హైదరాబాద్ నగరం నిర్మాణం ఇంకా జరగని సమయంలోనే శత్రుదుర్భేద్యంగా నిర్మాణమై కాకతీయులు, బహమనీ సుల్తానులు, కుతుబ్షాహీలు, మొగలులు, అసఫ్జాహీలు పాలించిన అద్భుతమైన కోట గోల్కొండ కోట. దాదాపు 8 శతాబ్ధాల ఘన చరిత్రను తనలో ఇముడ్చుకున్న కోట. మన భాగ్యనగరం హైదరాబాద్ నడిబొడ్డులో స్వర్ణ కవచంలా నేటికీ ఠీవీగా నిలబడి వున్న కోట 'గోల్కొండ కోట'.
కోటకు ప్రధాన ద్వారాలుగా 8 సింహ ద్వారాలున్నాయి. వీటన్నిటితోపాటు పొడవైన రాజ దర్బారులు, మసీదులు, దేవాలయాలు, అశ్వ గజశాలలు కోటలో కొలువైవున్నాయి. ఇంతటి ఘన చరిత్ర కలిగిన గోల్కొండ కోట నిర్మాణానికి దాదాపు 62 సంవత్సరాలు పట్టింది. సింహ ద్వారాన్ని ఫతే దర్వాజ అని అంటారు. 'ఫతే' అనగా 'విజయం' అని అర్థం. 'ఫతే దర్వాజ' నుండే కోట లోపలికి ప్రవేశించవచ్చు. కోట మొత్తాన్ని కూడా కప్పుతూ కవచంలా వుంటే గోడ 'బాలాఇసా గోడ' దీనినే కర్టెెన్ వాల్ అని కూడా పిలుస్తారు. అయితే ఇక్కడికి శత్రు సైనికులు చేరుకోవాలంటే మృత్యువుతో చెలగాటం లాంటిది. ఇక్కడి నుండే ఫతే దర్వాజా వరకు సైనికులు హెచ్చరికగా చప్పట్లు కొట్టేవారు. ఈ శబ్ధం కోట అంతా మారుమ్రోగి శత్రువుల రాకకు హెచ్చరికగా భావించేవారు.
వజ్రపు వ్యాపారానికి చిహ్నంగా: ప్రతి ద్వారం దగ్గర ఒక ఇనుప దర్వాజా వుంది. వీటి ఎత్తు సుమారు 24 అడుగులు. ఇక్కడి ప్రతి నిర్మాణాల్లో వజ్రపు ఆకారపు సముదాయాలు కనిపిస్తాయి. ఇది నాటి గోల్కొండ సామ్రాజ్యంలో వైభవంగా జరిగిన వజ్రపు వ్యాపారానికి చిహ్నంగా నిలుస్తాయని చరిత్రకారుల అంచనా. ఈ సముదాయం నుండే 300 మెట్ల వరకు పైకి ఎక్కితే 'బారాదరి'కి చేరుతాం. 800 ఏళ్ళ నాటి ఈ నిర్మాణ కౌశలాన్ని చూస్తే ఒక అద్భుతంలా అనిపిస్తుంది. ప్రతి కట్టడం పర్షియన్, ఇస్లామిక్ నిర్మాణ నైపుణ్యంతో ఉంటూ శిల్పుల అద్భుత ప్రతిభకు తార్కాణంగా నిలుస్తుంది.
అన్నీ రాతి నిర్మాణాలే: గోల్కొండ కోటలో దాదాపు 5 మంచినీటి బావులున్నాయి. ఈ బావులన్నీ కూడా గ్రానైట్తో నిర్మించినవే. వీటి నిర్మాణాల కోసం వాడిన పనిముట్లు మనకు ఇప్పటికీ దర్శనమిస్తాయి. రాజ దర్బార్కు చేరుకోవడానికి ఈ కోటలో మూడు మార్గాలు వేర్వేరుగా నిర్మించబడ్డాయి. మొదటి దాని గుండా వెళితే మనం నేరుగా రాజ దర్బారు వరకు వెళ్తాము. అలాగే రెండో దారి.. సేవకుల దారి ఈ దారిలో వెళ్తుంటే సైనికుల నివాస గృహాలు కనబడతాయి. ఇవన్నీ రాతి నిర్మాణాలే. ఈ దారిలోని మెట్లు కొంచెం తికమకగా వుంటూ శత్రువులకు అర్థం కానివిధంగా అయోమయంగా వుంటాయి. ఈ ప్రాంతంలో వున్న ఇనుప కడ్డీ సుమారు 240 కిలో బరువు కలది. దీన్ని ఎత్తి తక్కెడలో పెట్టగలవారిని మాత్రమే సైనికులుగా ఎంపిక చేసేవారు.
కళా మందిరాలు: కోటలో వున్న అనేక రాజమందిరాలు, రాణీ వాసాలు, ప్రత్యేక వసతి గృహాలు చాలా ప్రత్యేకమైనవి. ఇందులో భాగమతి మందిరం ఒక్కటే మొగలుల దాడి తరువాత కొంచెం కళ తప్పింది. కానీ వాటి ఆనవాళ్ళు మాత్రం పదిలంగా వున్నాయి. ఆరోజుల్లోనే రాణులకోసం స్నానపు గదులను బాత్టబ్స్ వంటివి నిర్మించారు. కోట బయట రెండు వేర్వేరు మండపాలు వున్నాయి. అవే 'తారావతి, ప్రేమావతి' మందిరాలు. కళాకారులు నృత్య ప్రదర్శన ఇచ్చే మందిరాలే ఈ కళామందిరాలు. అలాగే రాజులు అత్యవసర పరిస్థితుల్లో తప్పించుకోవడానికి రహస్య మార్గాలున్నాయి. ఈ రహస్య మార్గం గోల్కొండ నుండి చార్మినార్ వరకు వుంది. రాజ దర్బార్కు సమీపంగా ఆయుధ భాండాగారాలున్నాయి. వీటిలో మందుగుండు సామగ్రి, తోపులు భద్రపరిచేవారు. మందు గుండు సామగ్రిని భద్రపరచుటకు దాదాపు 150 గదులున్నాయి. ఇలాంటి అనేక విశేషాలు గోల్కొండ కోట నిండా అనేకం. ఇది దేశంలోనే ప్రత్యేకమైన కోట.
వైభవాన్ని కాపాడేందుకు: కోటలో పర్యాటకులకు ఆకర్షించడానికి సౌండ్ అండ్ లైట్ షోని ప్రతినిత్యం ప్రదర్శిస్తున్నారు. రాష్ట్ర పర్యాటకశాఖ ద్వారా రూపొందించిన ఈ షో ద్వారా 'గోల్కొండ కోట' చారిత్రక వైభవాన్ని వేలాదిమందికి తెలియజేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ కోట వైభవాన్ని కాపాడటానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. ప్రభుత్వానికి చెందిన అన్ని శాఖలు కోట రక్షణకు నడుం బిగించింది. నిత్యం వేలాదిమంది సందర్శించే 'గోల్కొండ కోట' తెలంగాణ చరిత్రకు మణిహారం వంటిదని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
Authorization