Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సేంద్రియ వ్యవసాయం చేయడమే కాదు.. ఆర్గానిక్ పాఠాలు కూడా చెప్తున్నాడీ కుర్రాడు. నిండా ఇరవైఏండ్లు కూడా లేవు. లోకం పోకడలు కూడా పెద్దగా తెలియని వయసు. అయితేనేం? అతడి ఆశయం గొప్పది. అంతకంటే అతడి ఆలోచన మహత్తరమైనది. చిన్న వయసులోనే సేంద్రియ వ్యవసాయం చేయడమంటే సామాన్యమైన విషయం కాదు. ఇతడు కేవలం వ్యవసాయం చేయాడానికే పరిమితం కాలేదు. తనలాగా మరికొందరిని సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేయించే పనిలో ఉన్నాడు. తనకు తెలిసిన విద్యను పది మందికి పంచుతూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న ఆర్య పూదోట పరిచయమే ఈ వారం జోష్...
సేంద్రియ వ్యవసాయం అంటే ప్రకృతి సిద్ధమైన పర్యావరణ అనుకూలమైన జీవాధారిత వ్యవసాయం.సేంద్రియ వ్యవసాయం జీవుల వైవిధ్యాన్ని, జీవుల వివిధ దశలను, నేలలో గల సూక్ష్మ జీవుల పనితనాన్ని వృద్ధి పరుస్తుంది. ముఖ్యంగా ప్రాంతీయంగా లభించే వనరులతో వ్యవసాయం చేయుటకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ, హానికర రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకానికి దూరంగా చేసే వ్యవసాయమే సేంద్రియ వ్యవసాయం. సేద్య, జీవ సంబంధ,యాంత్రిక పద్ధతులతో చేస్తున్న ఈ వ్యవసాయం ఆరోగ్య ప్రధాయిని. సేంద్రియ వ్యవసాయం అనగా సహజ సిద్ద కర్బనం కలిగియున్న మొక్కల, జంతు, నీటి వ్యర్ధాలు, ఇతర జీవపదార్థాలతో పాటు జీవన ఎరువులను ఉపయోగించుకొని నేలలోని పోషకాలను పంటలకు సమగ్రంగా అందే విధంగా సుస్థిర వ్యవసాయ దిగుబడులను సాధిస్తూ నేల, నీరు, వాతావరణం, కాలుష్యం కాకుండా కాపాడుతూ నేల సజీవంగా ఉండే విధంగా పంటలను పండించడం. ప్రపంచ వ్యాప్తంగా 43.7 మిలియన్ హెక్టార్లలో సేంద్రియ సాగు చేస్తున్నారు. భారతదేశంలో కూడా
4.72 మిలియన్ హెక్టార్లలో సేంద్రియ సాగు చేస్తున్నారు. పేరుకు తగ్గట్టుగానే బెంగళూరు కుర్రాడు. 16 ఏళ్ల వయసులోనే అతడు చేసిన అద్భుతాలు చూస్తుంటే ముచ్చటేస్తుంది. నలుగురితోపాటు తానుగా కాకుండా వందలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. దేశానికి ఏదైనా మేలు చేయాలన్నది ఆర్య ఆలోచన. అందుకే రసాయనిక ఎరువులతో కాకుండా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇంటి ఆవరణలోనే తన తల్లి కూరగాయలు పెంచిన తీరే అతడికి ప్రేరణ. అలా ఆర్గానిక్ ఫామింగ్ పై ఆసక్తి పెంచుకున్నాడు. నెమ్మదిగా సేంద్రియ వ్యవసాయంలో మెళకువలు, పద్ధతులు, అందులో ఉన్న లాభాల గురించి అవగాహన పెంచుకున్నాడు. సేంద్రియ వ్యవసాయం అనగానే ముందుగా అందరూ వెన్నుతట్టారు. కానీ సమయానికి ఒక్కరూ సాయం చేయలేదు. పైగా ఇది మనకు వర్కవుట్ అవుతుందా? అంటూ ప్రశ్నలు సందించారు. చక్కగా చదువుకోక ఈ వయసులో వ్యవసాయం ఎందుకంటా? వ్యవసాయం చేసిన వారందరూ ఏం బాగుపడ్డారు? లాంటి ప్రశ్నలు అతని ఆశయంపై ఎదురుదాడి చేశాయి. అతడి లక్ష్యాన్ని చులకన చేశాయి. దీంతో ఆర్యలో ఒక అంతర్మథనం మొదలైంది. రోజులు తరపడి మధనపడ్డాడు. చివరికి పట్టుదల ఉంటే ఎందుకు కాదు? ఎవరేమన్నా సేంద్రియ వ్యవసాయం చేసి తీరాలని డిసైడయ్యాడు. అలా 2014లో ఒంటరిగానే మై ఆర్గానిక్ ఫాం పేరుతో వ్యవసాయం మొదలు పెట్టాడు. ఇంట్లోనే చిన్న చిన్న కుండీల్లో, ఇంటి పెరట్లో సేంద్రియ పద్ధతిలో మొక్కలు పెంచుతున్నాడు. కుండీల్లో చిట్టి చిట్టి మొక్కలకు కాసిన క్యాప్సికమ్స్, టామాటా, క్యారెట్, దుంపలు, ఆకుకూరలు, బీరకాయలు, కాకర, బెండ, మిర్చీ లాంటి పంటలన్నీ సేంద్రియ పద్ధతిలోనే సాగు చేస్తున్నాడు. తనపై సంధించిన వేల ప్రశ్నలకు ఒకటే సమాధానం 'మై ఆర్గానిక్ ఫాం'
