ఒకప్పుడు విహారయాత్రలంటే కేవలం వేసవి సెలవుల్లోనే ప్లాన్ చేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. ఆనందించే హృదయం, ఆస్వాదించే కళ ఉండాలే కానీ సీజన్తో పనేముంది. కొండల్లో, కోనల్లో, లోయల్లో, పచ్చటి మైదానాల్లో నడుస్తూ... కురిసే చినుకుల మధ్య తడుస్తూ... ప్రకృతిని తిలకించి పరవశించిపోవడం కన్నా సుఖం ఏముంటుంది చెప్పండి. అందుకే ఇప్పుడు ప్రకృతిని పర్యటనలు ఎక్కువయ్యాయి. ఎండా వానా దోబూచులాడుతుంటే ప్రకృతిలో విహరించాలని ఎవరికి మాత్రం ఉండదు. అలాంటి పర్యటనలను ఇష్టపడే వారి కోసం ఎక్కడెక్కడ ఎలాంటి ప్రాంతాలు సిద్ధంగా ఉన్నాయో చూద్దాం...
ఆహ్లాదకరమైన అంబోలి
మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో ఉంది ఈ అందమైన ప్రదేశం. ఎటు చూసినా జలపాతాలతో, ఎత్తైన కొండలతో, చల్లటి గాలులతో ఆహ్లాదం కలిగించే ప్రాంతం అంబోలి. వేసవి విడిదిగానే కాదు వర్షాకాలంలో సందర్శించడానికి అనువైన గమ్యంగా కూడా ఇది ప్రసిద్ధి చెందింది. వర్షపాతం ఎక్కువ కాబట్టి ఎప్పుడూ తడిగా కనిపించే అంబోలిలోని పల్లె వాతావరణం మనసుకు ప్రశాంతత కలిగిస్తుంది. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఉన్న ఈ ప్రదేశం నుంచి సూర్యోదయం, సూర్యాస్తమయం వీక్షించడం మరపురాని అనుభూతి.
ఇలా వెళ్ళాలి
కర్నాటకలోని బెల్గాం నగరానికి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాల నుండి రైళ్ళు ఉన్నాయి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 28 కి.మీ. దూరంలో ఉన్న అంబోలి చేరుకోవచ్చు. సమీప విమానాశ్రయం 113 కిలోమీటర్ల దూరంలోని గోవాలో ఉంది. మహారాష్ట్ర టూరిజం, ప్రైవేటు సంస్థల యాజమాన్యంలో వసతి, భోజన సదుపాయాలున్నాయి.
మరవలేని అనుభూతి అగుంబే
కర్నాటక రాష్ట్రంలోని షిమోగా జిల్లాలో ఉంది ఈ ప్రాంతం 'దక్షిణ భారత చిరపుంజి'గా పేరు పొందిన అగుంబే ఎన్నో అందాలకు నెలవు. చుట్టూ దట్టమైన అడవులున్న ఈ ప్రాంతం సహ్యాద్రి పర్వతాల్లో మాల్నాడ్, శరావతి లోయల మధ్య ఉంటుంది. మైమరపించే జలపాతాలకూ, అత్యద్భుతమైన సౌందర్యానికీ అగుంబే పెట్టింది పేరు. ప్రకృతి ప్రేమికులు తప్పనిసరిగా చూడాల్సిన చోటు ఇది. అగుంబే ఘాట్ రోడ్డు దగ్గర నిలబడి అరేబియా మహా సముద్రంలో సూర్యుడు అస్తమిస్తున్న దృశ్యం చూడడం జీవితకాలానికి సరిపోయే అనుభూతిని మిగుల్చుతుంది. ఇక కింగ్ కోబ్రాలకు ఈ ప్రాంతం పుట్టినిల్లు. ఇతర జాతుల సర్పాలు కూడా ఈ వర్షారణ్యంలో పెద్ద సంఖ్యలో ఉంటాయి. అరుదైన జంతు, వృక్షజాలంపై ఇక్కడ విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి.
