మహారాష్ట్రలో రత్నగిరి జిల్లా ఒకటి. ఇది జిల్లాకేంద్రంగాఉంది. రత్న అంటే మరాఠీలో రత్నం అని అర్ధం. గిరి అంటే పర్వతం. రత్నగిరి అంటే రత్నాల పర్వతం అని అర్ధం. డాక్టర్ అంబేద్కర్, లోకమాన్య తిలక్, బాబా పాఠక్, సానే గురూజీ, అనంత్ కంహరె ఇలా అనేక మంది జాతిరత్నాలను దేశానికి అందించింది కనుక ఇది రత్నగిరి అయిందని భావిస్తున్నారు. రత్నగిరి కోటకు ఇరువైపులా ఉన్న రెండు సముద్రతీరాలలో ఒక దానిలో తెల్లని ఇసుక మరొక దానిలో నల్లని ఇసుక ఉండడం విశేషం. ఇక్కడ ఇటువంటి వింతలు చాలానే ఉంటాయి. మరి ఇక్కడున్న బీచ్లు ముఖ్యంగా బంగారు కోట విశేషాలు తెలుసుకుందామా...
తిబా ప్యాలెస్
తిబా ప్యాలెస్ క్రీ.శ. 1910 - 1911 మధ్యకాలంలో నిర్మించబడింది. ఇది దేశ బహిష్కరణ గావించబడిన బర్మా రాజు, రాణి కొరకు నిర్మించబడింది. వారు ఈ ప్యాలెస్లో క్రీ.శ. 1911 నుండి క్రీ.శ. 1916 వరకు నివసించారు. వారు నివసించిన దానికి గుర్తుగా ఇక్కడ రెండు సమాధులు కూడా ఉన్నాయి.
మాల్గుండ్
మాల్గుండ్ ప్రముఖ మరాఠీ కవి కేశవ్సూత్ జన్మస్థలం. ఇది ఒక చిన్న ప్రశాంతమైన గ్రామం. గణపతిపులె నుండి ఇది 1 కి.మీ దూరంలో ఉంది. కవి నివసించిన గృహం ఓ సందర్శన ప్రదేశంగా ఉన్నది. మరాఠీ సాహిత్య పరిషద్ కవి 'కేశవ్సూత్' పేరిట స్మారక చిహ్నం నిర్మించింది.
జైగాడ్ కోట
జైగాడ్ కోట సంగమృశ్వర్ నదీ ముఖద్వారం వద్ద నిర్మించబడింది. ఇది గణపతి పులే నుండి 25 కి.మీ దూరంలో ఉంది. 17వ శతాబ్ధానికి చెందిన ఈ కోట సముద్రతీరంలో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. జైగాడ్స్ సీ ఫోర్ట్ షెల్టర్డ్ బేలో ఉంది. ఇక్కడ సముద్రతీరం చిన్నగా ఉండి సురక్షితంగా ఉంటుంది.
వెల్నేశ్వర్
రత్నగిరి కి 170 కి.మీ దూరంలో ఉన్న వెల్నేశ్వర్ చిన్న గ్రామం ఇది. ఇక్కడ సముద్రతీరం శుభ్రంగా ఉంటుంది. ఇక్కడ కొబ్బరి చెట్లు బారులు తీరి ఉండి రాళ్ళు లేని ప్రాంతంగా ఉంటుంది. కనుక ఈతకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న ' వెల్నేశ్వర్' అనే పురాతన శివాలయం అనేకమంది భక్తులను ఆకర్షిస్తుంది.
సువర్ణ దుర్గం
చుట్టూ సముద్రం, మధ్యలో కోట. ఆ కోటే సువర్ణదుర్గం. హర్నారు దగ్గర సముద్రపు నీటి మధ్యలో ఈ కోట ఉంది. తీరం నుంచి సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో కొండపై ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు. లోపల ఎన్నో భవనాలు, నీటి వనరులు ఇలా సకల సదుపాయాలు ఉన్న ఆనవాళ్లు కనిపిస్తాయి. శివాజీ కాలంలోనే దీన్ని 'సువర్ణదుర్గ్' అని పిలిచేవారు. ఈ కోటను చూడడానికి వందలాదిగా పర్యాటకులు పడవల్లో వస్తుంటారు. ఇక్కడికి దగ్గరలో కనకదుర్గ్ అనే మరోకోట ఉంది. సువర్ణదుర్గ్ కోట కాపాడటానికే ఈ కోటని నిర్మించారని చరిత్రకారులు చెబుతున్నారు.
గురునాడా కోట
ఈ కోట గురునాడా ఆకారంలో ఉంటుంది. పొడవు 1300 మీటర్లు వెడల్పు 1000 మీటర్లు. కోట మూడు వైపులా సముద్రం ఉంటుంది. నాలుగవ వైపు మాత్రమే భూమి ఉంటుంది. కోటలో ఇప్పటికీ లైట్ హౌస్ ఉంది. ఇక్కడ అందమైన భగవతి ఆలయం ఉంది. ఆలయ సమీపంలో మెట్లబావి ఒకటి ఉంది.
