హైదరాబాద్ నుండి 213కిలోమీటర్ల దూరంలో శ్రీశైలం ప్రకృతి సృష్టించిన సహజ సౌందర్యంతో అలరారుతోంది. దేవాలయంతో పాటు ఇక్కడ చూడవల్సిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అందుకే ప్రతి సంవత్సరం లక్షల్లో భక్తులు, పర్యాటకులు శ్రీశైలం సందర్శిస్తుంటారు. మరీ ముఖ్యంగా వారాంతాల్లో పర్యాటకులకు ఫర్ఫెక్ట్ ప్లేస్గా దీన్ని చెప్పుకోవచ్చు. ట్రెక్కింగ్, క్యాంపింగ్కు అనువైన శ్రీశైలంలో చూడదగిని కొన్ని ప్రదేశాల గురించి ఈ వారం జరదేఖోలో...
నల్లమల హిల్స్
నల్లమల అడువుల్లో కొలువైన శ్రీశైలం కేవలం పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, పర్యాటక ప్రదేశంగా అందరినీ ఎంతో ఆకర్షిస్తోంది. పచ్చని పర్వతాలు, లోయలు, దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఇక్కడి శ్రీశైలం డ్యామ్ అందాలు వర్షాకాలంలో మరింత అందంగా..ఆహ్లాదంగా ఉంటాయి. శ్రీశైలంకు చుట్టుపక్కల నల్లమల హిల్స్ పర్యాటకులను మరింతగా ఆకర్షిస్తాయి. ఇక్కడ ట్రెక్కింగ్, క్యాంపింగ్, హైకింగ్ వంటి యాక్టివిటీస్లో ఉత్సాహంగా పాల్గొనవచ్చు. వీకెండ్లో విశ్రాంతి తీసుకోవడానికి అనువైన ప్రదేశం. శ్రీశైలం కొండల మద్య దాగున్న అద్భుతమైన పచ్చని వాతావరణం ప్రకృతి ప్రేమికులను రారామంటూ ఆహ్వానిస్తుంది.
టైగర్ రిజర్వ్
శ్రీశైలం చుట్టుపక్కల మీరు ఎక్కడ ఉన్నప్పటికీ ఇక్కడి సంరక్షిత అడవిని తప్పక చూడాలి. ఇది భారతదేశంలోనే అతి పెద్ద టైగర్ రిజర్వ్గా పేరొందినది. ఇది సుమారు 3568 చ. కి. మీ. ల విస్తీర్ణంలో వ్యాపించి వుంది. ఈ ప్రదేశంలో తిరిగి రావడమంటే ఓ సాహస యాత్రగా బావించవచ్చు. శాంక్చురి లోపల ఎన్నో రకాల వృక్షాలు, వెదురు మొక్కలు వంటివి చూడవచ్చు. శాంక్చురి లోపల పులులు, చిరుతలు, అడవి పిల్లులు, ఎలుగులు, లేళ్ళు, దుప్పులు వంటివి చూడవచ్చు. శ్రీశైలం డాంకు సమీపంలో కల శాంక్చురి భాగంలో మీరు నీటి మడుగులలో వివిధ రకాల మొసళ్ళని కూడా చూడవచ్చు.
మల్లికార్జున జోతిర్లింగ
శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. నాలుగు మండపములతో అపూర్వమైన శిల్ప సంపదతో అలరారే అందమైన దేవాలయం ఇది. ప్రధాన గర్భాలయము మాత్రము ఎటువంటి శిల్పాలు లేకుండా సాధారణ నిర్మాణముగా ముష్కరుల నుండి రక్షణ కొరకు కట్టినట్టుగా ఉంటుంది. మొత్తానికి శిల్ప కళను ఆరాధించే వారికి ఓ అద్భుతమైన ప్రదేశంగా ఉంటుంది.