ఇలా వెళ్ళాలి
మంగుళూరుకు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో అగుంబే ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాల నుంచి మంగుళూరుకు రైలు సౌకర్యం ఉంటుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అగుంబే చేరుకోవచ్చు. సమీప విమానాశ్రయం మంగుళూరులో ఉంది. హైదరాబాద్ నుంచి రైళ్ళ కన్నా రోడ్డు మార్గంలో (బెంగళూరు మీదుగా) తక్కువ సమయంలో వెళ్ళవచ్చు. అగుంబేలే బడ్జెట్లకూ సరిపోయే వసతి సదుపాయాలున్నాయి. అయితే అన్నిటికన్నా ఆకర్షించేది దొడ్డ మేను బంగళా. నూట యాభై ఏండ్ల నాటి భవనంలో నడుస్తున్న ఈ వసతి గృహాన్ని కస్తూరక్క అనే వృద్ధురాలు నిర్వహిస్తున్నారు. సంప్రదాయ పద్ధతుల్లో చేసిన ఇంటి భోజనం, ఎంతో చరిత్ర కలిగిన పాత కాలం ఇంట్లో బస పర్యాటకులకు ప్రధాన ఆకర్షణ.
వెదురు వంతెనల ప్రాంతం మౌసిన్రామ్
మౌసిన్రామ్... మేఘాలయ రాష్ట్రంలోని ఈస్ట్ ఖాసీహిల్స్ జిల్లాలో వుంది. ప్రపంచంలోనే అతి ఎక్కువ వర్షపాతం కలిగిన ప్రదేశంగా మౌసిన్రామ్ గిన్నిస్ బుక్లో చోటు సంపాదించుకుంది. అంతకు ముందు ఆ ఘనత మౌసిన్రామ్కు దగ్గర్లో ఉన్న చిరపుంజికి ఉండేది. అంతేకాదు, ఎప్పుడూ తేమగా ఉండే ప్రదేశంగా కూడా మౌసిన్రామ్ గుర్తింపు పొందింది. ఏడాదిలో కనీసం ఆరు నెలల పాటు ఇక్కడ వర్షాలు పడుతూనే ఉంటాయి. అందుకని ఇక్కడి ప్రజలు కావలసిన సరుకులన్నీ నిల్వ చేసుకుంటూ ఉంటారు. వర్షాలు ఎక్కువ కాబట్టి వృక్షజాలం కూడా ఎక్కువ. గ్రామస్తులు చెట్ల వేర్లను ఒకదానితో ఒకటి అల్లి, వెదురు కర్రలతో వంతెనలను తయారు చేస్తారు. వీటిలో కొన్ని వంతెనలు వంద మీటర్ల పొడవు కూడా ఉంటాయి. కనీసం అయిదారుగురిని అవలీలగా మోయగలిగేంత పటిష్ఠంగా ఇవి తయారవుతాయి. ఇలాంటి వంతెనలు మరెక్కడా కనిపించవు.
ఇలా వెళ్ళాలి
గువాహటికి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో మౌసిన్రామ్ ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి గువాహటికి రైళ్ళలో నేరుగా వెళ్ళవచ్చు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మౌసిన్రామ్ చేరుకోవచ్చు. సమీప ప్రధాన విమానాశ్రయం గువాహటిలో ఉంది. మౌసిన్రామ్లో గెస్ట్హౌసలు, రిసార్టులు, హోటళ్ళు ఉన్నాయి. హోమ్ స్టే సదుపాయం కూడా అందుబాటులో ఉంది.
