దాదాపు అయిదు సంవత్సరాల నుండి అతి సుందర ప్రదేశమైన న్యూజిలాండ్ని చూడాలని నా కోరిక. ఇన్నాండ్లకు ఆ కోరిక తీరింది. మా బందువుల అబ్బాయి కాదు కాదు మా రెండవ కొడుకైన హరీష్ రెడ్డి ఆహ్వానం మేరకు న్యూజిలాండ్ దేశానికి పర్యాటకులుగా వెళ్ళాం. ఎటు చూసినా సముద్రం నుండి నీటి అలల సంగీతం , ఇసుక తిన్నెల సైకత వేదికలు , పక్షుల మంద్ర స్వరాలు. అలాంటి చూడచక్కని న్యూజిలాండ్ దేశపు విశేషాలు ఈ రోజు మీతో పంచుకుంటున్నాను.
న్యూజిలాండ్ ఆస్ట్రేలియా ఖండంలోని ఓ సుందరమైన దేశం. దేశ జనాభా కంటే ఎక్కువ ఆవుల మందలతో అలరారుతున్న దేశం. న్యూజిలాండ్ ఉత్తర భాగం వాంగేరి ప్రాంతాన్ని కోస్టల్ ప్యారడైజ్గా అభివర్ణించవచ్చు . ఒక్క వాంగేరి జిల్లాలోనే 100 కి పైగా బీచ్లున్నాయి. ఆ సముద్ర జలాలలో మనం ఈదులాడ వచ్చు, బోటింగ్ చేయవచ్చు. ప్రియమైన వారితో కలిసి ఎన్నెన్నో అందాల్ని ఆస్వాదించవచ్చు . దూరంగా ఎత్తైన కొండలు, కొనలు, పచ్చిక బయళ్ళు, జలపాతాలు కనువిందు చేస్తాయి. అవన్నీ చూశాక తిరిగి సాయంత్రం ఆక్ ల్యాండ్ నగరానికి చేరుకొన్నాం.
ఆక్ ల్యాండ్ అందాలు
ఆక్ ల్యాండ్ నగరం పరిశుభ్రమైన వీధులతో, రోడ్లతో అతి సుందర మైన భవనాలతో చూడ ముచ్చటగా ఉంది . ఇది ఎంతో పెద్ద నగర మైనప్పటికి ఎక్కడ కూడా ట్రాఫిక్ సమస్యలుండవు.ఇండియా లాగ రోడ్ల పైన ఆవు లుండవు. ఆక్ ల్యాండ్ నగరం మద్యలో 60 అంతస్తుల స్కై టవర్ నిర్మించారు. ప్రతి రోజూ వందలాది పర్యాటకులు దాన్ని ఎక్కి నగర అందాల్ని తమతమ కెమెరాల్లో బంధిస్తారు. అంత ఎత్తు నుండి ఆక్ ల్యాండ్ సిటీ అందాల్ని చూసి తరిస్తారు. అక్కడక్కడ నగరంలోకి పాయలు పాయలుగా సముద్రం విస్తరించివుంది. అదో అద్బుత నగరం. అందుకే అక్కడికి ఎక్కడా లేని విధంగా యేటా లక్షల మంది పర్యాటకులు వచ్చి పోతుంటారు.
పాడిపరిశ్రమకు ప్రసిద్ధి
మరుసటిరోజు న్యూజిలాండ్ దేశంలోని అతిపెద్ద నదైనా వై కాటో నదితో పాటు ఆ నది తీర ప్రాంతాలని దర్శించటానికి వెళ్లాం.18వ శతాబ్దాని కంటే ముందు న్యూజిలాండ్లో ఆ దేశ భూమి పుత్రులైన మావొరీ తెగ ప్రజలు మాత్రమే నివశించే వారు. షaఱ అంటే మావోరి భాషలో నీరు అని అర్థం. కాటో అంటే నీటి పాయ లేక నీటి స్థావరమని అర్థం. హామిల్టన్ వై కాటో ప్రాంతమంతా ఎటు చూసినా పచ్చటి గడ్డి భూములు, ఆవుల మందలు అలరిస్తాయి. దేశంలో పాడి పరిశ్రమ భాగా అభివృద్ది చెందింది. ప్రస్తుతం న్యూజిలాండ్ నుండి పాలను, పాల ఉత్పత్తులను యాభై దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అలాగే అక్కడే చెట్లను, అడవులను ఎక్కువగా పెంచుతున్నారు. కొన్ని చోట్ల చెట్లతోనే గోడ కట్టినట్లుగా ఏర్పాట్లు చేశారు. ఆవుల మందల్ని, విస్తారమైన గడ్డి భూముల్ని చూసిన తర్వాత వైటోమో గుహల వద్దకు వెళ్లాం. ఆ గుహలు ఏర్పడిన తీరు గైడ్ వివరిస్తుంటే ఆశ్చర్యపోయాం. చీకటి గుహల్లో మిణుగురు పురుగులు వెలుతురు ప్రసాదిస్తున్నాయి. గుహల పైభాగంలో మరో నీలి ఆకాశం, నక్షత్రాలు. చూసేందుకు ఎంత అద్బుతంగా ఉన్నదో.
