శని, ఆదివారాలు సెలవులు వచ్చాయని పోయిన వారం ఏదైనా టూర్ వెళదామన్నారు పిల్లలు. ఎక్కువ రోజుల వ్యవధి లేదు. కాబట్టి దగ్గరగా వెళదామనుకున్నాం. ఈ మధ్య మద్రాసు చూడక చాలా రోజులయ్యింది. అంటే అసలు చూడక అని కాదు. ఎస్.ఆర్.ఎమ్.సిలో జరిగే కాన్ఫరెన్స్లు అటెండ్ అవుతూనే ఉన్నాం. సైట్ సీయింగ్ ప్రదేశాలు చూడట్లేదన్నమాట. అలా గతవారంలో చెన్నై వెళ్లాం.
ఫ్లైటు దిగగానే ఎయిర్ పోర్టులో తమ్మి సంప్రదాయ నృత్యమైన భరతనాట్య రీతుల్లో ఉన్న చిత్రాల భంగిమలు కనిపించాయి. ఇంకా నటరాజ విగ్రహం, తమిళనాడులోని చిదంబరానికి గుర్తుగా పెట్టారేమో..! తమిళనాడు దేవాల యాలు ద్రవిడ రీతుల్లో శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. పొడుగైన గోపురాలు వాటి మధ్యలో రంగుల విగ్రహాలుంటాయి. వాటి దగ్గర ఫొటోలు తీసుకొని హౌటల్ స్ప్రింగ్కు చేరాం. చెన్నైలో ఉన్న మూడు రోజులు మాకో ఇన్నొవా కారు, డ్రైవర్కు కంపెనీ వాళ్ళు పంపించారు. డ్రైవర్ పేరు దురై పాడ్యన్. మేం దిగిన హౌటల్లో మధ్యాహ్నం బఫే తిన్నాం. కూర్చున్న టేబుల్ మధ్యలో కుంపటి లాంటి పొయ్యి పెట్టారు. దాని మీద పన్నీర్ కబాబ్స్, స్టార్టర్స్ పెట్టి వెళ్లాడు. మనం మిగతావి తింటూ చల్లబడిపోకుండా వేడి వేడిగా తినడానికన్నమాట.
భోజనం గురించి : రాత్రి పూటేమో 'మురుగ ఇడ్లీ' అనే హౌటల్కు వెళ్లాం. అక్కడేమో టేబుల్ మీద అరిటాకు పరిచి దానిమీదే ఇడ్లీ పెట్టి సాంబారు పోస్తు న్నారు. మనకు సాంబారు కప్పుల్లో ఉంటుంది కదా! తర్వాత పొడి, నెయ్యి వేసి ఎక్స్ట్రాగా 20 రూ|| ఛార్జీ చేశారు. ఇడ్లీలోకి పొడి, నెయ్యి ఫేమస్ అట. దోశక్కూడా సాంబారు దోశ మీద పోసేసి వెళుతున్నాడు. ఇది కూడా కొత్తగా ఉంది. మరో రోజు సంగీతా అనే వెజ్ హౌటల్కు వెళ్లాం. దాదాపు 40,50 మంది హౌటల్ లోపల ఖాళీ లేక బయట ఎదురుచూస్తున్నారు. హైదరాబాద్ లోనే ఇలాంటి పరిస్థితి అనుకున్నాను. కానీ మద్రాసులో కూడా ఇంతేనా. వారాంతపు సెలవుల్లో ఎవరూ ఇళ్ళలో తినడం లేదన్నమాట.
పురాతన దేవాలయాలు : కపాలేశ్వర దేవాలయం, పార్థసారధి దేవాలయం చెన్నైలోని ప్రఖ్యాత ఆలయాలు. చాలా పురాతన ఆలయాలు. ఒక రోజంతా పట్టింది. ఈ 'కర్పగంబల్' అని పిలుస్తారు. తమిళంలో కర్పగంబల్ అంటే కోరికలు తీర్చే చెట్టు అని అర్థం. ఈ ప్రదేశం 'మైలాయి' అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. తమిళ భాషలో నెమలిని 'మైలా' అంటారు. అందువల్ల ఈ ప్రాంతం నెమలి పేరు మీదుగా మైలాయిగా అభివృద్ధి చెందింది.
స్టేట్ మ్యూజియం : దేవాలయాలు చూశాక స్టేట్ మ్యూజియంకు వెళ్లాం. లోపల చాలా బ్లాకులున్నాయి. ఎక్కడ నుండి మొదలు పెడదాం అని చూస్తుండగా 'కన్నెమర పబ్లిక్ లైబ్రరీ' అని బోర్డు కని పించింది. అరే ఇదేమిటి.. ఈ లైబ్రరీ ఇక్కడ ఉంటుందా అని ఆశ్చర్య పోయి లోపలికి వెళ్లాం. వేల పుస్తకాలు బీరువాల్లో పొందిగ్గా అమరి ఉన్నాయి. ఆ పుస్తకాల మధ్యలో తిరుగుతూ చాలా ఆనందపడ్డాం. పుస్తకలతో ఫొటోలు తీసుకొని మురిసిపోయాం. తర్వాత చిల్డ్రన్ డిపార్టుమెంట్కు వెళ్ళి అక్కడి పుస్తకాలను పరిశీలించాం.
