ఓర్చా... చరిత్రతోపాటు ప్రకృతిని ప్రేమించే వాళ్లకు ఆసక్తికరమైన ప్రదేశం. మధ్యప్రదేశ్లో ఉన్న ఈ అందమైన ప్రదేశాన్ని మహారాజా రుద్ర ప్రతాప్ సింగ్ స్థాపించాడు. ఆయనే దీనికి మొదటి రాజు కూడా. ఇక్కడి కళాత్మకమైన, అద్భుతమైన నిర్మాణాలు పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణలు. అలాంటి చారిత్రాత్మక ప్రాంత విశేషాల గురించి ఈ వారం జరదేఖోలో తెలుసుకుందాం...
ఓర్చాలోని రాజ మహల్, రాణీ మహల్, సుందర్ మహల్, లక్ష్మి నారాయణ ఆలయం తప్పనిసరిగా చూడాల్సినవి. ఓర్చా ఫోర్ట్ బేత్వా నది మధ్యలో ఉన్న దీవిలో ఉంటుంది. ఈ ఫోర్ట్ను ఒక్కసారి చూస్తే చాలు జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేము. అంతటి సుందర చారిత్రక కట్టడం ఈ రాజ మహల్. ఓర్చా కట్టడాన్ని బుందేల్ ఛీఫ్తాన్ రుద్రప్రతాప్ నిర్మించారు. గుప్తుల కాలానికి చెందిన ఈ కట్టడం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది.
మరుగున పడిన మాణిక్యం
పదహారవ శతాబ్దం నాటి ఈ ఓర్చా నగరం బుందేల్ ఖండ్ ప్రాంతంలో 'బెట్వా నది' తీరంలో నిర్మించబడింది. ఇది ఝాన్సీ - ఖజురహో రోడ్డుపై ఉంది. ఝాన్సీకి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రుద్రప్రతాప్ తర్వాత అతని కొడుకు బీర్ సింగ్ దేవ్ ఈ నగరాభివృద్ధి చేశాడు. అనేక శతాబ్దాలుగా యాత్రికులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న ఈ ఓర్చా మధ్యప్రదేశ్లో మరుగున పడిన మాణిక్యం అని చెప్పుకోవచ్చు.
ఆహ్లాదమైన వాతావరణం
ఓర్చా ప్రాంత గాథలు పాటలుగా, పద్యాలుగా జనం పాడుకుంటుంటారు. మధ్య ప్రదేశ్కు ఉత్తరాన మాల్వా పీఠ భూమిలో ఓర్చా ఉంది. వేసవిలో వేడి తక్కువగా ఉండటం శీతాకాలంలో ఆహ్లాద వాతావరణం దీని ప్రత్యేకత. బుందేల్ ఖండ్ రాజులు దీన్ని1531 నుండి రెండు శతాబ్దాల పాటు పాలించారు. ఒకప్పుడు ఓ రాజ పుత్ర వీరుడు తన విన్ధ్యవాసిని దేవికి దీన్ని సమర్పించుకోవాలని అనుకున్నాడు. అప్పుడు ఆ దేవి అతని త్యాగానికి మెచ్చి అతన్ని 'బుందేలా' అంటే 'రక్త తర్పణం చేసిన వాడా' అని పిలిచింది. అప్పటి నుంచి ఆ వంశీకులు బుందేల్ ఖండ్ రాజ పుత్రులై చరిత్రలో చిర కీర్తి సాధించారని ఓ కథనం.
బుందేల్ స్కూల్ ఆఫ్ పెయింటింగ్
ఓర్చా వైభవమంతా కోటలోనే ఉంది. ఈ కోటలో అనేక రాజ భవనాలు, ఆలయాలు, తోటలు, స్మృతి చిహ్నాలు ఉన్నాయి. వీటిలో బుందేల్ స్కూల్ ఆఫ్ పెయింటింగ్ ప్రసిద్ధమైనది. పుష్పాల అలంకరణ ఇక్కడి మరో ప్రత్యేక ఆకర్షణ. మొగల్ చక్రవర్తి సందర్శన సందర్భంగా బీర్ సింగ్ రాజు స్మారక మందిరం నిర్మించాడు. ఇక్కడ కోర్టు, దర్బారు గొప్పగా ఉంటాయి.
రాజ్ ప్రవీణ్ మహల్
కోటలోని రాజ భవనాలు ఆకర్షణీయంగా తీర్చి దిద్దారు. రాజా ఇంద్రమణి అనే కవి, సంగీతజ్నురాలు పేర 'రాజ్ ప్రవీణ్ మహల్ ' నిర్మించారు. ఆమె గొప్ప అందగత్తే, నాట్యకారిణి. జహంగీర్ ఆమెను ప్రేమించాడని ఓ కథనం. వీరిద్దరి ప్రణయ గాధ పాటలుగా కావ్యాలుగా ప్రసిద్ధమైనాయి. ఇక ఆనంద మహల్, హర్దు వాల్ మందిరాలు వైభవంగా ఉంటాయి. హర్దువాల్ బీర్ సింగ్ కుమారుడు. అన్న ఝుహార్కు తన అమాయకత్వాన్ని నిరూపించటానికి ప్రాణ త్యాగం చేశాడు. మరణం తరువాత అతని విగ్రహం నెలకొల్పి ఆరాధిస్తున్నారు.
