తూర్పు వెనిస్ నగరంగా ప్రసిద్ధికెక్కిన శ్రీ నగర్... అందమైన కాశ్మీర్ లోయలో ఉంది. జీలం నదీ తీరంలో ఉన్న ఈ నగరం అందమైన సరస్సులు, పడవ-ఇళ్ళు, అసంఖ్యాకమైన మొఘల్ ఉద్యానవనాలకి పేరు మోసింది. జమ్ము కాశ్మీర్ రాజధాని అయిన ఈ శ్రీనగర్ ప్రకృతి అందాలకు నిలయం. సరస్సులు, మొఘల్ గార్డెన్లు, మంచుతో కప్పబడిన పర్వత శిఖరాలు ఒక్కటేమిటి ప్రకృతిలోని ప్రతి అందం ఈ కాశ్మీర్ లోనే ఉందనటంలో అతియయోక్తి లేదు.అందుకే ఇది తూర్పు వెనిస్గా పేరుగాంచింది.
అందమైన గూటి పడవలు
శ్రీనగర్ వెళ్లిన ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన టూరిస్టు స్పాట్ దాల్ లేక్. ఇది 22 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ సరస్సు ఫిషింగ్, వాటర్ ప్లాంట్ హార్వెస్టింట్ లాంటి వాటి ద్వారా శ్రీనగర్ ఆర్థికాభివృద్ధికి ఎంతో తోడ్పడుతోంది. ఇక్కడి ప్రధాన ఆకర్షణ 'షికారాలు'. అంటే గూటి పడవలు. అందంగా అలంకరించిన ఈ పడవల్లో ప్రయాణించడానికి పర్యాటకులు ఇష్టపడతారు. చలికాలంలో ఈ సరస్సు పూర్తిగా గడ్డ కట్టేస్తుంది. అందుకే దీన్ని చూడాలంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలోనే వెళ్లాలి. భారతదేశంలో ఉన్న ఏకైక ఫ్లోటింగ్ మార్కెట్ శ్రీనగర్లోనే ఉంది. కూరగాయలు, పండ్లు, పూలు అన్నిటినీ పడవల్లోకెక్కించి, దాల్ సరస్సు నీటిపై తేలియాడుతూ అమ్ముతుంటారు. ఈ పూలు, కూరగాయలు, పండ్లు అన్నీ దాల్ లేక్ పరిసర ప్రాంతాల్లో సాగు చేసినవే. రోజూ ఉదయం 5 నుంచి 7 గంటల వరకు ఈ మార్కెట్ ఉంటుంది. పడవలో ప్రయాణిస్తూ అన్నీ కొనుక్కోవడం ఓ అనుభూతి.
ఉద్యానవనాలు
శ్రీనగర్లో ఎన్ని గార్డెన్స్ ఉన్నాయో లెక్క లేదు. 17వ శతాబ్దంలో కట్టిన షాలిమార్ బాగ్ శ్రీనగర్లో ఉన్న మూడు మొఘల్ గార్డెన్లలోనే పెద్దది. మే నుంచి అక్టోబర్ నెలల మధ్య ప్రతి రోజూ సాయంత్రం ఇక్కడ లైట్ అండ్ సౌండ్ షో జరుగుతుంది. శుక్రవారం సెలవు. నిషాత్ గార్డెన్ కూడా ఫేమస్. ఈ రెండూ పర్షియన్ పద్ధతిలో నిర్మితమయ్యాయి. శరదృతువు (ఆకులు రాలే కాలం)లో ఈ మొఘల్ గార్డెన్స్ రాలిపడిన ఎరుపు-బంగారం రంగు ఆకులతో కొత్త అందాన్ని సంతరించుకుంటాయి. ఇక మొక్కలపై ఆసక్తి ఉన్నవాళ్లెవరైనా జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ బొటానికల్ గార్డెన్ను చూడాల్సిందే. ప్రతి ప్రకృతి ప్రేమికుడు ఇష్టపడే ఆధునిక ఉద్యానవనం.