రైడింగ్ బస్సులో ప్రయాణం
రెండు రోజులు ఉత్తర న్యూజిలాండ్లోని సుందరమైన పర్యాటక ప్రాంతాలు చూసిన తర్వాత మూడవ రోజు ఆక్ ల్యాండ్లో లోకల్ విమానమెక్కి క్వీన్స్ టౌన్ చేరుకొన్నాం. ఆ రోజు రాత్రి వరకు నగర మంతా చూసి రాత్రి సెయింట్ జేమ్స్ అపార్ట్ మెంట్లో బస చేశాం. తెలతెలవారుతుండగా ఉదయం ఆరు గంటలకే రైడింగ్ బస్సు ఎక్కి మిల్ ఫోర్డ్ సరస్సుకి బయలు దేరాం. పచ్చటి అడవుల్ని కొండల్ని, లోయల్ని దాటేస్తూ బస్సు నూట యిరువై కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. ఎత్తైన పర్వతాల నుండి మంచు కరిగి పాయలు పాయలుగా జలపాతాల రూపంలో నేలపై దూకుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల జలపాతాలు చిన్న చిన్న ఏరులై , నదులై అతిపెద్ద సరస్సు ఏర్పడింది. సముద్రాన్ని తలపిస్తుంది. అది ఓ అపురూప దృశ్యం.అంతకు మించి అద్బుత సొందర్యం. పర్యాటకులు రైడింగ్ బస్సులు దిగి వారి వారి కెమెరాల్లో, సెల్ ఫోనుల్లో జలపాతాల్ని, కొండల్ని, లోయల్ని, అడవి అందాల్ని నిక్షిప్తం చేసుకున్నారు. సరస్సులో విమానం లాంటి నావిగేషన్ పడవలో మరో రెండు గంటలు ఆట పాటలతో జల విన్యాసాలు, లంచ్ ఏర్పాటు చేశారు. ''కులుకు లొలుకు చెలి చెంతన ఉంటే బృందావనమెందుకు, విహార యాత్రలెందుకు'' పాట వరస మారుతుంది. బృందావనంలో చెలియల నవ్వులే పువ్వులై విరుస్తున్నవి. ఎటు చూసినా పగలే వెన్నెల జగమే ఊయల. ప్రకృతి అందాల్ని కండ్లతో జుర్రేస్తున్న సందడి. అందాల ఖజానా వశమైనట్టుగా యాత్రికుల కేరింతలతో అతి సుందరంగా ఉంది. కనుచూపు మేరలో ఎటు చూసినా జలపాతాలే. మిల్ ఫోర్డ్ సౌండ్ ఏరియా ఓ అందమైన ప్రపంచాన్ని తలపిస్తుంది. సాయంత్రం తిరిగి క్వీన్స్ టౌన్ చేరుకొన్నాం. తెల్లవారి మళ్ళీ ఆక్ ల్యాండ్ చేరుకొన్నాం. న్యూజిలాండ్లోని అతిపెద్ద నగరం ఆక్ ల్యాండ్. ఆ దేశం లోని మొత్తం జనాభాలో నాలుగవ వంతు ఆక్ ల్యాండ్లో నివసిస్తున్నారు. న్యూజిలాండ్ దేశంలో చిన్న చిన్న గ్రామాలు తక్కువ. దాదాపు లేవనే చెప్పాలి. చిన్న పట్టణాలతో కలిపి పది వరకు ఉన్నాయి.
