Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెళ్లి తరువాత స్త్రీకి భవిష్యత్తు ఉండదు అని చాలామంది అపోహ పడుతుంటారు. అప్పటివరకు ఉన్న తమ లక్ష్యాలకు చరమగీతం పాడి, పిల్లలు, కుటుంబ బాధ్యతల్లో మునిగిపోయే వారూ మనకు తెలుసు. అయితే కొంతమంది మాత్రం వివాహం, పిల్లలు, కుటుంబ బాధ్యతలను సమర్ధవంతంగా పోషిస్తూనే, తమ ప్రత్యేకతను నిరూపించుకుంటారు. అటువంటి కోవకు చెందుతారు హైద్రాబాద్ నివాసి ఇందిరా వెల్ది. చిన్నప్పుడే తండ్రి పోవడంతో అమ్మమ్మ గారి ఇల్లే వాళ్ల నివాసమైంది. తాతయ్య రాగయుక్తంగా పాడే రామాయణ , భారత, భాగవతాలను శ్రద్ధగా ఆలకించడం వలన ఆమెకు సాహితీ అభిలాష ఏర్పడింది. నిత్యం దినపత్రికలు చదివే అలవాటుతో పాటు ముఖ్యమైన విషయాలను గుర్తుపెట్టి మరి తన కూతురైన ఇందిరతో చదివించేది అమ్మ సుభద్ర. అది ఆమె సమాజంపై అవగాహనకు కారణమైంది. సంతోషం కలిగినా,దుఃఖం వచ్చినా నేను చేసే పని ఏదో ఒక పుస్తకాన్ని ఆమూలాగ్రం చదవడమే అంటున్న తెలంగాణ రాష్ట్ర కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అయిన ఇందిరా వెల్ది పరిచయం ఆమె మాటలోనే ..
జీవిత నేపథ్యం
మాది వరంగల్ జిల్లా నర్సింహులపేట దగ్గర రామాపురం అనే చిన్న గ్రామం. మా అమ్మానాన్నలు హన్మంతయ్య,సుభద్ర. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో బాల్యమంతా అమ్మమ్మ గారింట మిర్యాలగూడెంలో సాగింది. ఇంటర్మీడియట్ వరకు అక్కడే చదివాను. డిగ్రీ మాత్రం సరోజినీ నాయుడు వనితా మహా విద్యాలయ,హైదరాబాద్ పూర్త చేశాను. ఆ తరువాత పీ.జీ. కాకతీయ యూనివర్సిటీ, ఖమ్మం డైట్ కాలేజీలో టీటీసీ పూర్తిశాను. చిన్నప్పటి నుండి చదువుపై ఉన్న మక్కువే నన్ను అన్నింటిలో ప్రథమురాలిని చేసింది.
పెండ్లి చూపులు
మా అమ్మ అనారోగ్యం కారణంగా డిగ్రీ అయిపోయిన సంవత్సరమే నాకు ఖమ్మం పట్టణానికి చెందిన శ్రీనివాసుతో వివాహం అయింది. పెండ్లి చూపులలోనే నన్ను చదివిస్తానంటే పెండ్లి చేసుకుంటా అని ఖచ్చితంగా చెప్పేశాను. ఆయన కూడా అంగీకరించారు. ఆయన ప్రోత్సాహంతోనే పీజీ, టీటీసీ పూర్తి చేశాను.
గ్రీన్ ఇంక్ పెన్ను
నేను ఐదవ తరగతిలోనే స్కాలర్షిప్ కోసం తహశీల్దారు కార్యాలయంలో గంటల తరబడి ఎదురుచూసే క్రమంలో తహశీల్దారు గ్రీన్ పెన్నుతో సంతకం చేయడం చూసి నేనూ ఒకటి కొనుక్కుని దానితో నోట్సులో వ్రాశాను. ఎవరుబడితే వాళ్ళు ఆకుపచ్చ పెన్నుతో వ్రాయకూడదని, గెజిటెడ్ ఆఫీసర్లు మాత్రమే రాస్తారని జయమ్మ టీచర్ చెప్పడంతో.. గెజిటెడ్ ఆఫీసర్ అంటే ఏమిటో కూడా తెలియకుండానే గెజిటెడ్ అధికారినిగా గ్రీన్ పెన్నుతో సంతకం చేయాలని నా మనసులో ముద్ర పడిపోయింది.
