ఉత్తరాఖండ్లో చూడదగ్గ పర్యాటక ప్రదేశం ఔలి. అప్పుడే విచ్చుకున్న మొగ్గలా ఎంతో అందమైన ప్రదేశం ఇది. అందుకే దీన్ని టూరిస్ట్ హబ్గా మార్చాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. గోండాలా కేబుల్ కార్లో ఔలి నుంచి జోషిమఠ్కు సాగే ప్రయాణంలో భారత్లోని టిబెట్ దేశాల సరిహద్దులో ఉన్న 'మానా' గ్రామం కనిపిస్తుంది. ప్రసిద్ధ హిమశిఖరాలు నీల్కాంత్, నందాదేవి కూడా దర్శనమిస్తున్నాయి. ఔలీ నుంచి జోషిమఠ్కు రోప్ జర్నీ 20 నిమిషాలు ఉంటుంది.
స్నోఫాల్ చూడాలనుకుంటే
ఉత్తరాఖండ్లో ఔలి ఉన్న ప్రదేశం గర్వాలీ రీజియన్. ఇక్కడ స్థానిక భాష గర్వాలి. వాళ్లు తమలో తాము గర్వాలీ భాషలో మాట్లాడుకుంటుంటారు. పర్యాటకులతో హిందీలో మాట్లాడతారు. అధికారిక కార్యక్రమాలు హిందీ, సంస్కృతం భాషల్లో జరుగుతాయి. ఔలిని గర్వాలీ భాషలో భుగ్యాల్ అంటారు. అంటే పచ్చిక బయలు అని అర్థం. మంచుకొండల్లో చొచ్చుకుని వచ్చిన పచ్చిక నేల అన్నమాట. శీతాకాలంలో ఈ మాత్రం పచ్చదనం కనిపించదు. పూర్తిగా మంచు కప్పేస్తుంది. స్నో ఫాల్ చూడాలనుకునే పర్యాటకులకు చలికాలం మంచి సమయం.
ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ...
ఔలికి చేరేటప్పుడు దారిలో కొండవాలు పరవళ్లుతొక్కుతూ ప్రవహించే నదులు కనిపిస్తాయి. అదంతా మంచు కరిగిన నీరే. అప్పుడే విచ్చుకుంటున్న పూలకు ఇది కేరాఫ్ అడ్రస్ అనే చెప్పాలి. ఔలిలో మంచు కొండల మధ్య నేలంతా పరుచుకున్న మంచులో విహరిస్తున్న పర్యాటకులను చూస్తే వారి ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం.
స్కీయింగ్ శిక్షణా కేంద్రం
ఇక్కడి రిసార్టులో మంచు కుర్చీలు, మంచు టేబుళ్ల ఆసక్తిగా, వింతగా కనిపిస్తాయి. గర్వాల్ మండల్ వికాస్ నిగమ్ స్థానికంగా నిర్వహించే స్కీయింగ్ శిక్షణ కేంద్రం కనిపిస్తోంది. ఇక్కడికి ఏటా కాశ్మీర్ రాష్ట్రం గుల్మార్గ్ నుంచి ఇన్స్ట్రక్టర్లు వచ్చి స్కీయింగ్లో శిక్షణనిస్తారు. సూర్యోదయం, సూర్యాస్తమయాలు ఎప్పుడూ అందంగానే ఉంటాయి. మంచు కొండల్లో ఆ అందం ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నట్లు ఉంటుంది. పర్యాటకులు సన్ సెట్ వ్యూ, టాప్ మౌంటెయిన్ వ్యూ చూసేందుకు పోటీ పడుతుంటారు. ఇక్కడకు జోషిమత్ నుంచి రోప్ వే ద్వారా చేరుకోవచ్చు. ఈ ప్రదేశం వద్ద ఎలాంటి వసతి సౌకర్యాలూ ఉండవు. అందువల్ల పర్యాటకులు ప్రతి రోజు ఉదయం వెళ్లి సందర్శించి రాత్రికి ఔలికి చేరుకోవాలి. గుర్సో బుగ్యల్ నుంచి కిలో మీటర్ దూరంలో చట్టర్కుండ్ అనే చిన్న సరస్సు ఉంది. దానిని కూడా సందర్శించవచ్చు.
Authorization