Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జాతి ద్వారా భాషకు, భాష ద్వారా జాతికి విశిష్ఠ గౌరవం దక్కుతుంది. ఏ ప్రగతిశీల జాతికైన భాషే తల్లివేరు. ప్రజల నాలుకలపై జీవ చైతన్యంతో తొణికిసలాడాల్సిన భాష తన ఉనికిని కోల్పోయి అంతరించిపోవడమంటే ఏమిటి..? ఏదైన భాష తన ఉనికి పోగోట్టుకోవడమంటే కేవలం ఆ భాష అంతరించిపోయినట్లే కాదు దాంతో పాటు ముడిపడి ఉన్న ఆ జాతి సంస్కృతి సంప్రదాయాలు కూడా అంతరించినట్లే కదా..! నేటి యువత ఆంగ్ల భాషలో చదివితేనే ఉద్యోగాలు అనే అభిప్రాయంతో ఉన్నది. నిస్సందేహంగా ఇది తప్పు వాదన. మాతృభాషలో చక్కగా రాయడం, చదవడం వచ్చిన వారికే ఇతర భాషల్లో విస్తారమైన జ్ఞానం వస్తుంది. ఒక అపోహతో నేటి యువతరం అమ్మ భాషకు దూరం అవుతున్నారు. ఈ ఎలక్ట్రానిక్ యుగంలో ఒక తరం మాతృభాషకు దూరమైతే మొత్తం ధ్వంసమైనట్లే అలా కాకుండా చూసుకోవాల్సిన భాద్యత మనందరిది. ప్రపంచ మాతృభాషా దినోత్సవం సందర్భంగా యువతరం ప్రతినిధుల అభిప్రాయాలను ఈ వారం జోష్లో పంచుకుందాం..!
- సేకరణ : అనంతోజు మోహన్ కృష్ణ
జాతి సంస్కృతికి భాష మూలం
శిశువు తానొక భాషను నేర్చుకుంటున్నాననే పరిజ్ఞానం లేకుండా అప్రయత్నంగా సహజంగా నేర్చుకొనేది మాతృభాష. తల్లి నుండి చుట్టూ ఉన్న సామాజిక నేపథ్యం నుండి ఇది అలవడుతుంది. జ్ఞానానికి సంబంధించిన మౌలిక భావనలను అర్థం చేసుకోవడం సృజనాత్మక ఆలోచనలను వెలికితీయడంకు ఉపయోగపడే సాధనం మాతృభాష. మనుగడ కోసం ఇతర భాషలు నేర్చుకోవడంలో తప్పులేదు కానీ పరాయి భాషల మోజులో తల్లిభాషను మరచిపోకూడదు. తరతరాలుగా వస్తున్న ఆయా జాతుల సంస్కృతి సంప్రదాయాలు వారి మాతృభాషలోనే నిక్షిప్తమై ఉంటాయి. కావున మాతృభాషను పరిరక్షిస్తే వాటిని కూడా కాపాడుకో గల్గుతాము.
- స్వప్న భువకర్
తెలుగు ఉపన్యాసకులు
న్యూ గవర్నమెంట్ జూనియర్ కళాశాల
వై.ఎం.సి. ఏ, సికింద్రాబాద్
యువతరం మాతృభాషను మరవకూడదు
భారతదేశం బహు భాషల కల్పవక్షం. ఇలాంటి భిన్న భాషలు నేర్చు కోవడానికి అందుబాటులో ఉండటం అభివృద్ధి చెందడానికి ఒక అవకాశం. దురదృష్టవశాత్తు భాషలను ఉపాధి కోణంలో బోధన చేసే అవకాశాలపై విద్యా వ్యవస్థ దృష్టి పెట్టడం లేదు. అందుకే యువతరం ఏదో ఒకటి రెండు భాషలపై మోజు పెంచుకొని మిగిలిన భాషలను చివరికి మాతృభాష ను కూడా వినియోగించడం, ప్రేమించడం మాని వేశారు. భాషలను మార్కెట్ అనుకూల సాధనంగా చేసే ప్రయత్నం భాషావేత్తలు చేసిన రోజు భాషల మనుగడ సులభం అవుతుంది.
భాష అంటే ఒక జాతి సంస్కతి అస్తిత్వం.
