మన రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా అక్కడ ఏదో ఒక దగ్గర చారిత్రిక, పౌరాణిక ప్రాధాన్యం ఉన్న కట్టడమో, వస్తువులో కనబడుతూనే ఉంటాయి. కానీ వాటిని ఎవరూ పెద్దగా గుర్తించడం లేదు. దాంతో వేలాది శిల్పాలు ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ మట్టికొట్టుకుపోతున్నాయి. అవి రాతి శిలలు కాబట్టి కరగడం లేదు. అటువంటి కేటగిరీలోకి వచ్చే అద్భుత చారిత్రక ప్రాంతమే మంచం గుట్ట.
జనగామ జిల్లా రఘునాధపల్లెకి సమీపంలో గబ్బెట్ట, కోమటి గూడెం గ్రామం శివార్లలో ఉన్న రాతియుగ కాలం నాటి డోల్మెన్ సమాధి ఇది. డోల్మెన్లు అంటే ఒకే గదిలాంటి నిర్మాణం వున్న పెద్దరాతియుగం నాటి మానవుల సమాధులు. ఇవి క్రీ.పూ.7000వ సంవత్సరం నుండి 4000వ సంవత్సరం మధ్యకాలంలో పురామానవులు నిర్మించుకున్నట్టు పురావస్తు శాస్త్రవేత్తల అభిప్రాయం. అవి ఉన్న పరిసర ప్రాంతాల్లో మనకు లభించే రాతిపనిముట్లు, ఇతర అవశేషాల కాలనిర్ణయం చేయవచ్చు. కానీ డోల్మెన్ల వయసు చెప్పడం కష్టం. ఈ సమాధుల్లో మరణించిన వారి ఎముకలను దాచివుంచేవారు.
బండరాళ్ళ ఆధారంగా నిర్మణం
సుమారు 2000-3000 కేజీలకు పైగా బరువుండే ఒక విశాలమైన నున్నటి రాతి పలక కేవలం కొన్ని బండరాళ్ళ ఆధారంగా నిర్మాణం చేయబడింది. అది కూడా కేవలం మూడు వైపులే ఉంటాయి. కింది భాగంలో సపోర్ట్ కోసం పేర్చిన రాళ్ళని అతకడానికి ఎటువంటి పదార్ధం వాడలేదు. అంత బరువున్న విశాలమైన పలకని సుమారు నాలుగు అడుగుల ఎత్తులో కేవలం కొన్ని బండరాళ్ళు ఆధారంగా నిలబెట్టారు. ఏవో చుట్టుపక్కల దొరికిన రాళ్ళని ఒక దానిపై మరొకటి పేర్చి దానిపై ఆ పలకని అమర్చారు. దానిపై మనుషులు ఎక్కినా అది ఏమాత్రం కదలదు. దాని కింద కనీసం 20 మంది మనుషులు కూర్చోవచ్చు.
యంత్ర పరికరాలు లేని కాలంలోనే...
ఇది రాతియుగం నాటిదని, అక్కడ రాతితో చేసిన పనిముట్లు, పాత్రలు కనుగొన్నామని పురాతత్వ పరిశోధకులు చెప్తున్నారు. మరో విశేషం ఏమిటంటే ఆ రాతి పలక కింద వైపు రెండు వరుసలలో నగిషీలు వంటివి చెక్కబడి ఉన్నాయి. వందల టన్నుల బరువున్న రాతిని ఎటువంటి ఆధునిక యంత్ర పరికరాలు లేని కాలంలో గుట్టపై భాగానికి చేర్చడం, దానిని అంత ఎత్తుకు లేపడం ఓ ఆశ్చర్యకరం అయితే, అంత బరువైన పలకని కేవలం కొన్ని బండ రాళ్ళ ఆధారంగా స్థిరంగా వందల ఏండ్లపాటు పడకుండా నిలబెట్టగలగడం విచిత్రమే.
దృష్టి సారిస్తే...
అసలు ఎక్కడ ఎన్ని రాళ్ళు పెడితే అది అంత పదిలంగా, స్థిరంగా నిలబడుతుందనే లెక్క ఆనాడే వారికి తెలియడం సాధారణమైన విషయమేమీ కాదు. అసలు అంత బరువైన పెద్ద పలక కింద రాళ్ళు పేర్చేవరకు ఏవిధంగా పైకి లేపి ఉంచారనేది కూడా మనల్ని ఆలోచింపజేస్తుంది. ఎందుకంటే దాని కింద ఆ రాళ్ళు పేర్చేవరకు పైకి లేపి పట్టుకోవడానికి నేడు ఉన్నట్టు ఆనాడు క్రేన్లు లేవు. ఇదే ఏ అమెరికా, ఇంగ్లాండ్ వంటి దేశాలలో కనబడితే దాని చుట్టూ ఒక అందమైన హెరిటేజ్ పార్క్ నిర్మించేసి దానిని ప్రత్యేక ఆకర్షణ కేంద్రంగా మలిచి ఉండేవారు. మూడు చిన్న శిలలపై భారీ రాయి ఉంది . ఇప్పటి వరకు ఈ స్మారకం గురించి ఎవరూ సమగ్రంగా అధ్యయనం చేయలేదు. పురావస్తు శాఖ దృష్టి సారించి అభివృద్ధి చేస్తే గొప్ప చారిత్రక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుంది.
Authorization