Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాల్యంలో ఎవరైన డాక్టర్ కావాలనో కలెక్టర్ కావాలనో కలలు కంటారు. కానీ న్యూస్ రీడర్ అవ్వాలని కలకనేవారిని ఎవరినైౖనా చూశారా..? పైగా ఒక ఆడపిల్ల అలాంటి ఆలోచన చేస్తే ఆమెను చులకనగా చూస్తారు. అలాంటి వారికి ఆడపిల్లని అలసుగా చూసేవారికి పెద్దపల్లి తేజస్విని ఒక సమాధానం. ఆమెకు ఉన్న ఆత్మవిశ్వాసం మనోదైర్యం పట్టుదల చూస్తే ఎవరైన ఆశ్చర్య పోవాల్సిందే. ఈ ఆశయ సాధనకోసమే ఆమె న్యూస్ రీడర్గా, సింగర్గా, రచయిత్రిగా అనేక పార్శాల్లో ఆమె టాలెంట్ను నిరుపించుకుంది. నా గురి ఎప్పుడూ నా లక్ష్యం మీదే అంటున్న తేజస్విని అంతరంగం ఈవారం జోష్..
మీ నేపథ్యం
నా పేరు పెద్దపల్లి తేజస్వి. అమ్మ సావిత్రి గృహిణి, నాన్న యాకయ్య రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి, మేము ఇద్దరం. నేను,తమ్ముడు షరీఫ్. తాను ప్రస్తుతం బోర్ వెల్ వర్క్ చేస్తున్నాడు. మాది ఖమ్మం.ప్రభుత్వ పాఠశాల లోనే పదవ తరగతి వరకు చదువుకున్నాను. ఇంటర్ ఉమెన్స్ కళాశాలలో, డిగ్రీ, పీజీ ఎస్.ఆర్.అండ్.బి.జి.ఎన్.ఆర్ ప్రభుత్వ కళాశాలలో బీఈ.డీ ట్రినిటీ కళాశాలలో చేసాను. డిగ్రీ స్థాయి నుండి పార్ట్ టైంగా చేస్తూ చదువుకున్నాను. చిన్నప్పటి నుండి ప్రతి విషయానికి పేరెంట్స్ మీద ఆధారపడటం నాకు ఇష్టం ఉండదు. అందుకే పార్ట్ టైం జాబ్ చేయాలన్న ఆలోచన ఎక్కువగా ఉండేది. అలా నేను ఏం చెయ్యగలనని ఆలోచించే దాన్ని. నేను ఎనిమిదోవ తరగతి చదువుతున్న దశలో మా మ్యాథ్స్ టీచర్ దుర్గా భవాని మేడం క్లాస్ చెప్పి వెళ్లిన తర్వాత నా తోటి విద్యార్థుల ముందు మేడం వాయిస్ తో మాట్లాడాను. అందరూ చప్పట్లు కొట్టారు. ఆ తర్వాత మేడం వొస్తున్నారని తెలిసి వెళ్లి సైలెంట్గా కూర్చున్నారు. నేనే అలా మాట్లాడానని మెల్లగా టీచర్స్ అందరికి తెలిసింది. ఒక రోజు సాయంత్రం నాతో అలా మాట్లాడించారు. అలా మాట్లాడటాన్ని మిమిక్రి అంటారని అప్పుడు తెలిసింది నాకు. నా మిమిక్రీ నచ్చిన రామాచారి సర్ ఒక పెన్ గిఫ్ట్ గా ఇచ్చారు. ఆ పెన్నుని ఇప్పటికి భద్రంగా దాచుకున్నాను. నా దృష్టిలో అదో పెద్ద బహుమతి. నా స్నేహితులు ఆ తర్వాత నుండి నన్ను ప్రత్యేకంగా చూసే వాళ్ళు. 2017 లో నెట్ ఉత్తీర్ణత సాధించాను. 2019 ఎం.ఫిల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో సీటు సంపాదించాను. కానీ అదే సమయంలో నాకు పీ.హెచ్.డీ లో సీటు రావడంతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులు డా.నాళేశ్వరం శంకరం గారి పర్యవేక్షణలో ప్రస్తుతం పీహెచ్.డీ చేస్తున్నాను.
యాంకరింగ్ వైపు ఎలా వచ్చారు?