మర్లేశ్వర్ ఆలయం
మార్లేశ్వర్ ఆలయం సాహ్యాద్రి కొండమీద ఉంది. ఇక్కడ ఉన్న మర్లేశ్వర్ జలపాతం ప్రధాన పర్యాటక ఆకర్షణగా ఉంది. ఆలయం పక్కనే జలపాతం ఉంది. ఇది మరల్ గ్రామం వద్ద ఉంది. ఇది దియోరుఖ్ గ్రామానికి 16 కి.మీ దూరంలో ఉంది
గుహగర్ బీచ్
గుహగర్లో ఉన్న ఈ సముద్రం అంత లోతైనది కాదు. అయితే ఇక్కడ స్విమ్మింగ్, వాటర్ స్పోర్ట్స్కు అనుకూలంగా ఉంటుంది. ఈ బీచ్లో మరో ప్రత్యేకం ఉదయం, సాయంత్ర సమయాల్లో సూర్యచంద్రలను చూడటం చాలా గ్రేట్ గా ఉంటుంది. ఈ సన్ సెట్లో బీచ్ అందాలను చూడటం నయన మనోహరంగా ఉంటుంది. ఈ బీచ్లో తెల్లని ఇసుకు వెండి వెన్నల్లో మిలమిల మెరుస్తుంటుంది.
వెలాస్ బీచ్
ఈ బీచ్ చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో టూర్టెల్ ఫెస్టివల్ జరుపుతారు. ఈ ఫెస్టివల్ జనవరి, ఫిబ్రవరిలో జరుగుతుంది. ఈ బీచ్లో తాబేళ్ళు ఎక్కువగా ఉంటాయి. అంతే కాదు ఈ బీచ్లో ఉండే తాబేళ్ళు ఒక్కొక్కటి ఒకసారికి 90-150 గుడ్లు పెడుతుంది. ఈ గుడ్లు 55 రోజుల వరకు అలాగే ఉండి తర్వాత పిల్లలను చేస్తాయి.
తిలక్ మ్యూజియం
రత్నగిరిలో చూడదగిన మరో పర్యాటక స్ధలం తిలక్ మ్యూజియం. ఈ ప్రదేశం ప్రఖ్యాత స్వాతంత్ర పోరాట యోధుడు లోకమాన్య తిలక్ పూర్వీకులది. మ్యూజియం స్ధానిక కొంకణి శిల్పశైలికి అద్దంగా నిలుస్తుంది. ఈ మ్యూజియం తిలక్ జీవిత అంశాలను ఎంతో వివరవంతంగా చిత్రాలు, ఇతర విధాలుగా ప్రదర్శిస్తుంది. ఒక్కసారి ఈ మ్యూజియం దర్శిస్తే చాలు తిలక్ స్వాతంత్ర పోరాటంలో ఎటువంటి పాత్ర తీసుకున్నాడనేది తెలిసిపోతుంది. ఆనాటి భారతీయులు స్వాతంత్రం కొరకు పడిన కష్టాలు అర్ధం అవుతాయి.
అంజర్లే బీచ్
ఇది ఓ అద్భుతమైన తెల్లని ఇసుక ఉన్న బీచ్. దీన్ని రత్న గిరి సమీపంలో కనుగొన్నారు. ఈ బీచ్లో ప్యారాసైలింగ్, స్నోర్కెలింగ్, వైండ్ సర్ఫింగ్ వంటి స్పోర్ట్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే అక్కడే లోకల్గా సీఫుడ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈ అంజ్లే బీచ్ దగ్గర డాల్ఫిన్ కూడా చూడవచ్చు. ఈ బీచ్కు సమీపంలో కద్యవార్చా గణపతి టెంపుల్ను సందర్శించవచ్చు.
ఎలా చేరుకోవాలి?
విమాన మార్గం: రత్నగిరిలో విమానాశ్రయం నిర్మించబడి ఉన్నప్పటికీ ఇది రవణా అవసరాలకు ఉపయోగపడడం లేదు. కాబట్టి 170 కి. మీ. దూరంలో ఉన్న సాంబ్రే ఎయిర్ పోర్ట్ (బెల్గాం ఎయిర్ పోర్ట్) వద్ద గాని లేదంటే దబొలిమ్ ఏర్ పోర్ట్ ( గోవా ఏర్ పోర్ట్) వద్ద గాని దిగి క్యాబ్ ల ద్వారా లేదా ప్రైవేట్ వాహనాల ద్వారా చేరుకోవచ్చు.
రైలు మార్గం: రత్నగిరిలో రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడ దేశం నలుమూలల నుంచి రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇక్కడికి చేరువలో అదవలి, నివ్సర్ అనే మరో రెండు రైల్వే స్టేషన్లు ఉన్నాయి.
రోడ్డు మార్గం: రత్నగిరి రాష్ట్ర రాజధాని ముంబయితో జాతీయరహదారి 66 (ముందుగా జాతీయరహదారి 17) ద్వారా అనుసంధానమై ఉంది. ఈ రహదారి జిల్లాను గోవా, కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరులతో అనుసంధానిస్తుంది. కనుక మీకు రోడ్డు మార్గం సులభమైనది. సముద్ర మార్గం జిల్లా పశ్చిమ సరిహద్దులో అరేబియన్ సముద్రతీరంలో పలు చిన్నచిన్న రేవులు ఉన్నాయి. వాటి ద్వారా రత్నగిరి చేరుకోవచ్చు.
Authorization