Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విద్య అంటే మనిషిలో అంతర్గతంగా దాగి ఉన్న శక్తుల సంపూర్ణ వికాసం. మరి మన దేశంలో విద్యావ్యవస్థ అలా ఉందా? సృజనాత్మకత, వికాసం లాంటి పదాలకు తరగతి గదుల్లో చోటుందా? ప్రభుత్వ పాఠశాలల్లో అరకొర వసతుల మధ్య చదువుతున్న విద్యార్థులు సైంటిస్టులు, డాక్టర్లు కాగలరా? పట్టణాల్లో ఎంతో కొంత సౌకర్యాలు ఉన్నాయి. మరి పల్లెల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుంది. అక్కడ చదివే విద్యార్థుల కలలు కల్లేనా. ఈ వ్యత్యాసాన్ని చూసి మనసు ద్రవించిన ఓ ఎంబీఏ గ్రాడ్యుయేట్ 'స్టడీ మాల్స్' అనే సోషల్ ఎంట్రెప్రెన్యూర్షిప్తో విద్యా వ్యవస్థ రూపురేఖల్ని మార్చేందుకు కంకణం కట్టుకున్నాడు.
మహారాష్ట్ర మాండ్వాలోని జిల్లా పరిషత్ పాఠశాలలో మరాఠీ మీడియంలో ప్రాథమిక విద్యను అభ్యసిం చాడు సంతోష్ దిగంబర్ రావ్ ఫడ్. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న విద్యా పరమైన అసమానతల్ని దగ్గర నుండి చూశాడు. ఇంటర్ చదివేందుకు తాలుకాకు వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇంజినీరింగ్ కోసం మహారాష్ట్ర బీడ్కు వెళ్లాడు. ఎంబీఏ ముంబైలో పూర్తిచేశాడు. ఇలా పల్లె నుండి పట్టణాలు, నగరాల వరకు అన్ని చోట్లా చదువుకున్నాడు. అప్పుడే గ్రామాలు, పట్టణాల్లోని విద్యావిధానాల్లో తేడాలు తెలిశాయి. ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత ఓ ఫైనాన్స్ కంపెనీలో చేరాడు. ఆ మధ్య ఓసారి మాండ్వాకు వెళ్లాడు. అక్కడ పాఠశాలల్ని చూసి షాకయ్యాడు. గ్రామంలో అతను చదువుకున్న రోజుల్లో స్కూల్ ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉంది. వ్యవస్థలో ఏ మార్పూ కనిపించలేదు. లైబ్రరీ వంటివి కూడా మెరుగుపడలేదు. పట్టణ, గ్రామీణ పాఠశాలల్లో విద్యాప్రమాణాల మధ్య పెరుగుతున్న దూరాన్ని తగ్గించేందుకు 2011లో థింక్ షార్ప్ ఫౌండేషన్ పేరుతో స్వచ్ఛంద సంస్థను ప్రారంభించాడు సంతోష్. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ఈ విషయాలన్నిటిపై పూర్తి అవగాహన ఉన్న తన మిత్రులు సచిన్ పవార్, దీపాలి బసుర్లు చేతులు కలిపారు.