పుస్తకాల పురుగు
లెపిస్మా అంటే పుస్తకాల పురుగు అని అర్థం. స్నేహితులు నన్ను అలాగే పిలిచేవారు. చిన్నప్పటి నుండి నాకు పుస్తకాలు మంచి నేస్తాలు. పుస్తకాలే నాకు తండ్రి లేని లోటును భర్తీ చేశాయి. అప్పటి నుండే తన బాధను, సంతోషాన్ని డైరీలో రాసుకునేవారు. ఉపాధ్యాయుల సూచనతో స్కూల్ లైబ్రరీలో పుస్తకాలు తీసుకుని చదివేదాన్ని. అప్పటికి ఇప్పటికి నేను బట్టలు, నగల కంటే ఎక్కువగా కొనేది పుస్తకాలనే.
వృత్తి పరంగా ఆమె నా రోల్డ్ మోడల్
నేను నెలల బాబును ఎత్తుకుని భద్రాచలం గుడికి వెళ్లినప్పుడు అక్కడ శ్రీ రామనవమి వేడుకలను సబ్ కలెక్టర్ హౌదాలో పరివేక్షిస్తున్న నీతూ ప్రసాద్ గారిని చూశాను. ఆమె నేను ఇంచుమించు ఒకే వయసు వారే కావడంతో ఒక్కసారిగా ఆమెను చూసి నాకు ఉద్యోగం సంపాదించాలనే కసి కలిగింది. ఆ ఫలితం అయిదు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించి పెట్టింది.
ప్రస్తుతం నీతూ ప్రసాద్ గారు కమర్షియల్ టాక్సెస్ డిపార్ట్మెంట్ లో కమీషనర్ గా ఉన్నారు. నేనూ అదే డిపార్ట్మెంట్ లో ట్యాక్స్ ఆఫీసర్ గా ఉన్నాను.
ఇతర కళలు - అభిరుచులు - పవ్రృత్తులు
మా ఇంట్లో వెనక ఏడు తరాలు చూసుకున్నా రచయితలు ఎవరూ లేరు. మరి నాలో ఈ సాహిత్యాభిలాష ఎక్కడిదా అని వెతుక్కుంటూ నాలోకి నేనే చూసుకుంటే - ముందు మా తాతయ్య జ్ఞాపకం వచ్చారు. ఆ వాతావరణమే నన్ను సాహిత్యకారిణిగా మార్చిందని చెప్పవచ్చు. రేడియోలోని వివిధ, భారతి, జనరంజని, పాటలు, బాలవినోదం కార్యక్రమాల వ్యాఖ్యాతలు న్యాపతి రాఘవరావు, న్యాపతి కామేశ్వరి, ఉషశ్రీ వంటి వారు రామాయణ, భాగవత, భారతములపై వ్యాఖ్యానాలను వినడం. మహానటులు ఎన్టీఆర్, ఎఎన్ఆర్ ల పౌరాణిక సినిమాలు, ప్రాచీన, ఆధునిక కవుల రచనలు చదవడం. ముఖ్యంగా సినిమా పాటలపై అభిలాష కలగడానికి కారణం నా నాలుగవ ఏట నేను విన్న మొదటి పాట '' మనసున మనసై బ్రతుకున బ్రతుకై '' లో గురువు శ్రీ పండిత జనార్థన్ మిట్టాగారి సితారవాదన, ఇంకా చందమామ, బాలమిత్ర, బుజ్జాయి, రాజ కుమారుల కథలు కనపడిన ప్రతి పుస్తకం సాహిత్యం పట్ల అభిలాషను కలిగించాయి. అదే కవిత్వం, కథలు, పాటల రాయించింది. వీటితో పాటు సామాజిక అంశాలు, రుగ్మతలు, వికాసం, అభివృద్ధి జనక, ఆశాపూరిత వ్యాసాలు రాయించింది. పద్యాలు, పాటలు పాడటం నేర్చుకున్నాను. సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, పౌరాణిక, సమస్త విషయ సంబంధిత అంశాలపై వక్తృత్వము పోటీలల్లో పాల్గొన్నాను. చాక్ పీస్లపై బొమ్మలు చెక్కుట, డ్రాయింగ్, పెయింటింగ్, కుట్లు, అల్లికలు (32 రకాల కుట్లలో ప్రావీణ్యత), రంగ వల్లికలు, తక్కువ ఖర్చుతో టీచింగ్ లెర్నింగ్ వస్తువులు తయారు చేయడం, వివిధ ఆకారాల బతుకమ్మలు తయారు చేయడం వంటి వాటిలో కూడా ప్రావీణ్యం ఉంది. మనసు పె(ప)డితే ఏదైనా సాధించగలం అనే నమ్మకమే నన్ను ఇక్కడి దాకా నడిపించింది.