- డా.తన్నీరు సురేష్, అసిస్టెంట్ ప్రొఫెసర్ తెలుగు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల గోదావరిఖని పరిశోధకులు, సాహితీ వేత్త
తూతూ మంత్రంగా చదువులు వద్దు
గాలి స్వేచ్ఛగా సాగినట్టు, సెలయేరు స్వచ్ఛంగా పారినట్టు, మనకు తెలియకుండానే మన ఊపిరి తీసుకున్నట్టు అసంకల్పితంగా, అప్రయత్నంగా, అత్యంత సహజంగా తల్లి పొత్తిళ్ళలోంచి మనకు దొరికే ప్రసాదం మాతృభాష. తల్లినుడిలో ప్రావీణ్యతను సాధించినవాడు ప్రపంచలోని ఏ ఇతర భాషనైనా సులువుగా నేర్వగలుగుతాడు. నేటి పిల్లలకు ఇటు మాతృభాష పూర్తిగా రాక, అటు ఇంగ్లీషు సరిగా రాక ఏదో తూతూ మంత్రంగా చదువులు పూర్తిచేస్తున్నారు. కనీసం మాతృభాషలోనైనా ప్రవేశం కలిగి, అవగాహనతో తగిన జ్ఞానాన్ని ఆర్జించగలిగితే మన భాషాసాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడొచ్చు. తద్వారా జీవవైవిధ్యం సాధించబడుతుంది.
- జి.శ్రీలత,
తెలుగు సహాయాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల,
మంచిర్యాల జిల్లా.
భాష అనేది నీళ్ళ లాంటిది
భాష అనేది నీళ్ళ లాంటిది వివిధ శాస్త్రాలనేవి చేపల వంటివి ఎంత ఎక్కువ నీళ్లు ఉంటే అన్ని చేపలు బ్రతుకుతాయి. భాషా సంపద ఎంత ఎక్కువ ఉంటే అన్ని ఎక్కువ శాస్త్రాలు అధ్యయనం చేయవచ్చు. బడిభాష ఇంటి భాష ఒక్కటే ఉండాలే అప్పుడే నిర్భయంగా, స్వేచ్ఛగా, ఆసక్తితో విద్యార్థి చదువుపై మక్కువ చూపుతాడు. ఆధునిక సాంకేతిక యుగంలో సమాచారమంతా అరచేతిలో లభిస్తుంది. విద్యార్థి సరైన భాషా పరిజ్ఞానం లేకపోవడంతో ఆయా సమాచారాన్ని జ్ఞానంగా మార్చుకోలేకపోతున్నాడు. మాతృ భాష, ఇంటి భాష మాధ్యమంలో వివిధ శాస్త్రాలను అధ్యయనం చేసినట్లైతే విద్యార్థి సర్వతోముఖాభివద్ధి పరిపూర్ణంగా సాధ్యమౌతుందని
నా అభిప్రాయం.
- డా.బూర్ల చంద్రశేఖర్
ప్రిన్సిపాల్(సహాయ ఆచార్యులు తెలుగు)
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మెట్ పల్లి, జగిత్యాల
తెలుగులో చదవలేక, ఆంగ్లం అర్థం కాక
మాతృభాష పై నిర్లక్ష్యం 'మన కళ్ళను మనమే పొడుచుకొని కర్ర సహాయంతో నడవడం వంటిది.' మాతృమూర్తికి, మాతృభాషకు ప్రత్యామ్నాయం లేవు. జ్ఞాన సముపార్జనకు విదేశీ భాష ఒక అవరోధంగా తయారై యువత గ్రామీణ విద్యార్థులు తల్లడిల్లుతున్న కాలం ఇది. స్పష్టమైన భావవ్యక్తీకరణ, ఉత్తమమైన ఆలోచనలు, ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడానికి ఇవన్నీ మాతృభాష ద్వారా సులభంగా సాధించవచ్చు. సర్టిఫికెట్ల కోసం ఉన్నత చదువులు, కేవలం ఉద్యోగాల కోసం విదేశాలు... సారం లేని చదువుల తీరిది. యువత, ముఖ్యంగా గ్రామీణ యువత ఎంతో శక్తి సామర్ధ్యాలు, ప్రతిభాపాటవాలున్నా ఈ వైరుధ్యాల వల్ల ఎంతో కోల్పోతున్నారు. తెలుగులో చదవలేక, ఆంగ్లం అర్థం కాక సతమతమవుతున్నారు. ప్రస్తుత ఆంగ్ల పాఠ్యపుస్తకాల రూపశిల్పి ఆనందన్ (కేరళ) మాటల్లో చెప్పాలంటే మాతృభాషను వదిలేసి స్వారీ చేస్తున్న ఈ వ్యవస్థ త్వరలోనే పెను సమస్యలను ఎదుర్కోనుందన్నారు. ముఖ్యంగా విలువలు లేని సమాజం చూడబోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరమనుషుల వ్యవస్థ వైపు అడుగిడుతున్న మనం ఈ విషయంపై మరింతగా దృష్టి సారించాలి. పూర్తిగా తెలుగు మీడియం గ్రామీణ నేపథ్యం నుండి వచ్చిన నేను ఈరోజు ఆంగ్ల ఉపాధ్యాయుడిగా స్థిరపడడానికి కారణం మాతృ భాష మీద పట్టు ఉండటం వల్లనే! మాతృభాషే దైవము, స్వర్గము! మాతృభాషలో మాట్లాడడం పట్ల గర్వపడే స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తూ, శుభాకాంక్షలు!
