వియత్నాం అనగానే మనకు ఏం గుర్తుకు వస్తుంది...? యుద్ధంలో గాయపడి పరిగెత్తుకొస్తున్న చిన్నారి గుర్తుకొస్తుంది. అగ్రరాజ్య అమెరికాను ముప్పుతిప్పలు పెట్టి ఒడించిన విధానం గుర్తుకొస్తుంది. యుద్ధాలు అంటే ఇంత భయంకరంగా ఉంటాయా అన్న విషయం గుర్తుకు వస్తుంది. సుదీర్ఘ కాలం యుద్ధాలతో మునిగిన ఈ దేశం గత కాలపు గాయాల నుండి కోలుకొని నిలదొక్కుకున్న విధానం గుర్తుకు వస్తుంది. అసియా ఖండంలోనే చిన్న దేశమైన వియత్నాం ఇవాళ దేశభక్తిని నరనరాల నింపుకొని ప్రపంచ దేశాల సరసన నిలబడుతోంది. యుద్ధం చేసిన గాయాలు ఇంకా మిగిలేవున్నా ఆధునిక హంగులతో, బహుళ అంతస్తుల నిర్మాణాలతో ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తున్నది. గ్రామీణ వియత్నాం ఓ వైపు - నగర వియత్నాం మరో వైపు రా.. రమ్మని పిలుస్తుంటే వియత్నాం చూడటానికి బయల్దేరాం.
మాతో పాటు ఇంకో మూడు జంటలు వచ్చాయి. మొదట హైదరాబాద్ నుండి కంబోడియా, కంబోడియా నుండి వియత్నాం క్యాపిటల్ సిటీ హోచిమన్కి వెళ్ళాం. సిటీకి చేరగానే పొట్టిగా, చిన్నగా ఉన్న అక్కడి ప్రజలను చూసి ఆశ్చర్యపోయాను. పొట్టి వాళ్ళను చూశాను కానీ మరీ ఇంత పొట్టి వాళ్ళు వందలాది మంది స్కూటర్లమీద వెళుతూ ఉంటే బలే అనిపించింది. పైగా అందరూ చూడటానికి ఒకేలా ఉన్నారు. వాళ్ళును అలా దారివెంట చూస్తూనే మేము బస చేయాల్సిన హోటల్కు చేరుకున్నాం. వియత్నాంలోనే పైలట్గా ఉన్న మా ఫ్రెండ్ కొడుకు మాదగ్గరికి రావడంతో అతనితో కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకొని సిటీ సెంటర్లో మంచి వియత్నాం ఫుడ్ దొరుకుతుందని చెప్పడంతో అందరం కలిసి సిటి సెంటర్కు వెళ్ళాం.
కండ్లకు కట్టినట్టు చూపారు
వియత్నాంలో తిరగాల్సిన ప్లేస్లు చూసేందుకు ఆ హోటల్ నుండే ఓ టూర్ ప్యాకేజీని మాట్లాడుకున్నాం. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు అంతా తిప్పి చూపిస్తారు ఆ ప్యాకేజీలో. ఆ రోజు హౌటల్లోనే విశ్రాంతి తీసుకున్నాం. తర్వాతి రోజు ఉదయం ఏడు గంటలకు మా పర్యటన ప్రారంభమైంది. బస్లో ఎక్కి కూర్చున్నాం. మాతో పాటు ఆఫ్రికా, జర్మనీ దేశాలకు చెందిన యాత్రికులు కూడా ఉన్నారు. మొదట మమ్మల్ని వార్ జరిగిన ప్లెస్కు తీసుకెళ్ళారు. అదంతా ఒక అడవి గుండా ప్రయాణం. అమెరికా - వియత్నాం మధ్య జరిగిన యుద్ధంలో అక్కడి ప్రజలు తమ యుక్తులను ఉపయోగించిన విధానం కండ్లకు కట్టినట్టు చూపించారు. ఎక్కడికక్కడ భూగర్భంలో తొవ్విన గాదెలు ఉన్నాయి అక్కడ. గాదెలు అంటే శత్రు సైనికులను మట్టుబెట్టేందుకు భూమిలోపలికి లోతైన గుంతలు తీసి, దానిపైన కనిపించ కుండా గడ్డి కప్పి ఉంచుతారు. అటువైపు ఎవరైన శత్రువులు వస్తే 20 అడుగుల లోతున్న గుంతలో పడిపోతారు. అలా పడిపోయిన వాళ్ళను సులభంగా మట్టుబెట్టొచ్చని వారి ఎత్తుగడ. వాస్తవానికి ఆధునిక ఆయుధాలతో యుద్ధానికి తలపడ్డ అమెరికా, రైతుల నాయకత్వంలోని వియత్నాం చేతిలో ఓడిపోవడానికి కారణం ఇలాంటి స్థానిక యుద్ధ తంత్రాలే కారణం. ఇలాంటి యుద్ధ తంత్రాలు ఎన్నింటినో వియత్నాం వీరులు ఉపయోగించారు. వారి యుద్ద నైపుణ్యాలను, యుక్తులను పాఠాలుగా తీసుకుంటే మన దైనందిన జీవితాలలో ఎదురయ్యే ఎన్నో ఒడిదుడుకులను సునాయాసంగా ఎదుర్కొవచ్చు.