చిన్నప్పటి నుండి నాకు సాంస్కతిక కార్యక్రమాలంటే చాలా ఇష్టం. పాఠశాల నుండి కళాశాల వరకు అన్ని యాక్టివిటీస్ లో ముందుండేదాన్ని. నేను యాంకర్ కంటే ముందుగా న్యూస్ రీడర్గా చేసాను. తొమ్మిదో తరగతి చదువుతున్న రోజుల్లో న్యూస్ చదివేవారిని బాగా గమనించే దాన్ని ఎందుకా కోరిక కలిగిందో తెలియదు గాని అప్పుడే న్యూస్ రీడర్ అవ్వాలి అనుకున్నాను. కుటుంబ సభ్యులు కూడా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఒక రోజు తమ్ముడు ఖమ్మం లోకల్ ఛానల్లో న్యూస్ రీడర్ వెకెన్సీ ఉందని ప్రయత్నించమని చెప్పాడు. అలా నేను వెళ్లడం సెలక్ట్ కావడం జరిగింది. 2012 నుండి ఖమ్మం లోకల్ ఛానెల్స్ అయిన మారుతి ప్లస్, సీ ఛానెల్, ఎస్ ఛానెల్లో న్యూస్ రీడర్ గా ఉంటూ, గుడ్ మార్నింగ్ ఖమ్మం, లక్కీ లేడీ లౌలీ సారీ, హౌసీ గేమ్ షో, కాఫీ టైం కార్యక్రమాలకు యాంకరింగ్ చేసాను. ఈవెంట్స్ కి యాంకరింగ్ చేసే అవకాశం నాకు అనుకోకుండా వొచ్చింది. ఒకరోజు మా ఇంటికి దగ్గరలో ఉండే మెజీషియన్ రాజాగారు కాల్ చేసి ఈవెంట్ కి యాంకరింగ్ చేయాలని అడిగారు. అమ్మానాన్న మొదట చదువుకు ఇబ్బందవుతుందని ఒప్పుకోలేదు. చదువుకు ఆటంకం రాకుండా చదువును, ఛానెల్లో న్యూస్ రీడింగ్ ను బ్యాలన్స్ చేసినట్టే ఈవెంట్స్ ని కూడా బ్యాలన్స్ చేయగలనని అర్ధం అయ్యేలా చెబితే ఒప్పుకున్నారు.ఛానల్లో కొందరి మధ్య యాంకరింగ్ చేయాలి. ఈవెంట్స్ లో అందరి మధ్య చేయాలి.మొదట కాస్త బెరుకుగా ఉండేది ఛానల్లో చేసిన అనుభవం ఉండటం వలన రాజా గారు ఇచ్చిన సలహాలు,సూచనల వల్ల అవలీలగా ఈవెంట్స్ కి,కార్పొరేట్ ఈవెంట్స్ కి యాంకరింగ్ చేయగలిగాను.
మీరు మల్టీ టాలెంటెడ్ కదా!
ఏమో నాకు తెలియదు కాని ఒక్క మాట చెప్పగలను నాకు కొన్ని రంగాల మీద ఇష్టం ఉంది ఆ ఇష్టం వలనే నేను వాటిలో రాణించగలుగుతున్నాని అనిపిస్తుంటుంది.మనం ప్రేమించే పని చేస్తే ఎంతటి స్థాయికైనా ఎదగగలం అని నమ్ముతాను. నేను న్యూస్ రీడర్, యాంకర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, పాటలు పాడుతాను, మిమిక్రీ చేస్తాను, యాక్టర్ ని కూడా వీటిలో నేను కొంచమైనా రాణించగలుగుతున్నానంటే కారణం వాటి మీద నాకున్న ప్రేమ. 2012 యువతరంగం కార్యక్రమంలో రాష్ట్ర స్థాయిలో ఏకాపాత్రాభినయం చేసాను. ఇందులో కథా వస్తువు కుటుంబ పెద్ద మద్యానికి బానిస అయితే స్త్రీ పడే వేదన. పోటీలో పాల్గొన్న సందర్భంలో అక్కడ నా యాక్టింగ్ చూసిన ఒక డైరెక్టర్ వరుణ్ సందేశ్ గారి మూవీలో స్నేహితురాలి పాత్రకి నటించమని అడిగారు. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో వెళ్లలేకపోయాను. కళాశాలలో జరిగే కార్యక్రమాలలో మాత్రమే పాల్గొన్నాను. తెలంగాణ ప్రపంచ తెలుగు మహాసభలలో రవీంద్ర భారతిలో కూడా ఏకపాత్రాభినయం చేసాను. నటనకు మంచి పేరు వచ్చింది. ఖమ్మంలో చదువు కాబట్టి టీవీ చానెల్ కూడా ఖమ్మంలోనే కాబట్టి న్యూస్ రీడింగ్ ,యాంకరింగ్ అడ్జస్ట్ చేసుకోగలిగాను. నటిగా కూడా ముందుకు రావాలి అనుకున్నాను. కళాశాలలో జరిగే కార్యక్రమాలలో మాత్రమే పాల్గొన్నాను. కళాశాలలో ఫోక్ సాంగ్స్ కూడా బాగా పాడేదాన్ని. అమ్మ పొలం పాటలు, బతుకమ్మ పాటలు చక్కగా పాడటం వల్ల పాటల మీద ఆసక్తి కనబర్చేదాన్ని. నా డిగ్రీ లో దేశభక్తికి సంబంధించిన హిమగిరి విద్యా పాటకు, ఫోక్ సాంగ్స్ లో వద్దంటే పోతాడు తాళ్లకు పాటలకు జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు బహుమతులు పొందాను. ఆసక్తి ఉన్న రంగంలో అవకాశాలు పొందితే కలిగే ఆనందం చెప్పలేనిది.రీసెంట్ గా రెండు ఫోక్ సాంగ్స్ లో నటించాను.ఒకటి 'అరె.. అరె.. ఎంకటి' సాంగ్, మరొకటి 'ఎక్కడ ఉన్నాడో బిడ్డా' రెండూ చాలా భిన్నమైన పాత్రలు.. రీసెంట్ గా సుమ గారు హౌస్ట్ గా చేస్తున్న స్టార్ మహిళ ప్రోగ్రాంలో పార్టీసీపీట్ చేసాను. అన్ని కలలను ప్రదర్శించడం మర్చిపోలేని అనుభూతినిచ్చింది. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సినిమాలు, వెబ్ సిరీస్ లో హీరోయిన్ కి మరియు అడ్వర్టైజ్మెంట్స్ కి వాయిస్ ఇచ్చాను. ఒక వెబ్ సిరీస్ లో సుమారు ఐదు పాత్రలకు డబ్బింగ్ చెప్పాను. విడుదలకు సిద్దంగా ఉంది. చదువులో, సాంస్కృతిక కార్యక్రమాలలో నా డిగ్రీ స్థాయి నుండి నా గురువులు డా.బి.మాధురి గారు, డా.జరుపుల రమేష్ గారు నిరంతరం ప్రోత్సహించేవారు వారిని ఎన్నటికీ మర్చిపోను.
ప్రోగ్రామ్స్ చేస్తూ చదువును కొనసాగిస్తున్నప్పుడు చదువుకు ఆటంకం రాలేదా??
నేను పీజీ చదివేటప్పుడు డా.జరుపుల రమేష్ నెట్ పరీక్ష గురించి, పీహెచ్ డీ గురించి విద్యార్థులందరికి గైడ్ చేసే సందర్భంలో డిసైడ్ అయ్యాను. నెట్ లో ఎలా అయినా ఉత్తీర్ణత సాధించి పీహెచ్.డీ తెచ్చుకోవాలని. చిన్న వయసులోనే సెంట్రల్ యూనివర్సిటీ లో పీహెచ్.డీ పూర్తి చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఎన్నికైన గురువు గారు నాకు ఇన్స్పిరేషన్. పీహెచ్ .డీ లో సీటు సంపాదించాలంటే నెట్ తప్పనిసరి. మరి పార్ట్ టైంగా యాంకర్,న్యూస్ రీడర్గా చేస్తూ నెట్ కి ప్రిపేర్ అవ్వగలనా అనుకున్నాను.వచ్చిన అవకాశాలను మిస్ చేసుకోకుండా షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నాను. ఈవెంట్స్ కి వెళ్ళినప్పుడు ఖాళీ టైం దొరికితే చాలు చదువుకున్నవి గుర్తు చేసుకునేదాన్ని.అలా పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న సమయంలో ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించారు. కుటుంబ సభ్యులు పెళ్లి అనడం నేను ఏడవడం ఆరోజుల్లో అలవాటైపోయింది.ఇక లాభం లేదని ఇంట్లో అందరిని కూర్చోబెట్టి ' పీహెచ్.డీ చెయ్యడం నా కల నాకు ఇప్పుడే వివాహం చేసుకోవాలని లేదు ఈసారి నేను నెట్లో అర్హత సాదించకపోతే సంబంధాలు చూడండి' అని చెప్పాను.