అద్భుతమైన ఆకుపచ్చదనం కప్పుకున్న ఎత్తైన కొండలు, చిక్కటి కాఫీ తోటలతో పరచుకున్న లోయలతో ఘుభాలిస్తూ పర్యాటకులను ఆహ్వానిస్తాయి. ఈ రెండింటి మధ్యలో ఉండే సన్నటి ఘాట్ రోడ్ పై మలుపులు తిరిగే ప్రయాణం మరిచిపోలేని మధురానుభూతిని కలిగిస్తుంది. దట్టమైన అడవులు.. ఆకాశాన్ని తాకుతున్నట్లుగా అనిపించే ఎత్తైన వృక్ష సంపద.. జలపాతాల హోరు.. కొండల్ని చీల్చుకుంటూ రైలు పట్టాల ఏర్పాటు కోసం తవ్విన గుహలు.. హోరెత్తుతూ నీటి ప్రవాహాలు.. ఇవన్నీ సొంతం చేసుకున్న సకలేష్పూర్ ప్రకృతి సౌందర్యం గురించి మనమూ తెలుసుకుందాం..
కర్ణాటకలోని సకలేషన్ పూర్ ఓ చిన్న హిల్ స్టేషన్. ఈ ప్రాంతం బెంగళూరు నుండి 220కి.మీ ల దూరంలో ఉంది. ఇది పశ్చిమ కనుమలలో కలిసిపోయిన ఓ చిన్న పర్వత ప్రాంతం. ఆహ్లాదరకరమైన ఈ వాతావరణంలో స్నేహితులతో, కుటుంబ సభ్యులతో హాయిగా గడిపేయవచ్చు. ఇటు బెంగళూరూ, అటు మైసూర్కు దగ్గరగా ఉండటం వల్ల వారంతపు విహారానికి చాలా అనుకూలంగా ఉంటుంది. సకలేశపుర్ నుంచి 59 కిలోమీటర్ల దూరంలోని కుక్కె వరకు రైలు మార్గంలో సాసహయాత్ర ప్రత్యేక అనుభూతిని మిగులుస్తుంది.
అద్భుతమైన హిల్స్టేషన్
సకలేష్ పూర్ ఊరు చిన్నదే అయినప్పటికీ...కాఫీ, యాలకులు, మిరియాలతోటలతో సకల సిరిసంపదలతో తులతూగుతుంది. సకలేష్పూర్ నుండి చిక్ మంగళూరుకు 2గంటలు ట్రావెల్ చేస్తే ఓ అద్భుతమైన హిల్ స్టేషన్ మనకు స్వాగతం పలుకుంతుంది. పర్వతారోహకులకు ఓ అద్భుతమైన ప్రాంతంగా సకలేశ్ పూర్ని చెప్పుకోవచ్చు. ఇది ఒకప్పుడు మైసూరు రాజుల పాలనలో ఉండేది. వారికి ముందు ఆ ప్రాంతం హొయసలులు, చాళుక్యుల పాలనలే ఉండేది. హొయసలుల కాలంలో ఈ ప్రాంతానికి సకలేశ్ పూర్ అనే పేరు వచ్చింది. ఇక్కడికి వచ్చిన పర్యాటకులు బిస్లే రిజర్వ్ అడవులలోను కుమారా పర్వత కొండలలోను ట్రెక్కింగ్ చేసి ఆనందిస్తారు.
రైలు పరుగులు
బెంగళూరు నుండి సకలేశపుర్కు..సకేలేశపుర్ నుండి కుక్కేకు.. రైలు పరుగులు తీస్తుంటే కనిపించిన దృశ్యాలకు మాటల్ని కూర్చడం సాధ్యం కాదనిపిస్తుంది. అడవి మధ్యలో పెద్దపెద్ద గొట్టాలు కనబడుతాయి. ఈ గొట్టాలు...ఎత్తైన కొండలు.. సొరంగాలు.. వాటిల్లో దూసుకెళ్తుంటే కమ్ముకునే చీకట్లకు రైల్లో ఆబాలగోపాలం కేరింతలతో స్వాగతం పలికినట్లుంటుంది.
