ఉత్తర భారతదేశంలో గౌహతి తరువాత మరో ముఖ్యమైన నగరం త్రిపుర రాజధాని అగర్తలా. విస్తీర్ణంలో అయినా, జనాభా ప్రాతిపదికన చూసినా అగర్తలా ఈ ప్రాంతంలోని రెండో అతి పెద్ద నగరం. బంగ్లాదేశ్ నుంచి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో వుండే అగర్తలా ఓ సాంస్కృతిక కేంద్రం. పశ్చిమ త్రిపురలో వుండే అగర్తలా గుండా హరోవా నది ప్రవహిస్తుంది. ఈ నగరంలో వినోద, సాహసం, సంస్కృతుల సంగమం అని చెప్పుకోవచ్చు. ఫల, పుష్ప జాతులు పుష్కలంగా ఉండడంతో అగర్తలా పర్యాటకం చాలా ఆహ్లాదకరంగా, ఆసక్తి కరంగా వుంటుంది.
రాష్ట్ర రాజధాని అయినప్పటికీ భౌగోళికంగా కూడా మిగిలిన నగరాల కంటే అగర్తలా కొంత భిన్నంగా ఉంటుంది. బంగ్లాదేశ్ వరకు విస్తరించి వుండే గంగా, బ్రహ్మపుత్ర మైదానానికి పడమటి వైపు నెలకొని వుంది ఈ నగరం. అగర్తలాలో పుష్కలంగా వుండే అటవీ ప్రాంతం కూడా దీని అందాన్ని మరింత పెంచింది. రాష్ట్ర రాజధాని అయినప్పటికీ అగర్తలా చాలా ప్రశాంతంగా వుంటుంది. అన్ని నగరాల్లో ఉండే మాదిరిగా ఇక్కడ పెద్ద హడావిడి వుండదు. ప్రశాంత వాతావరణం వల్ల మన సెలవు దినాన్ని సంస్కృతి, ప్రకృతిల నడుమ గడిపేయవచ్చు.
అగర్తలా చరిత్ర
19 వ శతాబ్దంలో ఉదయపూర్లోని రంగమతి నుంచి మాణిక్య వంశపు రాజధానిని మహారాజ కృష్ణ మాణిక్య ఇప్పటి అగర్తలాకు మార్చిన తరువాత ఈ నగరం ప్రాచుర్యంలోకి వచ్చింది. రాజ్యానికి నిరంతరం కుకి ల దాడి బెడదగా మారాక రాజధానిని మార్చారు. అప్పటి పొరుగు రాజ్యమైన బ్రిటిష్ వారు బెంగాల్తో సత్సంబంధాలు కలిగి ఉండాలనే కారణంతో కూడా మహారాజు రాజధానిని మార్చారు. 1940 లలో మహారాజ బీర్ బిక్రం, కిషోర్ మాణిక్య బహదూర్ నగరాన్ని ఎంతగానో అభివృద్ది చేశారు. ప్రణాళికా బద్ధమైన రహదారులు, మార్కెట్ వ్యవస్థ, పురపాలక సంఘం నగరంలో భాగమైనాయి. ఈ పనుల వల్లనే అగర్తలాను బీర్ బిక్రం మాణిక్య బహదూర్ నగరం అని కూడా పిలుస్తారు.
సుప్రసిద్ధ వ్యక్తులకు నిలయంగా
రాజధాని కావడం, బంగ్లాదేశ్ కు దగ్గరగా వుండడం వల్ల అగర్తలా చాలా మంది సుప్రసిద్ధ వ్యక్తులకు నిలయంగా వుండేది. రవీంద్రనాథ్ ఠాగోర్ చాలా సార్లు అగర్తలా సందర్శించారు. ఆయన త్రిపుర రాజులతో సత్సంబంధాలు కలిగి వుండే వారు. అగర్తలాతో పాటు దాని చుట్టు పక్కల చాలా ఆసక్తికరమైన పర్యాటక కేంద్రాలు వున్నాయి. ప్రాచీన గత వైభవాన్ని కలిగి వుంటూనే ఆధునికతకు స్థానం కల్పించిన అతి కొద్ది ఈశాన్య నగరాల్లో అగర్తలా ఒకటి. పాత ప్రాసాదాలు, రాజ భవనాలు ఉండగానే, ఆధునిక నిర్మాణాలకు తావిచ్చి అగర్తలా ఈ ప్రాంతానికి కొత్త రంగులు అద్దింది.
Authorization