నా పాటలు
మానవుడు తనను తాను కాపాడుకోవడంలో హరితహరం చేస్తున్నక్రమంలో చెట్టు విలువ తెలుపుతూ 'కన్నతల్లి వంటిదిలే కనిపించే ఈ చెట్టు/ నిరంతరం కడుతుందీ నీ ప్రగతికి మెట్టు/ ప్రాణవాయువిస్తుందీ పదిలంగా బతికేట్టు/ అదిలేక నువ్వు లేవు ఇది సత్యం ఒట్టు' అని, మనిషి జీవితం గురించి వివరిస్తూ 'ఉరుకులు,పరుగుల బతుకు కదా!/ ఊపిరి సలపని పనులు కదా!/ నవరస నటులం మనమె కదా!/ నవ్వుకు అర్థం పువ్వు కదా!' అనే పాటను, పోలీస్ సేవల గురించి 'సమ్మెలేవి చేయడూ, బందులంటె ఎరుగడు, నడుస్తున్న త్యాగధనుడు, విశ్రాంతి కోరడూ' అంటూ పాట రాశాను. రైతుల ప్రాముఖ్యతను వివరిస్తూ 'కలుపు వంటి కరువేమో, కన్నీటితో జారుకుంది, నిరాశేమే నిస్పృహతో నిరాశ చెందింది. అత్మహత్య అన్న పిలుపు/ ఆత్మహత్య చేసుకుంది / పురుగు మందులన్ని ఇంక పురుగులనే చంపునంట, రైతు 'రైతు దేవుడల్లే అరుగు గద్దెనెక్కునంటలే ఓ చుక్కమ్మా, పూలమొక్కమ్మా, ఓ పుట్టమ్మా, చెరువు గట్టమ్మా' రైతు ఘోషను అక్షరీకరించాను.
