Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతీయ సమాజంలో ముగ్గుకు చాలా విశ్ఠిత ఉంది. ముగ్గు అంటే కేవలం ఆడవాళ్లు పనే అనేది సహజంగా ఉన్న భావనే ఉంది. ముగ్గు... ఏరోజుకారోజు తుడిచేసి, కొత్తగా వేసుకునేది. ఇప్పటికీ ప్రతిరోజూ ఉదయమే భారతీయ మహిళలు ముగ్గులు వేస్తుంటారు. ఇప్పటికీ అది కేవలం భారతీయ మహిళల పనిగానే భావిస్తుంటారు. కానీ విదేశాల్లో కళ ఏదైనా మగ ఆడ అనే తేడా లేకుండా రంగవల్లులు ని ప్రత్యేక కళగా భావిస్తారు. కానీ అతడు వేసే ముగ్గుని మాత్రం అస్సలు చెరపాలనిపించదు. ఎప్పటికీ అలాగే ఉండిపోతే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. అతడి మునివేళ్ల నుండి ముగ్గుపిండి జాలువారితే భూమి క్యాన్వస్ అధ్భుతమైన కళాఖండాలను సష్టించబడతాయి. అతడే చత్తీస్ గడ్ యువకుడు ప్రమోద్ సాహు..
''శిలలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు సష్టికే అందాలు తెచ్చారు
కనుచూపు కరువైన వారికైనా కనిపించి కనువిందు కలిగించు రీతిగా'' అన్న పాట గుర్తుకు వస్తోంది. కానీ ప్రమోద్ కళతో శిలలపై శిల్పాలు చెక్కెది కాదు. ఈ కళ తుడిస్తే చేరిగిపోతుంది. కానీ ఒక్కసారి చూసిన మనస్సు క్యాన్వస్ పై మాత్రం చేరిగిపోని ముద్ర వేస్తుంది.
అచ్చుగుద్దినట్లూ ఫొటోలా ఉండేలా వాటర్ కలర్స్ తోనో ఆయిల్ కలర్స్ తో చిత్రలేఖనాన్ని వాటర్ కలర్లతో గీయడమే చాలా కష్టం. ప్రమోద్ చేతితో ముగ్గు వేస్తే అది అద్భుతమే. అలాంటి ఇలాంటిది కాదు హై రిజల్యూషన్ ఫొటోలో ఉన్నంత స్పష్టంగా, అస్సలు నమ్మలేనట్లుగా ముగ్గు వెయ్యడం అంటే ఆ కళను కళ్లారా చూసితీరాల్సిందే కానీ వర్ణించ సఖ్యం కాదు.
ఎవరీ ప్రమోద్ సాహు?
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని రాయ్ పూర్కి చెందిన 29 ఏండ్ల యువకుడు, రంగోలీ కళాకారుడు ప్రమోద్సాహు. ముగ్గుతో 'హైపర్ రియలిస్టిక్, త్రీడీ' ముగ్గులు వేయడంతో తనకు తానే సాటి. తెలుగు నాట సంక్రాంతి పండుగ వచ్చిందంటే నెలరోజుల పాటు ఇండ్ల ముందు పెద్దపెద్ద ముగ్గులు దర్శనమిస్తాయి. ఆడవాళ్లు పిండితో సన్నని గీతలు గీస్తూ చుక్కల ముగ్గుని అందంగా, అలవోకగా వేసేస్తారు. కానీ మగవారు ఇంటి పనిలో సాయపడినా ముగ్గు వెయడంలో మాత్రం ససేమిరా అంటారు. ఆ సన్నని గీతాలు తమ వల్ల కాదంటూ చేతులు ఎత్తేస్తారు. కానీ సాహు చేతిలో ఎన్ని నగిషీలైనా అలవోకగా ఒదిగిపోతాయి. అతడు ముగ్గు వేస్తే అది ముగ్గులా కాదు కళాఖండంలానే కనిపిస్తుంది. మార్బుల్ పొడితో మనుషుల రూపాల్ని అచ్చుగుద్దినట్లూ ముగ్గులోకి దించుతాడు మరి. రేగిన తలా అందులో సగం నెరిసిన వెంట్రుకలు, కనుపాపలు దగ్గర్నుంచీ కనుగుడ్డు మీద పడిన వెలుతురూ కంటిపాపలోని ఎరుపుదనం, ముఖం మీది ముడుతలూ, చీర కట్టు మడతలూ... మెడలోని పూసల దండలే కాదు ఒంటి మీది పచ్చబొట్ల సహా ప్రతిదాన్నీ ఎంతో స్పష్టంగా అదే రంగూ అదే రూపంతో ఉన్నది ఉన్నట్లుగా అచ్చుగుద్దినట్లు వెసేయగలడు. ఇది ఒక ఎత్తైతే... ముఖంలోని విచారాన్నీ కళ్లలోని కోపాన్నీ చూపులోని తీవ్రతనూ ఆశ్చర్యాన్నీ ఆనందాన్నీ గాంభీర్యాన్నీ వినోదాన్నీ కూడా తన ముగ్గులో పలికించగలడు.