- కాసుల రవికుమార్
లీడ్ వ్యవస్థాపకులు
నిత్యం పరభాషలో తడుస్తూంటాం
వృత్తిపరంగా నేను దక్షిణాఫ్రికాలో ఉండే నేను ఎక్కువగా పరాయి భాషల వర్షంలో తడుస్తూంటాం. ఎప్పుడైనా తెలుగు మాటల జల్లులు కురిస్తే ఆనందంతో తడిసిపోతాం. చిన్నపిల్లలమై భాషలో మేము జాగ్రత్తగా దాచుకున్న జ్ఞాపకాల తలుపుల్ని తెరచి గుర్తుల గదుల్లోకి దూరుతాం. ఆ ఆనందం కోసం అప్పుడప్పుడైనా తెలుగు పండగలు, భాషా సాంస్కృతిక ఉత్సవాలు జరుపుకొని మాతృభాషా చిగురులతో కూడిన వసంతాన్ని మా బ్రతుకుల్లోకి అరువు తెచ్చుకుంటాం. దూరంగా ఉన్నప్పుడే ఎక్కువ కోల్పోతాం, కనీసం కోల్పోతున్నామని గుర్తిస్తాం, ఇంతదూరం నడిచాక ఇప్పుడు ఒక్కక్షణం ఆగి దారెంట మేము పోగొట్టుకున్న అమ్మ బాష గుర్తులన్నింటినీ వెతుక్కుంటూ అదేఅడుగుల్లో వెనక్కి వస్తున్నాం. మా పిల్లలు అమ్మమ్మలతో, తాతయ్యలతో తెలుగులో మాట్లాడలేని రోజు ఎప్పటికీ రాకూడదని, తెలుగు వెలుగులు ముందు తరాలకి అంతే గొప్పగా అందివ్వాలని ఖండాలవతలున్నా గుండెల్లో మాతృభాషాదివ్వెల్ని వెలిగించుకుని జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం. అమ్మని, అమ్మభాషని ఒకేలా ప్రేమించాలి.. గౌరవించాలి. ఎందుకంటే ఆ ఇద్దరూ ఎంత కష్టమొచ్చినా, సుఖమొచ్చినా నీపక్కన ఒకేలా నిలబడతారు, నిన్ను నిలబెడతారు. నువ్వు ఒక్కడివే ఉన్నప్పుడు ఏ భాషలో ఆలోచిస్తావో, నీతో నువ్వు ఏ భాషలో మాట్లాడుతావో, ఏ భాషలో వింటావో అదే నీ అసలైన భాష, అమ్మభాష. చిన్నప్పుడు అమ్మ పాడిన లాలిపాటలు, నాన్న నుదిటిపై పెట్టిన తీపి ముద్దులు వెనక్కితిరిగి చూస్తే నడిసొచ్చిన బ్రతుకంతా అమ్మభాషలోనే ఉంది, బ్రతుకునుంచి భాషని ఎలా విడదీస్తాం, విడదీసి దేన్ని బ్రతుకుగా మిగుల్చుకుంటాం. మనమంతా ఈరోజు ప్రతిజ్ఞ చేసి బ్రతకడానికి భాషలెన్ని నేర్చుకున్నా బ్రతుకంతా నిండి ఉన్న అమ్మభాషను కాపాడుకుందాం, గౌరవించుకుందాం.