బొయ్యారాలు...
అక్కడే ఉన్న తుపాకులు పట్టుకొని ఉన్న సైనికుల బొమ్మల ముందు ఫొటోలు దిగాం. అక్కడి నుంచి 14 కిలోమీటర్లు అడవిమార్గంలో నడిచాం. అక్కడ ప్రదర్శన కోసం పెట్టిన ఓ యుద్ధ టాంకు మీద ఎక్కి ఫోటో దిగాం. అక్కడి నుంచి మా ప్రయాణం భూ మాలిగలలోకి వెళ్ళింది. భూ గర్భంలోపల చాలా దూరం బొయ్యారాలు తవ్వి అందులో స్థావరాలు ఏర్పాటు చేసుకొని అక్కడ దాక్కుని యుద్ధాలు చేసేవారట. విమానాలపై నుండి శత్రువులు దాడి చేసేటప్పుడు వాటి నుంచి రక్షించుకోవడానికి ఇవి బాగా పనికొస్తాయట. ఈ యుద్ధ క్షేత్రం తిరిగిన మాకు అర్థమైన విషయం ఏంటంటే వియత్నామీలు యుద్ధంలో ఉపయోగించిన ఆయుధాలు అన్నీ సాంప్రదాయమైనవే. అప్పటికే మధ్యాహ్నాం కావడంతో అడవిలోనే భోజనం చేశాం. అక్కడినుంచి మ్యూజియం చూడటానికి వెళ్ళాం.
యుద్ధం చేసిన గాయం
ఆ మ్యూజియంలో చాలా చాంబర్ విమానాలు పెట్టారు. అవన్నీ చూస్తూ లోపలికి వెళ్లాం. వియత్నాం వార్లో చనిపోయిన సైనికుల ఫొటోలు, అవయవాలు కోల్పోయి జీవచ్ఛవాలుగా జీవిస్తున్న వారి ఫోటోలు, యుద్ధం చేసిన గాయంతో నిరాశ్రయులుగా మారిన వారి ఫోటోలు అక్కడ భద్రపరిచారు. వాటిని చూస్తే హృదయం కకావికలమైంది. ఇటువంటివి చూసైన భవిష్యత్లో యుద్ధాల జోలికి వెళ్ళకుండా ఉండాలని వాటిని అక్కడ ప్రదర్శనకు పెట్టినట్లు అనిపించింది.
అర్ధాంతరంగా ముగించుకొని
అవన్నీ చూచిన తర్వాత అక్కడే ఉన్న ఓ చిన్న షాపింగ్ లాంటి ప్రదేశానికి వెళ్ళాం. లక్కతో తయారు చేసిన వస్తువులు చాలా ఉన్నాయక్కడ. వియత్నాం వారి చేతి నైపుణ్యం ఆ వస్తువుల్లో కనిపిస్తుంది. అప్పటికే మారోజు షెడ్యూలు దగ్గర పడటంతో వారితో ఒక ఫొటో దిగి తిరిగి హోటల్కు చేరుకున్నాం. వియత్నాంలో మేము చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నప్పటికీ మా అమ్మ చనిపోయిందనే వార్త ఇంటినుండి రావడంతో వియత్నాం పర్యటనను అర్ధాంతరంగా ముగించుకొని ఇంటికి వచ్చాం.
హాలాంగ్ బే
వియత్నాంలో చూడాల్సిన ప్రదేశాలు చాలా మిగిలిపోయాయనే బాధ చాలా కాలం వేధించడంతో తిరిగి 5 ఏండ్ల తర్వాత మళ్ళీ వియత్నాం గడ్డమీద అడుగుపెట్టాం. ఈ సారి వియత్నాం చూడటానికి మాతో పాటు మరో నాలుగు జంటలు వచ్చాయి. అందరం కలిసి 'హాలాంగ్ బే' వెళ్ళాం. హాలాంగ్ అంటే 'డ్రాగన్ కిందికి దిగుతున్నట్లుగా వున్న స్థలమని' అర్థమట. ఇక 'బే' అంటే సముద్రం ఓ ఆకారంలో వున్న దానిని 'బే' అని అంటారు. ''యునెస్కో వరల్డ్ హెరిటేజ్'' వారితో గుర్తించ బడిన స్థలం ఈ హాలాంగ్ బే. దీనికి చాలా చరిత్రనే ఉంది. సముద్రతీరానికి వచ్చిన అన్ని పడవల్నీ, నౌకల్నీ ఇక్కడికి రాకుండా వియత్నాం సైనికులు ఇక్కడ ఆపేశారట. చైనీస్ నౌకల్ని కూడా ఇక్కడే కట్టడి చేశారు. 1288 లో ''ట్రాన్ హంగ్ దావో'' మంగోలియా నౌకల్ని కూడ ఈ ప్రాంతంలోనే ఆపేశారు. అమెరికాతో జరిగిన వార్లో కూడా ఎన్నో వాటికి ఇక్కడ ఎదురు దెబ్బతీశారట.