ట్రెక్కింగ్ ఇష్టపడే వారి కోసం మున్నార్
కేరళలోని ఇడుక్కి జిల్లాలోని మున్నార్ను తేయాకు, సిల్వర్ ఓక్ తోటలూ, లోయలూ, పర్వత శ్రేణులతో అలరారే భూతల స్వర్గంగా పర్యాటకులు వర్ణిస్తూ ఉంటారు. కేరళకు వచ్చే టూరిస్టులు తప్పనిసరిగా సందర్శించే ప్రాంతం ఇది. పడమటి కనుమలలో ఉన్న మున్నార్ చుట్టూ కొండలు ఆవరించి ఉంటాయి. ట్రెక్కింగ్ కోసం చాలామంది ఇక్కడికి వస్తారు. అలాగే ఘాట్లలో బైక్ల మీద చేరుకొనే వారు కూడా ఎక్కువే. మున్నార్ చుట్టుపక్కల చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఫోటోపాయింట్, ముత్తిరప్పుళ నది, ఇడుక్కి ఆర్క్ డ్యామ్, దేవికుళం హిల్ స్టేషన్, అట్టుకల్ జలపాతం వీటిలో కొన్ని. పన్నెండేళ్ళకు ఒకసారి మున్నార్ కొండల మీద 'నీల కురంజి' అనే జాతి పూలు పూస్తాయి. అప్పుడు నేలంతా పూల దుప్పటి కప్పుకున్నట్టుంటుంది. ఈ పుష్పాల్లో నలభైకి పైగా రకాలున్నాయి. వాటిలో కూడా వివిధ రంగులుంటాయి.
ఇలా వెళ్ళాలి
ఎర్నాకుళం నగరానికి సుమారు 130 కిలోమీటర్ల దూరంలో మున్నార్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాల నుంచి మున్నార్కు రైళ్ళు ఉన్నాయి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మున్నార్ చేరవచ్చు. సమీప విమానాశ్రయం కొచ్చిలో ఉంది. మున్నార్లో సాధారణ హోటళ్ళు మొదలుకొని లగ్జరీ రిసార్టుల వరకు అన్ని బడ్జెట్లకూ అనువైన వసతి సదుపాయాలూ ఉన్నాయి.
పచ్చని ప్రకృతి ఒడిలో... కొడైకెనాల్
తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో ఉండే ఈ కొడైకెనాల్ తమిళనాడులో ఊటీ తరువాత ఎక్కువ మంది సందర్శించే చోటు. దేశ, విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న హిల్ స్టేషన్లలో ఇదొకటి. వేసవి విడిదిగా కొడైకెనాల్ ఖ్యాతి అందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రాంతంలో జలపాతాలు ఉధృతంగా కనిపించేది మాత్రం వర్షాకాలంలో. వాతావరణం కూడా ఈ సీజన్లో హాయిగా ఉంటుంది. ఎండా, వానా దోబుచులాడుతూ ఉంటాయి. తడిసిన లోయలూ, పొగ మబ్బులు కమ్ముకున్న కొండలతో కొడైకెనాల్ చూడచక్కగా కనిపిస్తుంది. కొండలూ, మైదానాలూ, జలపాతాలూ, కొలనులతో సహజ సౌందర్యానికి ఆటపట్టుగా ఇది నిలుస్తోంది. సైకిలింగ్, బోటింగ్, ట్రెక్కింగ్, హార్స్ఏరైడింగ్ లాంటి సాహసాలకూ, వినోదాలకూ, గోల్ఫ్ లాంటి క్రీడలకూ ఇక్కడ లోటు లేదు. కొడైకెనాల్లో కూడా పన్నెండేళ్ళకు ఒకసారి నీల కురంజి పుష్పాలు పూస్తాయి. సమీపంలోని సైలెంట్ వ్యాలీ, పచ్చ లోయ, ఫౌనా ఫ్లోరా పూల మ్యూజియం, బ్రయంట్ పార్క్, బెరిజం చెరువు వ్యూ పాయింట్, కొడైకెనాల్ చెరువు, వెండి జలపాతం తప్పనిసరిగా సందర్శించాల్సిన ప్రదేశాల్లో కొన్ని.
ఇలా వెళ్ళాలి
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాల నుంచి మదురై వైపు వెళ్ళే రైళ్ళు కొడైకెనాల్ రోడ్డు రైల్వే స్టేషన్లో ఆగుతాయి. అక్కడి నుంచి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో కొడైకెనాల్ ఉంది. సమీప విమానాశ్రయం 120 కి.మీ దూరంలో మదురైలో ఉంది. కొడైకెనాల్లో యాత్రికులు బస చేసేందుకు అనుకూలమైన సదుపాయాలు విస్తృతంగా ఉన్నాయి.
Authorization