ఓ వైపు కొండలు.. మరోవైపు లోయలో గలగలా పారే బియాస్ నది పరవళ్ళు.. కొండచిలువలా మలుపులు తిరిగిన తారురోడ్డు.. 50 నుండి 100 అడుగుల ఎత్తుదాకా పెరిగిన దేవదారు చెట్ల పరిమళం.. నీరెండలో చల్లటి చలి... ఇంతటి వింత అనుభూతిని అందించే ఈ ప్రాంతంలో ఆహ్లాదం తప్ప మరేమీ కనిపించదు. ఇది మరెక్కడో కాదు... హిమాచల్ ప్రదేశ్లోని మంచు పర్వతాల్లో...
భగభగమండే ఎండల నుంచి మంచు కొండలకు, కాంక్రీట్ అడవుల నుంచి కీకారణ్యానికి, రణగొణ ధ్వనుల నుంచి కిలకిలారావాల వైపుకు మహా కాలుష్యం నుంచి స్వచ్ఛమైన వాతావరణానికి, యాంత్రిక ప్రపంచానికి దూరంగా ప్రకృతి ఒడిలో హాయిగా గడపాలంటే హిమాచల్ప్రదేశ్కు వెళ్లాల్సిందే...
సైకిల్ తొక్కుతూ...
హిమాచల్ ప్రదేశ్లో బోలెడన్ని పర్యాటక ప్రాంతాలున్నప్పటికీ నేషనల్ హిమాలయన్ మౌంటెన్ బైటింగ్ అనే కార్యక్రమంలో భాగంగా కొండల్లో సరదాగా సైకిల్ తొక్కుతూ వెళ్లడానికి పర్యాటకులు ఆసక్తి చూపుతారు. చల్లగా వుండే 'కులు' పట్టణానికి 28 కిలోమీటర్ల దూరంలోని ఓట్ అనే ప్రాంతం నుంచి ఈ యాత్ర మొదలవుతుంది. సముద్ర మట్టానికి మూడు వేల అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ ఓట్. ఇక్కడి నుంచి సైకిల్ తొక్కుకుంటూ వెళ్లాల్సిన ప్రదేశం 'జలోరీ పాస్'. ఇది సముద్ర మట్టానికి 10,500 అడుగుల ఎత్తులో వుంటుంది. మొదటి రోజున సైకిల్ తొక్కుతూ... 16 కిలోమీటర్ల దూరం వెళ్లాలి. యాత్రను ఏర్పాటు చేసిన నిర్వాహకులే సైకిల్ ఇస్తారు. ఇది గేర్ల సైకిల్. తలకు హెల్మెట్, మోచేతులు, మోకాళ్లకు గార్డ్స్, చేతులకు గ్లవ్స్, కళ్లకు గాగుల్స్ వేసుకుంటే... మనల్ని మనమే గుర్తుపట్టలేం. ఉదయం 8 గంటలకు మొదలవుతుంది ఈ పర్యటన.
అలసట మర్చిపోవచ్చు
'ఓట్' వద్ద సుమారు 3 కిలోమీటర్లు పొడవుండే సొరంగం గుండా వెళ్లాల్సి ఉంటుంది. పల్లంగా ఉండే దారిలో సర్రున దూసుకుపోతూ... ఎత్తైన చోట సైకిల్ దిగి దాన్ని నడుపుకుంటూ ఒక్కో మైలురాయి కనిపించినప్పుడల్లా ఇన్ని కిలోమీటర్లు పూర్తి చేశామనే విజయగర్వంతో ముందుకు సాగిపోతుందీ ప్రయాణం. మధ్యాహ్నానికి బియాస్ నది ఒడ్డుకు చేరుకోవచ్చు. నది ఒడ్డున బండరాళ్లపై కూర్చుని నీటి గలగలలు ఆస్వాదిస్తుంటే భలే వుంటుందిలే... అలసటమీద వెంట తెచ్చుకున్న భోజనాన్ని తింటుంటే ఎంత హాయిగా ఉంటుందో. సాయంత్రానికి నిర్వాహకులు ఏర్పాటు చేసిన ప్రదేశంలో బస చేయొచ్చు. నడక, సైకిల్ తొక్కడం పెద్దగా అలవాటులేని వారు రాత్రి భోజనాలయ్యాక ఆదమరచి నిద్రపోతుంటారు.
చూడముచ్చటైన జలపాతం
రెండో రోజు యాత్రలో 'జిబి' అనే ఊరు చేరుకోవాల్సి ఉంటుంది. ఇక్కడికి చేరుకోవాలంటే... మొదటిరోజు బస చేసిన ప్రదేశం నుంచి 12 కిలోమీటర్ల దూరం వెళ్లాలి. అయితే ఇది బాగా ఎత్తు ప్రదేశం... సైకిల్ తొక్కడం కంటే ఎక్కువసేపు నడవాల్సి ఉంటుంది. మధ్యాహ్నానికల్లా 'జిబి' చేరుకోవచ్చు. ఈ ప్రాంతం దాటి రెండు మూడు ఫర్లాంగుల దూరం అడవిలోకి వెళ్తే చూడముచ్చటైన చిన్న జలపాతం ఆహ్వానిస్తుంది. అప్పుడే ఐస్ కరిగి నీరైనట్టుగా, ఈ జలపాతం నీళ్లు చాలా చల్లగా ఉంటాయి. ఈ నీళ్లలో స్నానం కాదు కదా... నీళ్లు పట్టుకోడానికే వణికిపోతాం. అంత చల్లగా ఉంటాయి.