మాల్ అంటే అన్నీ
మాల్ పేరు వినగానే మనకి గుర్తొచ్చేది ఇంటికి కావాల్సిన వస్తువులు, దుస్తులు ఇలా అన్నీ ఒకే చోట దొరికే ఆల్ ఇన్ వన్ అమ్మక ప్రదేశం. మాల్ పదంలోని ఈ సారాంశాన్ని గ్రహించి సంతోష్ గ్రామీణ ప్రాంతాల్లో విద్యావ్యవస్థను చక్కదిద్దేందుకు 'స్టడీ మాల్' కాన్సెప్ట్ని రూపొందించాడు. అది నచ్చిన మరో ఇద్దరు స్నేహితులు భగ్వాన్ దాస్, శ్రద్ధ భంగెల సహకారంతో 2013లో థింక్ షార్ప్ ఫౌండేషన్ తొలి 'స్టడీ మాల్'ను మహారాష్ట్రలోని సురంగలీలో ప్రారంభించారు. రెండో స్టడీ మాల్ను 2015లో జల్గావ్ సమీపంలోని వరంగావ్లో, ముంబై సమీపంలోని వంగనిలో మూడో సెంటర్ని ప్రారంభించారు. మరో అడుగు ముందుకేసి డిజిటల్ స్టడీ మాల్ని కూడా ప్రారంభించారు. థింక్ షార్ప్ ఫౌండేషన్ ఓ స్థలాన్ని అద్దెకు తీసుకుని లేదా ఏదైనా పాఠశాల ఆవరణను ఉపయోగించుకుని స్టడీ మాల్ను నిర్వహించేది. మాల్లో విద్యతో పాటు విజ్ఞానాన్ని అందించే పుస్తకాలను ఉచితంగా అందిస్తారు. స్కూల్ ఆవరణలో ఉండే ఈ మాల్లో చదువుకోవచ్చు. ఇక్కడుంచే వస్తువుల్ని వాడుకోవచ్చు. డిజిటల్ క్లాస్ రూమ్తో పాటు కళలు, ఎడ్యుకేషనల్ గేమ్స్, ఆట వస్తువులు ఇతర నైపుణ్యాలని అందించే ఎన్నో సాధనాలు ఇక్కడుంటాయి. అటలతో గణితాన్ని నేర్పించడం, ప్రొజెక్టర్ ద్వారా యానిమేషన్ బొమ్మల్ని చూపించడం వంటివి చేస్తుంటారు. స్టడీ మాల్స్లో కొందరు పిల్లలు స్వయంగా పద్యాలు, రైమ్స్ నేర్పుకోడానికి ఇష్టపడుతుంటారు. కథలు చెప్పడం, పద్యాలు, కవితలు చెప్పించడం లాంటి యాక్టివిటీస్లో పిల్లల్ని నిమగం చేస్తుంటారు వలంటీర్లు. సంతోష్ కుటుంబ సభ్యులు, స్నేహితుల సాయంతో ఔరంగాబాద్లోని చికత్గావ్లో నాలుగో మాల్ని ప్రారంభించేం దుకు నిధుల్ని సమకూర్చుకుంటున్నాడు.
ప్రభావం చూపించే అంశాలు
ఇప్పటికే మూడు గ్రామాల్లో వెయ్యి మందికి పైగా పిల్లలు స్టడీ మాల్ సేవల్ని ఉపయోగించుకుంటు న్నారు. విద్యపై అవగాహన పెంచుకుంటు న్నారు. డిజిటల్ లెర్నింగ్ ద్వారా పిల్లల్లో ఏకాగ్రత పెరిగింది. వారి స్టడీ టైమ్ 300 నుంచి 350 శాతానికి పెరిగింది. చదవడం రాయడం 30 నుండి 40 శాతానికి పెరిగింది. స్టడీ మాల్స్ని ఉపయోగిం చుకుని టీచర్లు కూడా కొత్త పద్ధతుల్లో బోధించడంతో విద్యార్థుల్లో హాజరు శాతం కూడా పెరిగింది. కంప్యూటర్లో శిక్షణతో పాటు విద్యాపరమైన అభివ ద్ధి, వ్యక్తిగత అభివ ద్ధి, కెరీర్ అవకాశాలపై అవగాహన పెరుగుతోంది.
కష్టాల ప్రయాణం
ఉద్యోగం చేస్తూ స్టడీ మాల్స్ను నిర్వహించడం తలకుమించిన భారమే. సోషల్ ఆంట్రెప్రెన్యూర్షిప్ కాస్త కష్టమైన వ్యవహారం. ప్రజల్లో వీటిపై అవగాహన లేకపోవడంతోపాటు ప్రభుత్వ మద్దతు లేకపోవడం పెద్ద సవాల్గా మారుతుంది. దీనిపై కోర్సులు అందించే సంస్థలు లేకపోవడంతో అన్నీ సొంతగానే నేర్చుకోవాల్సి ఉంటుంది. స్థిరత్వాన్ని సాధించడం, వనరుల కొరత, నిధుల విషయంలో నియంత్రణ వంటివి ప్రస్తుతం సోషల్ ఆంట్రెప్రెన్యూర్లు ఎదుర్కొంటున్న సమస్యలు.
- అనంతోజు మోహన్ కృష్ణ