Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'దారి లేని చోట నీవే కొత్త దారి నిర్మించు. కానరాని కటిక చీకటిలో నీవే చిరుదీపం వెలిగించు' తరచుగా వినిపించే ఈ మాటలు ఆచరణలోకి అంత త్వరగా రాకపోవచ్చు. కానీ తరానికి కనీసం ఒక్కరైనా ఇలా స్పూర్తి నింపేవారు రాకపోరు. బాల్యం నుంచే 'చలం'ను, తెలుగు సాహిత్యాన్ని ఔపోసన పట్టిన మానస ఎండ్లూరికి ఏ కథలోనూ తానంటూ కనిపించకపోవడం అసంతృప్తి కలిగించింది. అందుకే తమ వర్గంలోని తన తోటి మహిళలు ఎదుర్కొనే అనేక అంశాలను ఏరి, కూర్చి 'మిళింద'గా పాఠక లోకానికి పరిచయం చేసింది. ఆ కథల్లోని విభిన్నతకు మెచ్చిన కేంద్ర సాహిత్య అకాడమీ 'యువ పురస్కారం'కు ఎంపిక చేసింది. ఈ సందర్భంగా 'జోష్' మానసకు అభినందనలు తెలుపుతూ ఆమె గురించిన మరికొన్ని విశేషాలు మీకోసం...
తల్లిదండ్రులిద్దరూ సాహితీకారులే...
మానస ఎండ్లూరి తండ్రి ప్రముఖ కవి, కేంద్ర యూనివర్సిటీ ప్రొ.ఎండ్లూరి సుధాకర్. తల్లి ప్రముఖ కవయిత్రి, విమర్శకురాలు డా.పుట్ల హేమలత. బాల్యం నుంచే ఇంట్లో నెలకొన్న సాహితీ వాతావరణం మానసకు సాహిత్యం పట్ల మక్కువ పెంచింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఏడో తరగతిలోనే చలం 'మైదానం'ను ఒంట పట్టించుకుంది. హేమలత నెల్లూరుకు చెందిన వారు కావడంతో మానస పుట్టింది నెల్లూరు జిల్లా, పెరిగింది రాజమండ్రిలో. ఎండ్లూరి సుధాకర్ తెలంగాణ వారైనప్పటికీ ఉద్యోగరీత్యా మానస చదువు అక్కడ కొనసాగింది. అలా తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లోని దళిత క్రైస్తవులపై అవగాహన ఏర్పడింది. తన తాత, ముత్తాతలు చూసిన దళిత జీవితం తాను చూడనప్పటికీ, ఎదుగుతున్న క్రమంలో తనకూ ఎన్నెన్నో చేదు అనుభవాలు ఎదురైనట్లు చెప్తుంది మానస. వాటిని బాల్యం నుంచే హైకూలుగా, చిన్న చిన్న కవితలుగా, డైరీలో కథలుగా రాసి పెట్టుకోవడం అలవాటైంది. ఆ విధంగా తాను రాసుకోవడమే ఇప్పుడు కథలుగా వ్యక్తీకరించడానికి తోడ్పడిందేమో అని తన కథా ప్రస్థానాన్ని చెప్పుకుంటుందీ యువరచయిత్రి.
అనేక వర్గాలపై సానుభూతి...
భారత సమాజంలో ఉన్న నిచ్చెన మెట్ల వ్యవస్థలో అనేకానేక రుగ్మతలున్నాయి. స్వతహాగా ఆడపిల్ల కావడం, అందునా దళిత వర్గానికి చెందిన ఆడపిల్ల కావడంతో ఎదిగేక్రమంలో ఎదుర్కొన్న అనేక వివక్ష కోణాలను చవిచూసినట్లు వివరిస్తుంది మానస. హెచ్సియులో ఎమ్.ఏ., లింగ్విస్టిక్స్ చేసిన మానసకు పరిశీలనాశక్తి అధికం. మనదేశంలో దళితులు, మైనారిటీలపట్లనే కాదు స్వలింగ సంపర్కం, ట్రాన్స్ జెండర్స్(లింగమార్పిడి) పట్లా చిన్న చూపే. అందుకే మానసకు వారి పట్ల సానుభూతి మెండు. ఈ కారణం చేతనే తన కథల్లో ఆయా వర్గాలకు చోటుంటుంది. 'అప్పట్లో మొహంమీదే అవమానిస్తే ఇప్పుడు పొగడ్తల మాటున, చిరు నవ్వుల చాటున ఉంటున్నాయని' కుండ బద్దలు కొట్టింది. వర్త మాన దళిత సమస్యల్లో వచ్చిన మార్పులు తన కథల ద్వారా రాబోయే తరాలకు ప్రేరణగా నిలవాలని ఆశిస్తుంది ఆమె.
ఎన్నెన్నో పురస్కారాలు...