అప్పటికె నెట్ పరీక్ష రెండు సార్లు రాసాను. ఉత్తీర్ణత సాధించలేదు.ఆ రోజు రాత్రి బాగా ఆలోచించాను. నాకిప్పటికి ఆరోజు బాగా గుర్తు.ఈసారి నెట్ ఉత్తీర్ణత సాదించకపోతే పెళ్లి చేసేస్తారనే భయం విపరీతంగా ఏర్పడింది. ప్రిపరేషన్ గట్టిగా స్టార్ట్ చేసి ఉత్తీర్ణత సాధించాను. సంవత్సరం వరకు ఇంట్లో పెళ్లి ప్రస్తావన లేదు .సంవత్సరం దాటాక మళ్ళీ పెళ్లి అన్నారు. ఈసారి పీహెచ్.డీ కోసం సమయం ఇవ్వండి అన్నాను. ఆ సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ పీ.హెచ్.డీ నోటిఫికేషన్ ,కాకతీయ విశ్వవిద్యాలయం ఎం.ఫిల్. నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో కుటుంబసభ్యులు అభ్యంతరం చెప్పలేదు. మొదట కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎం.ఫిల్ సీటు సంపాదించాను. తర్వాత ఓయూ లో పీహెచ్. డీ రాగానే కేయూలో క్యాన్సల్ చేసుకొని పీహెచ్.డి జాయిన్ అయ్యాను.అలా ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయం లో పీ.హెచ్ డీ చేస్తున్నాను.
పెళ్లంటే మీకు భయమా?
అయ్యో అలా ఏమీ లేదండి. కాకపోతే చుట్టూ ఉన్న పరిస్థితులను పరిశీలించిన్నప్పుడు అనిపిస్తుంటది అనుకున్నవి వందకు వంద శాతం నెరవేరాలంటే పెళ్లికి ముందు మాత్రమే సాధించొచ్చు అని నమ్ముతాను. మొదట ఇంట్లో నేను చెప్పిన రెండింటిలో ఉత్తీర్ణత సాధించాక పెళ్లిటార్చర్ లేదు.ప్రస్తుతం నేను తెలంగాణ కథా సాహిత్యం - స్త్రీ జీవన చిత్రణ(1991-2015) అంశం మీద డా.నాలేశ్వరం శంకరం గారి పర్యవేక్షణ లో పీహెచ్ .డీ చేస్తున్నాను. ఆచార్యులు డా.సూర్యాధనంజయ్ గారు,డా.ఎస్.రఘు గారు నిరంతరం ప్రోత్సాహిస్తారు.
స్త్రీ కి సంబంధించిన అంశాన్నే ఎందుకు ఎంచుకోవాలి అనిపించింది?
స్త్రీ సమస్యలు కనిపిస్తే చలించిపోతాను.బాధాకరమైన దృశ్యాలు కనిపిస్తే వాటిని కవితలు,కథల రూపంలో మల్చుతాను. కొన్ని కవితలు మరియూ కథలు పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.నా అంశానికి సంబంధించిన పుస్తకాలు సేకరించి అధ్యయనం చేస్తున్నాను.కొన్ని స్త్రీ కోణం లో ఆర్టికల్స్ కూడా రాసాను. తెలంగాణ సాహితి వారు నిర్వహించిన 'తెలుగెత్తి జై కొట్టు' శతాధిక తెలుగు సాహితీవేత్తల జీవితం - సాహిత్యం లో అబ్బూరి ఛాయాదేవి గారి కథలపై.. జానకి విముక్తి నవల-సామాజిక పరివర్తన అంశంపై బావవీణ పత్యేక సంచికలో ప్రచురితం అయింది. సమ్మెట ఉమాదేవి గారి కథా సంపుటి రేలపూలు పై మద్రాసు క్రైస్తవ కళాశాల వారు నిర్వహించిన జాతీయ సదస్సు లో.. మరియు ఐతా చంద్రయ్య రాసిన కలికి గాంధారి కథ గురించి అంతర్జాతీయ సదస్సులో.. ఉస్మానియా తెలుగుశాఖ శతాబ్ది సంబరాల సందర్భంగా నిర్వహించిన ఉస్మానియా తెలుగుశాఖ-ఆచార్యులు-సాహిత్యసేవకి సంబంధించిన జాతీయ సదస్సులో డా.ఆలూరి సురేంద్రకుమార్ పై ఇలా జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పత్ర సమర్పణలు చేసాను.