అడవుల మధ్య నదులు
ఇక వర్షం కాలంలో సొరంగాలపై నుంచి హోరెత్తుతూ దూకుతున్న ధారలు దిగువన సెలయేళ్లుగా ప్రవహిస్తూ పర్యాటకులను కేరింతలకు గురిచేస్తాయి. దట్టమైన అడవుల మధ్య కనిపించే నదులు భలే గమ్మత్తుగా ఉంటాయి. సొరంగంలో వెళ్తుంటే చిమ్మచీకట్లు... ఎప్పుడూ అలాంటి అనుభవం ఎదురవని ప్రయాణికులు చెప్పడానికి మాటలు రాని అనుభూతిని పొందుతారు.
పెద్దశివలింగం
సదాశివాలయం నాగారం శైలిలో వుండే గోపురంతో సదాశివాలయాన్ని ఏకకూట నిర్మాణ శైలిలో నిర్మించారు. ఈ పుణ్య క్షేత్రంలోని గర్భ గుడిలో పెద్ద శివలింగం వుంది. రాతి గవాక్షాలతో కూడుకున్న ఒక పెద్ద గడిలో అందంగా చెక్కిన నంది విగ్రహం ఉంచారు. ఇక్కడికి చేరుకోగానే అమ్మవారి గుడి వద్ద, శివాలయం బయట రెండు వినాయకుడి విగ్రహాలు ఉంటాయి.
కాఫీ తోటల పరిమళాలు
సకలేష్పూర్ చేరుకోగానే కాఫీ,టీ తోటల పరిమళాలు మనల్ని స్వాగతం పలుకుతాయి. ఈ సువాసనలను ఆస్వాదిస్తూనే ఇక్కడి బిస్లే రిజర్వ్ ఫారెస్ట్, పుష్పగిరి వైల్డ్ లైఫ్ సాంచురీ చూడవచ్చు.
కనువిందు చేసే కనుమలు
సకలేష్పూర్ అడవిలో పులులు, పాములు, జింకలు, వివిధ రకాల పక్షులు ఉంటాయి. ఈ విహార ప్రదేశం నుండి పర్యాటకులు కనులకు విందు చేసే అందమైన పడమటి కనుమల శ్రేణిని అంటే కుమార పర్వతం, పుష్ప గిరి, దొడ్డ బెట్ట, పట్ట బెట్ట వంటివి చూడవచ్చు. సాహస క్రీడలు ఆస్వాదించాలనుకొనేవారు ఈ కుమార పర్వత ట్రెక్కింగ్కు వెళ్ళవచ్చు. సమీపంలోని సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాన్ని చూడవచ్చు.
మైమరిపించే శిల్ప శైలి
ఈ అందమైన పర్యాటక ప్రాంతంలో మంజరాబాద్ ఫోర్ట్, సకలేశ్ పూర్ మరో ప్రధాన ఆకర్షణ. ఈ కోటను మైసూర్ పాలకుడు టిప్పు సుల్తాన్ నిర్మించాడు. ఈ కోట ముస్లిం శిల్ప శైలి కళను ప్రదర్శిస్తుంది. దీని నుండి సముద్ర కోస్తా తీరాలను చూసి ఆనందించవచ్చు.
సకలేష్పూర్ ఎలా చేరాలి
విమాన మార్గం: సకలేష్పూర్కు మంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరగా ఉంటుంది. దీనిని గతంలో బాజ్ పే విమానాశ్రయం అనేవారు. ఇది కొడచాద్రి నుండి సుమారు 133 కి.మీ. లు ఉంటుంది. ఇక్కడనుండి దేశంలోని ముంబై, బెంగుళూరు, గోవా, కొచ్చి అలాగే విదేశాలైన దుబారు, అబుదాబి, మస్కాట్, దోహ కువయిట్, బహరేన్ వంటి ఇతర దేశాలకు విమానాలు నడుస్తాయి.
రోడ్డు మార్గం: సకలేష్పూర్ హిల్ స్టేషన్ పట్టణం. బస్సులలో కూడా తేలికగా చేరవచ్చు. కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ వివిధ నగరాలనుండి బస్లు నడుపుతుంది. ప్రయివేటు వాహనాలు కూడా లభ్యంగా ఉంటాయి.
రైలు మార్గం: సకలేష్పుర్కు రైల్వే స్టేషన్ ఉంది. ఇది బెంగుళూరు, మంగుళూరు, ఇతర నగరాలకు కలుపబడి ఉంది. ఈ పట్టణం నుండి రెండు కి. మీ. ల దూరం ఉంటుంది. ఇక్కడకు చేరిన ప్రయాణీకులు ఆటోలు, టాక్సీలలో చుట్టుపక్కల ప్రదేశాలను చూడవచ్చు.
Authorization