ఎప్పుడు మొదలుపెట్టారంటే చిన్న వయసులో చుక్కలను కలుపుతూ తన తల్లి వేసే పాము మెలికలు లాంటి ముగ్గులను, పూవుల్లా వంపులు తిరిగిన లతలను ముచ్చటగా చూసేవాడు ప్రమోద్. క్రమంగా ఆమెను అనుకరిస్తూ చాలా ఆకట్టుకునేదట. తనూ కాస్త ముగ్గు తీసుకుని గీతలు గీస్తుండేవాడు. అలా ఏడేళ్ల వయసులో మొదలైన ఆ ఇష్టం వయసుతో పాటే పెరిగింది. ఓ పండుగకి పెద్ద ముగ్గు వేద్దామని మొదలుపెట్టిన అక్క దాన్ని పూర్తిచేసేంత ఓపిక లేదనడంతో 'నేను వెయ్యనా..?' అంటూ ఆ ముగ్గుని వాళ్ల అక్క కన్నా చాలా బాగా వేశాడట. అది చూసిన ఇంట్లో వాళ్లు ఆశ్చర్యపోయి తర్వాత ప్రతి పండుగకీ ప్రమోద్ చేతనే ముగ్గులు వెయించారు. తనకు పన్నెండేళ్లు వయసు వచ్చేసరికి అతడి ప్రతిభ చుట్టుపక్కల ఇండ్లకీ పాకింది. 'అయిదు రూపాయలు ఇస్తాం.
మా ఇంటి ముందు కూడా అందమైన ముగ్గు వెయ్యి' అంటూ పిలిచేవారట. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో తన ఇష్టాన్ని ఆ వయసులోనే ఆదాయంగా మార్చుకున్నాడు ప్రమోద్. నీవ్వు చేసేది ఆడవాళ్ల పని అంటూ తోటి స్నేహితులూ ఏడిపించినా .. అవేవీ అతడి ప్రతిభను అడ్డుకోలేకపోయాయి. కళను నమ్ముకున్న అతడు ఆ మాటలను లెక్కచేయకుండా అడుగులు ముందుకు వేశాడు. 'గంటల తరబడి నిశ్శబ్దంగా కూర్చుని రంగులతో దేవుళ్లూ పువ్వులూ జంతువుల బొమ్మలూ డిజైన్లూ వేస్తుంటే మనసుకు చాలా హాయిగానూ తప్తిగానూఅనిపించేది' అంటాడు ప్రమోద్ సాహు.
అభిరుచే అతడి ఉపాధి
ముగ్గులు వేసుకుంటూనే కొందరు పిల్లలకు డ్రాయింగ్ క్లాసులు చెబుతూ వచ్చిన డబ్బుతో ఎంఏ పూర్తి చేశాడు. తర్వాత పూర్తిస్థాయిలో ముగ్గుమీదే దృష్టి పెట్టి ఆర్ట్ ఈవెంట్లలోనూ పాల్గొనేవాడు. అద్భుతమైన అతడి కళ జనం దృష్టిలో పడడంతో గుర్తింపుతో పాటు డబ్బూ ఒకదాని వెంట ఒకటి జోడు గుర్రాల దౌవుడు తీస్తున్నాయి. అప్పుడు అతడే ఒక ఆర్ట్ ఇన్స్టిట్యూట్ని రాయ్ పూర్లో 'ఛపాక్' పేరుతో నడుపుతున్నాడు. అందులో దాదాపు నాలుగొందలకు పైగా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ప్రతి సంవత్సరం పదిమందికి ఉచిత శిక్షణ అందిస్తున్నారు. కేవలం ఇన్స్టిట్యూట్ని నడపటమే కాకుండా అప్పుడప్పుడు వర్క్షాపులూ కూడా కండెక్ట్ చేస్తుంటాడు. స్వచ్ఛందంగా వేసే ముగ్గులు కాకుండా గత పదిహేనేళ్ల నుంచీ దేశవ్యాప్తంగా వివిధ సంస్థలకోసమే అయిదొందలకు పైగా ముగ్గుల్ని వేశాడట.
వాణిజ్య సంస్థలకు ఒక్కో రంగోలీ వెయ్యడానికి రెండు నుంచి యాభై గంటల వరకూ సమయం పడుతుంది. ఆ శ్రమకు తగ్గట్లే రూ.10 వేల నుంచి రూ.1.50 లక్షల వరకూ వారు చెల్లిస్తుంటారు. ముగ్గు వేసేటపుడు ఒక చుక్కవైపు గియ్యాల్సిన గీతను పొరపాటున మరోవైపు గీసుకుంటూ వెళ్తే రంగోలీ అంతా పాడైపోతుంది. అలాంటిది పిండితో పోర్ట్రెయిట్ అంటే ఏ చిన్న తప్పు చేసినా తుడిచేసి మళ్లీ మొదట్నుంచి వెయ్యాల్సిందే. అంటే ఎంత కష్టమో అర్థం చేసుకోవచ్చు.
అవార్డులు - రివార్డులు
ముగ్గు వేయడమంటే ఒకప్పుడు సాధారణమైన విషయమే కావచ్చు. కానీ ముగ్గుకు విశ్ఠిస్థానం తీసుకువచ్చాక ఇంత గొప్ప కళకు అవార్డులు రాకుండా ఎలా ఉంటాయి. అలా ప్రమోద్ అందుకున్న అవార్డులలో ఆల్ ఇండియా ప్లాటినమ్ ఆర్టిస్ట్ అవార్డ్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ రాష్ట్ర నిర్మాణ్ పురస్కార్ లాంటి ఎన్నో పురస్కారాలు వరించాయి. మూడేళ్ల కిందట రష్యాలో జరిగిన 'వరల్డ్ ఫెస్టివల్ ఆఫ్ యూత్ అండ్ స్టూడెంట్స్' కార్యక్రమానికీ ఎంపికయ్యాడు.