బండిపూర్ జాతీయ పార్కు... రకరకాల పక్షులకు, జంతువులకు నిలయంగా ఉంది. ఈ పార్కు సుమారు 800 చ. కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ప్రకృతి సహజ అందాలను తనివితీరా ఆస్వాదించాలంటే ఒక్కసారి బండిపూర్ నేషనల్ పార్కును సందర్శించాల్సిందే! పచ్చటి చెట్ల మధ్య వన్య మృగాలకు ఇల్లుగా ఈ జాతీయ పార్కును చెప్పుకోవచ్చు. 1931 సంవత్సరంలో మైసూర్ మహారాజు ఈ నేషనల్ పార్కును ప్రారంభించారు. అప్పట్లో ఇది 90 చ.కిలోమీటర్ల మాత్రమే ఉండేది. పార్కు నలుమూలల నుంచి ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. ఈ పార్కుకు చుట్టు పక్కల నాగూర్, కాబిని, మోయర్ నదులు ఉన్నాయి. పార్కులో చాలా రకాల జంతువులు అంటే పులులు, నాలుగు కొమ్ముల జింకలు, అడవి ఉడుతలు, ఏనుగులు, అడవి కుక్కలు, చిరుత పులులు, అడవి ఏనుగులు వంటి వివిధ రకాల జంతువులను చూడొచ్చు. జంతువులే కాక కొన్ని అపురూపమైన పక్షులను కూడా తిలకించొచ్చు. పక్షులలో కొన్ని ఇక్కడకు వలస వస్తాయి. చెకుముకి పిట్టలు, వడ్రంగి పిట్టలు, సాధారణ పక్షులు ఎన్నో రకాలు ఈ పార్కులో కనిపిస్తాయి. అలాగే ఈ పార్కులో అనేక వృక్షజాతులు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని టెక్టోనా గ్రాండిస్, ఎంబ్లికా అఫీషినాలిత్, వెదురు చెట్లు మొదలైనవి ఉన్నాయి. ఈ పార్కును ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు తెరిచి ఉంటుంది. వేసవి సెలవులు కావడంతో నిత్యం పిల్లలతో, పర్యాటకులతో సందడిగా ఉంటుంది.
Authorization