- గౌతమ్ లింగా
జోహన్నెస్బర్గ్, దక్షిణాఫ్రికా
+27 745657589
పరభాషా జ్ఞానాన్ని సంపాదించు.. నీ భాషలోనే సంభాషించు
వేరే భాషలను నేర్చుకోవడం ఎప్పుడూ విజ్ఞానమే. ఎన్నిభాషలు నేర్చుకున్నా మనం ఆలోచించేటప్పుడు మన మాతృ భాష లోనే ఆలోచిస్తాం. 17 భాషలు మాట్లాడగల పివి నరసింహారావు గారు మన తెలుగు వారైనందుకు ఎంతో గర్వించాలి. ఏ భాషకు లేని ప్రత్యేకత మన తెలుగు భాషకు ఉందనుటకు అవధానమే గొప్ప ఉదాహరణ. కావున ఎంతో ప్రాముఖ్యత ఉన్న మన భాషను మనం కాపాడుకోవాలి. మాతృభాషను ప్రేమిద్దాం, పరభాషను గౌరవిద్దాం.
- హిమజా రామం,
తెలుగు గజల్ గాయని
మాతృభాషపై ప్రపంచీకరణ ప్రభావం
మనిషి పుట్టుకతోనే అతడికి తల్లిపాలతో పాటు లభించే వరమే మాతృభాష. మాతృభాషను పరిరక్షించుకోవాలంటే, తప్పనిసరిగ దాన్ని మనం మట్లాడితీరాలి. ఇప్పటికే గ్రామీణప్రాంతాలన్నీ పట్టణీకరణ చెందుతున్నాయి. దీనివల్ల ఆయా ప్రాంతాలలో సజీవంగా ఉన్న అమూల్యమైన తెలుగు పదసంపద మరుగున పడుతున్నది. దీనికి ముఖ్యంగా నేటి ఆధునిక సాంకేతికత, ఇతర ప్రసారమాధ్యమాలు కారణమౌతున్నాయి. ప్రతీ చోట ఇదివరకే వాడుకలో ఉన్న మన పదాలనే యథావిధిగా వాడకంలోకి తెచ్చే విధంగా ప్రజలలో జాగురూకత కల్పిస్తే మన భాష బ్రతుకుతుంది. మాతృభాషలో విద్యాబోధన వల్ల పిల్లలకు మనోవికాసం కలుగుతుంది.
ఈ దిశగా ప్రజలలో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది.
- గంజి శశిధర్,
తెలుగు సహాయాచార్యులు,
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఇబ్రహీం పట్నం,రంగారెడ్డిజిల్లా.
రోజుకో రెండు వాక్యాలనైనా పరిచయం చేద్దాం!
ఈ పరుగులు ప్రపంచంలో అనేక భాషల్ని నేర్చుకుంటూ వెళ్తున్నాం ఇది బావుంది. అట్లాగే మాతృభాషను కాపాడుకోవాల్సిన అవసరం కూడా వుంది. వొక దారిన నడుస్తున్నప్పుడు ఆ దారి మూలాన్ని మరిచిపోతే ఎట్లా? వొక పరిపూర్ణమైన సృజనాత్మకతగల ఆలోచనల్ని స్వేచ్ఛగా ఆయా ప్రాంతీయ భాషలల్లో చెప్పడానికి మాట్లాడానికి వీలుంటుంది. మాతృభాషను మరిచిపోవడం అనేది బయటదొరికే గాలిని వొదిలేసి సిలెండర్ లో దొరికే గాలిని పీల్చడంలాంటిది. జీవనం కోసం ఇతర భాషల్ని ఎంచుకున్న ఆ జీవనాన్ని కొనసాగించడానికైనా తెలుగు భాష ఊపిరి కావాలి. ఇప్పుడు మన మాతృభాషా కొంత అయోమయంలో పడుతోంది దానికి మనమే కారణం. రేపటి తరానికి భాషని పరిచయం చెయ్యడం అత్యంత అవసరమని కర్తవ్యమని మనకి మనమే చెప్పుకొని ఈ తరానికి రోజుకో రెండు వాక్యాలనైనా పరిచయం చేసుకోవాలి.