శ్రీశైలం డ్యాం
శ్రీశైలం డ్యాంను కృష్ణా నదిపై నిర్మించారు. నల్లమల కొండలలో లోతైన గార్జ్ పైన ఈ నిర్మాణం జరిగింది. భారతదేశంలో అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టులలో ఇది రెండవది. ప్రస్తుతం ఈ ఆనకట్ట 2,200 చదరపు కిమీ విస్తీర్ణం గల నీటిని అందిస్తుంది. వరదల సమయంలో శ్రీశైలం జలాశయం త్వరగా నిండిపోతుంది. మిగిలిన వరద నీటిని తక్కువ ఎత్తులో ఉన్న నాగార్జునసాగర్ ఆనకట్ట ద్వారా ప్రవహించేటట్లు చేస్తారు. ఇక్కడ డ్యామ్ను చూడటానికి వచ్చిన యాత్రికులు పైనుండి సుందర దృశ్యం చూసి ఆనందిస్తారు.
అక్క మహాదేవి గుహలు
నల్లమల కొండ శ్రేణుల్లో ఉన్న ఈ గుహల చరిత్రకు ఆధారాలున్నాయి. నిజానికి ఈ గుహలు పట్టణ చరిత్రలో ఒక కీలకమైన పాత్ర పోషించాయి. 12 వ శతాబ్దపు ప్రసిద్ధ తత్వవేత్త, గీత రచయిత అయిన అక్క మహాదేవి వల్ల ఈ గుహలకు ''అక్క మహాదేవి గుహలు'' అని పేరు వచ్చింది. ఈ వంపు తిరిగిన గుహలు పర్యాటకులను అబ్బురపరుస్తాయి. గుహ సహజంగా ఏర్పడిన రాతి వంపు కలిగినది. 150 అడుగుల పొడవైన ఈ గుహను మీరు శ్రీశైలంకు వచ్చినప్పుడు తప్పక చూడాల్సిందే.
మల్లెల తీర్థం ఫాల్స్
మల్లెల తీర్థంలో ఓ అందమైన జలపాతం ఉంది. ఈ జలపాతాలు ఓ దట్టమైన అడవి మధ్యలో ఉన్నాయి. అయితే రోడ్ మార్గం ద్వారా సులభంగా చేరవచ్చు. ఈ జలపాతం చేరుకోవాలంటే దాదాపు 250 మెట్లు ఉన్న లోయలోకి దిగాలి. జలపాతం దగ్గర మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి.
అభయారణ్యం
శ్రీశైలం అభయారణ్యం భారతదేశంలోనే అతి పెద్ద పులుల అభయారణ్యంగా ఉంది. అభయారణ్యం లోపలి ప్రాంతంలో అనేక వెదురు మొక్కలు ఉన్నాయి. అభయారణ్యం లోపల పులులు, చిరుతలు, హైనాలు, అడవి పిల్లులు, ఎలుగు బంట్లు, జింకలు, పాంగోలిస్ వంటి అడవి జంతువులు వున్నాయి. శ్రీశైలం డ్యాం కు చాలా దగ్గరగా ఉన్న ఆనకట్ట జలాలు మొసళ్ళకు కేంద్రంగా ఉంది.
పాతాళ గంగ
శ్రీశైలం ప్రక్కనే కృష్ణానది ప్రవహిస్తుంది. కాకపోతే శ్రీశైలం చాలా ఎత్తులో ఉంటుంది, నది మాత్రం కింద లోయలో ప్రవహిస్తుంది. అందుకే శ్రీశైలం నుండి చాలా మెట్లు దిగి కృష్ణానదిలో స్నానం చెయ్యాలి. ఈ కృష్ణానదినే ఇక్కడ పాతాళగంగ అని పిలుస్తుంటారు. పాతాళ గంగ వద్ద నీరు నీలంగా కాక పచ్చగా ఉంటుంది. నీటి కింద బండలపై నాచు నిలచి సూర్య కిరణాల వెలుగు వలన పచ్చగా కానవస్తుంది. అయితే అందరూ నీటి కిందగల దీనిని 'పచ్చల బండ' అని కూడా పిలుస్తారు.
హైదరాబాదు నుండి శ్రీశైలం 212 కి.మీ. దూరంలో ఉంది.ఈ రోడ్డు అటవీ ప్రాంతం గుండా పోతుంది. అటవీశాఖ వారు రాత్రి వేళల్లో ఈ ప్రాంతం గుండా ప్రయాణించటానికి అనుమతించరు కనుక పగటి వేళ మాత్రమే ప్రయాణించాలి.