ముంబయి... ఆధునిక, పురాతనాల మేలు కలయిక. జనాభాతో నిత్యం రద్దీగా ఉండే ఈ నగరం ఎన్నో అద్భుతమైన, అందమైన చారిత్రాత్మకమైన ప్రదేశాలను తనలో ఇముడ్చుకుంది. భారత దేశంలో ఏ కొత్త ఫ్యాషన్ ఆవిష్కరించబడినా అది ముంబయిలోనే. నగరానికి అతి సమీపంలోనే ఉండే ఆహ్లాదకరమైన బీచ్లతో పాటు మరెన్నో చూడచక్కని ప్రాంతాలను తన సొంతం చేసుకుంది. గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద అలలపై అలా అలా విహరిస్తుంటే ఆ అనుభూతే వేరు. అలాంటి నగర విశేషాలు ఈ వారం జరదేఖోలో..
గేట్ వే ఆఫ్ ఇండియా
ముంబయిలో చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవల్సింది గేట్ వే ఆఫ్ ఇండియా గురించి. ప్రసిద్ది గాంచిన శిల్పకళా అద్భుతం ఇది . గేట్ వే ఆఫ్ ఇండియా దాని 8 అంతస్తుల ఎత్తుతో ముంబైలోని కొలబాలో పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. గేట్ వే ఆఫ్ ఇండియా ముంబై నగరంలోని అపోలో బందర్ ప్రాంతంలో సముద్రం ఒడ్డున ఉంది. దీని ఎత్తు 85మీటర్లు. ఇదో స్మారక కట్టడం. సముద్రం ద్వారా వచ్చే అతిథులకు ఇదో స్వాగత ద్వారం. బోట్ల ద్వారా ముంబై వచ్చే సందర్శకులకు ముందుగా కనిపించేది కూడా ఇదే. భారతీయ, యూరోపియన్ నిర్మాణ శైలిలో గేట్ వే ఆఫ్ ఇండియాను నిర్మించారు. అప్పట్లో దీని నిర్మాణానికి 21 లక్షల రూపాలను ఖర్చుచేశారు. 1911వ సంవత్సరం డిసెంబర్లో బ్రిటన్ రాజు కింగ్ జార్జ్ -5క్వీన్ మేరీలు భారత పర్యటనకు గుర్తుగా అదే సంవత్సరం మార్చి 31వ తేదీన దీని నిర్మాణాన్ని ప్రారంభించారు. 1924 డిసెంబర్ లో కట్టడాన్ని పూర్తి చేశారు. బ్రిటీష్ సైన్యం భారత్ నుండి వెనుదిరిగినప్పుడు అందులోని సోమర్ సైట్ లైట్ ఇన్ ప్రాంటీ మొదటి దళం గేట్ వే ఆప్ ఇండియా నుండే బయలుదేరి వెళ్లింది. ఇక్కడకు దక్షిణ ముంబైలో ప్రసిద్దిగాంచిన రెస్టారెంట్లు, బడే మియాస్, కేఫే మండేగర్, కేఫే లియో పోల్డ్ కూడా సీమపంలోనే ఉన్నాయి. అలాగే కొలబా కాజ్ వే కు ఇది సమీపంలోనే ఉంటుంది.
జుహు బీచ్
బీచ్ ప్రేమికులందరికీ జుహు బీచ్ ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంది. బాద్రా నుండి సుమారు నాలుగు గంటల్లో ఈ జుహు బీచ్ని చేరుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన పర్యాటకులు ఎంత సేపైనా ఉండి సముద్రపు అలలతో ఆటలాగుకోవచ్చు, ఆనంద సాగరంలో మునిగితేలవచ్చు. ఈ బీచ్లో దొరికే ఆహారాలు ముంబయిలోనే ప్రత్యేకం.
మెరైన్ డ్రైవ్
మెరైన్ డ్రైవ్లో వాక్ చేస్తుంటే అది మిమ్మల్ని ప్రపంచ ప్రసిద్ద చౌపట్టీ బీచ్కు చేరుస్తుంది. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్కు ప్రసిద్ది. వివిధ రకాల స్ట్రీట్ ఫుడ్ను రుచి చూడవచ్చు. మెరైన్ డ్రైవ్లో ప్రసిద్ధ బ్రాండ్లు, విశేషమైన హేండ్ లూమ్ స్టోర్స్ ఉన్నాయి. చీకటి పడితే లైట్లు సముద్రపు ఒడ్డు అందాలను మటుమాయం చేస్తాయి. రాత్రులలో మెరైన్ డ్రైవ్ నుండి ముంబై స్కై లైన్ చూడటం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.