విసిరేసినట్లుగా ఉండే ఇళ్లు
మూడో రోజున 'షోజా' అనే ప్రాంతానికి చేరుకోవాలి. అక్కడికి వెళ్లాలంటే కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరమే. అంటే మొదటి రెండు రోజులకంటే తక్కువ దూరమే. అయినప్పటికీ ఒక్క అడుగైనా సైకిల్ తొక్కలేని పరిస్థితి. ఎందుకంటే నిట్టనిలువు రోడ్డు, పక్కనే పెద్ద పెద్ద లోయలు... తక్కువ బరువున్న సైకిలైనా, చాలా బరువు అనిపిస్తుంది. ఇలాంటి కొండల్లో కూడా విసిరేసినట్లుగా అక్కడక్కడ ఇళ్లు కనిపిస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఈ ఇళ్లలో ఫ్రిజ్ తప్ప అన్ని వసతులూ అందుబాటులో ఉంటాయి. అక్కడ ఫ్రిజ్ అవసరం వుండదుగా మరి. భూమికి ఎనిమిది వేల అడుగుల ఎత్తులో ఉండే షోజాలో చలి జిల్లుమనిపిస్తుంది. వేసవిలోనే చాలా చలిగా ఉండే ఈ ప్రాంతం, చలికాలంలో అయితే అసలు ఊహించుకోడానికే వణికిపోతారు.
మంచును తాకుతూ
చివరి మజిలీ 'జలోరీ పాస్'. షోజా నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే బాగా ఎత్తుగా ఉంటుంది. సైకిల్ తీసుకెళ్లినా లాభం ఉండదు. అందుకే నడిచే వెళ్లాలి. అలా వెళ్తుంటే వచ్చే మలుపుల ముందు తిరుమల కొండ, శ్రీశైలం మలుపులు కూడా బలాదూరే. ఇక్కడ పొరపాటున కాలుజారి కిందపడితే ఇక మనిషి గల్లంతే. ఇంత ప్రమాదమైన ప్రదేశంలో కూడా అక్కడక్కడ కొండరాళ్లపై పేరుకుపోయిన మంచును తాకుతూ నడుస్తుంటే కలిగే ఆనందం మాత్రం మాటల్లో చెప్పలేనిది.
శేషనాగ సరస్సు
అలా జలోరీ పాస్ చేరుకున్నాక... అక్కడికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉండే 'శేషనాగ సరస్సు' చూడదగ్గది. ఇక్కడికి వెళ్లాలంటే మొత్తం అడవిలోనే నడవాల్సి ఉంటుంది. చిన్న సరస్సు, నల్లటి రంగులో నీళ్లు, చుట్టూ చెట్లున్నా సరస్సులో ఆకు అనేదే కనిపించకపోవడం వింతగా అనిపిస్తుంది. అయితే అది స్థానికులకు ఓ పవిత్రమైన కొలను. ఆ పక్కనే గుడి కూడా ఉంటుంది. సరస్సు అందాలు... దగ్గర్లోని మంచుకొండల సోయగాలు... చూసేందుకు రెండు కళ్లూ సరిపోవు.
ఆనందం వెనకే అపాయం
పైకి ఎక్కడం కంటే... కిందికి దిగటం సులువే కాబట్టి... తిరుగు ప్రయాణానికి హాయిగా, ఆనందంగా బయలుదేరొచ్చు. అయితే ఆ ఆనందం వెనుక అపాయం పొంచే ఉంటుంది. ఎందుకంటే సైకిల్ బ్రేక్ ఏ మాత్రం ఫెయిల్ అయినా.. అదుపు తప్పినా అంతే సంగతులు. కాబట్టి చాలా జాగ్రత్తగా కిందికి దిగాల్సి ఉంటుంది. చల్లటి ఐస్ లాంటి నీళ్లు, పర్వతాలు, కొండలు, లోయలు, సైకిల్ తొక్కినందుకు కాళ్ల నొప్పులు, ఆ నొప్పులతోనే ఆదమరచి నిద్ర. ఆనందం... ఆహ్లాదం... ఆ వెనకే పొంచి ఉండే ప్రమాదం ... చలి, ఆ చలిలోనే చెమట... మంచు, వర్షం... ఇలాంటి అందమైన ఆహ్లాదకరమైన ప్రయాణమే ఇది.
ఆసక్తి ఉంటే
నేషనల్ హిమాలరు మౌంటెన్ బైకింగ్ పేరుతో నిర్వహించే ఈ టూర్ను యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (వైహెచ్ఏఐ) అనే సంస్థ ఏర్పాటు చేస్తోంది. అంతేకాకుండా ఈ సంస్థ పలు ట్రెక్కింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఆసక్తి ఉన్న పర్యాటకులు తమ పేర్లను నమోదు చేసుకుని పర్యటించొచ్చు. మరిన్ని వివరాల కోసం వైహెచ్ఏఐ ఇండియా డాట్ ఆర్గ్ అనే వెబ్సైట్ను చూడొచ్చు.
Authorization