మొక్కలు పెంచే పద్దతి
కుండీల్లో సేంద్రియ పద్ధతిలో మొక్కలు ఎలా పెంచుతున్నాడు. ముందుగా ఒక కుండీలో చిన్న చిన్న కంకర రాళ్లు వేయాలి. దాని మీద కాసింత ఇసుక పోయాలి. తర్వాత కోకోపీట్, వర్మీ కంపోస్ట్ రెంటినీ ఒక మిశ్రమంలా తయారు చేయాలి. ఆ మిశ్రమాన్ని కుండీలో పోయాలి. మధ్యలో విత్తనాలు నాటి పైన కాసిన్ని నీళ్లు పోయాలి. క్యాప్సికమ్ మొక్క అయితే నాలుగు నెలల్లో కాపుకొస్తుంది. ప్రస్తుతమున్న సంప్రదాయ వ్యవసాయ పద్ధతుల్లో చాలా లోపాలున్నాయంటాడు ఆర్య. నిజమే. హానికరమైన ఎరువులు, రసాయనాల వాడకం వల్ల భూమి సహజత్వాన్ని కోల్పోతోంది. క్రమంగా నిస్సారమవుతుంది. పెస్టిసైడ్స్ ఉపయోగించి పండించిన కూరగాయలు, పండ్లు ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నాయి. కేన్సర్ వంటి ప్రమాదకరమైన రోగాలకు కారణమవుతున్నాయి. ఈ పరిస్థితిపై ప్రజల్లో అవగాహన కల్పించి, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడమే మై ఆర్గానిక్ ఫాం ఉద్దేశమంటాడు ఆర్య. సేంద్రియ సేద్యానికి సంబంధించిన అనేక విషయాలు, పద్ధతులను మై ఆర్గానిక్ ఫాం యూ ట్యూబ్ చానల్ ద్వారా ప్రచారం చేస్తున్నాడు.
149 రూపాయలకే కిట్
సేంద్రియ సేద్యం చేయాలని ఆసక్తి ఉన్నా.. అందుకు అవసరమైన ముడి సరుకు దొరకని వారి కోసం ది గ్రో బేసిక్ కిట్ ను కూడా అందిస్తున్నాడు. గ్రో బ్యాగ్, కొన్ని కూరగాయలు, పండ్ల విత్తనాలు, సేంద్రీయ ఎరువు ఈ కిట్లో ఉంటాయి. ఆర్గానిక్ ఫామింగ్ కు అవసరమైన అన్ని వనరులు ఒకే చోట దొరకడంతో జనం కూడా ఆసక్తి చూపిస్తున్నారు. కిట్ ధర 149 రూపాయలు.
తెలంగాణ హరితహరంలో భాగస్వామి
మై ఆర్గానిక్ ఫాం ద్వారా పర్యావరణ పరిరక్షణకూ ఆర్యా పూదోట నడుం బిగించాడు. వేలాదిగా మొక్కలు పంపిణీ చేయడం, గ్రీనరీని పెంచడం, సేంద్రియ సేద్యంపై అవగాహన కల్పించడం.. ఇవీ అతడి లక్ష్యాలు. ఒక్క కర్ణాటకలోనే కాదు.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం లోనూ ఆర్య భాగస్వామి అయ్యాడు. 2016లో హైదరాబాద్ కేబీఆర్ పార్కులో వందలాది మొక్కలు పంపిణీ చేశాడు. తెలంగాణ, కర్ణాటక అటవీ శాఖలు ఆర్య ఆశయానికి అండగా నిలబడ్డాయి. కొంతమంది పర్యావరణ ప్రేమికులు కూడా అతడికి చేయూత అందిస్తున్నారు. మొక్కలు పంపిణీ చేయడం, నాటడమే కాకుండా వర్మీ కంపోస్ట్ పై కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు. ఈ బుల్లి పర్యావరణ ప్రేమికుడిని ఇప్పటికే ఎన్నో అవార్డులు వరించాయి. ఆర్య కృషికి యునైటెడ్ నేషన్ ఎన్విరాన్ మెంట్ శాల్యూట్ చేసింది. 2015లో యునైటెడ్ స్టేట్స్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ పురస్కారంతో సత్కరించింది. మై ఆర్గానిక్ ఫాం ను భవిష్యత్ లో మరింత మందికి చేరువ చేయాలన్నదే ఆర్య ముందున్న లక్ష్యం. ఇప్పటికే చాలా మంది యువత అతడిని ఆదర్శంగా తీసుకుంటున్నారు. సీనియర్ సిటిజన్స్ కూడా అతడి బాటలోనే నడవడానికి సిద్ధమవుతున్నారు. చిన్న వయసులోనే పది మందికీ ఆదర్శంగా నిలుస్తున్న ఆర్యాకి హ్యాట్సాఫ్!
- ఎ.కిషన్ బాబు