- పేర్ల రాము,
మహాబూబాబాద్
పీజీ విద్యార్ధి
మాతృద్రోహులం కావద్దు
1999 నవంబర్ 17 న యునెస్కో ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఫిభ్రవరి 21 ని అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవంగా ప్రకటించింది. మాతృభాషా తృణీకారం అంటే అమ్మను తిరస్కారించడంతో సమానం అన్నారు గాంధీజీ. మాతృభాష అంటేనే తల్లి ఒడి భాష. దీనిని రక్షించుకోలేకపోవడం మాతృద్రోహమే. పరభాషార్జన అవసరమే.కానీ ఆ మోజులో మన మాతృ భాష తెలుగును నిర్లక్ష్యం చేయరాదు. తెలుగు వారిగా మన భాష పై ప్రేమను ప్రదర్శించుటకు మన వంతుగా కనీసం ఒక్క రోజులోనైనా (ఇతర భాషలు ఉపయోగించకుండా) పూర్తీ తెలుగులో మాట్లాడుకుందాం. అలాగే మన భాష మాధుర్యంను భావితరాలకు పంచాలంటే మనం చిన్న పిల్లలతో అచ్చ తెలుగులో మాట్లాడుతూ కోత్త పదాలు నేర్పిద్దాం. ప్రభుత్వం కూడా చిత్తశుద్దితో రాజపత్రాలను, శాసనాలను, కార్యనిర్వహణను మాతృభాషలోనే అమలు చేయాలి. వ్యాపార దుకాణాల పేర్లు ఆంగ్లంలో కాకుండా తెలుగులో ఉండేట్లు చర్యలు తీసుకోవాలి. అంతేకాదు నేటి సమాజం లో మాతృభాష పలుచన అయ్యేది ఉన్నత విద్యలలోనే. కావున ప్రభుత్వం డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ ఇతర అన్నీ చదువులలో తెలుగు బోధనను ఖచ్ఛితమైన అంశంగా నిర్ణయించాలి. ఇంకా మాతృభాష పరిరక్షణ కోసం ప్రత్యేకంగా సమితిలు ఏర్పాటు చేయాలి.
- ఐ.చిదానందం
పరిశోధక విద్యార్ధి
ఉస్మానియా విశ్వవిద్యాలయం
అమ్మభాష
మాతృత్వపు మాధుర్యం మాతృభాషలోని తియ్యదనం
పరవశించును ప్రతి హదయం
అదే భారతీయత గొప్పదనం
ఉగ్గుపాలనాడు ఊసులాడి
బడికెళ్లేనాడు పరభాషే మోజు అంటే అమ్మను మరవడమే
అన్యభాషలేపుడు అల్పమైనవే
నిర్బందపు చదువులు వీడి
పసిడిపలుకుల పదాల ముత్యాలు చేపట్టు
తెలుగునేలపై తేనెలు కురిపించు
తెలుగువాడినంటూ గర్వించు మాతృభాషలో మాట్లాడు..!
- కె.సంధ్యారెడ్డి
హైదరాబాద్
మాతృభాష మృతభాష కాకుడదు
ప్రస్తుతం అన్నింటిలో ఆంగ్ల భాష ప్రభావం పెరిగిపోవడం వలన, మాతృభాషా వాడకం తగ్గింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భౌవిష్యత్ లో మాతృభాషా ఉనికి ప్రశ్నార్థకంగా తయారవుతుంది. మాతృభాషను అభివద్ధి చేయవల్సిన బాధ్యత నేటి యువత పైన ఎక్కువగా ఉంది.నేటి యువత పాశ్చాత్య భాషలకు అలవాటు పడి మాతృభాషను నిర్లక్ష్యం చేస్తున్నారు. తద్వారా మన సంస్కతి సాంప్రదాయాలు కూడా నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. యువత మాతృభాష ద్వారానే పరిణితి చెందగలరని, మాతృ భాష ద్వారానే తమ భావాన్ని స్పష్టంగా తెలియజేయగలరని గుర్తుంచుకోవాలి.యువత తలుచుకుంటే సాధించలేనిది ఏది లేదు. కాబట్టి మాతృ భాషాభివృద్ధి యువత భుజస్కంధాలపై ఉంది.మాతృభాషా తల్లితో సమానం.దానిని నిర్లక్ష్యం చేయడమంటే మన మాతృ మూర్తి అవమాన పరచడమే అవుతుంది.అన్నా విషయం యువతకు అర్ధమయ్యేలా మన పాఠ్యాంశాలలో పొందు పరిస్తే మాతృభాష సజీవంగా మనగలుగుతుంది.మాతృభాషా యాస (మాండలికం)లో మాట్లాడే విధంగా యువతను ప్రోత్సహించడం ద్వారా కూడా మాతృ భాషాభివృద్ధి జరుగుతుంది...
- డా.మద్దిరాల సత్యనారాయణ రెడ్డి..
తెలుగు ఉపన్యాసకులు.
ఆర్జీయుకేటి బాసర.