హాలాంగ్ బే గుహలు
మునుపటిలా కాకుండా ఈ సారి ఓ కారు తీసుకొని ఎనిమిది మందిమి హాలాంగ్ బే కు చేరుకున్నాం. అక్కడే పడవల్ని మాట్లాడుకొని హాలాంగ్ బే లో వున్న గుహలని చూడడానికి బయల్దేరాం. అందరం వెళుతున్నప్పుడు టిఫిన్ బాక్స్లో అన్నం నెయ్యి పప్పు కలిపిన తీసుకొని వెళ్ళాం. కాబట్టి ఆ పడవల్లోనే టేబులుపై వాటిని పెట్టుకొని తింటూ ప్రయాణం చేశాం. ఆ ప్రయాణం గంటన్నర సాగింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్పాలి. మేము ఇలా పడవల్లో వెళుతూ ఉంటే ఓ వైపు జోరున వర్షం, మరో వైపు చిన్న చిన్న పడవల్లో వ్యాపారులు ఎంబ్రాయిడరీతో చేసిన పర్సులను తీసుకొచ్చి పడవల్లో ఉన్న వారికి అమ్ముతున్నారు. చూడటానికి భలే అనిపించింది. అన్నీ చౌకధరకు లభించే చిన్న చిన్న వస్తువులే. అలా పడవలో వ్యాపారం చేయడం బాగా అనిపించింది. అందరూ మిత్రుల కోసం కొంటుంటే 40-50 రూపాయలే కావడంతో నేను కూడా కొన్నాను. మేము చూడాల్సిన ప్లేస్ రావడంతో తడుస్తూనే గుహలోపలికి వెళ్ళాం. వందలాది మంది యాత్రికులు అక్కడికి చేరుకున్నారు. మాతో పాటు వచ్చిన గైడ్ మాకు ఆ గుహ విశేషాలను అన్నింటిని తిప్పి చూపించాడు. వాటన్నింటిని తిరిగి చూసే సరికి మా పడవ కూడా వెళ్ళడానికి సిద్దంగా ఉండటంతో ఎక్కి తిరుగుప్రయాణమయ్యాం.
ఫ్లోటింగ్ విలేజ్
2వ రోజు ఫ్లోటింగ్ విలేజికి వెళ్ళాం. దాని పేరు ''వుంగ్ వియాంగ్''. ఇది హాలాంగ్ బే కి 40 కి.మీ. దూరంలో వుంది. ఇక్కడ అన్నీ క్రూజ్లు తిరుగుతాయి. ఇక్కడ చాలా ఇళ్లు నీళ్ళలో కట్టారు. ఇది ఎంతో అందంగా వుంది. చుట్టూ ఎత్తైన కొండలలో నీలి రంగు పెయింట్, ఎర్రని పెంకులతో ఆ నీటిలో ఈ ఇళ్ళన్నీ తేలుతున్నాయా అనిపించింది. ఇది వరకు వీరి జీవనోపాధి చేపలు ముత్యాలు అయినా ఇప్పుడు మాత్రం యాత్రికులతోనే వారు ఎక్కువగా సంపాదిస్తున్నారు. ఎన్నో పడవల్లో టూరిస్టులను తీసుకొని వెళ్ళుతున్నారు. ఇక్కడ వారి చదువులు, స్కూళ్లు, భవనాలు అన్నీ నీళ్ళలోనే వున్నాయి. ఎక్కడికి వెళ్ళాలన్నా నీళ్ళలోనే వెళ్తారు. ఇక్కడి వారు అన్నీ చేతితో తయారు చేసిన వస్తువుల్ని అమ్ముతూ జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. పేదరికం కొట్టొచినట్లు కనిపించింది. సాయంత్రం వరకు ఈ గ్రామంలో గడిపి సాయంత్రానికి తిరిగి వచ్చాం.
మా గ్రూపంతా కలిసి అక్కడ కొన్ని బొమ్మలు కొని అక్కడ నుండి ఆభరణాలు తయారు చేసే ఫ్యాక్టరీకి వెళ్ళాం. ఎవరికి ఇష్టమైనవి వాళ్ళు కొనుక్కున్నారు. గాజులు, కెంపులతో తయారు చేసివని మా ఫ్రెండ్స్ కొనుక్కున్నారు. వాటిని చూశాక హోటల్కు వచ్చి అక్కడి నుండి కాంబోడియాకు తిరుగు ప్రయాణమయ్యాము.
Authorization