మీకు కథా సాహిత్యం పై ఎలా ఆసక్తి ఏర్పడింది?
నా పీజీ సెమిస్టర్ లో నవల పేపర్ మాకు పాఠ్యాంశంగా ఉండేది. మా గురువులు పీజీలో ఉన్నప్పుడు బోధనా నైపుణ్యాలను పెంపొందించాలనే ఉద్దేశ్యంతో కథలు, నవల అంశాలకు సంబంధించి ఒక్కొక్కరు ఒక్క టాపిక్ తీసుకొని మాతో చెప్పించి ప్రోత్సహించే వారు. నాకు స్త్రీ సమస్యల పట్ల ఆసక్తి ఉండటం వలన ముప్పాళ్ల రంగనాయకమ్మ గారు రచించిన మొట్టమొదటి స్త్రీ వాద నేపథ్యంలో వొచ్చిన నవల 'జానకి విముక్తి' గురించి చెప్పాను. క్లాస్ లో అందరూ చప్పట్లు కొట్టారు. చాలా బాగా చెప్పావ్ అని మెచ్చుకున్నారు. మనం ఏదైనా పనిని చేసినప్పుడు బాగుంది అని చెపితే ఆపనిని రెట్టింపైన ఉత్సాహంతో చేస్తాం. ఆ తర్వాత వరుసగా అంపశయ్య నవీన్ 'అంపశయ్య', బుచ్చిబాబు 'చివరికి మిగిలేది'
మాక్సిం గోర్కీ 'అమ్మ' , డా.కేశవరెడ్డి 'అడవిని జయించాడు' వంటి నవలు చదివాను. ఇలా చదువుతున్నప్పుడు ఎందుకో కథలు రాస్తే బాగుండు. ఎందుకు రాయలేనని ప్రయత్నించి ఒక్కొక్కటిగా రాయడం మొదలు పెట్టాను. ఇప్పటి వరకు ఏడు కథలు రాసాను. అందులో మారిన మనిషి కథ భర్త మద్యపానం వ్యసనాలకు స్త్రీ పడే మనోవేదనను వివరించిన కథ. పెళ్లి లొల్లి కథలో చదుకోవాలిసిన అమ్మాయికి పెళ్లి చేస్తాను అంటే ఇంట్లో ఎలా ఒప్పించింది అనే నేపథ్యం. కరోనా నేపథ్యంలో రాసిన 'పరిమళించిన మానవత్వం' కథ నవ తెలంగాణ పత్రికలో.. మనిషి స్వభావాన్ని తెలియజేసే 'స్వభావం' కథ ప్రజాకాంక్ష పత్రికల్లో ప్రచురితం అయ్యాయి. స్నేహానికి కులం అడ్డుగోడ కారాదు అనే నేపథ్యంలో రాసిన 'అడ్డుగోడ' గల్పిక, కరోనా మీద రాసిన వ్యాసం దెంచనాల జ్వలిత గారి సంపాదకత్వంలో వచ్చిన పుస్తకాలు 'అవలోకనం' ,గల్పికా తరువు పుస్తకాలలో ప్రచురితం అయ్యాయి. కొన్ని ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయి.
ప్రస్తుతం కొన్ని కథలు రాస్తున్నాను. అన్ని కథలను కలిపి ఈ సంవత్సరం కథా సంకలనం గా తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాను.
మీ జీవిత లక్ష్యం ఏమిటి?
ఒకే కాలంలో నేను అనుకున్న రంగాలలో మంచి పేరు తెచ్చుకోవాలని ఉన్నత స్థానానికి ఎదగాలని ఉంది.ఎప్పటికైనా ప్రొఫెసర్ కావాలన్నది నా కల.
- రాజు