విక్టోరియా టర్మినస్
ఛత్రపతి శివాజీ స్టేషన్ అనే పేరు కంటే కూడా వీటీ స్టేషన్ లేదా విక్టోరియా టర్మినస్ అనే పేరుతో ఇది ముంబయిలోని ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఎన్నో ఏండ్లుగా కొనసాగుతోంది. పట్టణ యువత అవసరాల విశేషంగా పెరగడంతో ఈ టర్మినల్ చుట్టూ ఎలక్ట్రానిక్స్తో పాటు దుస్తుల దుకాణాలు ఎన్నో వెలిశాయి.
ముంబై సీలింక్
బంద్రా-ముంబై సీ లింకు ముంబైలోనే ఓ ప్రధాన నిర్మాణం.. ముంబై స్కై లైన్కు ఇది ఓ అద్భుతమైన కట్టడంగా చెప్పుకోవచ్చు. వేలాడే ఈ 8లైన్లను బ్రిడ్జి మోటారిస్టులను వర్లి, బంద్రాల మధ్య పది నిమిషాలలో ప్రయాణింపజేస్తుంది.
ఎలిఫెంటా కేవ్స్
ఈ ఎలిఫెంటా గుహలు ముంబైలోని ఓ ద్వీపంలో ఉన్నాయి. ఇక్కడికి చేరాలంటే బోట్లో వెళ్ళాలి. ఇవి యునెస్కో చేత ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడ్డాయి. పోర్చుగీసు వారు ఇక్కడికి వచ్చినప్పుడు ఎలిఫెంట్ శిల్పశైలి అధికంగా కనిపించడంతో దీనికి ఎలిఫెంటా అని పేరుపెట్టారు. ప్రతి రోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు వీటిలోకి ప్రవేశం ఉంటుంది. అలాగే ప్రవేశ రుసుం భారతీయులకు 10 రూపాయలు, విదేశీయులకు 250 రూపాయలు ఉంటుంది.
హేంగింగ్ గార్డెన్
హేంగింగ్ గార్డెన్ పార్క్ నగరంలోనే అతిపురాతనమైనది. అతి పెద్ద జైంట్ లేడీ షూ ఈ పార్క్లోని ప్రతేకత. ఇక్కడి అందమైన దృశ్యాలను పదికాలాల పాటు భద్రపరుచుకునేందుకు పర్యాటకులు ఎంతగానే ఆసక్తి చూపుతారు. అందుకే ఇక్కడ ఫొటో గ్రాఫర్ల చాలా బిజీగా ఉంటారు.
ఐస్ బార్
మంచి ఉన్ని కోట్లు వేసుకొని నగరంలోని ఈ ఐస్ బార్లో ఓ సాయంత్రం గడిపేయండి. ముంబయిలోని పార్టీప్రియులు ఈ లాంజ్లో తప్పక విందు చేసుకుని ఆనందించాల్సిందే. ముంబై మహానగర రాత్రి దృశ్యాలను ఈ ప్రదేశం కండ్లకు కట్టినట్లు అందంగా చూపుతుంది. 34వ అంతస్తు నుండి చూస్తే మిమ్మల్ని మీరు మరిచిపోవాల్సిందే.
బ్యాండ్ స్టాండ్
ఇది ముంబైకి మరో సముద్ర ముందు భాగం. ఈ ప్రదేశంలో విలాసవంతమైన కాఫీ హౌస్లు, రెస్టారెంట్లు, చక్కటి వీధి దీపాలు, సంప్రదాయ ముంబయి చారు వంటివి ఎన్నో ఉంటాయి. బ్యాండ్ స్టాండ్ నుండి కిందకు నడుచుకుంటూ వెళితే, బాలీవుడ్ ప్రఖ్యాత సెలబ్రిటీల, నటుల నివాసాలు కనపడతాయి. షారుఖ్ ఖాన్ నివాసం మన్నత్, సల్మాన్ ఖాన్ నివాసం గెలాక్సీ టవర్ వద్ద చూడవచ్చు. బ్యాండ్ స్టాండ్ను ముంబయిలో లవర్స్ పాయింట్ అని కూడా అంటారు.
ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం
దీన్ని గతంలో సహార్ అంతర్జాతీయ విమానాశ్రయం అని పిలిచేవారు. ఇది ముంబాయిలోని ప్రధాన విమానాశ్రయం. ఇక్కడి నుంచి ప్రయాణించే వారిని పరిశీలిస్తే దక్షిణ ఆసియాలోనే అత్యంత బిజీగా ఉండే విమానాశ్రయంగా దీన్ని చెప్పుకోవచ్చు.గతంలో దీనిని సహార్ (అంతర్జాతీయ) విమానాశ్రయంతోపాటు శాంతాక్రూజ్ (స్వదేశీయ) విమానాశ్రయం అని కూడా పిలిచేవారు. ఈ రెండు విమానాశ్రయాలు విలీనమయ్యి 17వ శతాబ్దపు మరాఠా రాజు ఛత్రపతి శివాజీ భోస్లే పేరు మీదగా ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం అనే పేరు స్థిరపడిపోయింది.
Authorization