఓ అందమైన గ్రామం.పాలంపూర్కు కూతవేటు దూరంలో ఈ విలేజ్ ఉంది. పర్యాటకులు చాలామంది అక్కడే విడిది చేసేందుకు ఇష్టపడతారు. హిమాచల్లో ఉండే ప్రజల జీవన విధానాన్ని దగ్గర నుంచి చూడాలనుకునే వారికి ఈ ప్రదేశం అనువైనది. అందుకనే ఆ గ్రామాన్ని ఎంచుకుంటారు. అక్కడ రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు దూరంగా కనిపించే ఇళ్లను చూస్తే బొమ్మరిళ్ళ మాదిరిగా ఎంతో అందంగా కనిపిస్తాయి. పర్యాటకులు అక్కడి స్థానిక ఇళ్ళల్లో కొన్నిరోజులు ఉండి వాళ్ల ఆచార - వ్యవహారాలు, ఆహార పద్ధతులతోపాటు దినచర్య ఏంటో పరిశీలిస్తూ ఉంటారు. అందుకే హిమాచల్ హెరిటేజ్ విలేజ్ గురించి వివరించేందుకు నిత్యం స్థానిక గైడ్లు అందుబాటులో ఉంటారు.
బేజనాథ్ మందిరం
అక్కడికి దగ్గరలోనే అతి పురాతనమైన బేజనాథ్ మందిరం ఉంది. ఆ ఆలయ నిర్మాణశైలి సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. దాంతోపాటు పారాగ్లేడింగ్, బీడ్ బిల్లింగ్, కాంగ్రావ్యాలీ ప్రాంతాలను ఒక్కొక్కటిగా టారుట్రైన్లో ప్రయాణిస్తూ చూడొచ్చు.
పక్షుల కిలకిలారావాలతో ఉదయం నిద్రలేస్తే ఆ అనుభూతులు మాటల్లో చెప్పలేము. లేలేత సూర్యకిరణాలు అడవిని చీల్చుకుంటూ మన గది కిటికీలను తాకినట్లు అనిపిస్తాయి. ఆ క్షణాలను మాటల్లో వర్ణించడం కష్టమే. ఆ అందమైన క్షణాన అలసట ఒక్కసారిగా ఎగిరిపోతుంది. ప్రకృతి సోయగాలు మది నిండా నింపుకొని ఆ క్షణం అలాగే ఆగిపోతే బాగుండూ అనేంతగా అందంగా ఉంటుంది. ఇంతటి అందాన్ని, ఆనందాన్ని అనుభవించాలంటే మీరు కచ్చితంగా హిమాచల్ ప్రదేశ్లోని పాలంపూర్కి వెళ్ళ వలసిందే. మరికెందుకు ఆలస్యం. ఈ వేసవి సెలవుల్లో ప్లాన్ చేసుకోండి.
Authorization