మధుర ప్రేమగీతం 'నిన్ను మాత్రమే నా మనసున నిలుపగా! వలచి మరువ / నాతరమా? తలచి నిలువ నా వశమా? ఎరుగవే? ఎరుగవే?' అని 'పొల్లో పూలమ్మా' అనే జానపద గేయంలో 'సెంట్ సుర్మా కొనిపిస్తా,షోకులెన్నో నేర్పిస్తా, తళుకుబెళుకు కోకారెయికా', 'తాన్లకొద్దీ ఇప్పిస్తా!మంచె కాడికొస్తావా?మంచినీళ్ళు ఇస్తావా? పొల్లో పూలమ్మా జెర', 'మంచెకాడికొస్తావా?' అని సునిశిత శృంగార గీతాన్ని వ్రాశాను. మాతృభాషపై ఉన్న అత్యంత ప్రేమతో తెలుగు వ్యాకరణం లోని సంధులు, సమాసాలు, అలంకారాలు, విభక్తులను వివరిస్తూ 'యమాతారాజభానసలగం / ఏమాతో కన్నది ఈ ''లగం'' / పిల్ల నడుముకాస్తే ''నజభజజజరా''/ నడక చూస్తే 'భరనభభరవ'.../ 'నాలుగవ విభక్తి' నిదర్శనాలు మన/ వలపు పిలుపు సొమ్ము, నా ''కొరకు'' నువ్వు, నీ ''కొరకు'' నేను/ పుట్టామిది నిజము నమ్ము/ నాలోన నీరూపు చూస్తే బ్రతుకంత ససవృద్ధి సంధి'' అంటూ సరదాగా రాశాను. 2021 కొత్త సంవత్సరం పాటలో 'విజన్ ట్వంటీని విసిరేస్తూ/ కరోన ఇయర్ ను కసిరిస్తూ, న్యూ/ ఇయరను తెచ్చేశాం, కొత్త ఆశలతొ వచ్చేశాం/ వేదనలన్నీ వేడి ఛాయ్ లో ముంచేసెరు, బాధలన్నంటిని/ బందెలొ దొడ్లో కట్టేసెరు/ చేదు యాదుల్ని చెత్త కుండీల్లొ/ విసిరేసెరు నిన్నపోయింది, రేపెవ్వరిదో? నేడే/ నీదని తెలుసుకో'అని రాశాను. స్నేహం గొప్పతనం గురించి 'ఆజా ఆజా ఆజా మేరాదోస్త్/ నీతో బతుకంతా మస్త్ మస్త్ జోష్' అనే పాట రాశాను.
అవార్డులు/ సత్కారాలు
- వ్యాస రచన మరియు వక్తృత్వములో 100కు పైగా బహుమతులు
- ఖమ్మం జిల్లా కలెక్టర్ వారిచే వరుసగా 3 సంవత్సరాలు వ్యాసరచన, వక్తృత్వములలో ప్రథమ బహుమతుల స్వీకరణ
- మేకా రవీంద్ర గారి వాట్సాప్ కవితా యాగం ద్వారా సహస్ర కవి మిత్ర, సహస్ర సామెత మిత్ర బిరుదు
- 'మీలో ఎవరు కోటీశ్వరుడు' రెండవ సీజన్ లో 6,40,000,/- రూపాయల గెలుపు
తెలుగు వన్ డాట్. కామ్ వారి ద్వారా అతడు కథకు తృతీయ బహుమతి స్వీకరణ.
- గురజాడ ఫౌండేషన్ వారి పురస్కారం.
- అనేక కవితా వేదికలపై సన్మానాలు.
నా రచనలు
తపస్సు, అతను, మనుషులు, ప్రేమంటే?, నాకు ప్రేమించడంరాదా ఏమో!, చూపైనా దక్కుతుందా?, పెద్దరాములు సర్, నా బాల్యం నాకు మళ్ళీ కావాలి, మసకబారిన మనసు.
చిరకాల వాంఛ
గొప్ప కథా, పాటల రచయితగా వెండి తెరపై పేరు చూడాలని తాతయ్య కోరిన.. తాతయ్య జీవించి ఉన్నప్పుడే ఈ కోరిక నెరవేర్చాలని నా ప్రయత్నం నేను చేస్తున్నాను.
మీలో ఎవరు కోటీశ్వరుడు
మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు 'నాన్న అని పిలపుకు దూరమైన నేను' అప్రయత్నంగానే అక్కినేని నాగార్జున గారిని నాన్నా అని పిలిచాను. ఊహ తెలిశాక 36 సంవత్సరాల వయస్సులో ఒక్కసారైనా నాన్నా అని పిలవగలిగాను అదో మధుర స్మృతి.
రివర్స్ గేర్
'నునే నుట్టాపు.
ఈ కంలో దింవ్విన?
నునే నువ్వాన. ఈకంలో దిండ్చిఏ?'
'తాడుపా గాయతీ గాల్లచ
సిపలాపపా పోరదుని గాల్లిత,
రుగాంబ గాల్లిత...'
ఇలా పాటలను తిరగేసి పాడటం నాకు మహా సరదా, మంచి కాలక్షేపం కూడా.
- మోహన్ కృష్ణ అనంతోజు