ఒకటేమిటి ఎన్నో వస్తువులు : మ్యూజియంలో ఒక వస్తువు ఉంది. ఒక వస్తువు లేదు అనుకోవడానికి లేదు. చెక్కతో చేసిన శిల్పాల దగ్గర నుండి బంగారంతో తయారైన కత్తి పిడులు, మహారాణులు వాడిన ఆభరణాల దాకా అన్నీ ఉన్నాయి. గాజు ముక్కల్ని రకరకాల రంగుల్లో ముక్కలుగా కత్తిరించి వాటిని ఒక పద్ధతిలో అతికి కిటికీల దగ్గర, పైన వెంటిలెటర్ల దగ్గరా అమర్చారు. వాటి వలన సూర్యకిరణాలు పడి రంగుల్లో పరా వర్తనం చెంది గదంతా వెలుగులు విరజిమ్ముతున్నాయి. వారు వాడిన పాత్రలు, కత్తులు, కృపాణాలు, యుద్ధ సమయంలో వేసుకునే ఇను పదుస్తులు, కిరీటాలు, విరిగిపోయిన రాతి శిల్పాలు ఒకటేమిటి ఎన్నో వస్తువులున్నాయి. వాటిని చూస్తుంటే ఆనందంతో కడుపు నిండి పోయింది.
నస్సా మ్యూజియం : ఇక మహాబలిపురంకు పోయే దారిలో 'నస్సా మ్యూజియం' చూశాం. అందులో సముద్రంలో సంచరించే జీవులతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్స్ ఉన్నాయి. సీస్టార్లు, ఆక్టోపస్లు, జెల్లీపిష్లు, సీహార్స్లు, సీ యాంటి మోన్లు, గవ్వలు, ఆల్చిప్పలు వంటి ఎన్నో రకాల సముద్ర జీవులున్నాయి. చేపల్లోని రకరకాల ఆకారాలు రంగుల్లో ఎంతో ముద్దొస్తూ తొట్టెల్లో కనువిందు చేస్తున్నాయి. కేవలం వాటి ప్రదర్శనే కాకుండా ఆయా జంతువుల ప్రత్యేక లక్షణాలు, వివరాలు రాసి ఉన్నాయి. ఎన్ని ఫొటోలు తీసుకున్నా ఇంకా కొత్త రకాల షెల్స్ కనిపిస్తున్నాయి. సముద్ర అంతర్భాగంలో ఇన్ని రకాల జలచరాలు న్నాయా అని చాలా ఆశ్చర్యమేసింది. కొంత మంది చేపలతో మానిక్యూర్, పెడిక్యూర్ చేయించుకుంటున్నారు.
మహాబలిపురం : అక్కడి నుండి మహాబలిపురం కట్టడాల్లోకి వెళ్ళాం. దీనిని 'మామళ్ళపురం' అంటారు. ఇది చెంగల్పట్టు జిల్లాలో ఉంది. మహాబలిపురం ఇప్పుడు కొద్దిగా మారింది. కాలినడకలో వెళుతుంటే చీకటి వల్ల పక్కనే సముద్రమున్న విషయం కనిపించల్లేదు. కానీ సముద్రం మీద నుండి వీచే చల్లని గాలి, సముద్ర హౌరు వల్ల గుడి తీరంలో ఉన్నదని తెలుస్తున్నది. ఇసుక మధ్యలో అద్భుత కట్టడం అపూర్వంగా నిలబడి ఆనాటి శిల్పలు ప్రావీణ్యాన్ని ఎత్తి చూపినట్టుగా రాజసంగా ఉన్నది. ఎన్నో ఫొటోలు తీసుకున్నాం. అంత దూరం నడిచిన శ్రమ, అలసట ఆ కట్టడాన్ని చూశాక మాయమైపోయింది. గవ్వలతో చేసిన అనేక కళాఖండాలు అన్నింటినీ కొనేయమని మనసుని తొందర పెడుతు న్నాయి. గవ్వల కర్టెన్ ఒకటి, గవ్వల షాండ్లియర్ ఒకటి కొనుక్కొని వెనుదిరిగాం.
యూనివర్సల్ స్టూడియో : మహాబలిపురం నుండి మద్రాసు వస్తుంటే యూనివర్సల్ స్టూడియో, దక్షిణ చిత్ర వంటి అనేక ఎమ్యూజ్మెంట్ పార్కులు కనిపించాయి. వాటినింకోసారి చూద్దాములే అనుకుంటూ కారులో కళ్లు మూసుకొని నిద్రపోయాం. తిరిగి తిరిగి పడిన శారీరక శ్రమతో పాటు అద్భుత శిలా సంపద చూసి మనసూ నిండిపోయింది.
- డా|| కందేపి రాణీప్రసాద్
9866160378