కేంద్ర సాహిత్య అకాడమీ ద్వారా యువపురస్కారానికి ఎంపికైన మానస తన సాహితీ సృజనకు గతంలో అనేక అవార్డులు అందుకుంది. కేంద్ర సాహిత్య అకాడమీ వారు 2016లో త్రిపురలో, 2018లో అస్సాంలో నిర్వహించిన ఆలిండియా యంగ్ రైటర్స్ ఫెస్ట్స్ స్వీయ రచనా పఠనానికి తెలుగు నుంచి ఆహ్వానం అందుకున్న ఏకైక రచయిత్రి మానస మాత్రమే కావడం విశేషం. 2017లో స్మైల్ పురస్కారం, వెంకటసుబ్బు స్మారక పురస్కారం, 2020లో మాడభూషి పురస్కారాలు అందుకుంది.
అనువాదంలోనూ అనుభవం..
మిళిందలో ఉన్న 22 కథలు దళిత క్రైస్తవులు, ట్రాన్స్ జెండర్స్, స్వలింగ సంపర్కం... అనే అంశాల చుట్టూ అల్లుకున్న అనేక అంశాలను 360 డిగ్రీల కోణాలను పట్టి చూపుతాయి. మానస కేవలం తెలుగులో కథలు రాయడానికే పరిమితం కాలేదు. ఇతర భాషల్లో వివక్షను విప్పి చూపే కథలను, నవలలను అనువదించి మనకు పరిచయం చేసే పనిలో నిమగమై ఉన్నారు. 2015లో వచ్చిన మరాఠీ నవల 'ఓ'ను 'ఊరికి దక్షిణాన' పేరిట ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువదించారు. ఇటీవలే ఈ నవల ఆవిష్కృతమైంది. అంతేకాదు భారతదేశంలో వచ్చిన మొట్టమొదటి దళిత ఆత్మకథ 'బలూత'ను ఆంగ్లం నుంచి తెలుగులోకి త్వరలోనే అనువదించనున్నది.
చిత్రకారిణి కూడా...
తనలో దాగి ఉన్న చిత్రకారిణికి కూడా పదును పెడుతూ బహుముఖీన కృషి చేస్తోంది మానస. తన స్నేహితుల చిత్రాలను గీసి బహుమతులుగా అందజేస్తూ వచ్చిన మానస అనువాద నవల 'ఊరికి దక్షిణాన'కు కవర్ పేజీ తానే చిత్రీకరించి అబ్బుర పరిచింది. నవలలోని ఘట్టాలను, నవల అంతా వచ్చి పోయే సీతా మెహరిన్ పాత్ర, రోడ్లను, మరుగుదొడ్లను శుభ్రం చేసేవారి నివాసాన్ని ప్రతి బింబించే చిత్రపటాన్ని ఆయిల్ పెయింటింగ్లో వేసిన కవర్ పేజ్ అందరినీ ఆకర్షిస్తోంది.
వివక్షల్లో ఉన్నవారికే ఈ పురస్కారం అంకితం...మానస ఎండ్లూరి
కేంద్రసాహిత్య యువపుర స్కారం(2020) రావడంపట్ల మానస ఎండ్లూరిని పలకరించింది 'జోష్'. ఈ సందర్భంగా తన హర్షం వ్యక్తం చేసిన మానస 'ఈ పురస్కారం నాకు ఒక్కదానికే వచ్చిన గుర్తింపుగా నేను చూడడంలేదు. మొత్తం స్త్రీ జాతికి, స్వలింగ సంపర్కులకు, వివక్ష ఎదుర్కొంటున్న అన్ని వర్గాల వారికి ఈ పురస్కారాన్ని అంకితం చేస్తున్నాను' అని వివరించింది. తాను అట్టడుగు వర్గాలకు చెందిన స్త్రీల గురించి కథలు రాస్తున్నానని, ముస్లింలతోపాటు మరికొన్ని మైనారిటీ వర్గాల వారి జీవన విధానంపై అవగాహన లేకపోవడంతో వారి కథలను రాయలేకపోయానని, వారిపట్ల సానుభూతి ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేసింది.
మానసకు కళలంటే మక్కువ:సుధాకర్ ఎండ్లూరి
ఈ సందర్భంగా మానస తండ్రి, సీనియర్ కవి ప్రముఖులు ప్రొ.ఎండ్లూరి సుధాకర్ తన ఆనందాన్ని 'జోష్'తో పంచుకున్నారు. మానస బాల్యంనుంచే స్వేచ్ఛా వాతావరణంలో పెరిగిందని, తన అభిరుచికి అనుగుణంగా కళలను ఎంచుకుందని చెప్పారు. బాల్యం నుంచే సౌందర్యాత్మక దృష్టి ఉండేదని, తన ఇష్టంగానే సాహిత్యం చదువుతూ, తన స్నేహితులకు లేఖలు రాస్తూ ఉండేదని, దానితో శైలి పట్టుపడిందని చెప్పారు. సాహిత్య, సాంస్కృతిక వాతావరణం ఉన్న గోదావరి జిల్లాల్లో పెరగడంవల్ల మానసకు ఆ జీవితాలపట్ల అవగాహన ఏర్పడిందని చెప్పారు. కొడుకే కాదు కూతురు సాధించే విజయం కూడా గుండెల్లో నిలుస్తుందంటూ తన సంతోషం ప్రకటించారు.
- నస్రీన్ ఖాన్
9652432981