జలజలా పారే సెలయేళ్ళు.. పైనుండి దూకే జలపాతాల నడుమ ఆకుపచ్చని అడవులు.. కొండగుహలు.. ఎత్తైన రహదారుల.. చారిత్రక నిర్మాణాలు.. ఇంకా ఎన్నెన్నో అందాలు.. ప్రకృతిలోని అందాలన్నీ ఒకే చోట కుప్పబోసినట్లు కనువిందు చేస్తాయి. అలాంటి వాటిలో ఆదిలాబాద్ జిల్లాలో సహజ సిద్ధంగా ఏర్పడిన మిట్ట వాటర్ ఫాల్స్ ఒకటి. దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..
న తెలంగాణాలో చూడదగ్గ పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. కొమురంభీం యుద్ధబేరి మోగించిన జోడేఘాట్ ఇప్పుడు ప్రకృతి అందాలతో పర్యాటకులను పలకరిస్తున్నది. సప్తగుండాల జలపాతాలు సరికొత్త స్వరాలు వినిపిస్తున్నాయి. కేరమెరి ఘాట్ రోడ్ కొత్త దారులు తెచ్చుకుంటున్నది. అంతే కాదు పాండవుల గుహలు, రాప్పదేవాలయం, సోమశిల ఇలా ఎన్నెన్నో అద్భుతాలకు నెలవు తెలంగాణ.
న సహజ సిద్ధమైన ప్రకృతి అందాలెన్నో ఆదిలాబాద్ జిల్లాలో దర్శనమిస్తాయి. అడవి నడుమ పారే గోదావరి గలగలలు.. ఎత్తైన జలపాతాలు అలరిస్తుంటాయి. సప్తగుండాల వాటర్ ఫాల్స్ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. వాటిల్లో పిట్టగూడ గ్రామ సమీపంలో గల మిట్ట వాటర్ ఫాల్ చూస్తే ఔరా అనిపిస్తుంది.
న ఎత్తైన కొండ చరియల నుంచి జలజలా జారే జలపాతం.. కింద ప్రవహించే నీరు... చుట్టూ దట్టమైన అడవి.. నిజంగా ఆఫ్రికా అడవుల్లో ఉన్న అనుభూతి కలిగిస్తోంది. ప్రకృతి అందాలకు, ఆదివాసిల ఆటపాటలకు, అందాల జలపాతాలకు హస్తకళలకు, ఆధ్యాత్మిక కేంద్రాలకు నెలవు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా.
న ఓ వైపు సహ్యాద్రి పర్వతాలను ఆనుకుని ఉన్న కుంటాల జలపాతం.. మరోవైపు ఈ పర్వతాలకు దిగువన ఉండే కెరమెరీ పర్వత పంక్తుల అందాలు ఇట్టే ఆకట్టుకుంటాయి.
న జిల్లాలోని మిట్ట జలపాతం అందాలు చూడాలంటే కెరమెరి ఘాట్ను దాటుకుంటూ వెళ్ళాలి. కెరమెరి పర్వత పంక్తులు ప్రారంభంలో ఓ ఎత్తైన మంచెను ఆనాటి నిజాం పాలకులు నిర్మించారు. దాని పై నుండి ప్రకృతి అందాలను వీక్షించే ఏర్పాట్లు చేశారు. గిరిజన వీరుడు కొమురం భీం ప్రాణాలు అర్పించిన జోడేఘాట్ పర్వత పంక్తులు సైతం ఈ కెరమెరి పర్వతాలను ఆనుకుని ఉండటం విశేషం.
న ఇక్కడికి చేరుకోవాలంటే ఆసిఫాబాద్ -ఉట్నూర్ రహదారి వెంట ప్రయాణం చేసేటప్పుడు చుట్టుపక్కల అందాలను వీక్షిస్తూ పరవశించిపోవాల్సిందే. కుంటాల ..పోచ్చేర..గాయత్రి...కనకారు ..జలపాతాలు జిల్లాకు అదనపు ఆకర్షణలు.
న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి కొత్తగా ఏర్పాటు అయిన అసిఫాబాద్ కోమురంభీం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు మిట్ట జలపాతం అందాలు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి.
న అసిఫాబాద్ జిల్లాలో కొత్తగా ఏర్పడిన లింగాపూర్ మండంలోని పిట్టగూడా నుండి 3 కిలోమీటర్లు కాలినడకన వెళితే గాని మిట్ట జలపాతానికి చేరుకోలేం. అసిఫాబాద్ జిల్లా కేంద్రం నుండి పిట్టగూడ వరకు మాత్రమే రోడ్డు సౌకర్యం ఉంది. అక్కడి నుండి మిట్ట జలపాతం వరకు కాలి నడకనే వెళ్లాలి. పచ్చని ప్రకృతి నడుమ నడుచుకుంటూ వెళుతుంటే సందర్శకుల ఆనందానికి అవదులుండవు. అక్కడికి చేరుకోగానే ఒకదాని పక్కనే ఒకటి 7 జలపాతాలు దర్శనమిస్తాయి. వీటినే సప్తగుండాలు లేదా సప్త జలపాతాలు అని పిలుస్తారు.
న వర్షాకాలంలో చుట్టుప్రక్కల ప్రవహించే సెలయేళ్లు, పచ్చని అటవీ శ్రేణులు ఊటీని తలదన్నే విధంగా చక్కటి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. సహజ సిద్ధమైన ప్రకృతి అందాలను తిలకించేందుకు పొరుగు రాష్ట్రాల నుండి కూడా పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు.
Authorization