అందమైన ఉద్యాన వనాలు
న్యూజిలాండ్లో అడుగడుగునా పచ్చిక బయళ్ళు, (రబఅఅy శ్రీaషఅర ) సుందర ఉద్యాన వనాలు అపురూపమైన పూల మొక్కలతో దర్శన మిస్తాయి. ఒకే చోట 28 ఎకరాలలో ప్రపంచ దేశాల ముఖ్యంగా ఇండియా, చైనా, అమెరికా, బ్రిటన్ దేశాల గార్డెన్స్లలోని పూల మొక్కలతో ఏర్పాటు చేశారు. ఆ ఉద్యాన వనాలలో ఏడు వేలకు పైగా వివిధ రకాల పూల మొక్కలున్నాయి. పూల గుసగుసలు, చిన్నిచిన్ని పక్షుల సరాగాలు వినిపిస్తాయి.జంట గువ్వల సయ్యాటలు అలరిస్తాయి. సందర్శకులు ఎలాంటి రుసుం లేకుండా సందర్శించ వచ్చు. చాలా తోటలు సaషఅ సబరస వరకు తెరిచే ఉంటాయి. వేల రకాల పూల మొక్కలు చిరు నవ్వుల పూలతో కియా ఒరా అంటూ న్యూజిలాండ్ భూమి పుత్రుల భాష అయిన మౌరి భాషలో స్వాగతిస్తాయి. ఆక్ ల్యాండ్ నుండి వంద కి.లో మీటర్లు కారులో ప్రయాణిస్తే వైకాటో రివర్ అందాలు, వాంగేరి నగర సొగసులు, ముచ్చట గొలిపే వైటోమో గుహల అండర్ గ్రౌండ్ అద్భుతాలు చక్కటి కనువిందు చేస్తాయి.
చారిత్రక ఒప్పంద స్థూపం
న్యూజిలాండ్ దేశ చారిత్రిక విశేషాల్ని, ప్రజల నాగరికతని తెలసుకోవాలంటే న్యూజిల్యాండ్ భూమి పుత్రులైన మావొరీ ప్రజా నాయకుల తెగల మధ్య ఐరోపా సేటిలర్స్ మధ్య జరిగిన ఒప్పంద స్థుపాన్ని, మ్యూజియాన్ని దర్శించాల్సిందే. అక్కడి భూమి పుత్రుల ఔదార్యాన్ని , ఐరోపా వలసవాదుల గొప్పతనాన్ని రెండు జాతుల్ని నిండు మనసుల్ని కొనియాడక తప్పదు. ఆ ఒప్పంద ఫలితంగానే భిన్న జాతుల వాళ్ళు కలిసిమెలిసి జీవిస్తున్నారు. అక్కడ ప్రజల మధ్య ఎలాంటి గొడవలు లేవు. ఆ ఒప్పందం జరిగిన చోట స్థుపాన్ని నిర్మించారు. భవన నిర్మాణం చేసి మ్యూజియాన్ని ఏర్పాటు చేసారు. మావొరీ తెగ ప్రజానాయకులకు ఐరోపా వలసవాదులకు ఒప్పందం 1836లో జరిగింది.దాదాపు నూట ఎనభై సంవత్సరాలు గడిచినప్పటికీ రెండు జాతుల మద్య ఎలాంటి గొడవలు లేవు. సుఖ శాంతులతో జీవిస్తున్నారు. గొప్ప సంస్కృతినీ, విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని పాటిస్తున్న న్యూజిలాండ్ ప్రజానీకానికి పాత కొత్త తరాల వారందరికీ జేజేలు పలకాలి. ఆ న్యూజిలాండ్ వాసుల బాటలో ప్రపంచ ప్రజందరూ నడవాలి. అంతటి గొప్ప స్థూపాన్ని వైటాంగి ట్రీటీ చారిత్రిక ఒప్పందం జరిగిన చోట ఫొటోలు తీసుకున్నాం. నా ప్రపంచ విహార యాత్రలో న్యూజిలాండ్ పర్యటన ఓ మధురానుభూతి.
Authorization