రామ రాజ దేవాలయం
ఇక్కడున్న మరో ప్రత్యేక ఆకర్షణ రామ రాజ దేవాలయం. గుడిగా మారిన ఈ రాజ ప్రసాదంలో రాముడిని దేవుడిగా కాకుండా రాజుగా కొలవటం ఈ ప్రదేశానికున్న విశిష్టత. మధుకర్ షా భార్య రాణి గణేష్ కున్వారీదేవి అయోధ్య నుంచి శ్రీరాముని విగ్రహం తనతో ఓర్చాకు తీసుకొచ్చింది. దాన్ని రాజ ప్రాసాదంలో ఒక చోట తాత్కాలికంగా ఉంచింది. వేరొక చోట దాన్ని ప్రతిష్టిద్దామని ప్రయత్నం చేస్తే విగ్రహం ఊడి రాలేదట. చివరికి ఈ రాజ ప్రాసాదాన్నే శ్రీరాముని సమర్పించారు రాణీ రాజు. ఇక్కడ శ్రీరాముడు రాజుగా పూజింప బడుతున్నాడు. భారత దేశం మొత్తం మీద ఎక్కడా శ్రీరాముడు రాజుగా అర్చింపబడటం లేదు ఇక్కడే అది జరుగటంతో ఓర్చాలో మరో ప్రతేప్యకతగా నిలిచింది.
చంద్ర శేఖర్ ఆజాద్ నివసించిన ప్రదేశం
కున్వారి రాణీ కోసం మధుకర్ షా చతుర్భుజ దేవాలయాన్ని ఓర్చాలో నిర్మించాడు. ఇది ఉన్నతమైన శిఖరంతో గొప్ప కళా నికేతన్లా కనిపిస్తుంది. అలాగే రామ రాజ, లక్ష్మీ నారాయణ దేవాలయాలూ ఉన్నాయి . వీటిలో 'బుందేల్ చిత్రకళ' విశేష ప్రాముఖ్యతను పొందింది. విప్లవ వీరుడు స్వాతంత్ర సమరంలో వీర మరణం పొందిన చంద్ర శేఖర్ ఆజాద్ ఓర్చాలో1926-27లో నివసించటం దీని ఖ్యాతిని మరింత పెంచింది. ఇంకా సిద్ధ బాబా మందిర్, జుగల్ కిషోర్ మందిర్, జానకీ మందిర్ ఇక్కడి చూడదగిన ప్రదేవాలు. అంతేకాకుండా ఇక్కడ రాజస్తాని, జైన, మొగల్ శిల్ప కళలు వర్ధిల్లి కళా త్రివేణీ సంగమ స్థానమైంది.
స్మారక చిహ్నాలు
'చ్చాత్రిస్' అంటే రాజుల సమాధులు అని అర్థం. ఓర్చాలో నది ప్రక్కన ఉన్న చ్చాత్రిస్ ప్రత్యేక ఆకర్షణకు అద్దం పడుతుంది. బెట్వా నదిలో కాంచన్ ఘాట్తో పాటు నిలుచుని ఉన్న పద్నాలుగు ఖాళీ సమాధులు ఉన్నాయి. ఓర్చా రాజ్య పాలకుల సమాధులు ఇక్కడ చూడవచ్చు. ఈ స్మారక చిహ్నాలు అందంగా చెక్కబడిన గోడలు, స్తంభాలు, డోములతో కను విందు చేస్తాయి.
వైల్డ్ లైఫ్ శాంక్చురీ
ఓర్చాలో 46 కి.మీ విస్తీర్ణంలో విస్తరించివున్న వైల్డ్ లైఫ్ శాంక్చురీ తప్పక చూడాల్సిన ప్రదేశం. ఇక్కడ రకరకాల జంతువులతోపాటు 200 రకాల పక్షులు కూడా ఉంటాయి. ఈ అడవిగుండా బేత్వా నది ప్రవహించటం మూలంగా సంవత్సరం పొడవునా అడవంతా పచ్చదనంతో కనువిందు చేస్తుంది. ఇక శివపురిలోని మాధవ్ నేషనల్ పార్క్ యానిమల్ లవర్స్ చూడదగ్గ మరో ప్రదేశం. ఇదే పార్కులో వేట మధ్యలో సేదతీరేందుకు అప్పటి రాజు శివాజిరావు సింధియా కట్టించిన జార్జ్ కాజిల్ హంటింగ్ లాడ్జ్ పైకి ఎక్కాలి. ఇదే పార్క్ మొత్తంలో ఎత్తైన ప్రదేశం. ఇక్కడినుంచి చూస్తే అడవంతా స్పష్టంగా కనిపిస్తుంది.
చేరుకోవడం ఇలా...
ఈ ప్రాంతానికి సమీపంలో ఖజురహో ఎయిర్పోర్ట్ ఉంటుంది. రైల్వేస్టేషన్ ఝాన్సీలో ఉంది. ఓర్చాకు ఇది 19 కిలోమీటర్లు. ఝాన్సీ-ఖజరహోకు రోడ్డు మార్గం ఉంది. గ్వాలియర్కు 120 కిలోమీటర్లు, ఖజరహోకు 170 కిలోమీటర్ల దూరంలో ఉంది. జహంగీర్ మహల్, రారుప్రవీణ్మహల్, రాజ్మహల్, చతుర్భుజి టెంపుల్, లక్ష్మీనారాయణ టెంపుల్, జానకి, హనుమాన్ మందిర్, షాహిద్స్మారక్ ప్రదేశాలు సందర్శించవచ్చు. ఇక్కడ నుంచి 139 కిలోమీటర్ల దూరంలో డియోగడ్ ఉంది. మధ్యప్రదేశ్లోని అన్ని ప్రధాన నగరాల నుండి రోడ్డు మార్గాన ఓర్చాను సులభంగా చేరుకోవచ్చు. లేదంటే టాక్సీలు కూడా అందుబాటులో ఉంటాయి.
Authorization