నసీం బాగ్
దీన్ని ప్రశాంతతకు మారు పేరుగా చెప్పుకోవచ్చు. 1586లో అక్బర్ చక్రవర్తి దీన్ని నిర్మించారు. ఈ గార్డెన్ను నాలుగు వేరువేరు విభాగాలుగా చూడవచ్చు. ఇక్కడి ప్రకృతి అందాన్ని చూడటానికి, అలసిన మనసును శాంతపర్చుకోడానికి సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు.
నెహ్రూ బొటానికల్ గార్డెన్
ఇక్కడ లేని మొక్క ఉండదు.ఈ నెహ్రూ బొటానికల్ గార్డెన్ను 1969 లో 80 హెక్టార్ల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ గార్డెన్లో 17 హెక్టార్ల మేర ఓ అందమైన సరస్సు ఉంటుంది. ఈ గార్డెన్ లో 100 రకాల పువ్వులను ఒకే చోట చూడవచ్చు. వసంత ఋతువులో నెహ్రూ బొటానికల్ గార్డెన్ రంగురంగుల పువ్వులతో నిండి పర్యాటకులను ఆకర్షిస్తుంటుంది. నెహ్రూ బొటానికల్ గార్డెన్ రుంటెక్ మొనాస్టరీకి దగ్గరలో ఉన్నది. ఈ గార్డెన్ ను ఆధునిక పద్ధతులతో నియమాను సారం 4 విభాగాలుగా రూపొందించారు. వాటినే రిక్రియేషనల్ గార్డెన్, బొటానికల్ గార్డెన్ ,ప్లాంట్ ఇంట్రడక్షన్ సెంటర్, రీసెర్చ్ డివిజన్ అని వర్ణించవచ్చు.
ఈ జవహర్ లాల్ నెహ్రు బొటానికల్ గార్డెన్లో అందమైన పుష్పాలు కాకుండా ప్రధాన ఆకర్షణలో బోటింగ్ కూడా ఒకటి. అలాగే ఈ గార్డెన్లో ఓ అందమైన సరస్సు ఉంది. ఈ సరస్సులో పడవలలో విహరిస్తూ ఆనందాన్ని అనుభవించ వచ్చు. మొత్తానికి శ్రీనగర్ లో ప్రసిద్ది చెందిన ఈ బొటానికల్ గార్డెన్ ఓ ప్రముఖ పర్యాటక ఆకర్షణగా నిలిచింది.
పిల్లలకు ఆట స్థలం
ఈ గార్డెన్లో పిల్లలు ఆడుకోవటానికి ఆట స్థలం కూడా ఉంది. ఈ అందమైన గార్డెన్లో విరామ సమయంలో సరదాగా నడిచివెళ్లి ఆస్వాదించడానికి ఓ సుందరమైన రహదారి కూడా ఉంది. ఈ గార్డెన్ను వేసవి, శీతాకాలం రెండు ప్రధాన ఋతువుల్లో సందర్శించవచ్చు. శ్రీనగర్లో పరిమిత వర్షపాతం కారణంగా ఈ స్థలాన్ని ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు సందర్శించవచ్చు.
ఇలా చేరుకోవాలి?
విమాన మార్గం: ఇండియన్ ఎయిర్లైన్స్, జెట్ ఎయిర్వేస్ వంటి కొన్ని ప్రధాన విమానయాన సంస్థలు శ్రీనగర్ విమానాశ్రయం నుండి నడుస్తాయి. ముంబై, కోల్కతా, ఢిల్లీ వంటి ప్రధాన నగరాలను కలుపుతున్నాయి.
రైలు మార్గం ద్వారా: శ్రీనగర్కు సమీప రైల్వే స్టేషన్ జమ్మూలో ఉంది. ఇది జమ్మూ తవిలో ఉంది. ఈ మార్గం ఢిల్లీ, ముంబై, చండీగఢ్ వంటి ఇతర నగరాలకు శ్రీనగర్ను కలుపుతుంది.
రోడ్డు మార్గం: శ్రీనగర్ దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి రోడ్ అనుసంధానించబడి ఉంది. చండీగఢ్, గుల్మార్గ్, జమ్మూ, సోనమార్గ్, ఢిల్లీ రోడ్ల ద్వారా దీన్ని సులభంగా చేరుకోవచ్చు.
Authorization