కొండలు, లోయలు, భారీ వృక్షాలు వాటికి అల్లుకున్న లతలు.. నల్లమల వనసౌందర్యం గురించి ఎంత చెప్పినా తక్కువే! సుమారు 3,500 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్న నల్లమల అడవుల్లో ఆధ్యాత్మిక కేంద్రాలు, జలపాతాలు, విహార కేంద్రాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి మల్లెల తీర్థం. నల్లమల సిగలో.. ప్రకృతి తురిమిన విరులపాతం ఇది. దట్టమైన అటవీ మార్గం గుండా సాగే మల్లెలతీర్థ యాత్ర మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తుంది.
హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే దారిలో వాతావర్లపల్లికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ మల్లెల తీర్థం. కిలోమీటర్ దూరం నుంచే జలధారల హోరు వినిపిస్తుంటుంది. జలపాతానికి కొంత దూరంలో టికెట్లు తీసుకోవాలి. ఎత్తయిన కొండ నుంచి సుమారు 300 మెట్లు దిగితే మల్లెల తీర్థం చేరుకోవచ్చు. సగం మెట్లు దిగామో.. లేదో చెట్ల గుబురుల నుంచి జలపాత విన్యాసాలు కనిపిస్తాయి.
వంద అడుగుల ఎత్తు
మల్లెల తీర్థం జలపాతం ఎత్తు సుమారు 100 అడుగులు. రెండు పర్వతాల మధ్యనున్న లోయలో నుంచి దూకే జలపాతం నీళ్లు.. దిగువనున్న మరో లోయలోకి చేరుతాయి. పైనుంచి దూకే జలధారలు మల్లెల్లా మెరుస్తూ.. జడివానలా కురుస్తాయి. అందుకే ఈ జలపాతానికి మల్లెల తీర్థం అని పేరు వచ్చింది. ఫిబ్రవరి మాసాంతం వరకు ఇక్కడ జలధారలు కనువిందు చేస్తాయి. జలపాతం ముందుండే గుండం చాలా లోతుగా ఉంటుంది. గుండంలోని నీళ్లు రెండు గుట్టలను చీల్చుకుంటూ ఉత్తర దిశగా సాగుతాయి. కాస్తంత దూరంలోనే అరు చిన్న చిన్న జలపాతాలను ఏర్పరుస్తాయి. అయితే చెట్లు, గుబురుగా ఉన్న పొదలు కప్పేయడంతో వీటి దగ్గరికి వెళ్లడం కష్టమే!
గెస్ట్ హౌజ్ లు...
మల్లెల తీర్థం పరిసరాల్లో స్థానిక గిరిజనులు అల్పాహారం, చిరుతిళ్లు అమ్ముతుంటారు. భోజనం, బస దొరకాలంటే జలపాతానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న మన్ననూరు (హైదరాబాద్ వైపు), దోమలపెంట (శ్రీశైలం వైపు) గ్రామాలకు చేరుకోవాలి. మన్ననూరులో వనమాలి గెస్టహౌజ్ విడిదికి అనుకూలం. దోమలపెంటలోని వన మయూరి అతిథి గృహం కృష్ణానది ఒడ్డున ఉంటుంది. ఇవి రెండూ అటవీ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. వనమాలి గెస్ట్హౌజ్ సమీపంలో పర్యావరణ విద్యా ప్రదర్శనశాల, షావలి దర్గా ఉంటాయి.
ఎలా వెళ్లాలంటే..
హైదరాబాద్ నుంచి శ్రీశైలం దారిలో.. మన్ననూరు దాటాక 25 కిలోమీటర్లకు వాతావర్లపల్లి గ్రామం వస్తుంది. అక్కడి నుంచి మల్లెల తీర్థానికి ఆటోలు అందుబాటులో ఉంటాయి. శ్రీశైలం నుంచి వచ్చే వాళ్లు.. దోమలపెంట మీదుగా వాతావర్లపల్లికి చేరుకోవాలి. అక్కడి నుంచి ఆటోల్లో మల్లెల తీర్థం వెళ్లొచ్చు.
చూడాల్సిన ప్రదేశాలు
- శైలం (57 కిలోమీటర్లు)
- టైగర్ సఫారీ, మన్ననూరు ఫారెస్ట్ చెక్పోస్ట్ (17 కిలోమీటర్లు)
- లొద్ది మల్లన్న ఆలయం (25 కిలోమీటర్లు)
- ఉమామహేశ్వర ఆలయం (47 కిలోమీటర్లు)
Authorization